-
ఏపీ విద్యా సంస్కరణలు.. దేశానికి దిక్సూచిగా..
సాక్షి, అమరావతి : సాధారణంగా ఏ ప్రభుత్వమైనా విద్యా రంగానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వదు. ఇందుకు చెప్పుకోదగ్గ మొత్తం కూడా ఖర్చుపెట్టదు. అలాంటిది ఆంధ్రప్రదేశ్లో గత నాలుగున్నరేళ్లుగా విద్యకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడమేగాక, ఖరీదైన ఇంటర్నేషనల్ బాకలారియెట్ వంటి సిలబస్ను ప్రభుత్వ పాఠశాలల్లో అమలుచేయాలని సంకల్పించింది. ఈ కాలంలో రాష్ట్రంలో విద్యా రంగం సమూలంగా మారింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం చదువులు ప్రతి పల్లెకు చేరువయ్యాయి. కొద్దిమందికి మాత్రమే పరిమితమైన సీబీఎస్ఈ సిలబస్ సైతం ఇప్పుడు పేద పిల్లలకు అందుతోంది. రాష్ట్రంలోని 45 వేల పాఠశాలల్లో చదువుతున్న 43 లక్షల మంది విద్యార్థులకు డిజిటల్ విద్య అందుబాటులోకి వచ్చింది. త్వరలో అత్యంత ఖరీదైన ఐబీ సిలబస్ సైతం ఉచితంగా అందించనున్నారు. దీంతో దేశంలోని ఇతర రాష్ట్రాలు ఇప్పుడు ఏపీ వైపు చూస్తున్నాయి. ఇలా పేద పిల్లలకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఆ సంస్కరణలకు అద్దంపట్టేలా గణతంత్ర దినోత్సవ వేడుల్లో ప్రదర్శించే శకటాన్ని విద్యాశాఖ రూపొందించింది. ఈ నేపథ్యంలో.. విద్యకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత.. అమలుచేస్తున్న సంస్కరణలపై ప్రత్యేక కథనం.. విద్యా సంక్షేమానికి భారీగా నిధులు.. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలను గ్లోబల్ విద్యార్థులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చి ఇతర రాష్ట్రాలకు దిక్సూచిగా నిలిచింది. ఇందులో భాగంగా.. ► పేద తల్లులు తమ పిల్లలను బడికి పంపినందుకు గాను గత నాలుగేళ్లలో ‘జగనన్న అమ్మఒడి’ ద్వారా 42,61,965 మంది ఖాతాల్లో రూ.26,349.50 కోట్లు ప్రభుత్వం జమచేసింది. ►మనబడి నాడు–నేడు పథకం ద్వారా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో రూ.17,805 కోట్ల వ్యయంతో, మూడు దశల్లో 12 మౌలిక వసతులను కల్పిస్తున్నారు. ఇప్పటికే రెండు దశల్లో దాదాపు 32 వేల పాఠశాలల రూపురేఖలు మారాయి. ►పాఠశాల తెరిచిన మొదటిరోజే ప్రతి విద్యార్థికి ‘జగనన్న విద్యాకానుక’గా ఉచితంగా బైలింగువల్ పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్, వర్క్బుక్స్, కుట్టు కూలీతో మూడు జతల యూనిఫాం క్లాత్, జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, స్కూల్ బ్యాగుతో పాటు హైస్కూల్ విద్యార్థులకు ఆక్స్ఫర్డ్ ఇంగ్లిష్–తెలుగు డిక్షనరీ, ఎలిమెంటరీ విద్యార్థులకు పిక్టోరియల్ డిక్షనరీ అందించి ప్రైవేటు స్కూలు విద్యార్థుల కంటే మిన్నగా బడికి వెళ్లేలా ప్రభుత్వం అవకాశాలు కల్పించింది. ►బాలికా విద్యకు ప్రాధాన్యతనిస్తూ ఉన్నత పాఠశాలలను అప్గ్రేడ్ చేసి మండలానికి రెండు జూనియర్ కాలేజీలు ఏర్పాటుచేసి అందులో ఒకటి బాలికలకు కేటాయించింది. ఇటు ‘గోరుముద్ద’.. అటు డిజిటల్ చదువులు.. ► దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా విద్యార్థుల్లో రక్తహీనతను తగ్గించేందుకు చిక్కీ, రాగిజావతో సహా 16 రకాల పదార్థాలతో ‘జగనన్న గోరుముద్ద’ను అందిస్తున్నారు. ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.1,910 కోట్లు అదనంగా ఖర్చుచేస్తోంది. గోరుముద్ద పథకం కింద ఇప్పటిదాకా రూ.6,262 కోట్లు ఖర్చుచేశారు. ►అలాగే, ఏటా 8వ తరగతి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు రూ.15 వేల విలువైన బైజూస్ కంటెంట్తో రూ.17,500కు పైగా మార్కెట్ విలువగల ట్యాబ్ను ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. గత రెండేళ్లలో మొత్తం 9,52,925 ట్యాబులు ఉచితంగా అందించిన ఘనత దేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రమే జరిగింది. ► 62 వేల తరగతి గదుల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లను, స్మార్ట్ టీవీలను ఇప్పటికే అందుబాటులోకి తెచ్చారు. విద్యార్థులకు ఇచ్చిన ట్యాబుల్లోను, తరగతి గదుల్లో అమర్చిన ఐఎఫ్బీలు, స్మార్ట్ టీవీల్లో బైజూస్ కంటెంట్ ద్వారా బోధన చేపట్టారు. ఫలితాన్నిచ్చిన విద్యా సంస్కరణలు.. ఈ సంస్కరణల ఫలితంగా గత విద్యా సంవత్సరంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులే పది, ఇంటర్లో అత్యధిక మార్కులు సాధించారు. ఇలా ప్రతిభ కనబరిచిన 22,710 మంది విద్యార్థులకు ‘జగనన్న ఆణిముత్యాలు’గా గుర్తించి వారిని సత్కరించి ప్రభుత్వం ప్రోత్సహించింది. విద్యా సంస్కరణల శకటం ఆంధ్రప్రదేశ్లో అమలుచేస్తున్న విద్యా సంస్కరణలను చాటిచెబుతూ పాఠశాల విద్యాశాఖ రూపొందించిన శకటం శుక్రవారం విజయవాడలో జరిగే గణతంత్ర వేడుకల్లో సందడి చేయనుంది. గత నాలుగున్నరేళ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లోను, విద్య, విద్యార్థుల్లో తీసుకొచ్చిన మార్పులతో పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక శకటాన్ని రూపొందించింది. అలాగే, ఢిల్లీలో జరిగే వేడుకల్లో సైతం ఏపీ విద్యా సంస్కరణల ఆధారంగా రూపొందించిన శకటం రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించనుంది. ‘డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్’ విధానంతో ఈ వాహనం దేశానికి ఆంధ్రప్రదేశ్ విద్యా విధానాన్ని పరిచయం చేయనుంది. -
లోపలి అరలు, పొరలు, వాటికి అడ్డంగా తెరలు
భక్తి ఎప్పుడూ ఆధిపత్య ధోరణిని, అహంభావాన్ని ప్రదర్శించదు. నేను గొప్ప, నాకిది వచ్చు. నాకన్నా వాళ్లెంత...అన్న వైఖరిని చూపదు. విద్య...విత్ అంటే తెలుసుకొనుట. ఏది తెలుసుకోవాలో అది తెలుసుకుంటే అది వినయం. ‘‘విద్యాదదాతి వినయం వినయాద్యాతిపాత్రతాం పాత్రత్వాత్ ధనమాప్నోతి ధనాద్ధర్మంతత సుఖం’’ వైరాగ్య సుఖం, మోక్ష సుఖం వరకు అంతే. అందుకే త్యాగరాజ స్వామి వారిని... మీరంతవారు, మీరింత వారని అంటూంటే... ఆయన పొంగిపోలేదు. పైగా ఆయనేమన్నారు.. అంటే... ఎందరో మహానుభావులు ...అందరికీ వందనములు... అన్నారు. బ్రహ్మాన్ని తెలుసుకున్నవారు, రమించినవారు, పాడినవారు, అర్చించినవారు, అనుభవించినవారు ఎంతో మంది ఉండగా వారి ముందు నేనెంత, వారికి నేనేం చేయగలను, నమస్కారం చేస్తా...’’ అని వారందరినీ ఆదరపూర్వకంగా స్మరించుకున్నారు. వినయం అంటే అదీ. ఆదిశంకరులు అంతటి వారు ‘‘పశుం మాం సర్వజ్ఞ ప్రథితకృపయాపాలయవిభో’’...‘శివా! నేను పశువును. నీవు పశుపతివి. ఇదే మనిద్దరి మధ్య బంధం’ అన్నారు. అది వినయం. అది విద్యకు పరమార్థం.అది దేనిచేత ప్రకాశిస్తుంది... అంటే ఉపాసనా దేవత అనుగ్రహానికి పాత్రమయితే అప్పుడు వినయం వస్తుంది. ఆ వినయం మనకు వాగ్గేయకారులందరిలో కనబడుతుంది. అందుకే వారు ఏది చెప్పినా ఏది చేసినా మనకు సందేశం ఇస్తున్నట్లో, సలహా ఇస్తున్నట్లో ఉండదు. వారికి వారు చెప్పుకున్నట్లు ఉంటుంది. భిన్న కథనాలు ఉన్నప్పటికీ, త్యాగరాజ స్వామివారు ఒకసారి వేంకటాచలం వెళ్ళారు, స్వామి వారి దర్శనం కోసం కూచున్నారు. తెర అడ్డంగా ఉంది. దిగంతాలకు వ్యాపించిన కీర్తిమంతుడిని, సాక్షాత్ ఉపనిషద్బ్రహ్మేంద్రులంతటి వారు నన్నుపిలిచి కీర్తనలు పాడించుకుంటారే, నేనొస్తే తెర వేస్తారా... అని ఆయన కోపగించుకోలేదు. ఈ తెర కాసేపయితే తీస్తారు.. ఇవ్వాళ కాకపోతే రేపయినా తీస్తారు. కానీ లోపల ఇంకొక తెర ఉంది... అనే అర్థంలో ఆయన అన్న మాటేమిటంటే...