విశాఖలో టైమ్ పాస్ చేస్తున్న టీడీపీ MLA
Breaking News
జీఎస్టీ కోతతో ఇళ్లకు డిమాండ్
Published on Sat, 09/13/2025 - 12:36
పలు ఉత్పత్తులపై జీఎస్టీని తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వినియోగదారుల కొనుగోలు శక్తి పెరుగుతుందని, ఇది ఇళ్లకు డిమాండ్ను పెంచుతుందని రియల్ ఎస్టేట్ డెవలపర్ల సమాఖ్య ‘క్రెడాయ్’ అంచనా వేసింది. సిమెంట్, మరికొన్ని బిల్డింగ్ మెటీరియల్స్పై జీఎస్టీని తగ్గించడం వల్ల నిర్మాణ వ్యయం దిగొస్తుందని పేర్కొంది. సింగపూర్లో నిర్వహించిన క్రెడాయ్–నాట్కాన్ వార్షిక సమావేశం సందర్భంగా దీనిపై ప్రకటన చేసింది.
జీఎస్టీ రేట్ల తగ్గింపు ప్రయోజనాలు తప్పకుండా వినియోదారులకు బదిలీ కావాలంటూ.. సిమెంట్, బిల్డింగ్ మెటీరియల్స్ కంపెనీలు రేట్లను తగ్గించాలని డిమాండ్ చేసింది. జీఎస్టీలో 12 శాతం, 28 శాతం శ్లాబులను ఎత్తివేస్తూ, ఇందులోని వస్తు, సేవలను 5 శాతం, 18 శాతం కిందకు మారుస్తూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకోగా, ఈ నెల 22 నుంచి ఇది అమల్లోకి రానుండడం తెలిసిందే.
సానుకూల సెంటిమెంట్
జీఎస్టీ రేట్ల తగ్గింపుతో వినియోదారుల్లో సానుకూల సెంటిమెంట్ నెలకొన్నట్టు క్రెడాయ్ చైర్మన్ బొమన్ ఇరానీ తెలిపారు. పండుగల సీజన్కు ముందు ఇది మంచి సంకేతంగా పేర్కొన్నారు. జీఎస్టీ రేట్ల తగ్గింపుతోపాటు బడ్జెట్లో పన్ను మినహాయింపులు, రెపో రేట్ల తగ్గింపు హౌసింగ్ డిమాండ్కు ప్రేరణనిస్తాయని క్రెడాయ్ ప్రెసిడెంట్ శేఖర్ పటేల్ అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో ఇళ్ల అమ్మకాలు విలువ పరంగా పెరిగినప్పటికీ.. సంఖ్యా పరంగా (యూనిట్లు) తగ్గినట్టు చెప్పారు. అయితే జూన్ త్రైమాసికంలో జీడీపీ బలమైన వృద్ధిని నమోదు చేయడం, విధానపరమైన చర్యల ఫలితంగా రానున్న నెలల్లో ఇళ్ల అమ్మకాలు పుంజుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అందుబాటు ధరల ఇళ్లకు ఉన్న రూ.45 లక్షల పరిమితిని సవరించాలన్న డిమాండ్ను మరోసారి ప్రస్తావించారు. రూ.45 లక్షల వరకు ఉన్న ఇళ్లపై జీఎస్టీ ఒక శాతం కాగా, అంతకుమించితే 5 శాతం జీఎస్టీ వర్తిస్తుంది.
పన్నుల భారం తగ్గించాలి..
రియల్ ఎస్టేట్ రంగంపై కేంద్రం, రాష్ట్రాలు కలిపి 35–45 శాతం వరకు పన్నులు విధిస్తున్నాయని.. ఈ భారాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని శేఖర్ పటేల్ పేర్కొన్నారు. పన్నులు తగ్గించడం వల్ల ప్రాపర్టీల ధరలు దిగొస్తాయన్నారు. క్రెడాయ్లో దేశవ్యాప్తంగా 13,000 మంది డెవలపర్లు సభ్యులుగా ఉన్నారు.
ఇదీ చదవండి: ఎవరైనా సులువుగా డబ్బు సంపాదించవచ్చు!
Tags : 1