పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!
Breaking News
30 ఏళ్లకు తెరుచుకున్న ఉమా భగవతి ఆలయం
Published on Mon, 07/15/2024 - 08:18
జమ్ముకశ్మీర్లోని ఉమా భగవతి దేవి ఆలయాన్ని 30 ఏళ్ల తరువాత తెరిచారు. కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ సమక్షంలో ఆలయాన్ని తెరవడంతో పాటు పునరుద్ధరణ పనులు ప్రారంభించారు. దక్షిణ కశ్మీర్లోని అనంత్నాగ్లో గల షాంగస్ ప్రాంతంలో ఈ పురాతన ఆలయం ఉంది.
మూడు దశాబ్దాల తర్వాత ఆలయంలోకి భక్తులు ప్రవేశించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజస్థాన్ నుంచి తీసుకువచ్చిన ఉమా దేవి విగ్రహాన్ని వేదమంత్రాల నడుమ గర్భగుడిలో ప్రతిష్ఠించారు. ఆలయ పునరుద్ధరణపై స్థానిక కశ్మీరీ పండిట్లు, ముస్లింలు సంతోషం వ్యక్తం చేశారు. స్థానికుడు గుల్జార్ అహ్మద్ మాట్లాడుతూ ‘మా పండిట్ సోదరులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం’ అని అన్నారు. ఇన్నాళ్ల తర్వాత ఆలయంలో పూజలు చేయడం సంతోషంగా ఉందన్నారు.
కశ్మీరీ పండిట్లు తెలిపిన వివరాల ప్రకారం 1990లో ఈ ఆలయం ధ్వంసమైంది. దీని వెనుక పలు కారణాలున్నాయి. 1990లలో ఉగ్రవాదులు అలజడి కారణంగా కశ్మీరీ పండిట్లు ఈ ప్రాంతం నుండి పారిపోయారు. 2019 తర్వాత కశ్మీర్లో ఉగ్రవాదుల అలజడులు తగ్గాయి. ఈ నేపధ్యంలో గతంలో తీత్వాల్ వద్దనున్న మాతా శారదా ఆలయాన్ని తిరిగి ప్రారంభించారు. యూటీ అడ్మినిస్ట్రేషన్ స్మార్ట్ సిటీ మిషన్ కింద శ్రీనగర్లోని పలు దేవాలయాలతో సహా మతపరమైన ప్రదేశాలను ప్రభుత్వం పునరుద్ధరిస్తోంది.
Tags : 1