‘‘తెర తీయగ రాదా, నాలోని తిరుపతి వేంకటరమణా! మదమత్సరమను తెరదీయగరాదా, పరమ పురుషా!’’ అని పిలిచారు. నిజానికి భగవంతుడు ఎక్కడ దర్శనం కావాలి? మన లోపల.. ‘అంతర్ముఖ సమారాధ్యా బహిర్ముఖ సుదుర్లభా... లోపల అక్కడ కనబడాలి. పరమ యోగీంద్రులకు భావగోచరమైన పాదాబ్జములు నాకు దర్శనమయితే నేను యోగిని. .. అన్నారు తెర వేసినందుకుగానీ, తెర తొలగించనందుకు గానీ ఆయన ఎవరినీ నింద చేయలేదు. నా అంతటివాడొస్తే.. అని అహంకరించలేదు. ఎప్పుడు తీస్తారని అడగలేదు. ఇక్కడ ఉన్న తెర ఎవరయినా, ఎప్పుడయినా తీస్తారు. ‘లోపల నాకు అడ్డొస్తోన్న తెరవల్ల నీవు నాకు ఎప్పటికీ కనబడడం లేదు. అది నీవే తీయాలి. నేను తీసుకోలేను. ఇంకొకరు తీయలేరు. అది తీయవయ్యా నాలోని వేంకటరమణా!’– అని వేడుకున్నారు. నిన్ను పొందడానికి నాకు అడ్డొస్తున్నదేమిటంటే మత్సరం... అన్నారు. ఎంతగొప్పమాట! మత్సరం అంటే అన్య సుఖ ద్వేషి. ఇంకొకరికిఏదయినా మంచి జరిగితే మనం చాలా బాధపడి పోతుంటాం. అన్నపానీయాలు ఎక్కవు. నిద్రాసుఖం ఉండదు. వాడికి శుభం జరగడమా, నాకన్నావాడేం గొప్ప. వాడికేం తెలుసని. వాడికి కీర్తి రావడమేమిటి, వాడికి శుభాలు జరగడమేమిటి ... ఇలా ఇతరులను తక్కువచేసి తన గొప్పదనం స్మరించుకోవడం... అది మత్సరానికి ప్రారంభ స్థానం. అది అడ్డొస్తున్నదన్నారు. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
కరువు సీమలో విద్యాసౌరభం
పదిలో ప్రత్యేకత చాటాలంటే పుట్టిన ఊరు వదలాలి. ఇంటర్లో విన్నర్ కావాలంటే ఇంటి నుంచి దూరంగా పోవాలి. ఇక.. ఐఐటీ సీటు రావాలంటే అయినవారిని వీడాల్సిందే. నీట్లో ర్యాంకు రావాలంటే నిలుచున్నచోటును మరిచిపోవాల్సిందే. ఇదీ నిన్నామొన్నటివరకు రాయలసీమ విద్యార్థుల పరిస్థితి. అవును.. ప్రతిభ ఉన్నా సానబెట్టేవారు దొరకని దుస్థితి. పట్టుదల ఉన్నా పెద్దపట్టణాలకు వెళ్లలేని ఆర్థికస్థితి. ఇలాంటి తరుణంలో ఓ యువకుడు తన సద్బుద్ధితో వీరికి సరికొత్త మార్గాన్ని చూపాడు. రాళ్ల సీమ నుంచి రత్నాల్లాంటి విద్యార్థులను వెలికితీస్తున్నాడు. కడప గడ్డ వేదికగా ఐఐటీ, నీట్లలో ర్యాంకుల పంట పండిస్తున్నాడు. తన ‘సంకల్ప్’బలంతో కార్పొరేట్ శక్తులకు సవాల్ విసురుతున్నాడు. విద్యార్థుల సామర్థ్యానికి తన శక్తి జోడించి లక్ష్యం వైపు నడిపిస్తున్న ఓ విజేత స్ఫూర్తిగాథే నేటి ‘సాక్షి’ ప్రత్యేక కథనం. సాక్షి, కడప డెస్క్: ‘విజయం కోసం ఆరాటపడితే సరిపోదు.. జీవితంలో ఎదగాలని ఆశపడితే చాలదు.. మనసా వాచా కర్మణా ఆచరించాలి.. అలా చేయకుంటే ఎంత ఉన్నతాశయమైనా భూమిలో నాటని విత్తనంతో సమానమే.. అది మొలకెత్తదు.. ఆ ఆశయమూ ఫలించదు..’ అంటూ విద్యార్థులకు స్ఫూర్తిమంత్రం నూరిపోస్తుంటాడు వంశీకృష్ణ. వెనుకబడిన సీమ విద్యార్థుల భవితకు దీపధారై నడుస్తున్న ఆయన పుష్కరం క్రితం కడపకు వచ్చాడు. లాభాపేక్ష లేకుండా... 2011లో వైఎస్సార్ జిల్లా కేంద్రంలో నాగార్జున మోడల్ స్కూల్ కేంద్రంగా ‘సంకల్ప్’ స్థాపించాడు. అప్పటి నుంచి ఎందరో విద్యార్థులకు ఉత్తమ విద్యా బోధన అందిస్తున్నారు. అటుతర్వాత ఏపీహెచ్బీ కాలనీలో దశాబ్దం కిందట ‘సంకల్ప్’ పేరిట ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేశాడు వంశీకృష్ణ. అయినా ‘నాగార్జున’తో అనుబంధాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. డబ్బు సంపాదన లక్ష్యంగా కాకుండా సేవాదృక్పథంతో ఇస్తున్న ఆయన శిక్షణతో ఎంతోమంది ఉజ్వల భవిష్యత్ పొందారు. పకడ్బందీగా ప్రవేశపరీక్ష ‘సంకల్ప్’లో ప్రవేశాల కోసం బేసిక్ మ్యాథమేటిక్స్ విధానం ద్వారా పరీక్ష నిర్వహిస్తారు. నాలుగో తరగతి ముగించి ఐదో తరగతిలో చేరబోయే విద్యార్థులు మాత్రమే ఇందుకు అర్హులు. పదో తరగతి వరకు శిక్షణ కొనసాగుతుంది. ఏటేటా నిర్వహించే ప్రవేశ పరీక్షలకు సీమ జిల్లాల నుంచి విద్యార్థులు వెల్లువలా వస్తారు. ఇక్కడ చేరితే ఐఐటీలో కచ్చితంగా సీటు వస్తుందనే నమ్మడమే ఇందుకు కారణం. పరీక్షల్లో అర్హత సాధించిన వంద మందికే ఇక్కడ అవకాశం కల్పిస్తారు. ఆలోచనే ఆయుధం సంకల్ప్లో మొత్తం సిలబస్ను వేగంగా బోధించరు. విద్యార్థి ఆలోచనా విధానం, స్వతహాగా చొరవను గుర్తిస్తారు. ఉపాధ్యాయులపై ఆధారపడకుండా సొంతంగా సబ్జెక్ట్ అర్థం చేసుకుని చదివేలా తర్ఫీదు ఇస్తారు. నిత్యం ఏదో ఒక టాపిక్ చెబుతారు. అది నేర్చుకున్న విద్యార్థి సొంతంగా దానిపై ఒక్క నిమిషం మాట్లాడాల్సి ఉంటుంది. ఇలాంటి ప్రత్యేక తరహా శిక్షణతో వారు రాటుదేలుతారు. ప్రశ్నించడం నేర్పుతూ.. సంస్థలో ప్రతి విషయంలో ఎందుకు? ఏమిటి? ఎలా? అంటూ ప్రశ్నించడం అలవరుస్తున్నారు. మూస పద్ధతిలో బోధన కాకుండా విద్యార్థికి న్యూమరికల్ ప్రాబ్లం ఇచ్చి ఎన్ని పద్ధతుల్లో సాల్వ్ చేస్తారంటూ అడుగుతారు. చాలామంది మూడు పద్ధతుల్లో సాల్వ్ చేస్తారు. కొందరు అంతకంటే ఎక్కువ పద్ధతుల్లో పరిష్కరిస్తారు. ఈ క్రమంలోనే ఓ విద్యార్థి తొమ్మిది పద్ధతుల్లో సాల్వ్ చేయడం విశేషం. చిన్నారుల ఆలోచనలను సరైన దారిలో పెడితే ఇలాంటి అద్భుతాలు సాధ్యమంటాడు వంశీ. ►ఉత్తర తెలంగాణ నుంచి.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఓదేడుకు చెందిన సత్యనారాయణ, పద్మ దంపతుల కుమారుడు చకిలం వంశీకృష్ణ. ఓదేడు, మంథని, వరంగల్లో ఈయన బాల్యం గడిచింది. అక్కడే ప్రాథమికస్థాయి నుంచి డిగ్రీ వరకు చదువు పూర్తి చేశాడు. ఫిజిక్స్లో పీజీ చేసిన ఆయన ఐఐటీ, జేఈఈ లెక్చరర్గా కోటా(రాజస్థాన్), ఢిల్లీ తదితర ప్రాంతాల్లో పనిచేశాడు. ఐఐటీ రామయ్య, సూపర్ థర్టీ ఆనంద్ కుమార్ల నుంచి స్ఫూర్తి పొందాడు. వెనుకబడిన ప్రాంతాలకు ఏదైనా చేయాలనే ఆలోచన అక్కడే మొదలైంది. కెమిస్ట్రీ లెక్చరర్ చకిలం రేణుకతో వివాహమైన అనంతరం ‘సంకల్ప్’ స్థాపనకు బీజం పడింది. ► ర్యాంకులకు సూచిక భావిభారతానికి సేవ చేయాలనే లక్ష్యంతో తన శిష్యులను డాక్టర్లు, ఇంజినీర్లుగా.. సమాజానికి ఉపయోగపడే ఉన్నతాశయాలు కలిగినవారిగా తయారు చేస్తున్నాడు వంశీ. ప్రతీ పురుషుడి విజయం వెనుక ఓ సీ్త్ర ఉంటుందనే నానుడిని నిజం చేస్తున్నారు ఆయన భార్య రేణుక. కెమిస్ట్రీ బోధకురాలైన ఆమె ‘సంకల్ప్’కు డెరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. అయితే ‘సంకల్ప్’ ఘనత తమతో పాటు సహోపాధ్యాయులది కూడా అంటున్నాడు వంశీకృష్ణ. అందరి సమష్టికృషితోనే ఘనమైన ఫలితాలు సాధిస్తున్నామంటున్నాడు. ఆయన వద్ద చదివిన చాలామంది విద్యార్థులు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన కంపెనీల్లో రూ. లక్షల్లో గడిస్తున్నారు. ఎంతోమంది ఇంజినీర్లు, డాక్టర్లుగానే కాకుండా ఐఏఎస్, ఐపీఎస్లుగా కూడా స్థిరపడ్డారు. ఈ ఏడాది ప్రణతిరెడ్డి అనే విద్యార్థిని నీట్ ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరిలో 45వ ర్యాంకు సాధించడం ‘సంకల్ప్’ సాధనకు గీటురాయిగా నిలిచింది. పదుల సంఖ్యలో ఐఐటీ, మెడికల్ సీట్లు సాధించడం గర్వకారణమైంది. తమ సంస్థలో ఏటా పది మందికి ఉచితంగా శిక్షణ ఇవ్వడమేగాక కార్పొరేట్ కళాశాలలో చదివిస్తున్నాడు వంశీకృష్ణ. భవిష్యత్తులో అనాథ పిల్లలకు శిక్షణను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమంటున్నారాయన. క్రమశిక్షణ నేర్పుతున్నారు నా కుమారుడు శ్రీనందన్రెడ్డి, కుమార్తె హర్షిత సంకల్ప్లో చదివారు. బేసిక్స్తో పాటు పోటీప్రపంచానికి తగ్గట్టు తీర్చిదిద్దారు. ప్రాబ్లం సాల్వింగ్తో పాటు క్రమశిక్షణ నేర్పారు. దీంతో ఇంటర్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ సులభమైంది. శ్రీనందన్ 2019 ఆల్ ఇండియా నీట్లో 42వ ర్యాంకు సాధించారు. హర్షిత కూడా మంచి ర్యాంకు సాధించింది. – ఎ.