ట్రంప్ ప్రకటనకు ముందు భారీ డీల్ 580 బిలియన్ డాలర్ల ట్రేడింగ్
Breaking News
‘ఎండోసల్ఫాన్’పై విజయం ఒక మలుపు
Published on Tue, 03/24/2026 - 06:07
ఉషా సూలపాణి (63).. తిరువనంతపురం కేంద్రంగా పనిచేస్తున్న సేంద్రియ వ్యవసాయోద్యమ ప్రచారకర్త. దేశీ వరి వంగడాల వైవిధ్యం, పురాతన ఆహార సంస్కృతుల పరిరక్షణ, పునరుద్ధరణ లక్ష్యంతో ఆమె ‘సేవ్ అవర్ రైస్ క్యాంపెయిన్’ను రెండు దశాబ్దాలకు పైగా ముందుండి నడిపిస్తున్నారు. వాతావరణ మార్పులను దీటుగా తట్టుకునే వ్యవసాయ పద్ధతులు, సేంద్రియ వ్యవసాయంలో శక్తి వినియోగ సామర్థ్యంపై ప్రస్తుతం పని చేస్తున్నారు. ఆమె థనాల్ ట్రస్టు వ్యవస్థాపకురాలు.
థనాల్ సేంద్రియ ఉత్పత్తిదారుల కంపెనీ డైరెక్టర్గా కూడా పనిచేస్తున్నారు. ఎమ్మెస్సీ హార్టీకల్చర్ చదివి 1986లో వ్యవసాయ శాఖ అధికారిగా ఉద్యోగంలో చేరారు. నాలుగేళ్ల తర్వాత ఉద్యోగాన్ని వదిలి సేంద్రియ వ్యవసాయ ఉద్యమ ప్రచార కార్యకర్తగా జీవితాన్ని ప్రారంభించారు. ఎండోసల్ఫాన్ వంటి రసాయనిక పురుగుమందులకు వ్యతిరేకంగా ఉద్యమించి విజయం సాధించటం తన జీవితంలో గొప్ప మలుపు వంటిదని ఆమె అంటారు. ఇటీవల మైసూరులో కిసాన్ స్వరాజ్ సమ్మేళనంలో అతిథిగా పాల్గొన్న ఆమెతో ‘సాక్షి సాగుబడి’ ఇంటర్వ్యూ ముఖ్యాంశాలు..
→ వ్యవసాయాధికారి ఉద్యోగాన్ని వదిలి సేంద్రియ వ్యవసాయం, పర్యావరణ ఉద్యమంలోకి మీరు ప్రవేశించారు. ఈ 35 ఏళ్లలో మీ జీవన అనుభవాలను వివరిస్తారా?
భోపాల్ గ్యాస్లీక్ ఉదంతం, సైలెంట్ స్ప్రింగ్ (రాచెల్ కార్సెన్ రచన) పుస్తకం ప్రేరణతో వ్యవసాయ అధికారి ఉద్యోగానికి స్వస్తి చెప్పి పర్యావరణ ఉద్యమంలోకి వచ్చాను. ఎటుచూసినా పచ్చని చెట్లు, నీటితో ఆవరించి ఉండే కేరళ దశాబ్దాల నిర్లక్ష్యం కారణంగా పర్యావరణ వినాశనం జరుగుతోంది. సమాజం నానాటికీ ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నప్పటికీ పర్యావరణ సంక్షోభంలోకి కూరుకుపోతోంది. అందుకే, పర్యావరణాన్ని, స్థానిక పాత పంటలను, పురాతన వ్యవసాయ సంస్కృతిని పరిరక్షించుకోవాలనే చైతన్యాన్ని ప్రజల్లో రగిలించే ఆశయంతో పనిచేస్తున్నాం. 1986లో థనల్ ట్రస్టును ఏర్పాటుచేశాం. ఎన్నో అంశాలపై ప్రచారోద్యమా లను విజయవంతంగా నిర్వహించగలిగాం. ఈ ఉద్వేగభరిత ప్రయాణంలో మాతో చాలా మంది జత కలిశారు.
