బీసీసీఐ భారీ మోసం! RCBపైనే విరాట్ భారం
Breaking News
హ్యుందాయ్ లాభం డౌన్.. రూ.21 డివిడెండ్
Published on Sat, 05/17/2025 - 07:49
న్యూఢిల్లీ: ఆటో రంగ దిగ్గజం హ్యుందాయ్ మోటార్ ఇండియా గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 4 శాతం నీరసించి రూ. 1,614 కోట్లకు పరిమితమైంది. దేశీ అమ్మకాలు మందగించడం ప్రభావం చూపింది. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో రూ. 1,677 కోట్లు ఆర్జించింది.
వాటాదారులకు కంపెనీ బోర్డు షేరుకి రూ. 21 చొప్పున తుది డివిడెండ్ ప్రకటించింది. మొత్తం ఆదాయం నామమాత్ర వృద్ధితో రూ. 17,671 కోట్ల నుంచి రూ. 17,940 కోట్లకు బలపడింది. ఈ కాలంలో దేశీయంగా 1,53,550 వాహనాలను విక్రయించింది. 2023–24 క్యూ4లో రూ. 1,60,317 యూనిట్ల అమ్మకాలు సాధించింది. అయితే ఎగుమతులు 33,400 యూనిట్ల నుంచి 38,100 వాహనాలకు జంప్ చేశాయి.
పూర్తి ఏడాదికి మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి హ్యుందాయ్ ఇండియా కన్సాలిడేటెడ్ నికర లాభం 7 శాతం క్షీణించి రూ. 5,640 కోట్లను తాకింది. 2023–24లో రూ. 6,060 కోట్ల లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 69,829 కోట్ల నుంచి రూ. 69,193 కోట్లకు స్వల్పంగా తగ్గింది. దేశీ అమ్మకాలు 6,14,721 యూనిట్ల నుంచి 5,98,666 యూనిట్లకు వెనకడుగు వేశాయి. ఎగుమతులు నామమాత్ర వృద్ధితో 1,63,386 యూనిట్లకు చేరాయి. 2030కల్లా 20 ఐసీఈ, 6 ఈవీలతో కలిపి 26 కొత్త ప్రొడక్టులను ప్రవేశపెట్టనున్నట్లు కంపెనీ ఎండీ అన్సూ కిమ్ పేర్కొన్నారు.
వీటిలో 8 మోడళ్లు 2027కల్లా విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది(2025–26) రూ. 7,000 కోట్ల పెట్టుబడులు వెచ్చించనున్నట్లు కంపెనీ సీవోవో తరుణ్ గార్గ్ తెలియజేశారు. వీటిలో 40 శాతాన్ని పుణేలో ఏర్పాటు చేస్తున్న ప్లాంటుపై వెచ్చించనున్నట్లు పేర్కొన్నారు. ఫలితాల నేపథ్యంలో హ్యుందాయ్ షేరు 1.3 శాతం లాభంతో రూ. 1,860 వద్ద ముగిసింది.
Tags : 1