పుష్ప 2 డేట్ కు రాజాసాబ్.. బ్లాక్ బస్టర్ పక్కా..
Breaking News
మొఘులుల కాలం నాటి ఖుర్బానీ కా కహానీ..!
Published on Sun, 06/01/2025 - 13:47
విందు భోజనం తినే ముందు ఆకలిగా అనిపించడం సహజమే. కానీ సిటీలోని వేడుకల్లో పాల్గొనేవారికి విందు దాదాపు ముగింపునకు వచ్చేటప్పుడు కూడా కొత్త ఆకలి పుట్టుకొస్తుంది. కారణం ఖుర్బానీ కా మీఠా. ఈ డెజర్ట్ లేకుండా నగరంలో ఏ విందూ పూర్తి కాదు. తినకుండా ఏ జిహ్వా శాంతించదు. ఇంతగా సిటిజనుల అభి‘రుచి’లో అల్లుకుపోయిన ఈ ఖుర్బానీ కా మీఠా కహాని దాని తియ్యదనమంత గొప్పది.
కునాఫా చాక్లెట్లు, చీజ్కేక్లు, మాకరూన్లు వంటి కొత్త కొత్తవి సిటీ డెజర్ట్స్ మెనూలోకి రావడానికి చాలా కాలం ముందు నుంచే ఓ మిఠాయి రాజదర్పంతో కింగ్ ఆఫ్ డెజర్ట్స్గా నగరంలో వర్థిల్లుతోంది. నిజాం వంశాల వంటగదుల్లో జచిన ఈ మిఠాయి, హైదరాబాద్ ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం దక్కించుకుంది. పెళ్లిళ్లు, పండుగలు, వేడుకల భోజనాలు ఈ డెజర్ట్తో ముగిస్తేనే.. అది సంపూర్ణ విందుగా పరిగణిస్తారు. రాత్రంతా నానబెట్టిన డ్రై ఆప్రికాట్లను చక్కెరతో మగ్గించి, బాదం లేదా ఆప్రికాట్ గింజలతో అలంకరించడంతో ఇది స్వీట్ రూపం దాల్చుతుంది. ఈ రుచికరమైన డెజర్ట్ను మలాయ్, వెనిల్లా ఐస్క్రీమ్ లేదా కస్టర్డ్తో కలిపి కాంబినేషన్గా అందిస్తున్నారు.
మొఘలుల కాలం నుంచే..
మొఘల్ సామ్రాజ్య స్థాపకుడైన బాబర్కు ఫెర్గానా లోయ (ఉజ్బెకిస్తాన్)లో పండే ఆప్రికాట్లు బాగా నచ్చేవట. భారతదేశపు వేడిలో ఉక్కిరిబిక్కిరి అవుతున్నప్పుడు తన స్వదేశ పండ్లను బాగా మిస్ అయ్యేవాడట.
ఆ తర్వాత భారత ఉపఖండంలోకి అలా వచ్చిన ఆప్రికాట్లు నాటి చక్రవర్తుల పుణ్యమాని మొఘల్ వంటల్లో కూడా ప్రాధాన్యం పొందాయి. నగరాన్ని పాలించిన ఆసఫ్ జాహీ రాజవంశం హయాంలో ఈ మిఠాయి హైదరాబాద్ క్యుజిన్లో ప్రాముఖ్యం పొందింది.
నగరం నలువైపులా..
హైదరాబాద్ వంటకాలకు పేరొందిన ప్రతి రెస్టారెంట్ ఖుర్బానీ కా మీఠాను ప్రత్యేకంగా అందిస్తుంది. బిర్యానీకి పేరొందిన ప్యారడైజ్ రెస్టారెంట్, షాదాబ్ హోటల్, బావర్చీ హోటల్, నవాబ్స్ రెస్టారెంట్, సర్వీ, నానీస్ ప్యూర్ వెజ్, కబూల్ దర్బార్ వంటివన్నీ ఈ డెజర్ట్ను సర్వ్ చేస్తున్నాయి.
అలాగే మినర్వా కాఫీ షాప్స్, చట్నీస్లో క్లాసిక్ ఖుర్బానీ కా మిఠాను ఐస్క్రీమ్తో కలిపి అందిస్తారు. కరాచీ బేకరి, ఆల్మండ్ హౌజ్ వంటి కొన్ని మిఠాయి దుకాణాల్లో ప్యాకింగ్స్లో కూడా దొరుకుతుంది. దీని ధరలు రూ.70 నుంచి రూ.600 వరకూ ఉన్నాయి. సితార ఫుడ్స్ వంటివి కిలోల లెక్కన విక్రయిస్తున్నాయి.
చైనాలో పుట్టి.. చరిత్రకెక్కి..
ఖుర్బానీ కా మిఠా కేవలం ఒక మిఠాయి కాదు. తరాలుగా మనతో పాటు అల్లుకున్న చారిత్రక, సాంస్కృతిక సంపద. ఖుర్బానీ అంటే ఉర్దూలో ఆప్రికాట్. చైనాలో జన్మించిన ఈ పండు, క్రీ.పూ.4వ శతాబ్దంలోనే అలెగ్జాండర్ సైనికుల ద్వారా భారతదేశం మీదుగా యూరప్కు ప్రయాణించినట్టు చరిత్రకారులు చెబుతున్నారు.
ఆధునిక రూపం.. ఆప్రికాట్ డిలైట్..
ఈ మధ్య కాలంలో ఖుర్బానీ కా మిఠాకు సరికొత్త అవతారం దాల్చింది. అదే ఆప్రికాట్ డిలైట్. ఇందులో అసలు మిఠాయి రుచిని అలా ఉంచుతూనే కేక్, కస్టర్డ్, విప్డ్ క్రీమ్ వంటి కొత్త రుచులు జోడించి ట్రైఫిల్ లాగా తయారు చేస్తారు.
ఈ కొత్త వెర్షన్ జూబ్లీహిల్స్లోని ది స్పైసీ వెన్యూ హోటల్కి చెందిన ఎల్.రవీందర్ కుమార్ రూపొందించారు. ఈ డెజర్ట్ సోషల్ మీడియా, ఫుడ్ బ్లాగర్ల ద్వారా మరింత ప్రజాదరణ పొందింది. పారంపర్యానికంటే భిన్నంగా ఉందని కొన్ని వర్గాలు విమర్శిస్తున్నా మరికొందరు దీనిని పాత మిఠాయికి కొత్త జీవం పోసే ప్రయత్నంగా స్వీకరిస్తున్నారు.
(చదవండి: ఈ సాలీడు టాలెంట్కి సాటిలేరెవ్వరూ..! కటౌట్తో పనిలేదు బ్రదర్..)
Tags : 1