ప్రసూన, ప్రొఫెసర్, హోమియో మెడికల్ కళాశాల సెల్ఫ్ లెర్నింగ్ అత్యావశ్యకం ఐఐటీల్లో ఇంజినీరింగ్ చేసే విద్యార్థులకు సెల్ఫ్ లెర్నింగ్ చాలా అవసరం. వారిని అందుకు అనుగుణంగా సిద్ధం చేస్తున్నాం. మాస్టర్ టాస్క్ ఇచ్చి అదే పద్ధతుల్లో ప్రశ్నలు క్రియేట్ చేయమని చెబుతాం. ఇష్టంలో కష్టపడే వాతావరణం ఉండేలా చూస్తాం. – వంశీ, సంకల్ప్ సంస్థ సీమవాసుల అదృష్టం కడపలో ఇన్స్టిట్యూట్ పెట్టడం జిల్లావారికే కాదు సీమవాసులకు సైతం అదృష్టంగా మారింది. విద్యార్థులు బరువుగా కాకుండా, బాధ్యతగా చదువుకోవడాన్ని నేర్పి స్తున్నారు. దీంతో మావాడు కేవీపీఐ, మ్యాథ్స్ ఒలింపియాడ్, తదితర పరీక్షల్లో సైతం రాణించాడు. ఐఐటీలో 280 ర్యాంకుతో ఖరగ్ పూర్లో సీటు సాధించాడు. అమెజాన్లో సీనియర్స్ విభాగంలో ఇంటర్న్షిప్ సాధించాడు. – చంద్రశేఖర్రెడ్డి, ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు మామయ్య సలహాతో.. వంశీకృష్ణ మేనమామ రాజకీయ, సామాజిక అంశాల విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్. సంకల్ప్ స్థాపించాలనే తన ఆలోచనను ఆయనకు వివరించారు. వెనుకబడిన ప్రాంతాలకు ఉప యోగపడేలా సంస్థ ఉండాలని, రాయలసీమ అందుకు అనుగుణంగా ఉంటుందని నాగేశ్వర్ సలహా ఇచ్చారు. దీంతో రాయలసీమ నడిబొడ్డునున్న కడపలో సంస్థ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. -
యూనివర్సిటీలు సామాజిక బాధ్యత పెంచే కేంద్రాలు
సాక్షి, విశాఖపట్నం: విశ్వవిద్యాలయాలు జ్ఞానాన్ని పెంచడమే కాకుండా విద్యార్థుల్లో సామాజిక బాధ్యతను పెంచే కేంద్రాలుగా నిలుస్తున్నాయని ఏపీ గవర్నర్ జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్ అన్నారు. ఏయూ కట్టమంచి రామలింగారెడ్డి కాన్వొకేషన్ హాల్లో శనివారం నిర్వహించిన ఆంధ్ర విశ్వ విద్యాలయం స్నాతకోత్సవానికి చాన్స్లర్ హోదాలో గవర్నర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పరిశ్రమలు–శాస్త్ర రంగంలో జీఎంఆర్ అధినేత గ్రంథి మల్లికార్జున, అవంతి ఫీడ్స్ సంస్థ ఎండీ అల్లూరి ఇంద్రకుమార్, సాహిత్యం–కళా రంగాలలో ఎస్వీ యూనివర్సిటీ పూర్వ ఉపకులపతి ఆచార్య కొలకలూరి ఇనాక్లకు గౌరవ డాక్టరేట్లను గవర్నర్ అందించారు. 690 మంది డాక్టరేట్లను, 600 మంది మెడల్స్ను అందుకున్నారు. ఈ సందర్భంగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య హాస్టల్, భారత్–ది జీ20 ప్రెసిడెన్షియల్ హాస్టల్, శతాబ్ది క్లాసిక్ హాస్టల్ భవనాల్ని గవర్నర్ ప్రారంభించారు. అనంతరం గవర్నర్ నజీర్ మాట్లాడుతూ.. జ్ఞానం అంతఃదృష్టి కలిగి ఉండాలని, దానికి నైతికత జోడిస్తేనే విలువ ద్విగుణీకృతమవుతుందని వ్యాఖ్యానించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉన్నత విద్య జ్ఞాననిధిగా మారిందని.. దేశంలోని అత్యంత పురాతన విశ్వవిద్యాలయాలలో ఒకటిగా నిలుస్తోందని అన్నారు. శతాబ్ది ఉత్సవాలకు సిద్ధమవుతున్న ఈ విశ్వవిద్యాలయం సర్ సీఆర్ రెడ్డి, సర్వేపల్లి, డాక్టర్ వీఎస్ కృష్ణ వంటి వారి సారథ్యంలో ఎంతో ప్రగతి సాధించిందని కొనియాడారు. ఏయూ అమలు చేస్తున్న నూతన విధానాలను ఇతర విశ్వవిద్యాలయాలు సైతం అమలు చేస్తే ప్రతిభ కలిగిన యువతను దేశంలో స్థిరపడే విధంగా చేయడం సాధ్యమన్నారు. నాక్లో ప్రతిసారి అత్యుత్తమ గ్రేడ్ సాధించడం శుభపరిణామమని అభినందించారు. ఏయూ తెలుగు ప్రజలందరిదీ: బొత్స రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగు ప్రజలందరిదీ అన్నారు. విద్యావ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని.. విద్య కోసం ఏ రాష్ట్రం చేయనంత ఖర్చు చేస్తున్నామని వివరించారు. ప్రతి పేద విద్యార్థికి నాణ్యమైన విద్య, నైపుణ్యాలు అందించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని తెలిపారు. ఏయూ వీసీ పీవీజీడీ ప్రసాదరెడ్డి మాట్లాడుతూ.. సమగ్రాభివృద్ధి, విద్యా నైపుణ్యం దిశగా ఏయూ అడుగులు వేస్తోందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దార్శనికతకు అనుగుణంగా ఇంజినీరింగ్, సైన్స్, ఫార్మసీ రంగాల్లో ఆవిష్కరణలు జరిపే సౌలభ్యంతో కూడిన మౌలిక వసతులు కలి్పస్తూ ప్రోటో టైప్, కమర్షియలైజేషన్ దిశగా నడిపిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నెలకొలి్పన నాస్కామ్ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ 17 స్టార్టప్స్కు స్థానం కలి్పంచిందన్నారు. ఏయూ పరిశోధన, మౌలిక వసతుల అభివృద్ధికి ఉపయుక్తంగా 54 ఎంఓయూలు చేసుకున్నట్టు చెప్పారు. ఏయూ రిజిస్ట్రార్ కృష్ణమోహన్, వివిధ విభాగాధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
నేడు జగనన్న విద్యా దీవెన సాయం
సాక్షి, అమరావతి/సాక్షి చిత్తూరు: జగనన్న విద్యాదీవెన పథకంలో భాగంగా ఏప్రిల్–జూన్ 2023 త్రైమాసికానికి సంబంధించి 9,32,235 మంది విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ను సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విడుదల చేయనున్నారు. చిత్తూరు జిల్లా నగరిలో బటన్ నొక్కి రూ.680.44 కోట్లను 8,44,336 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా జమచేయనున్నారు. ఇదే సందర్భంలో నగరిలో సుమారు రూ.31 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారం¿ోత్సవం, శంకుస్థాపనలు చేయనున్నారు. పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందించే లక్ష్యంతో ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సుల నిమిత్తం ఆయా కళాశాలలకు చెల్లించే ఫీజుల మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తోంది. హాస్టళ్లలో ఉంటూ చదువుకునే విద్యార్థులు భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బందిపడకుండా ఏటా రెండు వాయిదాల్లో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున ఆరి్థక సాయం చేస్తోంది. తాజాగా విడుదల చేస్తున్న సాయంతో పాటు ఇప్పటివరకు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.15,593 కోట్లు ఖర్చుచేసింది. మొత్తం మీద నాలుగేళ్లలో విద్యారంగంపై వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.69,289 కోట్లు ఖర్చుపెట్టింది. -
భవిష్యత్తునిచ్చే విద్యమ్మ!
