ఏఐ ప్రయోజనాలకు మద్దతుగా నిలవాలి | Sakshi
Sakshi News home page

ఏఐ ప్రయోజనాలకు మద్దతుగా నిలవాలి

Published Tue, Jan 2 2024 6:24 AM

RBI Dy Governor Rajeshwar Rao highlights role of technology and AI in banking at IEA conference - Sakshi

ముంబై: కృత్రిమ మేథ (ఏఐ) ప్రయోజనాలను వినియోగించుకోవడానికి వీలుగా నియంత్రణపరమైన కార్యాచరణ మద్దతు అవసరమని, అదే సమయంలో ఆర్థిక వ్యవస్థపై దీని దు్రష్పభావాలను దృష్టిలో పెట్టుకోవాలని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ ఎం.రాజేశ్వరరావు అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో జరిగిన ఇండియన్‌ ఎకనమిక్‌ అసోసియేషన్‌ వార్షిక సదస్సుల్లో భాగంగా ఆయన మాట్లాడారు. ఏఐని ప్రతిపాదించే వారు సైతం ఇది భవిష్యత్తును మార్చేదిగా భావిస్తున్నట్టు చెప్పారు.

‘‘పలు బ్యంక్‌లు, నాన్‌ బ్యాంక్‌లు ఏఐతో ప్రయోగాలు చేస్తుండడాన్ని చూస్తున్నాం. కాకపోతే ఇదంతా బ్యాక్‌ ఆఫీస్‌ పనులకు సంబంధించే ఎక్కువగా ఉంటోంది’’అని చెప్పారు. నిబంధనల అమలుకు సంబంధించి, చెల్లింపులు లేదా లావాదేవీల్లో మనీలాండరింగ్‌ ప్రయత్నాలను గుర్తించేందుకు ఏఐని కొన్ని బ్యాంక్‌లు అమల్లో పెట్టినట్టు తెలిపారు. రుణ వితరణ నిర్ణయాలు, కస్టమర్‌ గుర్తింపునకు సంబంధించి కూడా కొనఇన సంస్థలు ఏఐ సొల్యూషన్లను వినియోగిస్తున్నట్టు రాజేశ్వరరావు చెప్పారు.

మార్పు స్వభావం, సామర్థ్యాల రీత్యా జెనరేటివ్‌ ఏఐ ఉత్పాదకత, ఉద్యోగులు, ఆదాయం పంపిణీపై బలమైన ప్రభావం చూపించగలదన్నారు. ఆర్థిక వ్యవస్థ, సమాజం, ఆదాయం పెంపు, మళ్లీ మళ్లీ చేయాల్సిన పనుల ఆటోమేషన్‌పై ఏఐ చూపించే ప్రభావాన్ని సైతం పేర్కొన్నారు. అదే సమయంలో ఏఐ నిరుద్యోగాన్ని పెంచుతుందన్న ఆందోళనలను ప్రస్తావించారు. ముఖ్యంగా ఐటీ రంగం నుంచి ఈ తరహా ఆందోళనలు వస్తున్నాయంటూ, దీనిపై చర్చకు ఇప్పట్లో ముగింపు రాకపోవచ్చన్నారు. 

Advertisement
 

తప్పక చదవండి

Advertisement