భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు
Breaking News
డబుల్ సెంచరీ చేజార్చుకున్న అభిమన్యు ఈశ్వరన్
Published on Fri, 10/04/2024 - 12:11
ముంబైతో జరుగుతున్న ఇరానీ కప్ 2024 మ్యాచ్లో రెస్ట్ ఆఫ్ ఇండియా ఆటగాడు అభిమన్యు ఈశ్వరన్ తృటిలో డబుల్ సెంచరీ చేజార్చుకున్నాడు. ఈశ్వరన్ 191 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద షమ్స్ ములానీ బౌలింగ్లో తనుశ్ కోటియన్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. నాలుగో రోజు ప్రారంభం నుంచి జాగ్రత్తగా ఆడిన ఈశ్వరన్ అనవసర స్వీప్ షాట్ ఆడి డబుల్ సెంచరీ చేసే సువర్ణావకాశాన్ని చేజార్చుకున్నాడు.
STAND UP & SALUTE ABHIMANYU EASWARAN 🙇
- An Icon of Indian domestic cricket. pic.twitter.com/wak0qvFen7— Johns. (@CricCrazyJohns) October 4, 2024
అంతకుముందే మరో ఓవర్నైట్ బ్యాటర్ ధృవ్ జురెల్ కూడా సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. జురెల్ 93 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద షమ్స్ ములానీ బౌలింగ్లో హార్దిక్ తామోర్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. మూడు పరుగుల స్వల్ప వ్యవధిలో రెస్ట్ ఆఫ్ ఇండియా రెండు కీలకమైన వికెట్లు కోల్పోవడంతో కష్టాల్లో పడింది. నాలుగో రోజు లంచ్ విరామం (104 ఓవర్ల తర్వాత) సమయానికి రెస్ట్ ఆఫ్ ఇండియా స్కోర్ 400/6గా ఉంది.
సరాన్ష్ జైన్ (3), మానవ్ సుతార్ (2) క్రీజ్లో ఉన్నారు. రెస్ట్ ఆఫ్ ఇండియా ముంబై తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఇంకా 137 పరుగులు వెనుకపడి ఉంది. రెస్ట్ ఆఫ్ ఇండియా ఇన్నింగ్స్లో రుతురాజ్ గైక్వాడ్ 9, సాయి సుదర్శన్ 32, దేవ్దత్ పడిక్కల్ 16, ఇషాన్ కిషన్ 38 పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో మోహిత్ అవస్తి, షమ్స్ ములానీ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. జునెద్ ఖాన్, తనుశ్ కోటియన్ చెరో వికెట్ దక్కించుకున్నారు.
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై తొలి ఇన్నింగ్స్లో 537 పరుగులకు ఆలౌటైంది. సర్ఫరాజ్ ఖాన్ అజేయ డబుల్ సెంచరీతో (222) ముంబై భారీ స్కోర్ చేయడానికి దోహదపడ్డాడు. అజింక్య రహానే (97) తృటిలో సెంచరీ మిస్ చేసుకోగా.. శ్రేయస్ అయ్యర్ (57), తనుశ్ కోటియన్ (64) అర్ద సెంచరీలతో రాణించారు. రెస్ట్ ఆఫ్ ఇండియా బౌలర్లలో ముకేశ్ కుమార్ ఐదు వికెట్లు పడగొట్టగా.. యశ్ దయాల్, ప్రసిద్ద్ కృష్ణ తలో రెండు, సరాన్ష్ జైన్ ఓ వికెట్ దక్కించుకున్నారు.
చదవండి: వరల్డ్ రికార్డుపై కన్నేసిన సూర్య భాయ్..!
Tags : 1