Breaking News

దిద్దుబాటుకు 'ఇస్రో' ఉపక్రమించాలి!

Published on Mon, 02/16/2026 - 00:21

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు ఈ ఏడాది ఆదిలోనే హంస పాదు ఎదురైంది. శ్రీహరికోట నుంచి జనవరి 12న ప్రయోగించిన పోలార్‌ ఉప గ్రహ వాహక నౌక (పీఎస్‌ఎల్వీ) విఫలమైంది. ఈ వాహక నౌక వివిధ దేశాలకు చెందిన ఉపగ్రహాలతోపాటు, మన దేశానికి చెందిన ఒక వ్యూహాత్మక ఉపగ్రహాన్ని కూడా కక్ష్యలో ప్రవేశపెట్టవలసి ఉంది. మిగిలిన అంతరిక్ష పరిశోధనా సంస్థల మాదిరిగానే ఇస్రో కూడా గతంలో కొన్ని వైఫల్యాలను చవి చూసింది. కానీ, కొన్ని సందర్భాల్లో అంతరిక్ష ప్రయోగాలు ఆందోళనను రేకెత్తిస్తాయి. లోతుగా ఆత్మపరిశీలన చేసుకోవలసిన, నిశితంగా సమీక్షించుకోవలసిన అవసరాన్ని చాటుతాయి. తాజా వైఫల్యం పలు కారణాల రీత్యా ఆ కోవకు చెందినదే!

పరుగెత్తని పంచకల్యాణి
పీఎస్‌ఎల్వీకి 63 సార్లు విజయం సాధించిన ఘన చరిత్ర ఉంది. చంద్రయాన్, మార్స్‌ ఆర్బిటర్‌ మిషన్‌ విజయాలు దాని ఖాతాలోకే వస్తాయి. దాన్ని తమ పంచకల్యాణి గుర్రంగా ఇస్రో చెప్పుకొంటుంది. ఒకటి రెండు వైఫల్యాలు లెక్కలోకి తీసుకోవలసిన అవసరం లేనివిగానే కనిపించవచ్చు. కానీ, పీఎస్‌ఎల్వీకి ఇది వరుసగా రెండో వైఫల్యం. గతేడాది మే 18న ప్రయోగించిన దానికి కూడా ఇదే గతి పట్టింది. ఈ రెండు సందర్భాలలోనూ రాకెట్‌ మూడవ దశలోనే లోపం తలెత్తింది. గత (2025) ప్రహసనం ఆధారంగా ఈసారి ఏమైనా మార్పులు చేసిందీ లేనిదీ ఇస్రో వెల్లడించలేదు. 

వైఫల్యాలను కూలంకషంగా విశ్లేషించుకునే బలమైన వ్యవస్థ ఇస్రోకు ఉంది. దీనికి 2021లో జియో ఉపగ్రహ వాహక నౌక (జీఎస్‌ఎల్వీ) వైఫల్యంపై వెల్లడైన నివేదికే ఉదాహరణ. క్రయోజనిక్‌ దశ జ్వలన సమయంలో దిగువ లిక్విడ్‌ హైడ్రోజన్‌ ట్యాంకులో పీడనం, ఫ్యూయల్‌ బూస్టర్‌ టర్బో పంప్‌ సక్రమంగా పనిచేయక పోవడానికి కారణమైందనీ, ఫలితంగా మొత్తం మిషన్‌ విఫలమైందనీ ఆ ఉదంతంలో తేల్చారు. కానీ, 2025 మే నాటి వైఫల్యం గురించి ఎలాంటి సమాచారమూ బయటకు రాలేదు. పారదర్శకంగా వ్యవహరించడంలో ఇస్రోకు మంచి చరిత్రే ఉంది. అది ఆ బాట నుంచి వైదొలగుతున్న ప్రమాదకర సంకేతాలు కనిపిస్తున్నాయి. 