తల్లి గర్భం దాల్చిన దగ్గర నుంచి బిడ్డ పుట్టేంత వరకు ఎంతో జాగ్రత్తగా ఉంటుంది. బిడ్డ ఆరోగ్యంగా పుట్టడం కోసం చేయని ప్రయత్నమంటూ ఉండదు. కానీ దురదృష్టవశాత్తూ కొంతమంది.. జన్యులోపాలతో దివ్యాంగ శిశువులు పుడుతుంటారు. చిన్నదైనా పెద్దదైనా లోపం ఉన్నప్పటికీ తమ పిల్లల్ని ప్రేమగానే చూసుకుంటుంటారు తల్లిదండ్రులు. కానీ అన్ని అవయవాలు సరిగా ఉన్న పిల్లలు ప్రయోజకులు కాకపోతే భారంగా అనిపిస్తారు తల్లిదండ్రులకు. అటువంటిది మానసిక శారీరక లోపాలున్న పిల్లలు జీవితాంతం భారమే. ఇక ఆడపిల్లల పరిస్థితి మరింత దారుణం. వీరి కనీస అవసరాలు తీరాలన్నా ఇబ్బందే. అలాగ పేరెంట్స్కు భారమైన అమ్మాయిలను తల్లిలా లాలిస్తోంది విద్యఫడ్కే. దివ్యాంగ అమ్మాయిల కోసం ఏకంగా ఒక హోమ్ను ఏర్పాటు చేసి ఆత్మీయతానురాగాలను పంచుతోంది విద్య. విద్యా ఫడ్కే నాసిక్లోని దివ్యాంగ ప్రత్యేక ప్రత్యేక పాఠశాలలో హెచ్ఎంగా పనిచేస్తోంది. 32 ఏళ్లుగా దివ్యాంగ బాలబాలికలకు చదువు నేర్పిస్తోన్న విద్య.. తన వృత్తిలో భాగంగా తరచూ ఆయా పిల్లల తల్లిదండ్రులను కలుస్తుండేది. తమ పిల్లల భవిష్యత్పై ఆందోళన చెందుతోన్న ఆ తల్లిదండ్రులు... తమ తర్వాత ఈ పిల్లల పరిస్థితి ఏంటి... భవిష్యత్ ఏమవుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తుండేవారు. వసతి సదుపాయాలే గాక, అమ్మాయిల భద్రత గురించి కూడా వారు దిగులుపడుతుండేవారు. పదేపదే వారి బాధలు విన్న విద్యకు ఆ పిల్లలకోసం ఏదైనా చేయాలనిపించింది. ఈ క్రమంలోనే వారికి చదువుతోపాటు, వివిధ రకాల నైపుణ్యాలు నేర్పించి ఆనందం గా ఉంచే ఒక హోమ్ వంటిది ఉంటే బావుంటుందన్న ఆలోచన వచ్చింది. నలుగురితో... దివ్యాంగ పిల్లలకు మంచి హోం ఉంటే బావుంటుంది కానీ వారు దానిలో ఆనందంగా ఉండగలుగుతారా! అనే అనుమానం వచ్చింది విద్యకు. దీంతో ఓ నలుగురు అమ్మాయిలకోసం ప్రత్యేకంగా క్యాంప్ ఏర్పాటు చేసింది. ఈ క్యాంప్లో భాగంగా నలుగురు అమ్మాయిలను నెలరోజులపాటు చూసుకుంది. నెలరోజుల తరువాత వారు ఇంటికి వెళ్లడానికి విముఖత చూపడమేగాక అక్కడే ఉండడానికి ఇష్టపడ్డారు. దీంతో 2016లో కొంతమంది దాతల సాయంతో నాసిక్లోని పింపల్గావ్ బాహులలో ‘ఘర్కుల్ పరివార్’ పేరిట హోంను ప్రారంభించింది. దివ్యాంగ అమ్మాయిలు, మహిళల కోసం రాష్ట్రంలో ఏర్పాటు చేసిన తొలి హోం అదే కావడంతో మహారాష్ట్ర నలుమూల నుంచి అమ్మాయిలు ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారు. ఇక్కడ వీరిని ఎంతో ప్రేమగా చూసుకుంటారు. ఈ హోమ్ను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మాత్రమే ఇచ్చింది కానీ, ఏవిధమైన నిధులూ మంజూరు చేయలేదు. అయినా, దాతలు ఇచ్చే విరాళాలమీదే విద్య దీనిని నడిపిస్తోంది. యాక్టివ్గా ఉంచేందుకు... హోమ్లోని పిల్లల్ని మానసికంగా శారీరకంగా దృఢంగా ఉంచేందుకు మెడిసినల్ వాటర్తో స్నానం చేయించడం, ఆరోగ్యవంతమైన అల్ఫాహారం, వివిధ నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వడం, వివిధ థెరపీల్లో భాగంగా సింగింగ్, డ్యాన్స్, యోగాలు రోజువారి దినచర్యలో భాగం. ఇవేగాక రోజువారి పనుల్లో అనేక కొత్త విషయాలను కూడా నేర్పిస్తున్నారు. వంటలో సాయం చేయడం, కూరగాయలు తరగడం, చపాతీ పిండి కలపడం వంటి వాటిని చేయిస్తున్నారు. వీరిలో కొంతమంది పెన్నులు తయారు చేయడం, డెకరేషన్ ఐటమ్స్ రూపొందిస్తున్నారు. మసాలా తయారీ, కుట్టు మిషన్, క్యాండిల్స్ తయారీ వంటి వాటిని నేర్పిస్తున్నారు. ఈ హోంలోని అమ్మాయిలంతా కలిసి రోజుకి ఎనిమిదివేల బాల్పెన్స్ను అసెంబుల్చేస్తున్నారు. వీరిలో కొంతమందికి ఎలా బిహేవ్ చేయాలన్న దానిపై కూడా తరచు శిక్షణ ఇచ్చి మంచి çనడవడికను నేర్పిస్తున్నారు. కష్టమైనా... ఇష్టంగానే! ‘‘మానసిక స్థితిగతులు సరిగా లేనివారు ఒక్కసారి చెబితే అర్థం చేసుకోరు. వారికి నేర్పించడానికి ఒకటికి పదిసార్లు చెప్పాల్సి ఉంటుంది. ఇది కష్టమే, కొన్నిసార్లు విసుగు కూడా వస్తుంది. కానీ మనమే విసుక్కుంటే వాళ్లకు తెలియదు. అందువల్ల మా కేర్ గివర్స్ ఎంతో సహనంతో వారికి నేర్పింస్తుంటారు. రెండేళ్ల కరోనా కాలమ్లో బాగా కష్టంగా అనిపించింది. కరోనా సమయంలో ఎక్కువమంది అమ్మాయిల ప్రవర్తనకు ఇబ్బందులకు గురై మమ్మల్ని ఆశ్రయించారు. ఆ సమయంలో హోమ్లో లేని పిల్లలకు ఆన్లైన్ ద్వారా బోధించాం. సరిగా మాటలు కూడా రాకుండా ఇక్కడకు వచ్చిన అమ్మాయిలు ఇప్పుడు చక్కగా పాటలు పాడడం, డ్యాన్స్ చేయడంతోపాటు పద్యాలు కూడా రాస్తున్నారు. మా సంస్థ తరపున అదితి అనే అమ్మాయి సింగపూర్లో జరిగే కాంపిటీషన్లో పాల్గొని బంగారు పతకాన్ని గెలుచుకుంది. ఈ అమ్మాయి ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉండడమేగాక, సంస్థలో ఉన్న మరికొంతమంది అమ్మాయిలకు సింగింగ్, డ్యాన్స్ నేర్పిస్తుంది’ అని విద్యఫడ్కే వివరించారు. -
Vidya: చిన్న ఉద్యోగం ఎందుకు చేయాలి.. నేనే ఉద్యోగం ఇస్తాను..
ఎం.ఎస్.సి డిజిటల్ సొసైటీ కోర్స్లో గోల్డ్ మెడలిస్ట్ ఆమె. కాని ఆమె ఫ్రెండ్స్ అందరికీ క్యాంపస్ సెలక్షన్స్లో ఉద్యోగాలు వచ్చాయి. ఆమెకు రాలేదు. ‘మీరు చూడగలిగితే బాగుండు’ అన్నారు అంతా. విద్యా పుట్టుకతో అంధురాలు. కాని అందరూ నిరాకరిస్తున్నా మేథమెటిక్స్లో గొప్ప ప్రావీణ్యం సంపాదించింది. ‘నాకు ఉద్యోగం ఇవ్వడం కాదు.. నాలాంటి వారికి నేనే ఉద్యోగాలు కల్పిస్తాను’ అని స్వచ్ఛంద సంస్థను స్థాపించి ఉపాధి చూపిస్తోంది విద్య. ఆమె ఎదుర్కొన్న అడ్డంకులు అన్నీ ఇన్నీ కావు. ఆమె సాధిస్తున్న గెలుపులు కూడా. ‘ప్రపంచంలోని అంధుల జనాభాలో మూడొంతుల మంది భారతదేశంలో ఉన్నారు. వారిలో 70 శాతం మంది పల్లెల నుంచే ఉన్నారు. మన దేశంలో అంధ బాల బాలికల్లో 68 శాతమే చదువుకోవడానికి వెళుతున్నారు. వీరిలో మళ్లీ మేథ్స్, సైన్స్ వంటివి తీసుకోవడానికి స్కూల్స్ అంగీకరించవు. సాధారణ కోర్సులే వీళ్లు చదవాలి. ఏం? ఎందుకు వీళ్లు మేథ్స్ చదవకూడదు?’ అంటుంది విద్య. బెంగళూరుకు చెందిన ఈ పాతికేళ్ల అమ్మాయి ఎం.ఎస్.సిలో గోల్డ్ మెడల్ సాధించి ఇప్పుడు ‘విజన్ ఎంపవర్’ అనే సంస్థ స్థాపించి దేశంలోని అంధ విద్యార్థినీ విద్యార్థులకు మేథ్స్, సైన్స్ చదవడంలో మెటీరియల్ తయారు చేస్తోంది. వారి కోసం ట్యూషన్లు, క్లాసులు ఏర్పాటు చేస్తుంది. వారికై పని చేసే అంధ టీచర్లనే సిద్ధం చేస్తోంది. ఒకప్పుడు ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించారు విద్యకు. కాని ఇప్పుడు విద్యే తన సంస్థ ద్వారా అంధ విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. ప్రిమెచ్యూర్ రెటినోపతి విద్య బెంగళూరు సమీపంలోని పల్లెటూరిలో పుట్టింది. సాధారణ జననమే. కాని పుట్టాక మూడు నెలలు ఇంక్యుబేటర్లో పెట్టాల్సి వచ్చింది. ఆ సమయంలో ప్రిమెచ్యూర్ రెటినోపతి వల్ల ఆమె రెండు కళ్లకూ చూపు పోయింది. ప్రపంచ సాక్షరతా దినోత్సవం రోజు పుట్టడం వల్ల, ఆమెకు వైద్యం చేసిన డాక్టర్ ‘పాపకు ఎలాగూ కళ్లు రావు. కాని బాగా చదివిస్తే తన కాళ్ల మీద తాను నిలబడుతుంది’ అని సలహా ఇవ్వడం వల్ల తల్లిదండ్రులు ‘విద్య’ అని పేరు పెట్టారు. ‘సాధారణంగా మన దేశంలో జరిగే తప్పేమిటంటే అంధ పిల్లలకు భవిష్యత్తు ఉండదని వారిని బడికి పంపరు పల్లెటూళ్లలో. నా అదృష్టం నా