ప్రధాని మోదీని కలిసిన క్రికెటర్ వైభవ్ సూర్యవంశి
Breaking News
Jesus ఒక్కడే మీ తండ్రి
Published on Thu, 05/29/2025 - 11:22
‘ఒక్కడే మీ తండ్రి’ అనునది అపొస్తలుల బోధ. వీరు యేసుక్రీస్తు దగ్గర మూడున్నర సంవత్సరాలపాటు ఆత్మసంబంధ జ్ఞానాన్ని గ్రహించారు. పామరులైన వీరంతా దేవుని బోధలు ఎలా చేయాలో క్రీస్తు అను మెస్సీయ వద్దనే నేర్చుకొన్నారు. క్రీస్తును గూర్చి’ఈయనే నా ప్రియ కుమారుడు అంటూ దేవుడు ఆకాశం నుండి పలికిన మాటలను ఆ దేవుని గొప్ప స్వరాన్ని పలుమార్లు విన్నారు.
దేవుని చేత పరము నుండి ఈ భూలోకమునకు పంపబడిన ‘పరలోక దేవుని అపొస్తలుడైన యేసు అసాధారణ బోధ’, ఆ యేసు క్రీస్తు చేత ఈ సర్వ లోకములోనికి పంపబడిన పన్నెండు మంది శిష్యులనబడిన ’క్రీస్తువారి అపొస్తలుల బోధ’, యెరూషలేములోని ఆదిమ సంఘముగా చెప్పబడే ‘క్రీస్తు ప్రభువు సంఘం చేత ప్రపంచ దేశాలకు పంపబడిన’ సంఘపు అపొస్తలుల ఉపదేశం’ అంతా ఒక్కటే. ఇందులో ఎలాంటి మార్పులు, చేర్పులు లేవు. ఇట్టి ఏకత్వం గల బోధ ఆనాడు భూలోకాన్ని తలకిందులు చేసింది. అపొస్తలులు మొదటగా చేసిన ప్రపంచ సువార్త పర్యటనలతోనే ప్రపంచాన్ని కదిలించారు. కారణం ఒక్కటే, ఎవరు ఏ మూలకు వెళ్ళి బోధించినా వారి వారి బోధలలో ఏకత్వం అనేది తేటగా పిరదర్శకంగా వెల్లడి కావడం.
సత్యవాక్యమను సువార్తను ఇక్కడ పేతురు ప్రకటిస్తున్నా అక్కడ యోహాను వివరిస్తున్నా మరోచోట యాకోబు చెబుతూ ఉన్నా ఈ ముగ్గురి బోధలు ఒకేలా ఉండడం విశేషం. ఇదే అపొస్తలుల బోధనా విధానం ప్రత్యేకత. బోధలో ఏకత్వం లేదంటే, రాలేదంటే అది అపొస్తలుల బోధ కాదని సుస్పష్టంగా చాలా తేలిగ్గానే ఇట్టే చెప్పేయవచ్చు. ఇప్పుడైతే ఏ ముగ్గురి బోధలు విన్నా చదివినా బోధలు మూడు రకాలుగా ఉంటూ క్రైస్తవ సమాజాన్ని కలవరానికి గురిచేస్తూ ఏకత్వాన్ని ధ్వంసం చేస్తున్నాయి.
నేడు దేవోక్తులకు చోటివ్వని నాయకత్వాలు అంతటా ప్రబలుతున్నాయి. అందులో ఒకటి ‘నేను మీకు ఆత్మీయ తండ్రిని’ అనే నాయకత్వం. విస్తరించిన పచ్చని చెట్టువలె ఉన్న ఇలాంటి నాయకత్వాలు విచ్చిన్నమై పుచ్చిపట్టి నేలకూలడానికి అవి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాయి (కీర్తన 37:35,36, 73:16–19).
ఎందుకంటే, ఒకడు ఎన్నో ఆత్మలను రక్షించినా ఎంత ఆత్మ సంబంధిగా జీవించినా నెత్తిన తెల్లకీరిటం ఉన్నానూ అతడు ఆత్మీయ తండ్రి కాలేడు. యేసు అసాధారణ బోధ దీన్ని అనుమతించుట లేదు. ప్రభువైన క్రీస్తు ఇలా అంటున్నాడు. ‘పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్ళగింపబడును’(మత్త 15:13 ). దీని భావం ఏమంటే, వివిధ రకాల లేఖన విరుద్ధ కొత్త సిద్ధాంతాలు, నాయకత్వాలు, మానవ కల్పిత స్థాపిత సంఘాలు అనేవి సాటిలేని, ప్రత్యామ్నాయం లేని అపొస్తలుల బోధ ముందు అనగా, క్రీస్తు పరిశుద్ధులుగా పేర్గాంచిన అపొస్తలుల బోధ ముందు ఇవి నిలువలేవు. వ్యక్తుల బోధల ప్రతిభాపాటవాలు, ధన దాసత్వం, భక్తి హీనత వంటి అబద్ద బోధలు నాయకత్వాలుగా పరిణమిస్తూ చెలామణిలో ఉంటూ రాజ్యమేలుతున్నాయి.
సత్యవాక్యం లోతుగా ఎరుగని కారణం చేతనే క్రై స్తవ్యంలో సత్య విషయమైన సత్య సంబంధిత ఈ ఆత్మ సంబంధ భావ దారిద్య్రం నేడు ఎందరినో పట్టి పీడిస్తోంది. ఆత్మీయ తండ్రిగా పిలిపించుకోవడం అనేది అది వ్యక్తులు సృష్టించుకొన్న వారి సొంత బోధ. పరలోక దేవుని అపొస్తలుడైన క్రీస్తు వారి అత్యున్నతమైన అసాధారణ బోధ ఏమంటే,‘మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు. మీరందరు సహోదరులు. భూమి మీద ఎవనికైనను తండ్రి అని పేరు పెట్టవద్దు. ఒక్కడే మీ తండ్రి. ఆయన పరలోకమందున్నాడు’ (మత్త 23 8, 9 ఎఫెసీ 4:6 ).
– జేతమ్
Tags : 1