Breaking News

హైహయుల కథ

Published on Sun, 12/07/2025 - 06:38

హైహయ వంశంలో కార్తవీర్యార్జునుడు అనే మహారాజు ఉండేవాడు. నర్మదా తీరంలోని మహిష్మతీ నగరాన్ని రాజధానిగా చేసుకుని, రాజ్యాన్ని పాలించేవాడు. కార్తవీర్యార్జునుడి వద్ద భృగువంశ విప్రులు పురోహితులుగా ఉండేవారు. వారి ఆధ్వర్యంలో కార్తవీర్యార్జునుడు అనేక యజ్ఞయాగాదులు చేశాడు. అతడు చేసిన దానాలతో, అతడి నుంచి అందుకున్న సంభావనలతో భృగువంశీయులందరూ సంపన్నులయ్యారు. 

కార్తవీర్యార్జునుడు స్వర్గస్థుడయ్యాక హైహయులు నిర్ధనులయ్యారు. ఒకసారి వారికి పెద్దమొత్తంలో ధనం అవసరమైంది. హైహయులు సుక్షత్రియులే అయినా, అహం చంపుకొని భృగువంశ పురోహితులను ఆర్థిక సహాయాన్ని అభ్యర్థించారు. లుబ్ధులైన భార్గవులు లేదు పొమ్మంటూ హైహయులకు మొండిచేయి చూపారు. హైహయులు తమ సంపదను బలవంతంగా దోచుకుంటారేమోనని భయపడిన భార్గవులు తమ వద్దనున్న అపార ధనరాశులను భూమిలో పాతిపెట్టి, తట్టా బుట్టా సర్దుకుని, భార్యా బిడ్డలతో పాటు మహిష్మతీ నగరాన్ని విడిచిపెట్టి, అడవుల్లోకి పారిపోయారు.

హైహయులకు ఎక్కడా ధనం దొరకలేదు. మనసు చంపుకొని భార్గవులనే మరోసారి అడుగుదామని వారి ఆశ్రమాలకు వచ్చారు. అన్నీ ఖాళీగా ఉన్నాయి. వారందరూ పారిపోయారని తెలిసింది. ధనరాశులను పాతిపెట్టి ఉంటారని అనుమానించిన హైహయులు ఇళ్లన్నీ తవ్వారు. అంతులేని ధనరాశులు దొరికాయి. ఈ సంగతి తెలిసిన భార్గవులలో కొందరు లబోదిబోమంటూ తిరిగి తమ ఆశ్రమాలకు వచ్చారు. క్షమించమంటూ హైహయుల కాళ్ల మీద పడ్డారు. తాము సవినయంగా అడిగితే ధనం లేదని చెప్పి, పాతిపెట్టి పారిపోయిన భార్గవులపై హైహయులు మండిపడ్డారు. వారిపై ధనుర్బాణాలను ఎక్కుపెట్టారు. దొరికిన వారిని దొరికినట్లుగా మట్టుబెట్టారు. అడవులలో తలదాచుకున్న భార్గవులను వెదికి వెదికి మరీ సంహరించడం ప్రారంభించారు. ఈ బీభత్సానికి భార్గవుల పత్నులు రోదనలు ప్రారంభించారు. 

హైహయుల మారణకాండ వల్ల చెలరేగిన కలకలానికి, రోదనలకు చుట్టుపక్కల ఆశ్రమాల్లోని మునీశ్వరులు ఏదో దారుణం జరుగుతోందని తలచి పరుగు పరుగున అక్కడకు చేరుకున్నారు. వారు అక్కడికి చేరుకునే సరికి హైహయులు భార్గవులను ఊచకోత కోస్తూ కనిపించారు. మునిగణమంతా హైహయులకు అడ్డువెళ్లి, వారించారు. విప్రులను వధించడం పాపకృత్యమని, ఈ హింసాకాండను ఇక్కడితో విరమించుకోమని హెచ్చరించారు. మునిగణం వారించడంతో హైహయులు కొంత శాంతించారు. ఆగ్రహావేశాల నుంచి తేరుకుని, పెదవి విప్పారు.

