టీడీపీ నాయకుల ధర్నా | Sakshi
Sakshi News home page

టీడీపీ నాయకుల ధర్నా

Published Wed, Oct 22 2014 1:58 AM

TDP leaders protests in parvathipuram

 పార్వతీపురం   :టీవల నిర్వహించిన అంగన్‌వాడీ నియామకాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్ తదితర నాయకులు ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట మంగళవారం ధర్నా చేశారు. పార్వతీపురం, కురుపాం, సాలూరు తదితర నియోజకవర్గాలకు చెందిన అంగన్‌వాడీ మెయిన్, లింక్, క్రెషీ, హెల్పర్ పోస్టుల నియామకాలు చేపట్టారు. పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రజిత్ కుమార్ సైనీ, ఎమ్మెల్యే, ఆయా శాఖలకు చెందిన అధికారుల కమిటీ ఆధ్వర్యంలో ఈ నియామకాలు చేపట్టారు.
 
 ఆ నియామకాల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేతో పాటు ఆ పార్టీకి చెందిన నాయకులు ఆందోళనకు దిగారు. ఐసీడీఎస్ పీవో కేతిరెడ్డి విజయ గౌరి ధర్నా వద్దకు వచ్చి నియామకాలు పారదర్శకంగా జరిగాయని ఎమ్మెల్యే, టీడీపీ నాయకులకు వివరించేందుకు ప్రయత్నించారు. నియామకాలు రద్దు చేస్తున్నట్లు హామీ ఇస్తే గానీ ధర్నా విరమిస్తామని వారు భీష్మించుకు కూర్చున్నారు. ఈ విషయంలో తాను చేయగలిగిందేమీ లేదని ఆమె చెప్పగా, తెలుగు తమ్ముళ్లు ఒక్కసారిగా గౌరిపై కేకలు వేశారు.  ఐటీడీఏ పీవోకు సమాచారం అందించగా, ఆయన ఫోన్లో ధర్నా చేపట్టిన వారితో మాట్లాడి డీడీ టి.సీతారామమూర్తిని పంపించారు. ఈ సం దర్భంగా వారు ఆయనకు వినతిపత్రాన్ని అందజేసి ధర్నాను విరమించారు.
 
 నియామకాలు పారదర్శకంగా జరిగాయి..  
 ఐసీడీఎస్ పీవో కేతిరెడ్డి విజయగౌరి విలేకర్లతో మాట్లాడుతూ అంగన్‌వాడీ నియామకాలు పారదర్శకంగా చేపట్టామన్నారు. కొన్ని నియామకాలకు ఏడో తరగతి క్వాలిఫికేషన్ కాగా దానికే ప్రాధాన్యతనిచ్చామన్నారు. పదో తరగతి ఆపై చదివినవారు తమకు వద్దకు రాలేదని,  ఏడో తరగతి మార్కుల జాబితా దరఖాస్తులతో జతచేయనివారు తదితరులు కూడా రాలేదంటున్నారన్నారు. 19వ వార్డుకు చెందిన దరఖాస్తు ఏ వార్డు, ఏ కేటగిరీకో రాయకపోవడంతో అక్కడ గుర్తించలేకపోయామని వెల్లడించారు.  
 
 

Advertisement
Advertisement