జేమ్స్ కామెరాన్ చేతిలో SSMB29 ప్రమోషన్స్
Breaking News
వీసీలు, పీఈలకు గేమింగ్ షాక్
Published on Fri, 08/22/2025 - 13:49
న్యూఢిల్లీ: రియల్ మనీ గేమ్స్పై నిషేధం విధించడం గేమింగ్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసిన పలు వెంచర్ క్యాపిటల్ ఫండ్స్, ప్రైవేట్ ఈక్విటీ సంస్థలకు షాకింగ్ పరిణామంగా మారింది. దీనితో అవి భారీగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. టైగర్ గ్లోబల్, కలారి క్యాపిటల్, బేస్ పార్ట్నర్స్ మొదలైనవి ఈ జాబితాలో ఉన్నాయి.
డ్రీమ్11, నజారా టెక్నాలజీస్, జూపీ, మొబైల్ ప్రీమియర్ లీగ్, గేమ్స్ 24్ఠ7 లాంటి అయిదు బడా గేమింగ్ కంపెనీలు, వెంచర్ ఫండ్స్ నుంచి దాదాపు 2.4 బిలియన్ డాలర్ల స్థాయిలో పెట్టుబడులు సమీకరించాయి. దేశీయంగా అతి పెద్ద ఫ్యాంటసీ స్పోర్ట్స్ ప్లాట్ఫాంలలో ఒకటైన డ్రీమ్11లో టెన్సెంట్, కలారి క్యాపిటల్, అల్ఫా వేవ్ గ్లోబల్, థింక్ ఇన్వెస్ట్మెంట్స్ మొదలైనవి 2014 నుంచి దాదాపు 1.6 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాయి. పరిశ్రమ వర్గాల డేటా ప్రకారం కలారీ క్యాపిటల్ 100 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసింది.
ఆ తర్వాత కొన్ని వాటాలను విక్రయించి పాక్షికంగా తప్పుకుంది. మరోవైపు, మొబైల్ ప్రీమియర్ లీగ్ దాదాపు 396 మిలియన్ డాలర్లు సమీకరించింది. పీక్ ఫిఫ్టీన్ పార్ట్నర్స్ టైమ్స్ ఇంటర్నెట్, గూగుల్ వెంచర్స్లాంటివి ఇన్వెస్ట్ చేశాయి. అటు నజారా టెక్నాలజీస్ 14 విడతల్లో 128 మిలియన్ డాలర్లు పెట్టుబడులు దక్కించుకుంది. వెస్ట్బ్రిడ్జ్ క్యాపిటల్, సెకోయా క్యాపిటల్, సీడ్ఫండ్ సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. గేమ్స్ 24్ఠ7 సంస్థ ఆరు విడతల్లో టైగర్ గ్లోబల్ మేనేజ్మెంట్, రైన్, మలబార్ ఇన్వెస్ట్మెంట్స్ నుంచి 108 మిలియన్ డాలర్లు సమీకరించింది. జూపీలో వెస్ట్క్యాప్, జెడ్47, ఏజే క్యాపిటల్ పార్ట్నర్స్ తదితర ఇన్వెస్టర్లు 122 మిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టాయి.
పెయిడ్ గేమ్స్ నిలిపివేత..
కొత్త బిల్లుకు అనుగుణంగా తాము పెయిడ్ గేమ్స్ను నిలిపివేస్తున్నామని జూపీ తెలిపింది. అయితే, లూడో సుప్రీమ్, లూడో టర్బో, స్నేక్స్ అండ్ ల్యాడర్స్, ట్రంప్ కార్డ్ మానియాలాంటి ఉచిత గేమ్స్ అందుబాటులో ఉంటాయని వివరించింది. ఇక ఎంపీఎల్, విన్జో, నజారా టెక్నాలజీస్ ఇన్వెస్ట్ చేసిన మూన్షైన్ టెక్నాలజీస్ (పోకర్బాజీ) కూడా రియల్ మనీ ఆన్లైన్ గేమింగ్ కార్యకలాపాలు నిలిపివేసినట్లు తెలిపాయి. మూన్షైన్ టెక్నాలజీస్లో నజారా టెక్నాలజీస్కి 46.07 శాతం వాటాలు ఉన్నాయి.
