శ్రీరామ నవమిని పురస్కరించుకొని బుధవారం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ప్రసిద్ధ ఆలయాల్లో సీతారాముల కల్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. చల్లువ పందిళ్ల కింద కల్యాణ వేదికలను సుందరంగా ముస్తాబు చేయగా.. కల్యాణ వేడుకను భక్తకోటి తిలకించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వేదమంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల మధ్య సీతారామచంద్రాస్వామి ఉత్సవ మూర్తులను పట్టువస్త్రాలతో అలంకరించి.. అభిజిత్ లగ్నంలో రుత్వికులు జీలకర్ర బెల్లం పెట్టారు. అనంతరం మాంగళ్యధారణ, తలంబ్రాల కార్యక్రమం నిర్వహించారు. సీతారాముల కల్యాణ వేడుకను భక్తులు కనులారా తిలకించి పులకించిపోయారు. ఈసందర్భంగా రామనామస్మరణ మార్మోగింది.