నాడు సాక్షి వేదికపై అవార్డు.. నేడు అంతరిక్షంలో రికార్డు
Breaking News
ఇకపై అలాగైతేనే డ్రైవింగ్ లైసెన్స్..
Published on Sat, 07/18/2026 - 13:47
సాక్షి, సిటీబ్యూరో: డ్రైవింగ్ లైసెన్సుల జారీ ప్రక్రియను రవాణా శాఖ కఠినతరం చేసింది. రోడ్డు భద్రతా నిబంధనలపై సమగ్ర అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఇందులో భాగంగా లెర్నింగ్ లైసెన్స్ తీసుకున్న అభ్యర్థి ఇక నుంచి తప్పనిసరిగా ఆన్లైన్లో రోడ్డు భద్రతపై మూడు గంటల పాటు వీడియో పాఠాలను చూసి అవగాహన పెంచుకోవాల్సి ఉంటుంది. వీడియో పాఠాలకు హాజరైన వారిని మాత్రమే డ్రైవింగ్ లైసెన్సుల కోసం నిర్వహించే ట్రాక్ టెస్టులకు అనుమతిస్తారు. ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా కూకట్పల్లి ప్రాంతీయ రవాణా కార్యాలయంలో ప్రారంభించారు. ఈ ఫలితాలను అనుసరించి నగరంలోని అన్ని ప్రాంతీయ రవాణా కార్యాలయాలకు ఈ విధానాన్ని విస్తరించనున్నారు.
ముఖ కవళికల నమోదు ఉంటేనే..
సాధారణంగా లెరి్నంగ్ లైసెన్స్ తీసుకున్న తర్వాత 30 రోజుల నుంచి 6 నెలల్లోపు డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తారు. ఇందుకోసం నాగోల్, కొండాపూర్, ఉప్పల్, మేడ్చల్, ఇబ్రహీంపట్నం, తదితర డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్లలో నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణులైతేనే లైసెన్స్ లభిస్తుంది. ఇక నుంచి ఈ రెండు పరీక్షలతో పాటు 3 గంటల వీడియో పాఠాలను చూసి రోడ్డు భద్రతా నియమాలను తెలుసుకొని డ్రైవింగ్ టెస్ట్కు వెళ్లాల్సి ఉంటుంది. రవాణాశాఖ ఆధ్వర్యంలోని టీజీ ఆన్లైన్లో ఈ పాఠాలకు సంబంధించిన మాడ్యూల్స్ ఉంటాయి. ఆన్లైన్లో ఈ పాఠాలను వీక్షించే సమయంలో అభ్యర్థుల ముఖకవళికల నమోదు (ఫేస్ రికగ్నిషన్) తప్పనిసరి. అలాగే స్కూల్ జోన్లలో వాహనాలను నడిపేటప్పుడు తప్పనిసరిగా హారన్ మోగించాలి. ఆసుపత్రులు ఉన్న చోట హారన్ మోగించొద్దు. డిఫెన్సివ్ డ్రైవింగ్ తెలిసి ఉండాలి.
రోజుకు 2,500 డ్రైవింగ్ టెస్టులు...
ప్రస్తుతం నగరంలోని అన్ని టెస్ట్ ట్రాక్లలో నిత్యం 2,500 మందికిపైగా అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. కాగా.. కొన్ని చోట్ల ఎలాంటి పరీక్షలు లేకుండానే డ్రైవింగ్ లైసెన్సులను జారీ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో రవాణాశాఖ తాజాగా ప్రవేశపెట్టిన రోడ్డు భద్రతా పాఠాలు సత్ఫలితాలిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.
Tags : 1