డీఏస్సీ స్కామ్ లో సీబీఐ ఎంక్వైరీ..? తక్షణమే లోకేష్ రాజీనామా..?
Breaking News
నేపాల్లో ఇక రూ.200, రూ.500 నోట్లు..
Published on Mon, 07/27/2026 - 11:29
భారత్–నేపాల్ మధ్య ప్రయాణాలు, సరిహద్దు వాణిజ్యానికి ఊరటనిచ్చే కీలక నిర్ణయాన్ని నేపాల్ ప్రభుత్వం అమలు చేసింది. 2016లో భారత్లో నోట్ల రద్దు తర్వాత అమల్లోకి వచ్చిన కఠిన పరిమితులను సడలిస్తూ, 2016 నవంబర్ 9 తర్వాత జారీ చేసిన భారతీయ రూ.200, రూ.500 నోట్లను ఒక్కో వ్యక్తి గరిష్ఠంగా రూ.25,000 వరకు నేపాల్లోకి తీసుకెళ్లడానికి, అక్కడి నుంచి తీసుకురావడానికి అనుమతి ఇచ్చింది. ఈ మేరకు నేపాల్ రాష్ట్ర బ్యాంక్ (Nepal Rastra Bank–NRB) తాజాగా మరోసారి స్పష్టీకరణ నోటీసు విడుదల చేసింది.
ఫిబ్రవరి 11న నేపాల్ గెజిట్లో ఈ నిబంధనలు ఇప్పటికే ప్రచురించినప్పటికీ, వాటి అమలుపై స్పష్టత కల్పించేందుకు ఎన్ఆర్బీ తాజా నోటీసు జారీ చేసింది. కొత్త నిబంధనల ప్రకారం.. భారతీయులు, నేపాలీయులు ఇద్దరూ 2016 నవంబర్ 9 తర్వాత ముద్రించిన రూ.200, రూ.500 నోట్లను చట్టబద్ధంగా వినియోగించవచ్చు. అయితే 2016కు ముందు జారీ చేసిన పాత రూ.500, రూ.1,000 నోట్లు మాత్రం నేపాల్లో ఇప్పటికీ నిషేధితంగానే ఉంటాయి.
ఎన్ఆర్బీ అధికార ప్రతినిధి గురు ప్రసాద్ పౌడెల్ ప్రకారం.. నేపాలీ పౌరులు భారత కరెన్సీని భారత్ నుంచి మాత్రమే నేపాల్కు తీసుకురావాలి. అలాగే నేపాల్ నుంచి భారతదేశం మినహా మూడో దేశానికి భారత కరెన్సీని తీసుకెళ్లేందుకు అనుమతి ఉండదు. ఈ నిబంధనలు సరిహద్దు నగరాల ప్రజలు, వ్యాపారులు, పర్యాటకులకు వర్తిస్తాయి.
విదేశీ కరెన్సీ విషయంలో ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల్లో మార్పు లేదు. నేపాలీ పౌరులు, విదేశీ సందర్శకులు 5,000 అమెరికన్ డాలర్లు లేదా దానికి సమానమైన విదేశీ కరెన్సీని కస్టమ్స్ డిక్లరేషన్ లేకుండా తీసుకురావచ్చు. అంతకంటే ఎక్కువ ఉంటే తప్పనిసరిగా కస్టమ్స్కు ప్రకటించాల్సి ఉంటుంది.
2016లో భారత ప్రభుత్వం రూ.500, రూ.1,000 పాత నోట్లను రద్దు చేసిన అనంతరం, నేపాల్ భద్రతా, ఆర్థిక కారణాలతో రూ.100కు మించిన భారతీయ నోట్ల ప్రవేశాన్ని నిలిపివేసింది. దాంతో భారత పర్యాటకులు, సరిహద్దు వ్యాపారులు, నేపాల్లో పనిచేసే వేలాది మంది నేపాలీయులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాజా నిర్ణయంతో దాదాపు పదేళ్ల తర్వాత ఆ పరిమితులకు గణనీయమైన సడలింపు లభించినట్లైంది. భారత్–నేపాల్ మధ్య పర్యాటకం, చిన్న స్థాయి సరిహద్దు వాణిజ్యం, ప్రజల మధ్య ఆర్థిక లావాదేవీలు మరింత సులభతరం అవుతాయని అధికారులు భావిస్తున్నారు.
ఇది చదివారా? ప్లాస్టిక్ నోట్లు వచ్చేస్తున్నాయ్.. ఆర్బీఐ తొలి అడుగు!
Tags : 1