భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు
Breaking News
చర్లపల్లి జైలులో జవాన్పై ఇస్లామిక్ స్టేట్ ఖైదీ దాడి?
Published on Wed, 11/05/2025 - 22:05
సాక్షి, హైదరాబాద్: చర్లపల్లి కేంద్ర కారాగారంలో విధి నిర్వహణలో ఉన్న ఓ జవాన్పై ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) కేసులో జైలుకు వచ్చిన ఖైదీ దాడికి పాల్పడిన ఉదంతమిది. ఈ సంఘటన బుధవారం సాయంత్రం ఐదు గంటలకు చోటుచేసుకుంది అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం చర్లపల్లిలో విధులు నిర్వహిస్తున్న రాజేష్ అనే జవాన్ చేతిలో లాఠీ పట్టుకుని రౌండ్స్లో ఉన్నారు. జైలులోని యూనిట్ ఆసుపత్రి వద్ద ఆయన తనిఖీల్లో ఉండగా, అప్పడే మాజ్ అనే ఖైదీ చికిత్స కోసం వచ్చాడు.
ఆసుపత్రిలో మహిళా డాక్టర్తో తనను నిమ్స్ కానీ, ఉస్మానియా ఆసుపత్రి కానీ రిఫర్ చేయాలంటూ డిమాండ్ చేశాడు. చిన్న ఆరోగ్య సమస్యేనని.. అవసరమైతే రేపు మరోసారి పరీక్షించి రిఫర్ చేస్తామని డాక్టర్ చెప్పారు. దాంతో శివాలెత్తిపోయిన మాజ్.. ఆసుపత్రి నుంచి బయటకు వచ్చి తిట్లు పురాణం ప్రారంభించారు. అదే సమయంలో రౌండ్స్లో ఉన్న రాజేష్ను తీవ్రంగా దూషించారు. అంతటితో ఆగకుండా రాజేష్ చేతులోని లాఠీని లాక్కుని ఆయనపై దాడి చేశారు.
తోటి సిబ్బంది ఇతర ఖైదీలు వెంటనే స్పందించి మాజ్ను నిలువరించారు. అక్కడే విధుల్లో ఉన్న ఓ డిప్యూటీ జైలర్.. మరో జవాన్ ఆ ఖైదీపై ఎదురుదాడి చేసి రాజేష్ను కాపాడారు. ఐఎస్ సంబంధింత కేసులో మాజ్ చర్లపల్లి జైలుకి వచ్చినట్లు తెలుస్తోంది. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అతణ్ని గతంలో అరెస్టు చేయగా.. తొలుత చంచల్గూడ జైలుకు తరలించారు. అక్కడ మరో ఐఎస్ ఖైదీతో కలిసి మాజ్ సెల్ఫోన్ కలిగి ఉన్నట్లు తనిఖీల్లో తేలింది. దీంతో.. అతణ్ని చర్లపల్లికి తరలించారు. జవాన్పై దాడి ఘటనపై చర్లపల్లి ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ శివకుమార్గౌడ్ వివరణ తీసుకునేందుకు ‘సాక్షి’ యత్నించగా ఆయన ఫోన్లో స్పందించలేదు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Tags : 1