YSRCP నేతలతో గుడివాడ అమర్నాథ్ అత్యవసర మీటింగ్
Breaking News
ఏనుగు మాధురి తిరిగి కొల్హాపూర్కు.. వంతారా కీలక ప్రకటన
Published on Fri, 09/11/2026 - 13:16
జామ్నగర్: కొల్హాపూర్లో మహాదేవిగా ప్రసిద్ధి చెందిన ఏనుగు మాధురిని తిరిగి కొల్హాపూర్కు తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని వంతారా ప్రకటించింది. హై పవర్డ్ కమిటీ (HPC) ఆదేశాలను గౌరవిస్తూ.. మాధురి సంక్షేమానికి అవసరమైన చర్యలను కొనసాగిస్తామని తెలిపింది. 2025 జులై 30న మాధురిని జామ్నగర్లోని వంతారాకు తరలించడం తమ నిర్ణయం కాదని, హై పవర్డ్ కమిటీ ఆదేశాల మేరకే ఏనుగును స్వీకరించి సంరక్షణ అందించామని స్పష్టం చేసింది.
మాధురిపై కొల్హాపూర్ ప్రజలకు ఉన్న భావోద్వేగాలను పూర్తిగా అర్థం చేసుకున్నామని వంతారా పేర్కొంది. మహారాష్ట్ర ప్రభుత్వం, అధికారులు, సంబంధిత వర్గాలు, స్థానికులతో చర్చించిన అనంతరం 2025 ఆగస్టు 6న కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసినట్లు తెలిపింది. అధికారుల ఆదేశాలకు తాము కట్టుబడి ఉంటామని అప్పుడే ప్రకటించామని గుర్తుచేసింది.
తాజాగా మాధురి విషయంలో తమ వాదనలను హై పవర్డ్ కమిటీ ముందు ఉంచాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అనంతరం అన్ని వర్గాల వాదనలు విన్న హై పవర్డ్ కమిటీ.. సంబంధిత నివేదికలను పరిశీలించడంతో పాటు నందనిలోని మాధురి పాత వసతి ప్రాంతాన్ని కూడా తనిఖీ చేసింది. 2026 సెప్టెంబర్ 9న మాధురిని తిరిగి కొల్హాపూర్కు తరలించేందుకు అనుమతిస్తూ కారణాలతో కూడిన ఆదేశాలు జారీ చేసింది.
అయితే మాధురిని ఇకపై ఊరేగింపులు లేదా ఇతర కార్యక్రమాలకు ఉపయోగించకూడదని హై పవర్డ్ కమిటీ స్పష్టం చేసింది. ఆ ఏనుగుకు 24 గంటలూ సంరక్షణ అందించడంతో పాటు ప్రతి రెండు వారాలకు ఒకసారి వైద్య పరీక్షలు నిర్వహించాలని షరతులు విధించింది. ఈ ఆదేశాలను పూర్తిగా పాటిస్తామని వంతారా వెల్లడించింది.
ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి
మాధురి విషయంలో తమ వైఖరి మొదటి నుంచీ పశువైద్య శాస్త్రం, ఆ ఏనుగు సంక్షేమం ఆధారంగానే ఉందని వంతారా తెలిపింది. నిరంతర వైద్య సంరక్షణతో ఏనుగు ఆరోగ్య పరిస్థితిని స్థిరీకరించగలిగామని, అయితే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు పూర్తిగా తొలగిపోలేదని పేర్కొంది. ఏనుగుకు నిరంతర వైద్య పర్యవేక్షణ, అవసరమైన చికిత్స, సహాయక సంరక్షణ కొనసాగాల్సిన అవసరం ఉందని తెలిపింది.
మాధురి కొల్హాపూర్కు తిరిగి వెళ్లిన తర్వాత కూడా తమ బాధ్యత ముగియదని వంతారా స్పష్టం చేసింది. ఆ ఏనుగుకు తగిన వసతి, వైద్య సదుపాయాలు, అవసరమైన వైద్య పరికరాలు, మందులు తదితర ఏర్పాట్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని తెలిపింది. హై పవర్డ్ కమిటీ ఆదేశాల మేరకు వంతారా పశువైద్యులు ప్రతి రెండు వారాలకు ఒకసారి కొల్హాపూర్కు వెళ్లి మాధురికి వైద్య పరీక్షలు నిర్వహించి, నివేదికలను సంబంధిత అధికారులకు సమర్పిస్తారని వెల్లడించింది.
నందని వసతిలోనూ ఏర్పాట్లు
మాధురి తిరిగి వెళ్లనున్న నందని ప్రాంతంలోని ఎన్క్లోజర్, ఇతర సదుపాయాలను కూడా అందుబాటులో ఉన్న వనరులతో సాధ్యమైనంత మెరుగ్గా తీర్చిదిద్దినట్లు వంతారా తెలిపింది. అయితే పట్టణ ప్రణాళిక పరిమితుల కారణంగా ప్రస్తుతం మరిన్ని మౌలిక సదుపాయాల అభివృద్ధి చేయలేకపోయామని పేర్కొంది. ట్రస్ట్ భూమి మీదుగా రహదారి వెళ్లడం వల్ల అభివృద్ధికి అందుబాటులో ఉన్న స్థలం పరిమితమైందని వివరించింది.
మాధురి అక్కడ స్థిరపడిన తర్వాత కూడా వసతి సదుపాయాలను మరింత మెరుగుపరిచేందుకు మఠానికి అవసరమైన సహకారం అందిస్తామని వంతారా తెలిపింది. కోర్టులు లేదా సమర్థులైన అధికారులు ఆదేశిస్తే మౌలిక సదుపాయాల అభివృద్ధికి సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొంది.
జంతు సంక్షేమం అంటే కేవలం భావోద్వేగాలకు పరిమితం కాకుండా వాస్తవాలు, పశువైద్య శాస్త్రం, బాధ్యతాయుత సంరక్షణ, చట్టపరమైన ప్రక్రియను గౌరవించడం, జంతువుల జీవితాలను నిరంతరం కాపాడే నిబద్ధతతో ముందుకు సాగడం అని వంతారా పేర్కొంది.
మాధురి విషయంలో ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు, బాంబే హైకోర్టు, హై పవర్డ్ కమిటీలకు వంతారా కృతజ్ఞతలు తెలిపింది. మహారాష్ట్ర, గుజరాత్ ప్రభుత్వాలు, అధికారులు అందించిన సహకారాన్ని ప్రశంసించింది. మాధురి కోసం ఆందోళన వ్యక్తం చేసిన కొల్హాపూర్ ప్రజలు, మఠానికి ధన్యవాదాలు తెలిపింది. మాధురి పరిస్థితిని హై పవర్డ్ కమిటీ దృష్టికి తీసుకెళ్లడంలో PETA ఇండియా పోషించిన పాత్రను కూడా గుర్తించింది.
మాధురి ఎక్కడ ఉన్నా.. ఆ ఏనుగు ఆరోగ్యం, సంక్షేమం, గౌరవమే తమ ప్రధాన ప్రాధాన్యమని వంతారా స్పష్టం చేసింది. ఆ ఏనుగుకు ఆరోగ్యకరమైన, సురక్షితమైన, సంతోషకరమైన దీర్ఘాయుష్షు ఉండాలని ఆకాంక్షించింది.
Tags : 1