Breaking News

కరువు ఎరుగని 'కృషీవలురు'!

Published on Sun, 05/04/2025 - 01:57

కొడిమ్యాల మండలం పూడూరు వాగుపై 7 చెక్‌ డ్యాంలు ఉన్నాయి. వాగుకు ఇరువైపులా మోటార్లు పెట్టుకుని రైతులు ఈ నీటితో పంటలు సాగు చేసేవారు. ఇటీవల వాగు పూర్తిగా ఎండిపోవటంతో ఆరెపల్లి, అప్పారావుపేట, పూడూరు గ్రామ రైతులు చందాలు వేసుకొని దాదాపు రూ. లక్ష జమచేసి 40 పైపులు కొనుగోలు చేసి, కొండాపూర్‌ మైసమ్మ చెరువు మత్తడి నుంచి సాగు నీటిని తరలించారు. దీంతో కొడిమ్యాల పెద్దవాగుతోపాటు పూడూరు వాగుపై ఉన్న ఏడు చెక్‌ డ్యాంలు నిండి పొంగిపోర్లుతున్నాయి. ఈ నీటితో ఆ చుట్టుపక్కల 500 ఎకరాల వరి పంట ఎండిపోకుండా రైతులు కాపాడుకున్నారు.

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: వేసవికాలం వచ్చిందంటే చాలాచోట్ల ఎండిన పంటలు.. పశువుల మేతకు వదిలేసిన పొలాల చిత్రాలే కన్పిస్తాయి. ఎండిపోయిన వాగులు.. ఒట్టిపోయిన బావులు సర్వసాధారణం.. కానీ, కొన్నిచోట్ల ప్రభుత్వం వాగులు, వంకలపై నిర్మించిన చిన్నచిన్న చెక్‌డ్యాంలు అన్నదాతల తలరాతలను మార్చేశాయి. మండు వేసవిలోనూ నిండైన జలకళతో పచ్చని పంటలకు ప్రాణం పోస్తున్నాయి. మరికొన్నిచోట్ల అన్నదాతలు సరికొత్త ఆలోచనలతో సొంతంగానే నీటిని ఒడిసిపట్టి మండు వేసవిలో బంగారు పంటలు పండిస్తూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. కన్నీటి జీవితాలను ప‘న్నీటి’గా మార్చుకున్న పలువురు రైతుల విజయగాథలివీ... 

ఐదేళ్లుగా కరువు ఎరగని వీణవంక పల్లె 
కరీంనగర్‌ జిల్లా వీణవంక మండల కేంద్రంలోని వాగుపై నిర్మించిన చెక్‌డ్యాం.. ఆ ప్రాంతంలో కరువును దూరం చేసింది. ఒకప్పుడు తాగు, సాగు నీటికి అల్లాడిన అక్కడి ప్రజలు.. చెక్‌డ్యాం వల్ల గత ఐదేళ్లుగా నిశ్చింతగా బతుకుతున్నారు. మండల కేంద్రానికి అర కిలోమీటర్‌ దూరంలోనే ఉన్న వాగులో వృథాగా పోతున్న నీటిని నిల్వ చేసేందుకు 2018లో రూ.1.54 కోట్లతో 15 ఎకరాల విస్తీర్ణంతో చెక్‌డ్యాంను నిర్మించారు. ఈ చెక్‌డ్యాం వీణవంకతోపాటు, బ్రాహ్మణపల్లి, రెడ్డిపల్లి, రామక్రిష్ణాపూర్‌ గ్రామాల ప్రజలకు తాగు, సాగు నీరు అందిస్తోంది. సుమారు 220 ఎకరాల భూమి దీని కింద సాగవుతోంది.  

సొంత భూమిలో చెరువు తవ్వించి.. 
నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ మున్సిపల్‌ విలీన గ్రామం శ్రీనివాస్‌నగర్‌కు చెందిన పుట్ట బాబు తన పంట పొలంలో 2 ఎకరాల విస్తీరణంలో 15 ఏళ్ల క్రితమే చెరువును తవ్వించి నీటి సంరక్షణ చేపట్టారు. వర్షం నీటితో పాటు ఆరు బోరు బావులతో చెరువును నింపుతున్నాడు. ఈ చెరువు ద్వారా 12 ఎకరాల్లో వర్షాకాలం, యాసంగీ సీజన్లలో వరి పంట సాగుచేస్తున్నాడు. చెరువు గట్టు చుట్టూ కొబ్బరి, మామిడి, సీతాఫలంచెట్లు పెంచి అదనపు ఆదాయం పొందుతున్నాడు. 

వట్టిపోని వట్టివాగు.. 
మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలంలోని కాట్రపల్లి, వెంకటగిరి, అర్పణపల్లి, ఉప్పరపల్లి, పెనుగొండ గ్రామాల మీదుగా వెళ్లే వట్టివాగు ఇప్పుడు మండు వేసవిలోనూ నిండుకుండలా కనిపిస్తోంది. ఇటీవల యాసంగి పంటల కోసం కొంత ఆలస్యంగా ఎస్సారెస్పీ జలాలను వట్టి వాగులోకి మళ్లించటంతో వెంకటగిరి, అర్పణపల్లి, ఉప్పరపల్లి గ్రామాల పరిధిలో వాగుపై నిర్మించిన చెక్‌ డ్యాంలు జలకళను సంతరించుకున్నాయి. దీంతో చుట్టుపక్కల వ్యవసాయ బావులు, బోర్లలో భూగర్భ జలాలు పెరిగాయి.  