‘మునీశ్వరులారా! మీరు మమ్మల్ని నిందిస్తున్నారే గాని, వీరు మా పట్ల చేసిన పాపకృత్యం మీకు తెలియదు. వీరు మా పూర్వీకుల వద్ద పౌరోహిత్యం చేసేవారు. మా పూర్వీకుల నుంచి భూరి దానాలు, సంభావనలు స్వీకరించి ధనాఢ్యులయ్యారు. వీరు విప్రులు కాదు, నయవంచకులు, పరమ లోభులు. మాకు అత్యవసరం ఏర్పడి ధనాన్ని సర్దుబాటు చేయమని సవినయంగా అర్థిస్తే, కనికరమైనా లేకుండా, లేదు పొమ్మన్నారు. పైగా మేమెక్కడ బలవంతం చేస్తామోనని అనుమానించి, ధనరాశులను భూమిలో పాతిపెట్టి, అడవులకు చేరుకున్నారు. 

కృతజ్ఞత కలిగిన మనుషులు చేయదగిన పనేనా ఇది? వీరిని చంపుతున్నామంటే, చంపమా మరి? వీరికి ఈ ధనరాశులన్నీ మా పూర్వీకుడైన కార్తవీర్యార్జునుడు లోక క్షేమం కోసం యజ్ఞ యాగాదులు చేయమని, తాము సుఖంగా బతకమని, యాచకులకు దానం చేయమని వీరికి అపార ధనరాశులను ఇచ్చాడు. వీళ్లు ఈ మూడింటిలో ఏ ఒక్క పనీ చేయలేదు. పైగా లోభంతో ధనరాశులను భూమిలో పాతిపెట్టారు. పరమ లోభులైన ఈ నీచులను విప్రులు అనవచ్చునా? యజమానుల క్షేమం కోరుకోని వీరు లోకక్షేమాన్ని కాంక్షిస్తారనుకోగలమా? ధనానికి మూడే గతులు. దానం, భోగం, నాశం. దానం చేయక, తాను అనుభవించక ధనం కూడబెట్టిన లోభులు వంచకులు, దండనార్హులు. అందుకే మేము ఈ వంచకులను దండించాం. ఇందులో మా తప్పులేదని మా అభిప్రాయం. దీని గురించి మీరు మాపై కినుక వహించకండి’ అన్నారు.

హైహయుల సమాధానానికి మునీశ్వరులెవరూ మారు పలకలేకపోయారు. అయితే, మునిగణం రాకతో హైహయులు ఆగ్రహం నుంచి బయటపడ్డారు. రోదిస్తున్న భార్గవుల పత్నులను ప్రాణాలతో విడిచిపెట్టారు. అప్పటికే భయకంపితులై ఉన్న ఆ స్త్రీలు, ప్రాణాలు దక్కడమే చాలనుకుని, అక్కడి నుంచి బయలుదేరి హిమవంతం చేరుకున్నారు.

హిమాలయాలకు చేరుకున్న భార్గవుల పత్నులు కొన్నాళ్లకు భయాందోళనల నుంచి తేరుకున్నారు. వారంతా నదీతీరంలో మట్టితో గౌరీదేవి బొమ్మను చేసి, దీక్షగా అర్చించారు. వారి భక్తికి ప్రసన్నురాలైన దేవి కలలో కనిపించింది. ‘మీలో ఒకరికి ఊరు అంశతో కొడుకు పుడతాడు. అతడే మీ దుఃఖాలను తొలగించగలడు’ అని పలికింది. 

కొన్నాళ్లకు భార్గవపత్నులలో ఒకరికి తొడలో గర్భం ఏర్పడింది. ఒకనాడు వారు ఉంటున్నవైపు హైహయులు వచ్చారు. వారిని చూసి భార్గవపత్నులు భయకంపితులై పరుగులు తీశారు. హైహయులు వారిని వెంబడించారు. పరుగు తీయలేని ఊరుగర్భిణిని ఖడ్గధారులైన హైహయులు చుట్టుముట్టారు. 
ఊరుగర్భంలో ఉన్న బాలకుడు తన తల్లి దీనావస్థకు చలించిపోయి, గర్భాన్ని చీల్చుకుని బయటకు వచ్చాడు. మార్తాండకాంతితో మెరిసిపోతున్న ఆ బాలుడిని చూడటంతోనే హైహయులకు కళ్లు పోయాయి. ఇది పాతివ్రత్య మహిమ అని గ్రహించిన హైహయులు రోదిస్తూ ఆ తల్లి కాళ్ల మీద పడ్డారు. ‘తల్లీ! కనికరించు’ అని ప్రాధేయపడ్డారు. 

