మావోయిస్టు కుంజమ్ హిడ్మా అరెస్ట్
Breaking News
పెట్రోల్, డీజిల్ విక్రయాలకు ప్రత్యేక అవుట్లెట్లు
Published on Wed, 05/28/2025 - 14:12
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) అనుబంధ సంస్థగా ఉన్న చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (సీపీసీఎల్) రిటైల్ ఇంధన మార్కెట్లోకి ప్రవేశించడానికి పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ నుంచి అనుమతులు లభించాయి. దీంతో సీపీసీఎల్ ప్రత్యేకంగా తన సొంత బ్రాండెడ్ అవుట్లెట్ల ద్వారా పెట్రోల్, డీజిల్ను విక్రయించనుంది.
ప్రస్తుతం సీపీసీఎల్ చెన్నైలోని మనాలిలో సంవత్సరానికి 10.5 మిలియన్ టన్నుల (ఎంటీపీఏ) సామర్థ్యంతో క్రూడాయిల్ రిఫైనరీని నిర్వహిస్తోంది. ఇప్పటివరకు కంపెనీ మొత్తం ఉత్పత్తులను రిటైల్ అమ్మకాలను నిర్వహించే ఐఓసీకి సరఫరా చేసింది. సొంత రిటైల్ అవుట్లెట్లను ఏర్పాటు చేయడం ద్వారా ఐఓసీ, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్పీసీఎల్), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్), రిలయన్స్, షెల్, నయారా ఎనర్జీ వంటి ప్రధాన ఇంధన రిటైలర్లతో సీపీసీఎల్ పోటీ పడనుంది.
ఇదీ చదవండి: బ్యాంకుల మొండిబాకీలు ‘రైట్ఆఫ్’
కంపెనీ ఉత్పత్తుల పంపిణీ కోసం గతంలో ఐఓసీపై ఆధారపడిన సీపీసీఎల్ రిటైల్ రంగంలోకి ప్రవేశించడం దాని సొంత ఇంధన ధరలు, అమ్మకాల వ్యూహాలను నియంత్రించడం ద్వారా లాభాలు ఆర్జించనుంది. భవిష్యత్తులో ప్రీమియం ఇంధన ఆఫర్లు, ప్రత్యామ్నాయ ఇంధన పరిష్కారాలను విస్తరించడానికి ఈ చర్యలు వీలు కల్పిస్తున్నాయి. అయితే సీపీసీఎల్ తన రిటైల్ అవుట్లెట్ల సంఖ్యను, వాటి లోకేషన్లను ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. కంపెనీ తన మార్కెట్ ఉనికిని విస్తరించడానికి ప్రధాన పట్టణ కేంద్రాలు, రహదారుల సమీపంలో వ్యూహాత్మకంగా అవుట్లెట్లను ఏర్పాటు చేస్తుందని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు.
Tags : 1