9 చెక్‌డ్యాంలతో నీటి సమస్య దూరం 
మహబూబ్‌నగర్‌ జిల్లా చిన్న చింతకుంట మండలంలోని ఊక చెట్టు వాగులో గతంలో నీరు ఉండక భూగర్భ జలాలు అడగంటేవి. గత ప్రభుత్వం ఈ వాగుపై 9 చెక్‌డ్యాంలు నిర్మించటంతో నీటి నిల్వ పెరిగి, చుట్టుపక్కల భూగర్భ జలాల పైపైకి వచ్చాయి. దీంతో సాగు, తాగు నీటి సమస్య దూరమైంది. సమీపంలోని బండ్రపల్లి, పల్లమరి, లాల్‌ కోట, నెల్లికొండి, పెద్ద వడ్డేమాన్, చిన్న వడ్డేమాన్, ఏదిలాపురం, చిన్న చింతకుంట, మద్దూరు, అల్లిపురం, కురుమూర్తి, అమ్మాపురం, గూడూరు, అప్పంపల్లి, ముచ్చింతల తదితర గ్రామాలలో 7,000 ఎకరాలలో రైతులు రెండు పంటలు పండిస్తున్నారు. 

వర్షపు నీటిని గుంతల్లో నిల్వ.. 
నల్లగొండ జిల్లా చండూరులో వర్షపు నీటిని ఒడిసి పట్టేందుకు రైతు పాల్వాయి సత్యనారాయణరెడ్డి తన భూమిలోనే కందకాలు తవ్వించాడు. ఆరేళ్ల క్రితం తనకున్న దాదాపు 100 ఎకరాలలో పలు చోట్ల కందకాలు తవ్వించాడు. గొల్లగూడకు వెళ్లే దారిలో గల 50 ఎకరాలలో సుమారు 4 ఎకరాల విస్తీర్ణంలో వర్షపు నీటి గుంతలను తవ్వారు. ప్రస్తుతం ఎండలు మండుతున్నా ఈ గుంతల్లో నీరు పుష్కలంగా ఉండటం గమనార్హం. ఈ నీటివల్ల భూగర్భ జలాలు పెరిగి పంటకు నీటి కరువు తీరింది.  

వాననీటిని ఒడిసి పట్టి.. 
మెదక్‌ జిల్లా రత్నాపూర్‌ గ్రామానికి చెందిన నింబాద్రిరావు అనే రైతు వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు సరికొత్త ఆలోచన చేశారు. తన ఏడు ఎకరాల భూమి చుట్టూ స్ట్రెంచ్‌ కొట్టించి, వర్షాకాలంలో పడిన వర్షం నీరు భూమిలోకి ఇంకేలా ఏర్పాట్లు చేశాడు. దీనికి రాళ్లు, సిమెంట్‌ లైనింగ్‌ చేసి నీటిని నిలువ చేస్తున్నాడు. ఈ నీటి ద్వారా ఎండా కాలంలోనూ పంటలకు నీరందేలా ఏర్పాటు చేసుకున్నాడు. డ్రిప్‌ ద్వారా మామిడి పంటకు నీళ్లు పారిస్తున్నాడు. ఒకప్పుడు బీడుగా ఉన్న భూమిని ఇప్పుడు బంగారు పంటలు పండే సారవంతమైన భూమిగా తీర్చి దిద్దుకుని ఆదర్శంగా నిలుస్తున్నాడు.  

జహీరాబాద్‌ ప్రాంతంలో జలకళ 
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ నియోజకవర్గంలో గతంలో చేపట్టిన వాటర్‌షెడ్‌ పనులు ఇప్పుడు రైతులకు జల సిరులు పారిస్తున్నాయి. ప్రముఖ ఇంజనీర్‌ హన్మంత్‌రావు ఇక్కడ చతుర్విద జల ప్రక్రియను ఆవిష్కరించారు. జహీరాబాద్‌ నియోజకవర్గంలోని గొట్టిగారిపల్లి గ్రామంలో 2001లో వాటర్‌షెడ్‌ పథకానికి శ్రీకారం చుట్టారు. ఫలితంగా నేడు 30 వేల ఎకరాలకు నీటి కొరత తీరింది. ఏడాది పొడువునా మూడు పంటలు పండుతున్నాయి.  

Videos

లేఖ బయటకి వస్తే రాజకీయ ప్రకంపలను ఖాయం

సంజు, బుమ్రా రీ ఎంట్రీ.. ఆఫ్గన్ సిరీస్ కు టీమిండియా ఇదే

snake plant ఈ మొక్క‌ల‌ని కిచెన్‌లో పెట్టుకుంటే..

మళ్లీ ఎప్పుడు పుడతావు రాజన్నా..? YSRపై భూమన భావోద్వేగ వ్యాఖ్యలు

Konda Surekha: నాకంటే ముందు రేవెంత్ పై చర్యలు తీసుకోవాలి

పులిచింతల నీరు, బీడు భూముల్లో పండిన సిరులతో YSR కు అభిషేకం

Nepal: ప్రాణాలు అరచేతిలో.. భవనంపై చిక్కుకున్న వ్యక్తి!

Kanigiri: పోలీసుల ఓవరాక్షన్.. YSR విగ్రహం వద్ద టెంట్ తొలగింపు

ఉద్దవ్ సేన ఎమ్మెల్యేపై దిశా శాలియన్ తండ్రి సంచలన ఆరోపణలు

ఏంపొడిచారని పుట్టిన రోజు సెలబ్రేషన్ చేస్తున్నారు, పవన్ ను ఏకిపారేసిన పోతిన మహేష్

Photos

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)

+5

నేపాల్ పిల్లలకు అండగా సోనూసూద్ (ఫొటోలు)