తల్లిదండ్రులు నన్ను బెంగళూరులోని ఒక మిషనరీ స్కూల్లో 7 ఏళ్ల వయసులో వేశారు. అక్కడే నేను 7 వ క్లాస్ వరకూ స్పెషల్ స్టూడెంట్గా చదువుకున్నాను. కాని అసలు సమస్య నా 8 వ తరగతి నుంచి అందరిలాగే మామూలు బడిలో చదువుకునే సమయంలో మొదలైంది‘ అంటుంది విద్య. లెక్కల పిచ్చి విద్యకు చిన్నప్పటి నుంచి లెక్కల పిచ్చి. ఇంట్లో చేటలో తల్లి బియ్యం పోసిస్తే ప్రతి గింజను లెక్క పెట్టేది. బియ్యం ఏమిటి... ఆవాలు పోసిచ్చినా ప్రతి ఆవాల గింజను లెక్క పెట్టేది. తల్లిదండ్రులు ఆమె లెక్కల ఇష్టాన్ని గమనించారు. కాని హైస్కూల్లో లెక్కలు చదవడం ఆమెకు కష్టమైంది. క్లాసులన్నీ బోర్డు మీద రాతలతో ఉంటాయి. మేథమెటికల్ సింబల్స్ ఉంటాయి. డయాగ్రామ్స్ ఉంటాయి. వీటిని చూడకుండా అర్థం చేసుకోవడం అసాధ్యం. కాని విద్య పట్టుదలగా వాటిని తెలుసుకోవడానికి ప్రయత్నించేంది. ‘నేను చేయాల్సింది మరిన్ని గంటలు కష్టపడటమే అని అర్థం చేసుకున్నాను. ఉదయం నాలుగున్నరకు లేచి చదివేదాన్ని’ అంటుంది విద్య. డిగ్రీలో మేథ్స్, కంప్యూటర్ సైన్స్ తీసుకుని కంప్యూటర్లో ఆడియో మెటీరియల్ ద్వారా వీలైనంత చదువుకుంటూ పాస్ అయ్యింది. ఆ తర్వాత బెంగళూరులో ప్రతిష్టాత్మకమైన ట్రిపుల్ ఐటిలో ఎంఎస్సీ డిజిటల్ సొసైటీ కోర్సును టాపర్గా పాసైంది. ‘నా చదువుంతా నా ప్రయోగమే. నేను గణితాన్ని అర్థం చేసుకోవడానికి పడిన తపన, కష్టమే నా చదువు. ట్రిపుల్ ఐటి నుంచి మేథమేటిక్స్ ఆధారిత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన తొలి స్టూడెంట్ని నేనే’ అంటుంది విద్య. అందరి కోసం విద్యకు ఉద్యోగం ఇవ్వడానికి కంపెనీలు నిరాకరించాయి ఆమె అంధత్వం వల్ల. చాలా కంపెనీలు దయతలిచి కాల్సెంటర్ ఆపరేటర్ ఉద్యోగాన్ని ఆఫర్ చేశాయి. ఇంత మేధ పెట్టుకుని చిన్న ఉద్యోగం ఎందుకు చేయాలి అనుకుంది విద్య. అసలు అంధులు అన్ని విధాలా మేథ్స్, కంప్యూటర్స్ చదివి పెద్ద ఉద్యోగాలు చేసేలా వారిని తయారు చేస్తాను అని ఉద్యోగప్రయత్నాలు మాని తానే ఉద్యోగాలు చూపే ‘విజన్ ఎంపవర్’ అనే సంస్థను బెంగళూరులో స్థాపించింది. నాలుగేళ్లుగా ఈ సంస్థ తన కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అంధ విద్యార్థులకు బాసటగా నిలుస్తోంది. అంతేకాదు ప్రస్తుతానికి కర్నాటకలోని అంధ విద్యార్థులను ప్రపంచ అంధ విద్యార్థులతో, విద్యా సంస్థలతో అనుసంధానం చేస్తోంది. విద్య చేస్తున్న ఈ పనిని సమాజం గుర్తిస్తోంది. ఆమెను పిలిచి స్ఫూర్తివంతమైన ప్రసంగాలను వింటోంది. ‘అప్పుడే ఏమైంది. ఇది మొదలు మాత్రమే. చేయాల్సింది చాలా ఉంది’ అంటోంది విద్య. చాలా కంపెనీలు దయతలిచి కాల్సెంటర్ ఆపరేటర్ ఉద్యోగాన్ని ఆఫర్ చేశాయి. ఇంత మేధ పెట్టుకుని చిన్న ఉద్యోగం ఎందుకు చేయాలి అనుకుంది విద్య. అసలు అంధులు అన్ని విధాలా మేథ్స్, కంప్యూటర్స్ చదివి పెద్ద ఉద్యోగాలు చేసేలా వారిని తయారు చేస్తాను అని ఉద్యోగ ప్రయత్నాలు మాని తానే ఉద్యోగాలు చూపే సంస్థను స్థాపించింది. -
Vidya Iyer: వాయిస్ ఆఫ్ విద్య
భారతదేశంలో పుట్టింది. పెరిగిందేమో అమెరికాలో. డాక్టర్ అవ్వాలనుకుంది, కానీ అనుకోకుండా మంచి సింగర్గా మారింది. ఒక దేశంలో పుట్టి మరో దేశంలో పెరిగినప్పటికి.. దేశీయ సంప్రదాయ సంగీతాన్ని వెస్ట్రన్ మ్యూజిక్తో కలిపి, వీటికి తన సృజనాత్మకతను జోడించి సరికొత్త మ్యాషప్ సాంగ్స్తో ప్రపంచ వ్యాప్త వ్యూవర్స్ను ఉర్రూతలూగిస్తోంది విద్యా అయ్యర్. విద్యా అయ్యర్ భారత సంతతికి చెందిన అమెరికన్ పాపులర్ మ్యాషప్సాంగ్స్ సింగర్. చెన్నైలో పుట్టిన విద్య, తల్లిదండ్రులు వృత్తిరీత్యా అమెరికాలోని వర్జీనియాకు మకాం మార్చడంతో చిన్నతనంలోనే అక్కడికి వెళ్లింది. అక్కడే పెరిగిన విద్య బీఎస్సీ (సైకాలజీ, బయోమెడికల్ సైన్స్) డిగ్రీ చేసింది. తరువాత మెడిసిన్ చదివేందుకు ఎమ్క్యాట్ (మెడికల్ కాలేజ్ అడ్మిషన్ టెస్ట్)కు సన్నద్ధ మవుతున్న సమయంలో తన స్నేహితుడు శంకర్ టక్కర్ ఓ యూట్యూబ్ చానల్ నిర్వహించేవాడు. విద్య చిన్నప్పుడు కర్ణాటక శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకున్నట్లు తెలుసుకున్న టక్కర్ తన యూట్యూబ్ చానల్కోసం పాటలు పాడమని అడగడంతో వీకెండ్స్లో విద్య పాటలు పాడేది. విద్య గొంతు వినసొంపుగా సుమధురంగా ఉండడంతో టక్కర్ నిర్వహించే వివిధ కన్సర్ట్లలో పాల్గొని పాటలు పాడేది. విద్య గాత్రం ఎక్కువ మంది శ్రోతల్ని ఆకట్టుకోవడంతో టక్కర్.. విద్యను ‘‘నువ్వు కూడా ఒక యూట్యూబ్ చానల్ను ప్రారంభించు’’ అని చెప్పడంతో తన గొంతుకు వస్తున్న ఆదరణను చూసిన విద్య సంగీతాన్నే కెరియర్గా మలుచుకోవాలనుకుంది. విద్యా వోక్స్... మెడిసిన్ చదివేందుకు ప్రిపేర్ అవుతోన్న విద్య ఒక్కసారిగా తన ఆలోచన మార్చుకుని మ్యూజిక్ను కెరియర్గా ఎంచుకుంటానంటే తల్లిదండ్రులు మొదట్లో ఒప్పుకోలేదు. ‘‘రెండేళ్లు సమయం ఇస్తా. నిన్ను నువ్వు నిరూపించుకోగలిగితే ఒకే, లేదంటే... తిరిగి మెడిసిన్ చదవాలి’’ అని అమ్మ కండిషన్ పెట్టింది. అమ్మమాటను ఒప్పుకుని 2013లో ముంబై వచ్చి సంగీతంలో మరిన్ని మెళకువలు నేర్చుకుంది. రెండేళ్లపాటు ఇక్కడే ఉండి కర్ణాటక, హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం, వెస్ట్రన్ వాయిస్ పాఠాలను నేర్చుకుని తిరిగి 2015లో ఆమెరికా వచ్చేసింది. ఇదే ఏడాది ఏప్రిల్లో ‘విద్యావోక్స్’ పేరిట యూట్యూబ్ చానల్ను ప్రారంభించింది. ‘వోక్స్’ అంటే లాటిన్లో వాయిస్ అని అర్థం. మ్యాషప్ సాంగ్స్... సమకాలీన, సంప్రదాయమైన పాటలకు వెస్ట్రన్ సంగీతాన్ని జోడించి సరికొత్త పాటలను విద్యావోక్స్లో అప్లోడ్ చేసేది. ‘బిగ్ గార్ల్స్ క్రై’, ‘కభీ జో బాదల్ బర్సే’ మ్యాషప్ పాటలను అప్లోడ్ చేసింది. ‘మ్యాడ్ డ్రీమ్స్’ ‘కుథు ఫైర్’ సాంగ్స్ విద్యకు బాగా పాపులారిటీని తెచ్చిపెట్టాయి. విద్యకు బాగా పేరు వచ్చిన వాటిలో ‘‘లవ్ మీ లైక్ యూ డు, కబీరా–క్లోజర్, లీన్ ఆన్, జింద్ మహి, వుయ్ డోంట్ టాక్ ఎనీమోర్, పానీ ద ర్యాంగ్, కుట్టునందన్ పుంజయితే’’లు ఉన్నాయి. వెస్ట్రన్ పాప్ హిట్ సాంగ్స్కు భారతీయ సంగీతానికి జోడించి మ్యూజిక్ వీడియోలను రూపొందిస్తూ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. విద్య తనే పాటలు రాయడం, స్వయంగా కంపోజ్ చేసి, సొంత బ్యాండ్తో ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష షోలు కూడా నిర్వహిస్తోంది. ఇప్పటిదాకా ఇండియా, మారిషస్, ట్రినిడాడ్, సురనామ్, దుబాయ్, హాంగ్కాంగ్, అమెరికాలలో లైవ్షోలు నిర్వహించి శోతల్ని తన సుమధుర గానం, మ్యాషప్ పాటలతో ఆలరించింది. టక్కర్తో ప్రారంభించిన తన మ్యూజిక్ జర్నీ ఇప్పటికీ అతని సలహాలు, సూచనలతో కొనసాగడం విశేషం. కెమెరా, ఎడిటింగ్, డైరెక్షన్లలో సాయం చేస్తూ విద్యను ముందుండి నడిపిస్తున్నాడు. విద్య తల్లి, చెల్లి కూడా తనని ప్రోత్సహించడంతో ఆమె చానల్ ప్రస్తుతం 7.41 మిలియన్ల (దాదాపు డెభైఐదు లక్షలు) మంది సబ్స్క్రైబర్స్తో దూసుకుపోతోంది. మనం ఎంచుకున్న రంగం ఏదైనా విభిన్నంగా ఆలోచిస్తూ, కష్టపడి ముందుకు సాగితే ఉన్నతస్థాయికి ఎదగవచ్చు అనడానికి విద్య గొప్ప ఉదాహరణ. ఆమె ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తోంది. -
అలా అయితే ఆదాయానికి లోటు ఉండదని నిరూపించింది!
