కాసేపట్లో మరోసారి సీబీఐ ముందుకు విజయ్
Breaking News
ప్రముఖ బ్యాంకుల ఆర్థిక ఫలితాలు
Published on Mon, 01/19/2026 - 08:54
ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 12 శాతం ఎగసి రూ. 19,807 కోట్లను తాకింది. వడ్డీయేతర ఆదాయంలో వృద్ధి ఇందుకు సహకరించింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ. 17,657 కోట్లు ఆర్జించింది. స్టాండెలోన్ నికర లాభం సైతం 11 శాతం బలపడి రూ. 18,654 కోట్లకు చేరింది. నికర వడ్డీ ఆదాయం 6 శాతం వృద్ధితో రూ. 32,600 కోట్లను తాకింది. వడ్డీయేతర ఆదాయం 12 శాతం ఎగసి రూ. 13,250 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్లు 3.35 శాతంగా నమోదయ్యాయి.
కొత్త కార్మిక చట్టాల అమలు కారణంగా రూ. 800 కోట్ల వ్యయాలు నమోదైనట్లు బ్యాంక్ వెల్లడించింది. మొత్తం ప్రొవిజన్లు రూ. 3,154 కోట్ల నుంచి రూ. 2,838 కోట్లకు తగ్గాయి. స్థూల మొండిబకాయిలు 1.58 శాతం నుంచి 1.24 శాతానికి నీరసించగా.. గత 12 నెలల కాలంలో 500 బ్రాంచీలను కొత్తగా జత కలుపుకుంది. దీంతో వీటి సంఖ్య 9,616ను తాకింది. ఈ కాలంలో బ్యాంక్ మొత్తం సిబ్బంది సంఖ్య దాదాపు 5,000 తగ్గి 2.15 లక్షలకు పరిమితమైంది. కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్) 19.9 శాతంగా నమోదైంది.
ఐసీఐసీఐ బ్యాంక్.. డౌన్
ప్రయివేట్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) మూడో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 3 శాతం నీరసించి రూ. 12,538 కోట్లకు పరిమితమైంది. ప్రాధాన్యతా రంగ అడ్వాన్సులంటూ తప్పుగా నమోదుచేయడంతో ఆర్బీఐ ఆదేశాలకు అనుగుణంగా వ్యవసాయ రుణాలకు రూ. 1,283 కోట్ల ప్రొవిజన్ చేపట్టింది. దీంతో లాభాలు దెబ్బతిన్నట్లు బ్యాంక్ వెల్లడించింది. స్టాండెలోన్ నికర లాభం సైతం 4 శాతం బలహీనపడి రూ. 12,883 కోట్లకు చేరింది. కాగా.. ఎండీ, సీఈవో సందీప్ బక్షి పదవీ కాలాన్ని రెండేళ్లు పొడిగించేందుకు బోర్డు నిర్ణయించినట్లు బ్యాంక్ పేర్కొంది. నికర వడ్డీ ఆదాయం 8 శాతం వృద్ధితో రూ. 21,932 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్లు 4.3 శాతంగా నమోదయ్యాయి.
ట్రెజరీ కార్యకలాపాలు మినహాయించి, వడ్డీయేతర ఆదాయం 12 శాతం ఎగసి రూ. 7,525 కోట్లకు చేరింది. కొత్త కారి్మక చట్టాల అమలులో భాగంగా రూ. 145 కోట్ల వ్యయాలు నమోదు చేసినట్లు బ్యాంక్ వెల్లడించింది. మొత్తం ప్రొవిజన్లు రెట్టింపై రూ. 2,556 కోట్లకు చేరాయి. తాజా స్లిప్పేజీలు రూ. 5,356 కోట్లుకాగా.. స్థూల మొండిబకాయిలు 1.58 శాతం నుంచి 1.53 శాతానికి తగ్గాయి. కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్) 17.34 శాతంగా నమోదైంది. ఐసీఐసీఐ అనుబంధ సంస్థలలో ప్రుడెన్షియల్ లైఫ్ నికర లాభం రూ. 390 కోట్లకు, లంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ లాభం రూ. 659 కోట్లకు, ఏఎంసీ లాభం రూ. 917 కోట్లకు చేరాయి.
యస్ బ్యాంక్.. హైజంప్
ప్రయివేట్ రంగ సంస్థ యస్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 55 శాతం జంప్చేసి రూ. 952 కోట్లను తాకింది. మొత్తం ప్రొవిజన్లు రూ. 259 కోట్ల నుంచి భారీగా తగ్గి రూ. 22 కోట్లకు పరిమితంకావడం ఇందుకు దోహదపడింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో కేవలం రూ. 612 కోట్ల లాభం ఆర్జించింది.
కొత్త కార్మిక చట్టాల అమలుకు రూ. 155 కోట్లమేర ప్రొవిజన్లు చేపట్టింది. నికర వడ్డీ ఆదాయం 11 శాతం వృద్ధితో రూ. 2,466 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్లు 5.2 శాతంగా నమోదయ్యాయి. వడ్డీయేతర ఆదాయం 8 శాతం పుంజుకుని రూ. 1,633 కోట్లకు చేరింది. స్థూల స్లిప్పేజీలు రూ. 1,248 కోట్ల నుంచి రూ. 1,050 కోట్లకు క్షీణించగా.. స్థూల మొండిబకాయిలు 0.1 శాతం మెరుగుపడి 1.5 శాతాన్ని తాకాయి. కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్) 14.5 శాతంగా నమోదైంది.
ఇదీ చదవండి: తెలంగాణలో వీధికుక్కల సామూహిక హత్యలు
Tags : 1