SBI క్రెడిట్ కార్డులు వాడేవారికి షాక్.. జులై 1 నుంచి కొత్త రూల్స్
Breaking News
సక్సెస్ నేర్పారు.. ఓకే! ‘సంతోషం’పై శిక్షణ ఏది?
Published on Sat, 06/06/2026 - 06:00
ఐఐటీ ఢిల్లీ నుంచి ఐఐఎం బెంగళూరు దాకా, అక్కడి నుంచి ఐఏఎస్ దాకా సాగిన ప్రయాణంలో దివ్య మిట్టల్ ఎన్నో నేర్చారు. ఆ తర్ఫీదులో ఇన్ని నేర్పినా, వృత్తి సవాళ్లను ఎదుర్కొనడం నేర్పించినా ‘మనసును ప్రశాంతంగా ఎలా ఉంచుకోవాలో, ఒంటరితనాన్ని ఎలా తట్టుకోవాలో, ఆనందంగా ఎలా ఉండాలో నేర్పించలేదు’ అంటున్నారామె. ఆమె ‘ఎక్స్’ వేదికగా చేసిన వ్యాఖ్యలు ఎంతో ఆసక్తికరమైన చర్చను లేవదీశాయి.
‘ఐఐటీ ఢిల్లీ, ఐఐఎం బెంగళూరు నుంచి ఐఏఎస్ వరకు దేశంలో అత్యుత్తమ విద్యను అభ్యసించే అవకాశం నాకు దక్కింది. కఠినమైన పరీక్షలను ఎలా ఎదుర్కోవాలో, పెద్ద బాధ్యతలను ఎలా భుజాలపై మోయాలో ఆ విద్య నేర్పింది. కానీ అది నా మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం ఎలాగో, ఆనందంగా ఎలా ఉండాలో, ఒంటరితనాన్ని తట్టుకోవడం ఎలాగో మాత్రం ఎప్పుడూ నేర్పలేదు’ అన్నారు దివ్య మిట్టల్.
ఉత్తరప్రదేశ్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ స్పెషల్ సెక్రటరీ దివ్య మిట్టల్ ‘ఎక్స్’ వేదికగా చేసిన ఈ వ్యాఖ్యలు మన విద్యావ్యవస్థలోని లోటుపై లక్షల మందిని ఆలోచింపజేస్తున్నాయి. ‘మన దేశ విద్యావ్యవస్థ ఏం నేర్పుతోంది? దేనికి దూరమవుతోంది?’ అనే అంశంపై విస్తృత చర్చకు అవి దారి తీశాయి. సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
‘మనం విజయం ఎలా సాధించాలో నేర్చుకోవడానికి ఏళ్లకు ఏళ్లు వెచ్చిస్తాం. కానీ సంతోషంగా ఉండటం ఎలాగో నేర్చుకోవడానికి ఒక్క రోజూ కేటాయించం’ అని ఆమె వ్యాఖ్యానించారు.
దివ్య మిట్టల్ కామెంట్స్కు వందలాది స్పందనలు వచ్చాయి. మన దేశంలోని స్కూళ్లు, కాలేజీలు మార్కులు, ర్యాంకులు, ప్రవేశ పరీక్షలపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నాయని, ఆర్థిక అక్షరాస్యత, భావోద్వేగ ఆరోగ్యం, జీవన నైపుణ్యాలను గాలికి వదిలేస్తున్నాయని నెటిజన్లలో చాలామంది అభి్రపాయపడ్డారు.
ఇలా అయితే ఎలా!
భావోద్వేగ నియంత్రణ గురించి తన పోస్ట్లో దివ్య ప్రస్తావించారు. ‘విద్యార్థులు విద్యాసంబంధమైన భావనలు నేర్చుకుంటున్నారు. కానీ దుఃఖం, ఒత్తిడి, వైఫల్యాన్ని ఎదుర్కోవడం గురించి అరుదుగా నేర్చుకుంటున్నారు. మనం పీరియాడిక్ టేబుల్ను కంఠస్థం చేశాం. కానీ విరిగిన హృదయం వెనుక ఉన్న రసాయన శాస్త్రాన్ని ఎవరూ వివరించలేదు’ అని పేర్కొన్నారు. భావోద్వేగాలను అర్థం చేసుకోవడానికి బదులు వాటిని అణచివేయమని విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారని, ఇది భవిష్యత్తులో ఒత్తిడిని ఎదుర్కొనే విధానంపై ప్రభావం చూపుతుందని దివ్య మిట్టల్ అన్నారు. ఒత్తిడిని ఎదుర్కోవడంలో చాలామంది విఫలమవుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
అవి ఎందుకు నేర్పడం లేదు?
తన వైరల్ పోస్ట్లో కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి కూడా దివ్య ప్రస్తావించారు. ‘వ్యాసాలు రాయడం, మార్కులు సంపాదించడం నేర్పిస్తాం. కానీ అసౌకర్యంగా అనిపించినప్పుడు దాన్ని ఎలా వ్యక్తపరచాలి, హద్దులు ఎలా ఏర్పరచుకోవాలి, కష్టంగా ఉన్నప్పుడు ‘కాదు’ అని ఎలా చెప్పాలో నేర్పడం లేదు’ అని ఆమె అన్నారు. విమర్శనాత్మక ఆలోచన, ఆర్థిక అక్షరాస్యత ప్రాధాన్యం గురించి కూడా ఆమె నొక్కి చెప్పారు.
‘పాఠశాలలో ఎక్కువ జవాబులు చెప్పేవాడు గెలుస్తాడు. జీవితంలో ఎక్కువ ప్రశ్నలు వేసేవాడు కాలానికి నిలబడతాడు’ అంటున్న దివ్య మిట్టల్ ఆర్థిక అక్షరాస్యతను ప్రముఖంగా ప్రస్తావించారు.
‘గణితం నేర్చుకోవడానికి వెచ్చించిన సమయం, అనుభవం ఆర్థిక ఒత్తిడిని తట్టుకోవడానికి ఉపయోగపడటం లేదు. అప్పులు, ఖర్చు అలవాట్లపై ఆ పాఠాలు ప్రభావం చూపడం లేదు’ అని ఆమె అభి్రపాయపడ్డారు. ‘మన విద్య డబ్బు సంపాదించడంపైనే దృష్టి పెడుతుంది, దాన్ని నిర్వహించడంపై కాదు’ అని ఆమె సూటిగా చెప్పారు.
క్షేత్రస్థాయిలో...
‘ఒకరకంగా చెప్పాలంటే ప్రతిభను కూడా అదృష్టంగా పిలవొచ్చు. అయితే మన చేతుల్లో ఉన్నదానిపైనే మనం దృష్టి పెట్టాలి. అదే– కఠోర శ్రమ’ అన్నారు దివ్య మిట్టల్.
ఈ చర్చ మన దేశంలోని ‘ఎగ్జామ్ కల్చర్’ను కూడా టచ్ చేసింది. దానిలోని మంచి, చెడులను విశ్లేషించింది. దివ్య మిట్టల్ తన పోస్ట్లో ఎన్నో ప్రశ్నలు సంధించారు. వాటికి జవాబులు కొందరు మాత్రమే చెప్పేవి కావు. సోషల్ మీడియాకే పరిమితమైనవీ కావు. క్షేత్రస్థాయిలో చర్చ జరగాల్సినవి. నిర్మాణాత్మక పరిష్కారాలు కనుగొని ప్రవేశ పెట్టాల్సినవి.
Tags : 1