కీలకమైన ఉపగ్రహాలకే ఎదురుదెబ్బ
వరుసగా రెండు పీఎస్‌ఎల్వీ వైఫల్యాలతోపాటు, గతేడాది కాలంలో, ఇస్రో మరో వైఫల్యపు అపఖ్యాతిని కూడా మూట గట్టుకుంది. కానీ, అది రాకెట్‌ వైఫల్యం కాదు. ఉపగ్రహ వైఫల్యం! ఇస్రో 2025 జనవరి 29న చేపట్టిన జీఎస్‌ఎల్వీ ప్రయోగంతో శ్రీహరికోట నుంచి వంద సార్లు ఉపగ్రహాలను ప్రయోగించిన రికార్డును సృష్టించింది. ఆ వాహక నౌక ప్రయోగానంతరం, అది ఎన్‌విఎస్‌–02 నావిగేషన్‌ ఉపగ్రహాన్ని దానికి ఉద్దేశించిన ట్రాన్స్‌ఫర్‌ కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టిందని ప్రకటించింది.  అయితే, ఆన్‌బోర్డ్‌ థ్రస్టర్లను జ్వలింప జేసేందుకు ఆక్సిడైజర్‌కు వీలు కల్పించే కవాటాలు తెరుచుకోని కారణంగా, నిర్ణయించిన స్లాట్‌లో ఉపగ్రహం కుదురుకోలేక పోయిందని చెప్పింది. 

ఏడాది కాలంలో మూడు వైఫల్యాలు ఎదురవడం అటు ఇస్రోకు గానీ, ఇటు దాని దేశ, విదేశీ కస్టమర్లకు గానీ తీవ్ర పర్యవసానాలనే కలుగ జేస్తోంది. పైగా, ఈ వైఫల్యాల కారణంగా కోల్పోయిన మూడు భారతీయ ఉపగ్రహాలు కీలకమైన సైనిక ఉపగ్రహాలు. ఆశించిన కక్ష్యలో కుదురు కోలేకపోయిన ఎన్‌విఎస్‌–02 ఒక నేవి గేషన్‌ ఉపగ్రహం. అది స్టాండర్డ్‌ పొజి షనింగ్‌ సర్వీసులతో పాటు, ‘రిస్ట్రిక్‌ టెడ్‌ సర్వీసులను’ కూడా సమకూరు స్తుంది. గతేడాది వైఫల్యంతో ఇఓఎస్‌– 09 ఉపగ్రహాన్ని కోల్పోయాం. ఆపరేషనల్‌ అప్లికేషన్లలో ఉన్న ఏజన్సీలకు రిమోట్‌ సెన్సింగ్‌ డేటాను అందించేట్లుగా దాన్ని డిజైన్‌ చేశారు. దానిలో సింథటిక్‌ అపెర్చర్‌ రాడార్‌ ఉంది. ఎటువంటి వాతావరణ పరిస్థితులలోనైనా ఇమేజ్‌లను సమకూర్చగల సామర్థ్యం ఆ పేలోడ్‌కు ఉంది. రక్షణ పరిశోధన ఏజన్సీలు అభివృద్ధి చేసిన ఇఓఎస్‌ –ఎన్‌1 (అన్వేషగా పిలుస్తున్నారు) భూ పరిశీలనా ఉపగ్రహాన్ని ఈ జనవరిలో ప్రయోగించిన పోలార్‌ వాహక నౌకలో అమర్చారు. 

అంతరిక్షం నుంచి సైన్యానికి ఉపయోగపడగలిగిన మూడు వ్యూహాత్మక ఆస్తులను కోల్పోవడం అంతరిక్ష, రక్షణ ఏజన్సీలకు మేలుకొలుపు కావాలి. అంతరిక్షం నుంచి సైన్యం ప్రయోజనాలను తీర్చగలిగిన దాదాపు 52 ఉపగ్రహాలను వచ్చే ఐదేళ్ళలో ప్రయోగించాలని బెంగళూరులోని డిఫెన్స్‌ స్పేస్‌ ఏజన్సీ ప్రణాళికలతో ఉంది. అంతరిక్ష ఆధారిత నిఘా (ఎస్‌బిఎస్‌) ప్రాజెక్టు 3వ దశ కింద వాటిని వినియోగించుకోవాలని భావిస్తున్నారు. ఉపగ్రహాలను తయారు చేసినా, ప్రైవేటు కంపెనీల ద్వారా పొందినా, వాటిని అంతరిక్షంలోకి చేర్చవలసిన బాధ్యత ఇస్రోపైనే ఉంటుంది. 