విన్జో పోర్ట్ఫోలియోలో రమ్మీ, సాలిటైర్, ఫ్యాంటసీ క్రికెట్, పోకర్లాంటి 100 పైగా రియల్ మనీ గేమ్స్ ఉన్నాయి. ఎంపీఎల్కి ఆసియా, యూరప్, ఉత్తర అమెరికాలో 12 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. ఇండియా గేమింగ్ రిపోర్ట్ 2025 ప్రకారం ప్రపంచవ్యాప్తంగా గేమింగ్ యూజర్లలో భారత్కి దాదాపు 20 శాతం, గ్లోబల్ గేమింగ్ యాప్ డౌన్లోడ్స్లో 15.1 శాతం వాటా ఉంది. మన దేశంలో 1,800 పైగా గేమింగ్ స్టార్టప్లు ఉన్నాయి. ఇక, రియల్ మనీ గేమ్స్ నిలిపివేతతో నజారా టెక్నాలజీస్ షేరు వరుసగా మూడు రోజుల్లో దాదాపు 18 శాతం పతనమైంది. శుక్రవారం నాడు గేమింగ్, హాస్పిటాలిటీ సంస్థ డెల్టా కార్ప్ 3.50 శాతం, ఆన్మొబైల్ గ్లోబల్ దాదాపు 3 శాతం క్షీణించాయి.
ఐపీఎల్పైనా ఎఫెక్ట్..
రియల్ మనీ గేమింగ్స్పై నిషేధం అటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)పైనా భారీగా ప్రభావం చూపనుంది. డ్రీమ్11, మై11సర్కిల్లాంటి సంస్థలు ఐపీఎల్కి బడా స్పాన్సర్లుగా ఉండటమే ఇందుకు కారణం. 2025 ఐపీఎల్కి వచి్చన మొత్తం ప్రకటనల ఆదాయంలో ఫ్యాంటసీ స్పోర్ట్స్ స్పాన్సర్లు వాటా సుమారు రూ. 2,000 కోట్లు ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. డిజిటల్ అడ్వరై్టజింగ్పై గేమింగ్ కంపెనీలు అత్యధికంగా ఖర్చు చేస్తుంటాయి కనుక ఐపీఎల్తో పాటు ఇతరత్రా ఆటల ప్రసార హక్కులకు పలికే రేటుపైనా ప్రభావం పడుతుందని పేర్కొన్నాయి. ఆన్లైన్ గేమింగ్పై నిషేధంతో అడ్వర్టైజింగ్ పరిశ్రమ ఆదాయంపై సుమారు 10–15 శాతం ప్రతికూల ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఆందోళనలో పరిశ్రమ.. స్కిల్ గేమ్స్కి రాజ్యాంగపరమైన రక్షణ ఉన్నప్పటికీ గేమింగ్ మీద నిషేధం విధించడం ఆశ్చర్యకరమని పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రభుత్వం దీన్ని పట్టించుకోకపోవడం సరికాదని డ్రీమ్11 వర్గాలు పేర్కొన్నాయి. దేశీయంగా ఫ్యాంటసీ స్పోర్ట్స్ పరిశ్రమ ప్రస్తుతం 1.82 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉండగా 2030 నాటికి ఏకంగా 5.05 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందనే అంచనాలు నెలకొన్న తరుణంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సరికాదని అభిప్రాయపడ్డాయి. పెద్ద సంఖ్యలో దీనిపై ఆధారపడిన వారి ఉపాధి, స్పోర్ట్స్లో ఆవిష్కరణలు, అత్యధిక నైపుణ్యాలు అవసరమయ్యే ఉద్యోగాలకు నిషేధంతో విఘాతం కలుగుతుందని వివరించాయి.
Tags : 1