కరోనాతో దెబ్బకు వ్యాపారాలు దెబ్బ తిన్నాయి... అయితేనేం వెంటనే తేరుకున్నాయి. సాంకేతిక విజ్ఞానంతో స్టార్టప్లు డిజిటల్ సేవలు అందించాయి. ఎంబిఏ చేసిన విద్యా వెంకటరామన్ మెరకి అండ్ కో స్థాపించారు. విస్తృతంగా సేవలు అందించారు. ఏడాది కాలంలోనే ఉన్నత శిఖరాలు అధిరోహించారు... విద్యా వెంకట్రామన్ వ్యాపార ప్రయాణం..విద్యా వెంకటరామన్ సెయింట్ మేరీస్ స్కూల్లో చదువు పూర్తి చేశాక, ఎస్ఐఈఎస్ కాలేజీ ఆఫ్ ఆర్ట్స్ సైన్స్ అండ్ కామర్స్ ఫర్ మేనేజ్మెంట్ స్టడీస్లో చేరారు. ఆ తరవాత ఐబిఎస్ బెంగళూరులో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. విద్యా వెంకటరామన్... మార్క్యూ ఆర్గనైజేషన్స్ అయిన ప్రాక్టో, ఇండియా బుల్స్ సంస్థల ప్రేరణతో మెరకీ అండ్ కో స్థాపించి, ఎల్లో టై హాస్పిటాలిటీ, ఫ్యాషన్ టీవీలలో వారికి కావలసిన సేవలు అందచేశారు. సమయాన్ని అనుకూలంగా... కరోనా లాక్డౌన్ కారణంగా ప్రపంచమంతా ఇంటికే పరిమితమైపోయింది. ఆధునిక సాంకేతికతతో అందరూ ప్రపంచంతో కనెక్ట్ అయ్యారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న చందాన విద్యా వెంకటరామన్ ఈ అవకాశాన్ని తన మార్కెట్ పెంచుకోవటానికి అనువుగా ఆలోచన చేశారు. వినియోగదారులకు ఆరు రకాల సర్వీసులు ప్రారంభించి, ఆ సంఖ్యను పదిహేనుకి పెంచి, 50 రకాల ఉత్పత్తులను తమ సేవల ద్వారా అందించటం ప్రారంభించారు. ఆమెకు 15 మంది సభ్యుల బృందం తోడుగా నిలిచింది. ఇవే ఆ సూత్రాలు.. నాలుగు సూత్రాల ఆధారంగా మెరకి అండ్ కో వివిధ అంశాలలో సేవలను అందించటం ప్రారంభించింది. ‘అవగతం చేసుకో, సృష్టించు, ఉల్లాస పరచు, ఫలితం సాధించు’ అనేవే ఈ సంస్థ పాటించిన సూత్రాలు. మొదట వినియోగదారులు చెప్పే ప్రతి మాటను వింటారు. చెప్పిన దానిని అర్థం చేసుకుంటారు. ఆ అంశం మీద అవగాహన ఏర్పరచుకుని పరిష్కారం చూపిస్తారు. వినియోగదారునికి సృజనాత్మకమైన రీతిలో దగ్గరైతే ఫలితాలు నాణ్యంగా ఉంటాయని నిరూపించారు మెరకి అండ్ కో ద్వారా విద్యా వెంకట్రామన్. ఈ స్టార్టప్.. సోషల్ మీడియా, ఇన్ఫ్లుయెన్సర్, ఇ మెయిల్, ఎస్ఎమ్ఎస్ రీతులను తనకు ఆలంబనగా చేసుకుంది. వెబ్సైట్, గ్రాఫిక్ డిజైన్ నుంచి బ్రాండింగ్ వరకు, ఫొటో షూట్స్, షూటింగ్స్, వీడియో షూట్స్, బ్లాగింగ్, కంటెంట్ రైటింగ్ ఇలా ఒకటేమిటి పబ్లిక్ రిలేషన్స్కు సంబంధించిన అంశాలన్నిటినీ మార్కెటింగ్లో భాగం చేసుకున్నారు. ఇదే ప్రత్యేకత... ఒక బ్రాండ్ను ప్రచారం చేసి, ఆ బ్రాండ్ విస్తృతి పెంచడం నుంచి అన్ని రకాల మార్కెటింగ్ ప్రచారాలను నిర్వహించడం మెరకి అండ్ కో ప్రత్యేకతగా మార్చుకున్నారు. ఒక సంస్థకు ఏ ప్లాట్ఫామ్ అయినా సరే... ప్రచారం కల్పించడం, వినియోగదారుకు సంతృప్తి కలిగించి, ఫలితాన్ని రాబట్టడమే ధ్యేయం. స్టార్టప్స్కు విస్తృతి కల్పించి, బ్రాండ్ బిల్డప్ చేయడానికి ఇదే తగిన సమయమని విద్యా వెంకటరామన్ నమ్మారు. సమగ్రమైన సేవలను సృష్టించి, ఉన్నత శిఖరాలకు చేరడమే ధ్యేయంగా ఎదిగారు. మహిళలే కేంద్రంగా పనిచేస్తున్న సంస్థలు వృత్తిలో ఏకాగ్రతను కనబరుస్తూ ఇతరులకు సాయపడి, వారి వ్యాపారాలను పెంచుకుంటూ, కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. అతి వేగంగా... ఏడాది క్రితం అంటే మే 3, 2020న ప్రారంభమైన విద్యా వెంకటరామన్ చేసిన ప్రయత్నం, ఊహించని సానుకూల ఫలితాలను అందించింది. వ్యాపార సమస్యలకు డిజిటల్ ప్లాట్ఫామ్లో ఆమె పరిష్కారాలను చూపిన తీరు అందరీ ఆకట్టుకుంది. ప్రపంచమంతా పవర్ ఆఫ్ డిజిటలైజేషన్ను అనుభవపూర్వకంగా ఆస్వాదించింది కూడా. ఉరుకులు, పరుగులు తీస్తున్న ప్రపంచం కంటికి కనిపించని చిన్న క్రిమి కారణంగా స్తంభించిన వేళ, ప్రపంచాన్ని డిజిటల్ ప్లాట్ఫామ్ నడిపించింది. యాంత్రిక ఉత్పత్తి రంగం మినహా అన్నీ ఇంటి నుంచే సాగాయి. అవకాశం కోసం ఎదురుచూసేవారు సరైన వేదికను ఎంచుకుంటే ఆదాయానికి లోటుండదని, డిజిటల్ ప్లాట్ఫామ్ను ఆశ్రయించిన వారు దూసుకుపోయారని చెప్పడానికి విద్యా వెంకటరామన్ ఒక మంచి ఉదాహరణ. -
కర్ణవేధ... విద్యారంభం
షోడశ సంస్కారాలలో తొమ్మిదవది కర్ణవేధ: దీనికే కర్ణభేద అనే పేరు కూడా వుంది. అంటే చెవులకు రంధ్రం వేయడం అని అర్థం. వాడుకలో ఈ సంస్కారాన్ని చెవులు కుట్టించడమంటారు. దీనిని శిశువులందరికీ లింగభేదం లేకుండా శిశువుకు ఐదు సంవత్సరాలు నిండేలోపే జరిపించాలని దేవలుడనే మహర్షి బోధించాడు. తాటంకాలు అనగా చెవి తమ్మెలకు రంధ్రం వేసి వాటిని బంగారంతో అలంకరించడం ద్వారా మెదడుకు చైతన్యం కలిగి జ్ఞాపక శక్తి వృద్ధి చెంది శిశువులు చురుకుగా అన్ని రంగాలలో రాణిస్తారని వైద్యశాస్త్రం చెప్తుంది. ఎందుకంటే, జ్ఞాపకశక్తికి సంబంధించిన నాడులు చెవి తమ్మెలలో అంతమౌతాయి. వాటిని నిత్యం బంగారంతో ప్రేరేపించడం ద్వారా అవి ఉత్తేజితమై, జ్ఞాపకశక్తి వృద్ధి చెందుతుంది. పూర్వాశ్రమంలో గురువులు తమ శిష్యులకు గుంజీలు తీసే శిక్ష విధించడంలో పరమార్థం ఇదే. అందుకే గతంలో స్త్రీ పురుష భేదాలు లేకుండా అందరూ చెవులు కుట్టించుకునేవారు. సంస్కార విధానం: శుభముహుర్తాన స్నానాదులను ఆచరించాలి. స్వర్ణశిల్పాచార్యులను పిలిపించి, పూజామందిరం దగ్గర శిశువును కూర్చుండబెట్టి ఆచార్యుల చేత చెవులు కుట్టించాలి. తర్వాత ఆ చెవులను స్వర్ణాభరణాలతో అలంకరించాలి. తదుపరి ఆ చార్యులకు నూతన వస్త్ర దక్షిణ తాంబూలాదులను సమర్పించి వారి ఆశీర్వాదం తీసుకోవాలి. విద్యారంభం: యాజ్ఞవల్క్య స్మృతి తదితర స్మృతులలో ఈ అక్షరాభ్యాసం గురించి కనిపిస్తుంది. దీనికే విద్యారంభం, అక్షర స్వీకారం అని ఇతర పేర్లున్నాయి.. శిశువుకు ఈ సంస్కారాన్ని చూడాకరణం అయిన తర్వాత చేయాలని శాస్త్రం. వేదాధ్యయనంతప్ప ఇతర విద్యలన్నీ కూడా ఈ సంస్కారం అయిన తర్వాతే నేర్చుకోవడం ప్రారంభించాలని సూచించారు. ఒక్క వేదవిద్యమాత్రం, అర్హులైనవారు ఉపనయనం అయిన తరువాతే ప్రారంభించాలి. ఈ సంస్కారాన్ని ఐదు లేదా ఏడవ సంవత్సరంలో చేయాలని శాస్త్రవచనం. శిశువు విద్యలను అభ్యసించడం ద్వారా దినదిన ప్రవర్ధమానమవుతాడని, ఉత్తరాయణంలో ఈ సంస్కారం జరిపించాలని ఒక భాష్యకారుడు సూచించాడు. కొందరు కార్తీక, మార్గశిర మాసాలు కూడా యోగ్యమనే చెప్పారు. పురుష నక్షత్రాలలో, శుభతిథులలో, ఆది, సోమ, బుధ, గురు, శుక్ర వారాలలో జరిపించాలని శాస్త్రం. సంస్కార విధానం: శుభముహుర్తాన, పూజామందిరంవద్ద గణపతి పూజ, పుణ్యహవాచనం పూర్తిచేసిన తర్వాత కలశస్థాపన చేసి, అందులోకి వాగ్దేవిని, గణపతిని, ఇతర దేవతలను ఆవాహనచేసి, సరస్వతీదేవికి విశేషపూజలు జరిపించాలి. గుణవంతుడు, విద్యాప్రపూర్ణుడైన ఒక ఆచార్యుని పిలిపించి ఆయనకు పాదపూజ చేసి వారి ఆశీర్వాదం తీసుకోవాలి. ఆ తర్వాత, ఆ ఆచార్యుడు, ఒక పళ్ళెంలో నిండుగా బియ్యం పోసి, మధ్యలో, ఆ బియ్యం మూడు సమాన భాగాలుగా అయ్యేట్లు ఒక బంగారు వస్తువుతో అడ్డంగా రెండు గీతల్ని గీయాలి. మొదటి భాగంలో ‘ఓం‘ అనీ, రెండవ భాగంలో ‘నమశ్శివాయ’ అనీ, మూడవభాగంలో ‘సిద్ధం నమః‘ అనీ వ్రాయాలి. శిశువును కుడితొడమీద కూర్చోపెట్టుకుని, తండ్రి, ఆ శిశువుచేత ఆ అక్షరాలను మూడుసార్లు దిద్దించాలి. ఆ తర్వాత గణపతికి, సరస్వతికి హవిస్సులర్పించే హోమం చేయాలని కొన్నిచోట్ల ప్రస్తావస్తన కనిపిస్తుంది. – ఆచార్య తియ్యబిండి కామేశ్వరరావు -
ఒక్కసారి కూడా నా తండ్రిని చూడలేదు
సాక్షి, చెన్నై : పుట్టినప్పటి నుంచి తాను తన తండ్రిని చూడలేదని, కేవలం మృతదేహం మాత్రమే కాసేపు చూశానని గందపు చెక్కల దొంగ వీరప్పన్ కుమార్తె విద్యారాణి వీరప్పన్ అన్నారు. ఇటీవల ఆమెకు బీజేపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి దక్కింది. ఈ నేపథ్యంలో విద్యా సోమవారం రాత్రి మీడియాతో మాట్లాడారు. తనకు ఈ పదవి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. తాను చిన్నతనం నుంచి ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నానని తెలిపారు. తనజీవితంలో ఎన్నో చేదు అనుభవాలు, జ్ఞాపకాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమాజం తనను ఓ శత్రువుగానే, ప్రత్యర్ధిగానో చూడలేదన్నారు. మంచితనంతో ఆదరించిన వాళ్లు ఎందరో ఉన్నారని, ఇదే భాగ్యంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. (వీరప్పన్ కుమార్తెకు బీజేపీలో కీలక పదవి) తాను నేర్చుకున్న విద్య, ఉపాధ్యాయుల భోదనలు తన ఎదుగుదలకు ఎంతో దోహద పడ్డాయని విద్యారాణి వివరించారు. తాను చిన్నతనం నుంచి తండ్రిని చూడలేదని, ఆయన గురించి పలువురు మంచితనంతో ఎన్నో మాటలు చెప్పినట్లు గుర్తుచేశారు. ఒక్క రోజు కూడా తన తండ్రిని చూసే సమయం లభించలేదని, ఆయన మృతదేహం మాత్రమే కాసేపు చూశానని పేర్కొన్నారు. జీవచ్చవంగా ఉన్న తన తండ్రిని ఏదో ఆందోళన, ఉరుకులు పరుగులుగా చూసినట్లు చెప్పారు. బీజేపీ ఎదుగుదలకు కృషి చేస్తానని, దేశంలో జాతీయ పార్టీ అంటే ఒక్క బీజేపీ మాత్రమేనని అభిప్రాయపడ్డారు. -
