బ్రిస్టల్: ఇటీవల ప్రపంచ క్రికెట్ ను బాగా ఆకర్షించిన మహిళా క్రికెటర్ స్మృతీ మంధన. భారత్ కు చెందిన మంధన కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. తన ఆటతో పాటు అందంతో కూడా మంధన క్రికెట్ ప్రేమికుల్ని బాగా ఆకట్టుకుంది. ప్రధానంగా మహిళల వన్డే వరల్డ్ కప్ లో భాగంగా ఇంగ్లండ్ తో మ్యాచ్ లో 90 పరుగులు, వెస్టిండీస్ తో మ్యాచ్ లో సెంచరీ చేసిన మంధన ఒక్కసారిగా లైమ్ లైట్లోకి వచ్చింది. అయితే ఈ రెండు మ్యాచ్ లు తరువాత చూస్తే వరుసగా జరిగిన నాలుగు మ్యాచ్ ల్లో మంధన ఘోరంగా వైఫల్యం చెందింది. కేవలం సింగిల్ డిజిట్ కే పరిమితమై అభిమానుల్ని నిరాశపరిచింది.
కాగా, మూడు రోజుల క్రిత ఆస్ట్రేలియాతో మ్యాచ్ సందర్భంగా మూడు పరుగులు మాత్రమే చేసిన మంధన ఏడ్చేసింది. తాను అవుటైన తరువాత డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లిన మంధన కన్నీరు పెట్టుకుందట. ప్రస్తుతం మంధన కన్నీరు కారుస్తున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇప్పటివరకూ మంధన ఆటను ఆస్వాదించిన అభిమానులు..ఆమె కన్నీరు పెట్టుకోవడంపై తెగబాధపడిపోతున్నారు. 'మంధన నీ ముఖంపై కన్నీరు వద్దు.. నీకు చిరునవ్వే ముద్దు'అని ఒక అభిమాని ట్వీట్ చేశారు.