Jada Sravan : అల్లాడిపోతున్న నాలుగు ప్రాణాలు ఎంత లాగితే అంత నష్టమే..
Breaking News
సివిల్ ఏవియేషన్పై హెచ్ఏఎల్ మరింతగా ఫోకస్
Published on Thu, 01/29/2026 - 09:17
పౌర విమానయాన విభాగంపై మరింతగా దృష్టి పెట్టనున్నట్లు ప్రభుత్వ రంగ ఏరోస్పేస్ దిగ్గజం హెచ్ఏఎల్ సీఎండీ డీకే సునీల్ వెల్లడించారు. వ్యాపారంలో ఈ విభాగం వాటా ప్రస్తుతం 5–6 శాతంగా ఉండగా 25 శాతానికి పెంచుకోనున్నట్లు వివరించారు. ఈ క్రమంలో సూపర్జెట్ 100 (ఎస్జే100) ఎయిర్క్రాఫ్ట్లను ప్రస్తుత ప్లాంట్లలో వచ్చే మూడేళ్లలో సెమీ–నాక్డ్ డౌన్ విధానంలో రూపొందించనున్నట్లు చెప్పారు. రష్యాకి చెందిన పబ్లిక్ జాయింట్ స్టాక్ కంపెనీ యునైటెడ్ ఎయిర్క్రాఫ్ట్ కార్పొరేషన్తో హెచ్ఏఎల్ ఇటీవలే ఇందుకు సంబంధించిన ఒప్పందం కుదుర్చుకుంది.
ఓవైపు వీటిని లీజు పద్ధతిలో అందిస్తూనే, దేశీయంగా ఈ విమానాల తయారీకి ఏర్పాట్లు చేసుకోనున్నట్లు సునీల్ చెప్పారు. దేశంలో ప్రాంతీయంగా కనెక్టివిటీపై దృష్టి పెడుతున్నందున 200 పైగా ఎస్జే100 విమానాలకు డిమాండ్ నెలకొనవచ్చని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. రాబోయే మూడునాలుగేళ్లలో తమ కంపెనీ ఆదాయాల్లో ఈ విమానాలతో పాటు హెలికాప్టర్లకు కూడా గణనీయంగా వాటా ఉంటుందని ఆయన తెలిపారు.
ప్రభుత్వ రంగ పవన్ హన్స్ సంస్థ దేశీయంగా తయారైన 10 ధృవ్ న్యూ జనరేషన్ హెలికాప్టర్లను కొనుగోలు చేసి, ఓఎన్జీసీ ఆఫ్షోర్ కార్యకలాపాల కోసం వినియోగించనున్నట్లు సునీల్ చెప్పారు. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) నుంచి కూడా ఈ విమానాలకోసం ఆర్డర్లు ఉన్నట్లు తెలిపారు. కార్యకలాపాలపై ఏటా రూ. 2,500–3,000 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరం రూ. 31,000 కోట్ల ఆదాయం ఆర్జించగా, ఈ ఆర్థిక సంవత్సరం సుమారు 7–8 శాతం వృద్ధి అంచనా వేస్తున్నట్లు వివరించారు.
ఇదీ చదవండి: లెక్కలు తప్పయితే.. చిక్కులు తప్పవు!
Tags : 1