నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా
Breaking News
Mahakumbh-2025: అంబాసిడర్ బాబా.. 35 ఏళ్లుగా కారులోనే సాధన
Published on Sat, 01/11/2025 - 07:11
జనవరి 13 నుండి ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా జరగనుంది. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ మేళాకు దేశ విదేశాల నుండి స్వామీజీలు, బాబాల రాక మొదలయ్యింది. వీరిలో కొందరు బాబాలు అక్కడి జనాలను విపరీతంగా ఆకట్టుకుంటున్నారు. ఇదేకోవలో ప్రయాగ్రాజ్కు వచ్చారు అంబాసిడర్బాబా.
మధ్యప్రదేశ్ నుంచి అత్యంత పురాతన అంబాసిడర్ కారులో వచ్చిన ఒక బాబా.. అంబాసిడర్ బాబా(Ambassador Baba)గా పేరొందారు. ఆయనను ఇక్కడివారు ఆశ్చర్యంగా గమనిస్తున్నారు. ఈ బాబా 52 ఏళ్ల క్రితం నాటి అంబాసిడర్ కారులో నిత్యం ప్రయాణిస్తుంటారు. ఈ నేపధ్యంలోనే ఆయన తనకు తాను అంబాసిడర్ బాబా అని పేరు పెట్టుకున్నారు. ఇంతకీ ఈ అంబాసిడర్ బాబా ఎవరనే మూలాల్లోకి వెళితే.. ఈయన అసలు పేరు మహంత్ రాజగిరి. ఈయన మధ్యప్రదేశ్లోని ఇండోర్ నుండి ప్రయాగ్రాజ్కు తరలి వచ్చారు. కుంభమేళా తరహాలో జరిగే కార్యక్రమాలలో పాల్గొంటూ ఆయన తన ఉనికిని చాటుకుంటారు. మహంత్ రాజగిరి తన ఉద్యోగాన్ని, కుటుంబాన్ని విడిచిపెట్టారు. ఒక్క అంబాసిడర్ కారును మాత్రమే తన వద్ద ఉంచుకున్నారు.
అంబాసిడర్ బాబా కొన్ని దశాబ్ధాలుగా ఈ కారులోనే నివసిస్తున్నారు. ఈ కారును ఆయన 35 ఏళ్ల క్రితం విరాళం(Donation)గా అందుకున్నారు. అప్పటి నుంచి మహంత్ రాజగిరి ఈ కారునే తన నివాసంగా చేసుకున్నారు. ఆయన ఈ అంబాసిడర్ కారుకు కాషాయ రంగు పెయింట్ వేయించారు. ఈ అంబాసిడర్ కారు 1972 మోడల్. అంబాసిడర్ బాబా గతంలో నాలుగు కుంభమేళాలకు ఈ కారులోనే హాజరయ్యారు. ఆయన ఈ కారులోనే తినడం, పడుకోవడం చేస్తుంటారు. ఈ కారు తనకు అమ్మలాంటిదని అంబాసిడర్ బాబా తెలిపారు. ప్రయాగ్రాజ్ వచ్చిన ఆయన సంగమనగరి(Sangamnagari)లో ఒక గుడిసెలో బసచేస్తున్నారు. ఆ గుడిసె ముందర తన అంబాసిడర్ కారును నిలిపివుంచారు. ఈ కారులోనే కూర్చుని ఆయన ఆధ్యాత్మిక సాధన కొనసాగిస్తున్నారు.
ఇది కూడా చదవండి: ‘డిజిటల్ మహాకుంభ్’.. సంస్కృతి, సాంకేతికతల కలబోత
Tags : 1