వాణిజ్య నష్టం అపారం
ఈ నెలలో వెళ్ళిన వాహక నౌక ఇఓఎస్‌–ఎన్‌1తో పాటు దేశ, విదేశీ కస్ట మర్లకు చెందిన 15 ఉపగ్రహాలను మోసు కెళ్ళింది. వాటిలో ‘ధ్రువ స్పేస్‌’కు చెందిన ఐదు ఉపగ్రహాలున్నాయి. ఆ ఐదింటిలో నేపాల్‌ది ఒకటి. బ్రెజిల్‌కు చెందిన ఆల్టో స్పేస్‌కు చెందిన మరో ఐదు ఉపగ్రహాలున్నాయి. బ్రిటన్‌–థాయి లాండ్‌ సంయుక్త ఉపగ్రహంతోపాటు, భారతీయ కస్టమర్లకు చెందిన మరో రెండు చిన్న ఇతర ఉపగ్రహాలు, యూరోపియన్‌ స్పేస్‌ ఏజన్సీ చేయూతతో స్పెయిన్‌ కంపెనీ తయారు చేసిన ‘కిడ్‌’ ఉపగ్రహం కూడా ఉంది. 

ధ్రువతోపాటు ఇతర భారతీయ అంకుర సంస్థలు పీఎస్‌ఎల్వీ పైనే ఆశ పెట్టుకున్నాయి. అవి పెద్ద మొత్తంలో నగదుతోపాటు విలువైన కాలాన్ని, అవ కాశాన్ని కూడా కోల్పోయినట్లు లెక్క. ఉప గ్రహాల సైజును బట్టి వాటిని తయారు చేసేందుకు కంపెనీలకు కొద్ది నెలల నుంచి కొద్ది ఏళ్ళు పట్టవచ్చు. కోల్పో యినవాటి స్థానంలో అవి కొత్త వాటిని వేగంగా తయారు చేసుకున్నా, పీఎస్‌ ఎల్వీలో చోటు కోసం అవి చాలాకాలం ఎదురుచూడక తప్పదు. దీనికితోడు, రాకెట్‌ విశ్వసనీయత దెబ్బ తినడం వల్ల బీమా ఖర్చులు పెరుగుతాయి. అది తిరిగి మొత్తం ప్రాజెక్టు వ్యయాన్ని పెంచుతుంది. 

వరుసగా రెండు వైఫల్యాల నేపథ్యంలో, భవిష్యత్‌ పీఎస్‌ఎల్వీ ప్రయోగాలను సమీక్షించుకోవడం ఇస్రోకు తక్షణ కర్తవ్యంగా మారు తోంది. ఈ ఏడాది మరికొన్ని ఇతర ప్రయోగాలు నిర్వహించవలసి ఉంది. ముఖ్యంగా గగన్‌యాన్‌ కార్యక్రమం కింద సిబ్బంది లేకుండా ఒక అంతరిక్ష నౌకను కక్ష్యలో తిప్పనున్నారు. మానవ సహిత అంతరిక్ష నౌకను పంపడంపై జోరుగా ప్రయత్నాలు సాగుతున్నాయి. భారతీయ అంతరిక్ష కేంద్రాన్ని నెలకొల్పడంపై దృష్టి పెట్టాం. ఈ స్థితిలో ఇస్రోపై బృహత్తర బాధ్యత పడుతోంది. అది టెక్నికల్, క్వాలిటీ, మేనేజీరియల్‌ ప్రక్రియలను పూర్తి స్థాయిలో సమీక్షించుకోవాలి. విశ్వసనీయమైనదని ఉన్న పేరును కాపాడుకునేందుకు అదొక్కటే మార్గం! 

దినేశ్‌ సి. శర్మ
వ్యాసకర్త సైన్స్‌ అంశాల వ్యాఖ్యాత 

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)