ప్రజా దర్బార్ లో పేదలను అవమానించిన బద్వేల్ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ
Breaking News
నిజమైన పంచాంగము
Published on Tue, 03/17/2026 - 09:36
ఉగాది పండుగ అనగానే వెంటనే పంచాంగ పఠనం మనకు గుర్తుకొస్తుంది. ప్రతి ఊళ్లో పంచాంగ పఠనాన్ని వినటానికి జనం ఉత్సాహంగా గుమికూడతారు. 1961 మార్చి 17న పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో సత్య సాయిబాబా వారి సమక్షంలో కస్తూరి పంచాంగం చదివాడు. బాబా ఇలా అన్నారు: ‘కస్తూరి ఇప్పుడు ‘ప్లవ’ నామ సంవత్సర పంచాంగం చదివాడు. విన్న మీలో విచారము, అశాంతి ఎక్కువవుతున్నాయి. ఈ పంచాంగము గురించి ఆందోళన చెందకండి, మీ లోపల ఉన్న పంచ అంగముల యెడల జాగ్రత్త వహించండి. అవి చాలా శక్తిమంతములైనవి. అవే ఐదు కర్మేంద్రియములు. వాటిని అదుపులో ఉంచటంలో మనస్సుకి శిక్షణ ఇవ్వండి. మీరు భగవంతుని అనుగ్రహం పొందినట్లయితే ఏ గ్రహమూ మిమ్మల్ని ఏమీ చేయదు.’ (పుట 15– శ్రీ సత్యసాయి వచనామృతం–1961–1962). ఈ సందర్భంలో మనం ఒక శ్లోకాన్ని గుర్తుకు తెచ్చుకొని పరిశీలిస్తే మంచిది:
కురంగ, మాతంగ, పతంగ, భృంగ
మీనాః హతాః పంచభిరేవ పంచ.
ఏకః ప్రమాదీ స కథం నహన్యతే
యస్సేవతే పంచభి రేవ పంచ.
లేడి, ఏనుగు, మిడత, చేప, తుమ్మెద ఈ అయిదును శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము అను అయిదు విషయములలో క్రమముగా ఒక్కొక్క విషయముచే ఆకర్షింపబడి వానికి వశములై చనిపోవుచున్నవి. ఒక్కొక్క విషయమునకు, ఇంద్రియమునకు మాత్రమే వశములై పోయిన వాని దురవస్థ ఇట్లుండగా; అయిదు విషయములకు, అయిదు ఇంద్రియములకు వశమైపోయి, ఆ విషయములన్నిటిని ఎడతెగక ఎల్లప్పుడు అనుభవించుచున్న వారి దురవస్థను గురించి ఏమని వర్ణింపవలెను? (అద్వైతాక్షర మాలిక).
పంచాంగములైన కర్మేంద్రియాలను, పంచాంగములైన జ్ఞానేంద్రియములను జాగ్రత్తగా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, నియంత్రించటం వల్లే శుభం కల్గుతుంది. ఒక్క ఉగాది రోజే కాక సంవత్సరమంతా అలా చేస్తే ఏడాదంతా పండుగే. పంచాంగ పఠనం (పరిశీలన) రోజూ చేయాల్సిందే.
– రాచమడుగు శ్రీనివాసులు
Tags : 1