వీరప్పన్ కుమార్తెకు కీలక పదవి
సాక్షి, చెన్నై : ఒకప్పుడు కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలను గడగడలాడించిన గంధపు చెక్కల స్మగ్లర్, అడవి దొంగ వీరప్పన్ కూతురు విద్యా వీరప్పన్కు బీజేపీ కీలక బాధ్యతలను అప్పగించింది. తమిళనాడు యువమోర్చా విభాగం ఉపాధ్యక్షురాలిగా ఆదివారం ఆమెను నియమించింది. వృత్తిరీత్యా న్యాయవాది అయిన విద్య గత పిబ్రవరిలో తన అనుచరులతో కలిసి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. అయితే తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీకి సమయం దగ్గర పడుతున్న తరుణంలో వీరప్పన్ వర్గాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని బీజేపీ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. దీనిలో భాగంగానే విద్యకు రాష్ట్ర స్థాయిలో పదవిని కట్టబెట్టారు. మరోవైపు పాత వీరప్పన్ వర్గాన్ని మొత్తం బీజేపీ వైపుకు తిప్పలా విద్య కీలకంగా వ్యవహరిస్తున్నారు. కాగా గంధపు చెక్కల స్మగ్లర్గా దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందిన వీరప్పన్ 2004లో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన విషయం తెలిసిందే. -
బీజేపీలో చేరిన వీరప్పన్ కూతురు
హోసూరు: ఒకప్పుడు కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలను గడగడలాడించిన గంధపు చెక్కల స్మగ్లర్, అడవి దొంగ వీరప్పన్ కూతురు విద్య తన అనుచరులతో కలిసి బీజేపీలో చేరారు. జిల్లా కేంద్రం క్రిష్ణగిరిలోని ప్రైవేట్ కళ్యాణ మంటపంలో శనివారం జరిగిన కార్యక్రమంలో పార్టీ తమిళనాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరేంద్రన్, పార్టీ కేంద్ర ప్రధాన కార్యదర్శి మురళీధరన్, మాజీ కేంద్ర మంత్రి పొన్ రాధాక్రిష్ణన్ల సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. 2 వేల మంది ఆమె మిత్రులు, అనుచరులు పార్టీలో చేరారు. -
చదువుల తల్లుల తండ్రి
డాడీస్ లిటిల్ గర్ల్... అవును కూతుళ్లెప్పుడూ నాన్నలకు బంగారు తల్లులే! నాన్నలెప్పుడూ బిడ్డలకూ రోల్మోడల్సే! అందుకే నాన్న వేసే ప్రతి అడుగూ జాగ్రత్తగా పడాలి.. పడ్తోంది! అలాంటి తండ్రులు మన దగ్గరే కాదు పాకిస్తాన్లో ఉన్నా.. అఫ్ఘానిస్తాన్లో కనిపించినా సెల్యూట్ చేయాల్సిందే!! మియా ఖాన్ కూడా ఆ వందనం స్వీకరించదగ్గ ఫాదరే!! అమ్మాయిలకు చదువును నిషేధించిన తాలిబన్ ప్రభావం విపరీతంగా ఉన్న అఫ్ఘానిస్తాన్ నివాసి మియా ఖాన్. అక్షరం ముక్క తెలియదు. రోజూవారీ కూలీతో కుటుంబాన్ని పోషిస్తాడు. అతనికి ఏడుగురు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు. మన దగ్గర నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో అమ్మాయిలను చదువు మాన్పించి మైళ్ల దూరంలో ఉన్న బావులు, చెరువులు, కొలనుల నుంచి నీళ్లు మోసుకొచ్చే కొలువులో పెడ్తాం. శారీరక దారుఢ్యం ఉన్న అబ్బాయిలను మాత్రం స్కూళ్లకు పంపుతారు . మియా ఖాన్ ఆ కోవకు చెందిన వాడు కాదు. ఘోషాయే అమ్మాయిల అస్తిత్వంగా ఉన్న దేశంలో తన ఏడుగురు కూతుళ్లకు చదువు చెప్పించి... ఆ ఏడుగురిలో ఒకమ్మాయిని వైద్యసౌకర్యం లేని తన ఊరికి డాక్టర్గా చేయాలని నిర్ణయించుకున్నాడు. కొడుకులను పనికి పంపించి.. ప్రతిరోజు ఉదయం తన బిడ్డలను పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న స్కూల్కి తీసుకెళ్తాడు. బడివేళ అయిపోయే వరకు ఉండి మళ్లీ వాళ్లను ఇంటికి తీసుకొస్తాడు. అనారోగ్యం వల్ల పనికి వెళ్లడం మానేసినప్పటి నుంచి ఇదే అతని దినచర్య అయింది. అంతకుముందు మియా ఖాన్ కొడుకులు తమ చెల్లెళ్లను బడికి తీసుకెళ్లేవారు. ఏడుగురిలో ఒకమ్మాయి అయిన రోజీ ‘‘మా ఊళ్లో చాలామంది అమ్మాయిలకు లేని అవకాశం, అదృష్టం మాకు కలిగింది. ఎందుకంటే మా నాన్న ధైర్యవంతుడు. తన బిడ్డలు చదువుకోవాలి.. చదువుకుంటేనే జీవితం అని తెలిసిన వాడు. మాకూ అదే చెప్తూంటాడు. ఇప్పుడు నేను ఆరవ తరగతిలో ఉన్నాను. డాక్టర్ కావాలనుకుంటున్నాను’’ అని చెప్తుంది గర్వంగా! ‘‘చదువు లేకపోవడం.. రాకపోవడం ఎంత శాపమో నాకు తెలుసు. అందునా ఆడపిల్లలకు అక్షరమే ఆయుధం. నా బిడ్డలు నాలా కాకూడదు. బాగా చదువుకోవాలి. వాళ్ల కాళ్లమీద వాళ్లు నిలబడాలి. నా పిల్లల్ని అంత దూరం స్కూల్కి తీసుకెళ్తుంటే చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు. నా మొండితనం చూసి ఇప్పుడిప్పుడే వెనక్కి తగ్గుతున్నారు’’అంటాడు మియా ఖాన్. అప్పుడు మలాలా.. ఇప్పుడు రోజీ, ఆమె ఆరుగురు అక్కచెల్లెళ్లు. వీళ్లు కదా ఆడపిల్లలకు ధైర్యం! మలాలా తండ్రి.. మియా ఖాన్ వీళ్లు కదా.. ప్రపంచానికి స్ఫూర్తి! -
పుట్టిన చోటుకే ప్లాస్టిక్ చెత్త
మట్టిలో కలిసిపోయేందుకు వందల ఏళ్లు పడుతుందని ప్లాస్టిక్ వినియోగాన్ని ఆపేస్తే... ఈ క్షణమే బతుకు బండి ఆగిపోయేంతగా మనుషులు ప్లాస్టిక్కి అలవాటు పడిపోయారు. అయితే ప్లాస్టిక్ ఏ ఇంధనంలోంచి తయారవుతోందో ఆ ఇంధనంలోకే తిరిగి తీసుకెళ్లడం ద్వారా పర్యావరణానికి పొంచి ఉన్న ముప్పు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు చెన్నైలో ఉంటున్న విద్య. విద్య కామర్స్ గ్రాడ్యుయేట్. వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీ నిర్వహిస్తూ ఉన్నట్లుండి తన ప్రయాణాన్ని వేస్ట్ మేనేజ్మెంట్ వైపు మలుపు తిప్పుకున్నారు. ‘ఎ జర్నీ ఫ్రమ్ వెల్త్ టూ వేస్ట్’ అని నవ్వుతారామె. ఞ్ఞ్ఞఅంతేకాదు, ‘‘చెన్నైలో తాగడానికి పనికి వచ్చే నీటి చుక్క కోసం ఎదురు చూపులు తప్పడం లేదు. వ్యర్థాలను విడుదల చేసే ఫ్యాక్టరీలు ఆ వ్యర్థాల మేనేజ్మెంట్ మీద దృష్టి పెట్టడం లేదు. నిజానికి వాళ్లు ఆ పని చేస్తే సమాంతరంగా రెండు రకాల ఆర్థిక ప్రయోజనాలను పొందగలుగుతాం. ఇందుకోసం పర్యావరణ పరిరక్షణ మీద కనీస స్పృహ కల్పించాల్సిన అవసరం ఉంది’’ అంటారు విద్య. తప్పదు నిజమే ఏడాదికి దేశంలో దాదాపు అరవై లక్షల టన్నుల ప్లాస్టిక్ వేస్ట్ వస్తోంది. అందులో 20 శాతం మాత్రమే రీసైకిల్ అవుతోంది. మిగిలిన ప్లాస్టిక్ భూమిని, తాగునీటిని, సముద్రాలను కలుషితం చేస్తోంది. ప్లాస్టిక్ వాడకాన్ని నివారించమని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ హెచ్చరిస్తూనే ఉంది. అయితే క్యారీ బ్యాగ్ల బదులు క్లాత్ బ్యాగ్ వాడకం తప్ప మరేదీ మన చేతిలో ఉండదు. ఉదయం పాలప్యాకెట్ నుంచి రాత్రి వేసుకునే మందుల డబ్బా వరకు ప్లాస్టికే. ఏ వస్తువు అయినా భద్రంగా రవాణా చేయాలంటే ప్యాకింగ్కి ప్లాస్టిక్ మీదనే ఆధారపడాల్సి వస్తోంది. వాడటం తప్పనిసరి అయినప్పుడు ప్లాస్టిక్ను డీ కంపోజ్ చేయడానికి సరైన పద్ధతి ఉంటే సమస్య నివారణ అయినట్లే. సరిగ్గా ఆ సామాజిక బాధ్యతనే తలకెత్తుకున్నారు విద్య, ఆమె భర్త అమర్నాథ్. వీళ్లేం చేస్తున్నారంటే..! విద్య దంపతులు ప్లాస్టిక్ వేస్ట్తో పర్యావరణ హితమైన ఇంధనాన్ని తయారు చేస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే... ప్లాస్టిక్ని తిరిగి మూలరూపానికి తెస్తారు. ప్లాస్టిక్ వస్తువుల తయారీకి మూలవస్తువు క్రూడ్ ఆయిల్. వీళ్లు వేస్ట్ ప్లాస్టిక్ని ఐదువందల సెల్సియస్ వేడిలో కరిగించి పూర్వ రూపమైన క్రూడ్ అయిల్ను తీసుకువస్తారు. పైరోలిసిస్ అనే రియాక్టర్.. ప్లాస్టిక్ వేస్ట్ని పైరోసిలిస్ ఆయిల్, హైడ్రో కార్బన్ గ్యాస్, నల్లటి కార్బన్ పౌడర్లుగా మారుస్తుంది. గ్యాస్ని తిరిగి ప్లాస్టిక్ను వేడి చేయడానికి ఉపయోగిస్తారు. పౌడర్ని పెయింట్ కంపెనీలు, సిమెంట్ పరిశ్రమలు తీసుకుంటాయి. ఈ ఇంధనం మార్కెట్లో దొరికే మామూలు ఇంధనం కంటే 25 శాతం తక్కువ ధరకే లభిస్తోంది. వేస్ట్ మేనేజ్మెంట్ ఒక టన్ను ప్లాస్టిక్ వేస్ట్ నుంచి 500 లీటర్ల ఆయిల్ వస్తుంది. గ్యాస్, పౌడర్ వంటి బై ప్రోడక్ట్స్ కాకుండా ఆయిల్ లెక్క ఇది. ఇలాంటి పరిశ్రమలను దేశమంతటా స్థాపించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు విద్య. ‘‘ప్లాస్టిక్ని తప్పు పట్టడం మానేయాలి. మనిషి సృష్టించిన అద్భుతాల్లో ప్లాస్టిక్ ఒకటి. ఇరవయ్యో శతాబ్దం పారిశ్రామికాభివృద్ధి వేగవంతం కావడంలో ప్లాస్టిక్ పాత్ర ముఖ్యమైనది. అయితే ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న అసమతుల్యతకు కారణం... రీసైకిల్ చేసి మరీ వాడుకోగలిగిన ఈ మెటీరియల్ని నిర్లక్ష్యం చేయడమే. విలువైన ప్లాస్టిక్ వస్తువులను మాత్రమే రీసైకిల్ చేస్తున్నారు. మిగిలిన వాటిని వదిలేస్తున్నారు. అందుకే ఆ విలువలేని ప్లాస్టిక్ వేస్ట్ని ఇలా రీసైకిల్ చేస్తున్నాం’’ అని వివరించారు విద్య. – మను -
రెండోసారి పెళ్లి కూడా వేదన మిగిల్చింది.