‘క్షత్రియవీరులైన మీరు నావంటి సామాన్య స్త్రీని ప్రాధేయపడటం తగదు. నాకు మీ మీద ఎలాంటి కోపం లేదు. తన తాత తండ్రులను చంపినందుకు నా కుమారుడికే మీ మీద కోపంగా ఉంది. ఇతడు జగదీశ్వరి ప్రసాదంగా నాకు జన్మించాడు. అతడే  మిమ్మల్ని క్షమించగలడు’ అని చెప్పింది. హైహయులు వెంటనే ఆ బాలుడి పాదాల మీద పడ్డారు. బాలభార్గవుడు ప్రసన్నుడై, వారికి దృష్టి ప్రసాదించాడు. ధర్మబద్ధంగా పాలన సాగించండి అని హితవు చెప్పి, వారిని పంపాడు.

సాంఖ్యాయన


 

Videos

Chintada Ravi: దేశ ప్రతిష్టను పాతాళానికి తొక్కేసాడు ఇండిగో సంక్షోభంపై రామ్మోహన్ నాయుడును ఏకిపారేసిన చింతాడ రవి

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జానియర్ ఎన్టీఆర్

Maoist Leader: మావోలకు భారీ ఎదురుదెబ్బ 3 కోట్లు రివార్డ్ ఉన్న మావోయిస్ట్ సరెండర్

ప్రజలకు వివరించి కోటి సంతకాల సేకరణ చేశాం: బొత్స సత్యనారాయణ

ఛీ.. ఛీ.. మీరు రాష్ట్రానికి పట్టిన. రామ్మోహన్ నాయుడు, లోకేష్‌పై రెచ్చిపోయిన KA పాల్

Kethireddy Pedda Reddy: అంతా మీ ఇష్టమా! తాడిపత్రి మీ అడ్డా కాదు

ఇండియాలో స్టార్ లింక్ సబ్ స్క్రిప్షన్ ధరలు ఇవే!

వెంటనే ఆపేయండి.. మెడికల్ కాలేజీల జోలికి పోవద్దు

Tadepalli : పోలీసుల ఓవర్ యాక్షన్ విద్యార్థి నేతలను లారీ ఎక్కించి..!

Machilipatnam: కూటమి నాయకుల మధ్య వాజ్‌పేయి విగ్రహం చిచ్చు

Photos

+5

చేతి వేళ్లన్నంటికీ రింగ్స్.. మృణాల్ ఠాకుర్ ఫ్యాషన్ (ఫొటోలు)

+5

సూర్య కొత్త సినిమా లాంచ్.. హీరోయిన్‌గా నజ్రియా (ఫొటోలు)

+5

అట్టహాసంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభం (చిత్రాలు)

+5

Chiranjeevi : మేనేజర్ కుమార్తె బారసాల వేడుకలో మెగాస్టార్ చిరంజీవి దంపతులు (ఫొటోలు)

+5

నేటి తరానికి స్పూర్తి.. మన 'ప్రగతి' విజయం (ఫోటోలు)

+5

హైదరాబాద్ : ఈ కాళీ మాత ఆలయాన్ని మీరు ఎప్పుడైనా దర్శించుకున్నారా? (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

మడత మంచంపై పడుకుని ప్రకృతిని ఆస్వాదిస్తూ (ఫొటోలు)

+5

థాయ్‌ల్యాండ్ ట్రిప్‌లో 'రాజాసాబ్' బ్యూటీ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ బ్యూటీ రమ్య మోక్ష లేటేస్ట్ లుక్స్.. ఫోటోలు