థ్యాంక్స్ జైపాల్.. మీకు నా సెల్యూట్.. పేర్ని నాని సెటైర్లు
Breaking News
పెట్రోలే కాదు.. తాగే నీటిపైనా యుద్ధం ఎఫెక్ట్!
Published on Fri, 04/03/2026 - 21:07
రష్యా-ఉక్రెయిన్ తర్వాత ఇప్పుడు ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి. పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు కేవలం ఇంధన ధరలనే కాదు, సామాన్యుడు తాగే నీటిని కూడా ఖరీదైనవిగా మారుస్తున్నాయి. హోర్ముజ్ జలసంధి గుండా రవాణాకు అంతరాయం కలగడంతో ముడి చమురు ధరలు బ్యారెల్కు 119 డాలర్లకు చేరడం భారత్లో బాటిల్ వాటర్ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమైంది.
ప్యాకేజింగ్ భారం
నీటి ధర పెరగడానికి కారణం నీరు కాదు, ఆ నీటిని నింపే ప్లాస్టిక్ బాటిల్. ప్లాస్టిక్ తయారీకి వాడే PET (పాలిథిలిన్ టెరెఫ్తాలేట్) రెసిన్ గుళికలు ముడి చమురు నుండి తయారవుతాయి. చమురు ధరలు పెరగడంతో, ఈ ముడిపదార్థాల ధరలు గత పక్షం రోజుల్లోనే భారీగా పెరిగాయి.
ధరల పెంపు
మార్కెట్ లీడర్ బిస్లేరి ఇప్పటికే వాటర్ బాటిళ్ల ధరలను 11 శాతం పెంచింది. 12 లీటర్ బాటిళ్ల బాక్స్ ధర ఏకంగా రూ. 24 పెరిగింది. ప్యాకేజింగ్ ఖర్చులు 70 శాతం పెరగడంతో లీటర్ బాటిల్ ధర రూ. 20కి చేరుకుందని బిస్లేరి సీఈఓ ఏంజెలో జార్జ్ తెలిపారు. PET ప్రిఫార్మ్స్ ధర కిలోకు రూ. 115 నుండి రూ. 180కి పెరగడమే కాకుండా, సరఫరాలో తీవ్ర కొరత ఏర్పడిందని మహారాష్ట్ర బాటిల్డ్ వాటర్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ తెలిపింది.
పరిశ్రమలపై 'చైన్ రియాక్షన్'
కెమ్కో ప్లాస్టిక్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ వైభవ్ సరోగి అభిప్రాయం ప్రకారం, ఈ ప్యాకేజింగ్ సెగ కేవలం తాగునీటికే పరిమితం కాదు. PET ప్యాకేజింగ్ను ఎక్కువగా ఉపయోగించే సాఫ్ట్ డ్రింక్స్, ఫుడ్ డెలివరీ, ఫార్మాస్యూటికల్స్, కాస్మెటిక్స్ రంగాలు కూడా ప్రభావితం కానున్నాయి.
సామాన్యుడిపై నీటి భారం
భారతదేశంలో స్వచ్ఛమైన నీటి లభ్యత ఇప్పటికే సవాలుగా మారింది. దేశంలో దాదాపు 70 శాతం భూగర్భ జలాలు కలుషితమయ్యాయని నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో పట్టణాల్లో 15 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 6 శాతం గృహాలు తమ ప్రాథమిక దాహం తీర్చుకోవడానికి బాటిల్ వాటర్ పైనే ఆధారపడుతున్నాయి.
కర్మాగారాల మూసివేత
పెరిగిన ఖర్చులను భరించలేక మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో దాదాపు 20 శాతం తయారీ ప్లాంట్లు తాత్కాలికంగా ఉత్పత్తిని నిలిపివేశాయి. యుద్ధం ఇలాగే కొనసాగితే, రానున్న రోజుల్లో బాటిల్ వాటర్ ధరలు మరింత భారమయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Tags : 1