నాడు సాక్షి వేదికపై అవార్డు.. నేడు అంతరిక్షంలో రికార్డు
Breaking News
ప్లాస్టిక్ నోట్లు వచ్చేస్తున్నాయ్.. ఆర్బీఐ తొలి అడుగు!
Published on Sat, 07/18/2026 - 13:01
దేశంలో త్వరలోనే ప్లాస్టిక్ (పాలిమర్) కరెన్సీ నోట్లు చలామణిలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రూ.10, రూ.20 విలువల పాలిమర్ నోట్లను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) కీలక చర్యలు ప్రారంభించింది. అయితే పైలట్ ప్రాజెక్టు తేదీలు లేదా నోట్ల డినామినేషన్లపై ఆర్బీఐ ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు. ప్రస్తుతం గ్లోబల్ టెండర్ ప్రక్రియ ప్రారంభించడం ద్వారా సన్నాహాలు వేగవంతం చేసింది.
ఆర్బీఐకి చెందిన కరెన్సీ ముద్రణ సంస్థ భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ్ ప్రైవేట్ లిమిటెడ్ (BRBNMPL) ప్రపంచవ్యాప్తంగా తయారీ సంస్థల నుంచి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్ (EOI) కోరింది. ఇందులో బయాక్సియల్ ఓరియెంటెడ్ పాలీప్రొపైలిన్ (BOPP) ఆధారిత పాలిమర్ సబ్స్ట్రేట్ను సరఫరా చేయాలని పేర్కొంది. మొత్తం 68,000 రీముల పాలిమర్ షీట్లు అవసరమని, వాటిలో రెండు డినామినేషన్లకు చెరో 34,000 రీములు కేటాయించినట్లు టెండర్లో వెల్లడించింది.
ఈ పాలిమర్ షీట్లలో పారదర్శక విండో, మెటాలిక్ న్యూమరల్, మాగ్నెటిక్ సూడో థ్రెడ్, షాడో ఇమేజ్, ఇరిడిసెంట్ ప్యాటర్న్ వంటి అధునాతన భద్రతా లక్షణాలు ఉండాలని ఆర్బీఐ నిర్దేశించింది. ఇవి నకిలీ నోట్ల తయారీని మరింత కష్టతరం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని అధికారులు భావిస్తున్నారు.
టెండర్ నిబంధనల ప్రకారం, దరఖాస్తు చేసుకునే సంస్థలకు సెంట్రల్ బ్యాంకులు లేదా బ్యాంక్నోట్ ప్రింటింగ్ సంస్థలకు కనీసం మూడేళ్ల పాటు పాలిమర్ సబ్స్ట్రేట్ సరఫరా చేసిన అనుభవం ఉండాలి. అంతేకాదు, చైనా లేదా పాకిస్తాన్కు సంబంధించిన కార్యకలాపాలు భారత ప్రాజెక్టుతో సంబంధం లేకుండా పూర్తిగా వేరుగా ఉండాలని, అక్కడి నుంచి ముడి పదార్థాలను సేకరించకూడదని కూడా కఠిన నిబంధనలు విధించింది. బిడ్ల సమర్పణకు చివరి తేదీ ఆగస్టు 18గా నిర్ణయించింది.
ఆర్బీఐ గవర్నర్ ఏమన్నారు?
జూన్లో జరిగిన ద్రవ్య విధాన సమీక్ష అనంతరం ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా మాట్లాడుతూ, పాలిమర్ నోట్ల ప్రతిపాదన పరిశీలన దశలోనే ఉందని, వాటి ప్రయోజనాలు, వ్యయభారం, అమలు సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. అందువల్ల 2027లో పూర్తి స్థాయి అమలు జరిగే అవకాశం ఉందని కొన్ని మీడియా కథనాలు పేర్కొన్నప్పటికీ, దీనిపై ఆర్బీఐ నుంచి అధికారిక ధ్రువీకరణ ఇంకా వెలువడలేదు.
పాలిమర్ నోట్ల ప్రత్యేకత ఏమిటంటే..
1988లో ఆస్ట్రేలియా తొలిసారిగా పాలిమర్ బ్యాంకు నోట్లను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం 50కిపైగా దేశాలు వీటిని ఉపయోగిస్తున్నాయి. సాధారణ కాగితపు నోట్లతో పోలిస్తే పాలిమర్ నోట్లు ఎక్కువకాలం మన్నుతాయి. నీరు, తేమ, మురికి ప్రభావం తక్కువగా ఉండటంతో పాటు నకిలీ చేయడం కూడా కష్టమవుతుంది. దీర్ఘకాలంలో ముద్రణ వ్యయం తగ్గడం, పాడైన నోట్ల స్థానంలో కొత్త నోట్లు ముద్రించే అవసరం తగ్గడం వంటి ప్రయోజనాలు కూడా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
Tags : 1