Perni Nani: తొక్కి పెట్టి నార తీస్తావా? ఆటలో అరటిపండు గాడివి..!
Breaking News
అడవి ఆమెను సీఈఓ చేసింది...
Published on Tue, 06/23/2026 - 06:26
20 ఏళ్లకే అమెరికా మీడియా సంస్థ ‘అన్ టేమ్డ్ ప్లానెట్’ సీఈఓ అయ్యింది మలైకా వాజ్. గోవా తీరంలో అలలతో ఆడుకున్న అమ్మాయి నేడు అడవుల గుండె చప్పుడును ప్రపంచానికి వినిపిస్తోంది. ‘వైల్డ్లైఫ్ ఫిల్మ్మేకింగ్తో అడవిని రక్షించవచ్చు’ అని చదువు మానేసి అడవినే యూనివర్సిటీ చేసుకుంది. 21 ఏళ్లకే నేషనల్ జియోగ్రాఫిక్ ఎక్స్ప్లోరర్గా ఎంపికైంది. ‘అవకాశాలు ఎదురుచూడవు, దూకెయ్యాలి’ అంటున్న మలైకా వాజ్ పరిచయం ఇది.
‘టీవీ అడవికీ, నిజమైన అడవికీ తేడా ఉంది. నేను టీవీలో జనం లేని అడవిని చూశాను. కానీ నిజమైన అడవిలో ఎక్కడ చూసినా మనిషి పాదముద్రలే. జనం ప్రమేయం ఇంతగా ఉంటే అడవి, అటవీ జంతువులు ఏం కావాలి?’ అంటుంది మలైకా. అడవిని నిజరూపంలో చూపిస్తేనే మనిషి దాని పట్ల వివేకంతో వ్యవహరిస్తాడని ఆమె నమ్మకం.
పచ్చటి బాల్యం...
గోవాలోని సలిగావ్లో 1997లో పుట్టిన మలైక ఇంటి పక్కనే సముద్రం... పచ్చటి చెట్ల మధ్య ఉన్న స్కూలుతో పచ్చటి బాల్యాన్ని చూసింది . ఇతర పిల్లలు బొమ్మలతో ఆడుకుంటుంటే మలైక పాముల కోసం చెట్లు ఎక్కేది. గాయపడిన జంతువులను రక్షించేది. స్కూబా డైవింగ్, విండ్సర్ఫింగ్, సెయిలింగ్ నేర్చుకుంటూ సముద్రాన్నే ప్లేగ్రౌండ్ చేసుకుంది. తండ్రి మాక్ వాజ్, తల్లి మరుషా వాజ్లది గోవాలో ప్రముఖ వ్యాపార కుటుంబం. వారు కూతురిని వ్యాపారంలోకి కాని, అకడెమిక్స్ వైపుగాని ఒత్తిడి చేయలేదు. నచ్చింది చేయనిచ్చారు. ఆ స్వేచ్ఛే మలైకాకు రెక్కలు తొడిగింది.
జీవితంలో మలుపు...
మలైకా ఈ దారిలోకి రావడానికి కారణం వైల్డ్లైఫ్ ఫిల్మ్మేకర్ మైక్ పాండేను కలవడం. అప్పటికి ఆమె వయసు 14. ఆయన డాక్యుమెంటరీలు ప్రభుత్వాల పర్యావరణ నిర్ణయాలను ప్రభావితం చేశాయని తెలుసుకుంది. ‘అంటే మన కథలతో మార్పు సాధ్యం’ అని గ్రహించింది. ‘పర్యావరణం గురించి ఆలోచించడానికి నా వయసు చిన్నదేం కాదు’ అనుకుని హైస్కూల్ తర్వాత కాలేజీకి వెళ్లలేదు. డైరెక్ట్గా ప్రొడక్షన్ హౌస్లలో చేరింది. షార్ట్ ఫిల్మ్స్ తీసింది. 18 ఏళ్లకే ఆర్కిటిక్, అంటార్కిటికా రెండు చోట్లకు వెళ్లిన అతి పిన్న భారతీయురాలిగా లిమ్కా బుక్ రికార్డ్ కొట్టింది. 21 ఏళ్లకే నేషనల్ జియోగ్రాఫిక్ ఎక్స్ప్లోరర్గా ఎంపికైంది. ‘లివింగ్ విత్ ప్రిడేటర్స్’ అనే సిరీస్ను ప్రొడ్యూస్ చేసి, హోస్ట్ చేసింది. భారత్లో చిరుత, పులి, ఎలుగుబంట్లతో మనుషులు ఎలా కలిసి బతుకుతున్నారో చూపించింది. డిస్కవరీ, యానిమల్ ప్లానెట్లో ‘ఆన్ ది బ్రింక్’ ఎనిమిది భాగాల సిరీస్ చేసింది.
మంటా రేస్ రక్షకురాలు...
సముద్రంలో ఏడు మీటర్ల రెక్కలతో తిరిగే ‘మంటా రేస్’ చేపల అక్రమ రవాణాపై సాహసోపేతమైన ఇన్వెస్టిగేటివ్ డాక్యుమెంటరీ చేస్తోంది మలైకా. మంటా రేస్ మొప్పలకు ఔషధ గుణాలున్నాయనే మూఢనమ్మకంతో వాటిని క్రూరంగా వేటాడుతున్నారు. ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ నుంచి చైనా మార్కెట్కు అవి ఎలా స్మగుల్ అవుతున్నాయో అండర్కవర్గా షూట్ చేసింది. కెమెరాను ఆయుధంగా మార్చి మాఫియాను ఎక్స్పోజ్ చేస్తోంది. రువాండా వాల్కానోస్ నేషనల్ పార్క్లో మౌంటెన్ గొరిల్లాలపై విలువైన డాక్యుమెంటరీ చేసింది. ‘వాటి ఫ్యామిలీ డైనమిక్స్ చూస్తే అద్దంలో మనల్ని చూసుకున్నట్టే ఉంటుంది’ అంటుంది.
20 ఏళ్లకే సీఈఓ...
‘అన్ టేమ్డ్ ప్లానెట్’ మీడియా సంస్థను 2017లో స్టార్ట్ చేసి సీఈఓ అయ్యింది మలైక. న్యూయార్క్, బెంగళూరులో ఆఫీసులు నడుపుతూ బీబీసీ, నేషనల్ జియోగ్రాఫిక్, అల్ జజీరా, డిస్కవరీకి కంటెంట్ ఇస్తోంది. ఆమె ‘నగర ఆఫీసు’ల్లో ఉండేకన్నా ‘అడవి ఆఫీసు’లో ఉండటమే ఎక్కువ. ‘అమ్మాయిలను బయటకు పంపొద్దు’ అనేవాళ్లకు మలైకా సమాధానం– ‘వారి చేతికి కెమెరా ఇవ్వండి, ప్రపంచాన్ని మారుస్తారు’. ‘నీకు భయం వేయదా? అడవిలో అంత రిస్క్ ఎందుకు అని అందరూ అడుగుతారు. భయం వేస్తుంది. కానీ ఏమీ చేయకుండా కూర్చుంటే అంతకన్నా బోర్ కొడుతుంది’ అని నవ్వుతుంది మలైకా.
‘నా కంఫర్ట్ జోన్ అడవే. నా ఆఫీస్ జీప్, బోట్, కెమెరా... ఇవి ఉంటే చాలు’ అంటోందామె.
Tags : 1