కర్ణాటకలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలపై వేటు
Breaking News
Fear & Emotions : భయానికి మూలం
Published on Mon, 05/05/2025 - 11:38
మన దుఃఖాన్ని మనమే సృష్టించుకుంటున్నాం. ఒక నీటిబుడగను సృష్టించుకుని మనమే అందులో చిక్కుకుంటున్నాం. శరీరము–మనస్సులే నేను అనే భ్రమను కల్పించుకుని సుఖదుఃఖాల చట్రంలో చిక్కుకునిపోయాం. నీవు శుద్ధచైతన్యంగా ఉన్నప్పుడు దుఃఖమనేదే లేదు. కేవలం సచ్చిదానందమే ఉంది. మనమే నమ్మకాలను కల్పించుకొని భయమని, దుఃఖమని, కుంగుబాటని వేదన చెందుతున్నాం. కొన్ని జన్మల నుంచి నమ్మకాలను బలపరచుకుంటూ వస్తున్నాం. నేను శరీరము–మనస్సు అని నమ్ముతున్నాం. నిజానికి నీవు వ్యక్తివి కావు. ఈ వ్యక్తికి మూలం ఏది? ఆత్మనే మూలం. అది అనందనిలయం. మరి దుఃఖం ఎందుకు వచ్చింది అంటే నీవు ఆత్మవని మరచి వ్యక్తిని అని నమ్ముతున్నావు గనుక. చైతన్యానికి ద్వంద్వాలు లేవు. చైతన్యం భిన్నత్వాన్ని అనుభవించటానికి ఒక రూపంలో వ్యక్తమయ్యింది. దానికి నేను అనేది అవసరం. అక్కడ ఎరుక మాత్రమే ఉండాలి. కానీ నేను శరీరం అనే నమ్మకాన్ని కల్పించుకొని తన నిజతత్వాన్ని మరచిపోయింది. సుఖదుఃఖాల్లో కూరుకుపోయింది. ఆలోచనలు, భావోద్వేగాలు, గుర్తింపు, నమ్మకాలు, ఇష్టాఇష్టాలు వంటి వాటితో వ్యక్తి మొదలైనాడు.
నిజానికి ఆ చూసేవాడు వ్యక్తే కాదు. వాడికి దుఃఖం, భయం అనేవే లేవు. అది కేవలం సాక్షీ చైతన్యం. కానీ మనం చూసేవాడు, చూడబడేది అనే ఇద్దరుగా తయారైనాము. చూసేవాడు చైతన్యం, చూడబడేది శరీరం–మనస్సు. నేనే శరీరమనే భ్రమ కల్పించుకొని, శరీర అనుభవాలతో కలిసిపోయి రాగద్వేషాలను కల్పించుకొని, భయం, దుఃఖం, కోపం, ద్వేషం అనేవి ఊహించుకుంటున్నాం. నిజమైన నిన్ను ఎవరైనా భయపెట్టగలరా? కేవలం నీ నమ్మకం వల్లనే భయపడుతున్నావు. ఎక్కడికి పారిపోగలవు నీవు? శరీరం–మనస్సులకు మూలమే నీవు. నీవే అనంత చైతన్యం. నిన్ను ఏ సమస్య ఐనా, ఏ రోగమైనా ఏమీ చేయలేదు. శరీరానుభవాలను సాక్షిగా గమనిస్తూ ఉండు. సదా నీ నిజతత్వం పట్ల ఎరుకతో ఉండు. నీవు అనంత శక్తిమంతుడివి. నిత్యం సచ్చిదానందంలో ఉండాలి.
(దిల్ ఉండాలే గానీ : రూ. 50 వేలతో మొదలై, నెలకు రూ. 7.50 లక్షలు)
వ్యక్తిగా ఒక చిన్న పరిధినే నేను అనుకున్నప్పుడే భయం, దుఃఖం ఉంటాయి. అప్పుడే నీకు అభద్రత ఉంటుంది. తోడుకావాలి, కుటుంబం కావాలి, స్నేహితులు కావాలి అని కోరుకుంటావు. ఇదంతా భయం వల్లనే. నీవు చైతన్యంగా ఉన్నప్పుడు నీకు ఏమీ అవసరం లేదు. నీవు సంపూర్ణ భద్రతలోనే ఉంటావు. నీకు అవసరమైనవి సమకూరుతూ ఉంటాయి. నేను కర్తను కాను, కర్మను కాను, క్రియను కాను అనే భావనలో ఉండాలి. సాక్షిగా ఉండాలి. నీ ముందున్న జీవితాన్ని సంపూర్ణంగా జీవిస్తూ అత్మతత్వంలో ఉండేటప్పుడు నీలో నిరాశ, నిస్పహ, బాధ, విసుగు లాంటివి ఎలా ఉంటాయి? భిన్నత్వాన్ని అనుభవించటానికే చైతన్యం శరీరరూ΄ాన్ని సంతరించుకుంది. ఆ శరీరమే నేను అనుకోవడం నీ భ్రమ. భిన్నత్వాన్ని యథాతథంగా సాక్షీభావంతో సంపూర్ణంగా ఆస్వాదిస్తూ ఉండాలి.
– స్వామి మైత్రేయ,
ఆధ్యాత్మిక బోధకులు
Tags : 1