బెల్టు షాపులంటూ గిల్టు కథనాలా?  | FactCheck: Eenadu Ramoji Rao Spreading False News On Belt Shops In AP, Facts Inside - Sakshi
Sakshi News home page

FactCheck: బెల్టు షాపులంటూ గిల్టు కథనాలా? 

Published Sat, Nov 11 2023 5:22 AM

Eenadu false news on belt shops - Sakshi

సాక్షి, అమరావతి: అసలు బెల్టు షాపులు ఎవరు పెడతారు? వీటిని నిర్వహించేది లాభాపేక్షతోనే కదా? మరి షాక్‌ కొట్టే ధరలతో ప్రభుత్వమే పరిమిత సంఖ్యలో, నియమిత వేళల్లో మాత్రమే మద్యాన్ని విక్రయిస్తోందంటే సర్కారుకు లాభాపేక్ష లేనట్లే కదా? అయినా అసలు ప్రభుత్వానికి దుకాణాల్లో చిల్లరగా మద్యాన్ని అమ్ముకోవాల్సిన అవసరం ఏముంటుంది? ఎక్కడైనా ఆ పరిస్థితి ఉందా? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం ఉండాలి కదా? మరి రామోజీ ఈ చిన్న లాజిక్‌ ఎలా మిస్సయ్యారు? గతంలో ఐదేళ్లు మత్తుగా పడుకుని ఇప్పుడే నిద్ర లేచారు కాబట్టేనా! టీడీపీ నేతలు ఎవరైనా వాళ్ల దుకాణాల్లో మద్యం అమ్ముతుంటే ఆయన ఫొటోలు తీశారా? అనే సందేహాలు వస్తున్నాయి.

ఇప్పుడు 236 బెల్టు షాపులు లెక్క తేల్చానంటూ గుండెలు బాదుకుంటున్న ఆయన చంద్రబాబు హయాంలో 43వేల బెల్టు షాపులు ఏర్పాటైతే నోరెత్తకపోవడం గమ్మత్తు­గా లేదా? సాధారణంగా ప్రైవేట్‌ దుకాణ­దారులు తాము అమ్ముకోవడంతోపాటు మరింత మద్యాన్ని తాగించేందుకు రకరకాల దుకాణాల్లో బెల్టు షాపులు ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు ఆ పరిస్థితిని మార్చి మద్యపానాన్ని నిరుత్సాహ­పరుస్తూ పూర్తిగా ప్రభుత్వ నియంత్రణలోనే విక్రయాలు జరుగుతు­న్నాయి. ప్రత్యేకంగా స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (సెబ్‌)ను సైతం ఏర్పాటు చేసింది. 

బాబు హయాంలో ఏరులై పారిన మద్యం..
చంద్రబాబు హయాంలోటీడీపీ మద్యం సిండికేట్‌ ఆధ్వర్యంలో రాష్ట్రంలో మద్యం ఏరులై పారింది. గత సర్కారు వేలం ద్వారా 4,380 మద్యం దుకాణాలకు లైసెన్సులు కేటాయించగా వాటన్నింటిని టీడీపీ నేతలే దక్కించుకున్నారు. ఒక్కో మద్యం దుకాణానికి అనుబంధంగా మరో 4,380 పర్మిట్‌ రూమ్‌లకు చంద్రబాబు అనుమతులు ఇచ్చారు. వాటికి అదనంగా టీడీపీ నేతలు 43 వేల బెల్ట్‌ దుకాణాలను తెరచి దోపిడీకి తెగబడ్డారు. గుడి, బడి తేడా లేకుండా వీధికి ఒకట్రెండు చొప్పున బెల్ట్‌ షాపులను తెరిచి మద్యం ఏరులై పారించారు. ఎమ్మార్పీ ధరల కంటే 25 శాతం వరకు అధిక ధరలకు అమ్ముకున్నా అడిగే నాథుడే లేడు.  

 ఉక్కుపాదం మోపిన సీఎం జగన్‌
వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మద్యం మాఫియాపై ఉక్కుపాదం మోపారు. 43 వేల బెల్టు షాపులను, 4,380 పర్మిట్‌ రూమ్‌లను ఒకేసారి రద్దు చేశారు. 2019 అక్టోబరు 1 నుంచి మద్యం దుకాణాలన్నీ ప్రభుత్వ పరం చేసేశారు.

టీడీపీ హయాంలో ప్రైవేటు మద్యం దుకాణాలు ఉదయం 10 నుంచి రాత్రి 11 గంటల వరకు అధికారంగా విక్రయాలు సాగించేవి. అనధికారికంగా 24 గంటలూ విక్రయిలు సాగించాయి. ఇప్పుడు సమయాన్ని కుదించి ఉదయం 10 నుంచి రాత్రి 9 గంటల వరకే విక్రయిస్తున్నారు. 2019లో రాష్ట్రంలో 4,380 ప్రైవేటు మద్యం దుకాణాలు ఉండగా ప్రస్తుతం 2,934 ప్రభుత్వ మద్యం దుకాణాలే ఉన్నాయి. ఇక 2019లో ఖరారు చేసిన 840 బార్లే ఇప్పటికీ ఉన్నాయి. 

Advertisement
Advertisement