కాపుతో పెట్టుకున్నారు.. వంగవీటి నరేంద్ర మాస్ వార్నింగ్
Breaking News
భారత్లో రోల్స్-రాయ్స్ విస్తరణ చర్యలు
Published on Sat, 02/14/2026 - 09:14
ప్రపంచ ప్రఖ్యాత ఆటోమొబైల్, ఇంజినీరింగ్ దిగ్గజం రోల్స్-రాయ్స్ భారత్లో తన కార్యకలాపాలను భారీ స్థాయిలో విస్తరించనున్నట్లు ప్రకటించింది. బ్రిటన్కు చెందిన ఈ సంస్థ భారత రక్షణ రంగ అవసరాల కోసం అత్యాధునిక సాంకేతికతను అందించడమే కాకుండా స్థానికంగా ఇంజిన్ల తయారీకి సిద్ధమవుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో రోల్స్-రాయ్స్ సీఈఓ తుఫాన్ ఎర్గిన్ బిల్గిక్ ఇటీవల సమావేశమైన నేపథ్యంలో ఈ కీలక ప్రకటన వెలువడటం విశేషం.
ప్రకటనలోని అంశాలు..
భారత తదుపరి తరం యుద్ధ విమానాల కోసం 120 కేఎన్ క్లాస్ కాంబాట్ జెట్ ఇంజన్ను అభివృద్ధి చేసేందుకు రోల్స్-రాయ్స్ ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టు ద్వారా భారతదేశానికి పూర్తి మేధో సంపత్తి హక్కులతో పాటు వంద శాతం సాంకేతిక బదిలీ జరుగుతుంది. ఇది స్వదేశీ రక్షణ పరిజ్ఞానంలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది. భారత ఆర్మీ, నేవీ, కోస్ట్ గార్డ్ కోసం అవసరమైన ఇంజన్లను భాగస్వామ్య సంస్థలతో కలిసి ఇక్కడే తయారు చేయడంపై కంపెనీ దృష్టి సారించింది.
వికసిత్ భారత్ దిశగా అడుగులు
ప్రధాని మోదీతో భేటీ సందర్భంగా భారత ప్రభుత్వం చేపట్టిన వికసిత్ భారత్, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాల్లో పాలుపంచుకోవాలని చూస్తున్నట్లు కంపెనీ సీఈఓ ఎర్గిన్ బిల్గిక్ వెల్లడించారు. ‘మా అత్యాధునిక సాంకేతికతతో భారత అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాం’ అని సీఈఓ అన్నారు.
ఉపాధి, ఆర్థిక వృద్ధి
ఈ విస్తరణ ప్రణాళికల వల్ల భారత్లో భారీగా పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. ప్రస్తుతం రోల్స్-రాయ్స్, దాని భాగస్వామ్య సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్యను సుమారు 10,000 కు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది ప్రస్తుత సంఖ్య కంటే రెట్టింపు. భారత్ నుంచి కంపెనీ చేసే ఔట్ సోర్సింగ్ సర్వీసులు రాబోయే కాలంలో 10 రెట్లు పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల దేశంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు భారీ లబ్ధి చేకూరుతుంది. రక్షణ రంగమే కాకుండా మౌలిక సదుపాయాలు, పరిశ్రమలకు అవసరమైన పవర్ సొల్యూషన్లను అందించడానికి కూడా సంస్థ సిద్ధమవుతోంది.
ఇదీ చదవండి: ప్రేమలో మునిగి తేలుతూ.. వ్యాపారం పెంచుతూ..
Tags : 1