→ సేంద్రియ ఆహార మార్కెట్ల అభివృద్ధిలో మీ అనుభవాలు చెప్పండి..
2002లో తిరువనంతపురం జిల్లాలో రెండు పంచాయితీల్లో పనిచేయటం ప్రారంభించాం. మహిళా స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చెయ్యటం, సేంద్రియ సేద్యం, ఇంటి పంటల సాగుపై శిక్షణ ఇవ్వటంతో కొబ్బరి, కూరగాయలు, అరటి పండ్లు.. వంటి సేంద్రియ సాగు పెరిగింది. అయితే, ఎవరికి అమ్మాలి? ఎక్కడ అమ్మాలి? అనే సవాళ్లు వచ్చాయి. అప్పుడు సేంద్రియ రైతుల మార్కెట్లను తిరువనంతపురంలో ఏర్పాటు చేయించాం. రైతుల భాగస్వామ్యంతో 2009లో థనాల్ ఆర్గానిక్ బజార్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీని ఏర్పాటు చేశాం. నెలకోసారి సేంద్రియ సంతతో మార్కెట్ను ప్రారంభించాం. ప్రజాదరణతో రెండేళ్లలోనే వారాంతపు మార్కెట్లు నిర్వహించాల్సి వచ్చింది. 2011 నాటికి అనుదిన సేంద్రియ మార్కెట్ నిర్వహణ ప్రారంభమైంది.
→ ‘సేవ్ అవర్ రైస్ క్యాంపెయిన్’ ఎప్పుడు మొదలైంది..?
మన పురాతన ఆహార, వ్యవసాయ సుసంపన్న సంస్కృతిలో భాగమైన దేశీ వరి వంగడాలు కనుమరుగైపోతున్న స్థితిలో 2004లో ‘సేవ్ అవర్ రైస్ క్యాంపెయిన్’ ప్రారంభించాం. అది ఐరాస అంతర్జాతీయ రెండవ వరి సంవత్సరం. కొచ్చిన్లో జాతీయ స్థాయి సమావేశం పెట్టాం. పది రాష్ట్రాల నుంచి చాలా మంది వచ్చి పాల్గొనటంతో కొత్త ఉత్సాహంతో ముందుకెళ్లాం. దేశీ వరి రకాలను సేకరించి, పండించటమే కాదు నుంచి మార్కెటింగ్ వరకు వాల్యూ చెయిన్ నిర్మించాం. వినియోగదారుల్లో అవగాహన పెంచటం కోసం ప్రత్యేక కృషి చేశాం. సీడ్ ఫెస్టివల్స్, ఫుడ్ ఫెస్టివల్స్ ఇందుకు బాగా ఉపయోగపడ్డాయి.
→ ఇప్పటికి ఎన్ని రకాలను పరిరక్షించారు?
ఈ 22 ఏళ్లలో 1,400 రకాల దేశీ వరి రకాలను పరిరక్షించి రైతులు, విత్తనోత్పత్తి సంఘాల ద్వారా సాగులోకి తెచ్చాం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దేశీ రకాలను ప్రాధాన్యాన్ని గుర్తించాయి. రైతు ఉత్పత్తిదారుల సంఘాలు దేశీ రకాలను ప్రత్యేకంగా ఆర్గానిక్గా సాగు చేస్తున్నాయి. దేశీ రకాలను 95% సేంద్రియంగానే సాగు చేస్తున్నారు. అనేక యూనివర్సిటీలు కూడా దేశీ రకాలపై ఆసక్తి చూపుతున్నాయి. ఈ ఉత్పత్తులకు ఎగుమతి అవకాశాలు కూడా వచ్చాయి.
→ ఏయే రాష్ట్రాల్లో ఆదరణ బాగుంది?
కేరళ, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమబెంగాల్, ఒడిషా, మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో వరి తదితర దేశీ విత్తనాలకు ఎక్కువ ఆదరణ ఉంది. పశ్చిమబెంగాల్లో దేశీ వరి ఆధారిత సమీకృత వ్యవసాయ పద్ధతి అమల్లోకి వచ్చింది. వరి, కూరగాయలు, చేపలు, కోళ్లతో కూడి ఉంటుందీ పద్ధతి.
