అమరచింత: పదేళ్ల పాలనలో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో కొనసాగుతున్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ రంగాలకు అప్పజెప్పి, దేశ సంపదను కొల్లగొట్టడమే బీజేపీ ప్రభుత్వం ప్రధాన కర్తవ్యంగా పెట్టుకుందని మహబూబ్నగర్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్రెడ్డి అన్నారు. మండలంలోని నాగల్కడ్మూర్లో సీతారామస్వామి కల్యాణంలో ఆయన సతీమణితో హాజరయ్యారు. కల్యాణం అనంతరం కాంగ్రెస్ ముఖ్య నాయకులు, శ్రీరాంభూపాల్తో కలిసి సమావేశంలో పాల్గొన్నారు. దేశాన్ని మతోన్మాద ముసుగులో దోచుకుంటున్న పార్టీకి తగిన బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లి, ప్రభుత్వరంగ సంస్థలను విస్తరించి, ఉద్యోగ అవకాశాలు కల్పించి, పేదలన ఆదుకున్న కాంగ్రెస్ పార్టీపై బీజేపీ నాయకులు విమర్శలు చేయడం వింతగా ఉందన్నారు. బ్యాంకుల్లో రుణాలు తీసుకుని దేశం వదిలి వెళ్లిన వ్యక్తులకు రక్షణ కల్పిస్తూ.. వారి అప్పులను మాఫీ చేస్తుంది ప్రధాని మోదీ అనే విషయాన్ని ప్రజలు మరిచిపోలేరన్నారు. మహబూబ్నగర్ను దత్తత తీసుకుంటానని పదేళ్ల పాటు మోసం చేసిన మాజీ సీఎం కేసీఆర్కు ప్రజలు సరైన బుద్ధి చెప్పారన్నారు. ఇదే తరహాలో కేంద్రంలో ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన బీజేపీకి తగిన బుద్ధి చెబుతారన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని, పార్టీ గెలుపులో భాగస్వాములు కావాలన్నారు. కార్యక్రమంలో శ్రీరాంభూపాల్, టీపీసీసీ కల్లుగీత డిపార్ట్మెంట్ రాష్ట్ర చైర్మన్ కేశం నాగరాజ్ గౌడ్, జలంధర్ రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి
డా.వంశీచంద్రెడ్డి