→ అంతర్జాతీయ మహిళా రైతు సంవత్సరం 2026 కదా..
అవును. వ్యవసాయం అంటేనే మహిళ కేంద్రంగా జరిగే పని. విత్తనం దగ్గరి నుంచి నూర్పిడి వరకు వ్యవసాయ పనుల్లో 70% మహిళల శ్రమ చాలా కీలకంగా ఉంది. మహిళా రైతుల హక్కుల అమలును ప్రోత్సహించడానికి అంతర్జాతీయ మహిళా రైతు దినోత్సవం ఉపయోగపడుతుంది.
→ రైతులు వాతావరణ మార్పుల్ని తట్టుకోవాలంటే..?
ప్రతికూల వాతావరణ పరిస్థితుల్ని, చీడపీడల్ని తట్టుకోవాలంటే పర్యావరణ హితమైన పద్ధతుల్లో బహుళ పంటలను సాగు చెయ్యాలని మా అనుభవాలు చెబుతున్నాయి. సేంద్రియ/ప్రకృతి వ్యవసాయంలో పంటలు పండించే రైతులు నేరుగా వినియోగదారులకు అమ్ముకునే విధంగా మార్కెట్ సదుపాయాల కల్పనపై ప్రభుతం దృష్టి పెట్టాలి. కానీ, ప్రభుత్వ శాఖలు దేనికదే అన్నట్లు ఒంటెద్దు పోకడలా పనిచేస్తున్నాయి. అన్నీ కలిసి పనిచేస్తేనే రైతులకు ప్రయోజనం కలుగుతుంది. సేంద్రియ/ప్రకృతి సేద్య నమూనాలను క్షేత్రస్థాయిలో ఏర్పాటు చేస్తే ఎక్కువ మంది రైతులు ఈ పద్ధతిలోకి మారటానికి అవకాశం ఉంటుంది. సౌరశక్తిని వాడుకోవాలి. తద్వారా రసాయనిక వ్యవసాయ హరితగృహ వాయువులను 30% తగ్గించుకోవచ్చు.
→ వ్యవసాయం వైపు యువతను ఆకర్షించటం ఎలా?
ఇటీవల కాలంలో సేంద్రియ/ప్రకృతి సేద్యం వైపు యువతీ యువకులు బాగానే ఆకర్షితులవుతున్నారు. మహిళలు కూడా సేద్యంలోకే కాదు మార్కెటింగ్ నైపుణ్యాలతో అగ్రిప్రెన్యూర్స్గానూ రాణిస్తున్నారు. కిసాన్ స్వరాజ్ సమ్మేళనంలోనూ కొందరు పాల్గొన్నారు.
ఎండోసల్ఫాన్ నిషేధానికి దారితీసిన ఉద్యమం గురించి చెప్పండి..
1997–98 నుంచి రసాయనిక పురుగుమందులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమాలు నిర్వహించటం ప్రారంభించాం. ఎండోసల్ఫాన్ పురుగుమందును హెలికాప్టర్లతో జీడి తోటపై పిచికారీ చేయటం వల్ల ఆ ప్రాంత ప్రజల ఆరోగ్యం నాశనమైంది. అప్పట్లో గణాంకాలు పెద్దగా అందుబాటులో లేవు. వైద్యులు, హెల్త్ వర్కర్స్ తదితరులు కలసి రావటంతో క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి గణాంకాలు తయారు చేసి వెలుగులోకి తెచ్చాం. మీడియా తోడ్పాటుతో చైతన్యం తేగలిగాం. ఎన్నో అవాంతరాలు ఎదురైనా ఎట్టకేలకు ఎండోసల్ఫాన్ను నిషేధించటం మా ఉద్యమానికి గొప్ప మలుపుతిప్పింది. ఎంతో ఉత్సాహాన్నిచ్చింది. ఈ విజయం తర్వాతే సేంద్రియ వ్యవసాయంపై మరింత లోతుగా దృష్టి కేంద్రీకరించాం.
Tags : 1