మన ‘ప్రేమ్నగర్’ హిందీలో విడుదలైన 1974లోనే ‘రజనీగంధ’ కూడా విడుదలైంది. ప్రేమ్నగర్ భారీ చిత్రం. రాజేష్ఖన్నా హీరో. హేమమాలిని హీరోయిన్. కథ ప్రకారం హీరో కుబేరుడు. హీరోయిన్ ప్రతి సీన్లోనూ నాటకీయత ప్రదర్శించగల ఆత్మాభిమాన స్వభావి. ‘నా దేవి లేని ఈ కోవెల తునాతునకలై పోనీ’ అని హిందీలో రాజేష్ ఖన్నా మందుగ్లాసు పట్టుకొని పాడుతూ ఉంటే హీరోయిన్ దుఃఖంతో పెదవి కొరుక్కుంటుంది. సినిమా అంటే అదే అని జనం హర్షధ్వానాలు చేశారు. కాని సినిమా అంటే ఇది కూడా అని ‘రజనీగంధ’ వల్ల వాళ్లకు మెల్లగా తెలిసి వచ్చింది. రజనీగంధలో పైవన్నీ లేవు. కాని ఉన్నది జనానికి నచ్చింది. అదేమిటి? 1970లలో అందరూ చూసే అందరికీ కనపడేటటువంటి అమ్మాయి అబ్బాయి ఈ సినిమాలో నాయకనాయికలు. అమోల్ పాలేకర్ ఒక సాదాసీదా గుమాస్తా. విద్యా సిన్హా డిగ్రీ పూర్తి చేసి ఆ రోజుల్లో ఆడవాళ్లు కూడా ఉద్యోగం చేస్తే బాగుండు అనుకునే ఆర్థిక పరిస్థితి ఉన్న కుటుంబపు అమ్మాయి. వీళ్లద్దరికీ స్నేహం. అమోల్ పాలేకర్ సరదా కుర్రవాడు. చిటుక్కుమని వేరుశనగకాయను పగులగొట్టి గింజను పంటికింద వేయడంలో కూడా ఆనందం వెతుక్కోగలవాడు. తాను ఇష్టపడే అమ్మాయికి మోకాలి మీద వొంగి కూచుని డైమండ్ రింగ్ ఇవ్వక్కర్లేదు... కలిసిన ప్రతిసారి గుప్పిళ్లనిండా కాసిని రజనీగంధ పూలు బహూకరిస్తే చాలు అనుకుంటాడు. ఢిల్లీ వీధుల్లో సాయంత్రపు గాలి పీల్చడం, ఎప్పుడైనా సినిమాకెళ్లడం, పక్కవాడి పోటీ బరువు నెత్తిన పడకుండా తేలిగ్గా గడపటం... ముఖ్యంగా హాయిగా నవ్వడం తెలిసినవాడు. విద్యాసిన్హా ఇతణ్ణి ప్రేమిస్తుంది. ఆ కాలంలో ఒక పక్కింటి అమ్మాయి... పెంకుటింట్లో ఉండే అమ్మాయిలాంటి అమ్మాయి... బట్టల షాపులో అందరూ కొనుక్కునేటటువంటి వృత్తాలు వృత్తాల కనకాంబరపు రంగు చీరలు, బాబీ బ్లూ కలర్ చీరలు కట్టుకుని, పూలు తురుముకున్న ఒంటిపేట జడతో, మడిచిన రుమాలు అరచేతిలో ఉండేంత స్థోమతకు ఎదిగిన అమ్మాయి అమోల్ పాలేకర్ని ఇష్టపడటం చాలా సహజం. కాని ఆ అమ్మాయి ఉద్యోగం వెతుక్కుంటూ బొంబాయి వెళ్లినప్పుడు అక్కడ పరిచయమైన ఒక యువకుడు ఈ ప్రేమను మరిపిస్తాడు. జీవితం పట్ల గాంభీర్యం, కెరీర్ పట్ల ఆలోచన, భవిష్యత్తు పట్ల ప్రణాళిక, నగర నాగరికతకు అనువుగా మార్చుకున్న వ్యవహార శైలి... ఢిల్లీలో చూసిన అల్లరి చిల్లరి కుర్రవాడి స్థానే ఈ సంస్కారవంతుడైన పురుషుడు విద్యాసిన్హా మనసు నిండా నిండిపోతాడు. విద్యా సిన్హా ఆమె ఒకనాడు ఢిల్లీకి తిరిగివచ్చి, అమోల్ పాలేకర్తో నీకూ నీ ప్రేమకూ రామ్రామ్ చెప్పాలనుకుని, ఆ బొంబాయి పురుషుణ్ణి చేసుకోవడానికి నిశ్చయించుకున్నాక ఇదేమీ తెలియని అమోల్ పాలేకర్ స్నేహితురాలు వచ్చింది కదా అని ఎప్పటిలాగే వస్తాడు. చేతుల్లో సువాసనలు యీనే, స్వచ్ఛంగా పరిమళించే, సహజంగా వికసించే, తేట మనసులకు స్పందించే రజనీగంధ పూలను తెచ్చి నవ్వుతూ అతడు ఎదురుగా నిలబడినప్పుడు ఆ ‘సాధారణం’లోని ‘అలవిగాని ప్రత్యేకం’ కృత్రిమమైన అదుపాజ్ఞల బొంబాయి పురుషుడిలో ఏమాత్రం లేవు అని విద్యా సిన్హాకు హటాత్తుగా అనిపిస్తుంది. అవును. ఇతని సమక్షంలోనే హాయి ఉంది. అసలుతనం ఉంది. ఉబికే ప్రేమ ఉంది. గుండెలు కోరే సాంత్వనం ఉంది. పరిగెత్తుకుని వెళ్లి ఆమె అమోల్ పాలేకర్ను కావలించుకుంటుంది. ‘ఇక నన్ను ఎక్కడికీ పంపకు’ అని అంటుకుపోతుంది. అమోల్ చేతుల్లోని పూలు వారిద్దరితో పాటు తామూ ఆలింగనంలో భాగమవుతాయి. ఈ సినిమా చూసినవారు ఇప్పటికీ మరోసారి ఇంకోసారి చూస్తూనే ఉంటారు. వారెవరూ విద్యా సిన్హాను మర్చిపోలేదు. పోరు కూడా. డెబ్బయిలనాటి స్త్రీల సహజ ప్రాతినిధ్యం కె.బాలచందర్ వల్ల దక్షిణాదిలో కనిపిస్తే బాసూ చటర్జీ వల్ల ఉత్తరాదిన కనిపించింది. ‘రజనీగంధ’లో మధ్యతరగతి అమ్మాయిల టిపికల్ ప్రెజెన్స్ని వెండితెర మీద విద్యా సిన్హా అనువాదం చేయగలిగింది. ఆమె మీద చిత్రీకరించిన ‘రజనీగంధ ఫూల్ తుమ్హారే’... పాట అతి సుందరమైన హిందీ పాటలలో ఒకటి. బొంబాయి రోడ్లలో ఆమె మీదా ఆమెతో పాటు ఉండే దినేష్ ఠాకూర్ మీద చిత్రీకరించిన ‘కహీ బార్ యూ భి దేఖా హై’ పాటకు ముఖేష్కు జాతీయ అవార్డు వచ్చింది. రజనీగంధలోనే కాదు ఆ తర్వాత వచ్చిన ‘ఛోటీసి బాత్’లో కూడా విద్యా సిన్హా ఆనాటి మధ్యతరగతి ఆడపిల్లల స్వభావ స్వరూపాలను అందంగా చూపించగలిగింది. ‘ఛోటీసి బాత్’లో ఆత్మవిశ్వాసం లేని అమోల్ పాలేకర్ విద్యా సిన్హా వంటి అందమైన ఆడపిల్ల ఎక్కడ చేజారిపోతుందోనని ఆమెతో కలయిక జరిగిపోతే ఇక చచ్చినట్టు పెళ్లి చేసుకుంటుందని అందుకు పథకం వేస్తాడు. అది విఫలం అవుతుంది. ఆ పథకం గురించి తెలుసుకున్న విద్యా సిన్హా ‘ఇంత చిన్న విషయానికి ఇంత పెద్ద పథకం ఎందుకు?’ అని అతణ్ణి దగ్గరకు తీసుకుంటుంది. అంటే మనస్ఫూర్తిగా ప్రేమించిన అమ్మాయికి అబ్బాయి మనసులోని ప్రేమ ఎలాగూ తెలిసిపోతుంది అనీ... ఇరువురూ మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నాక ఈ ‘కలయిక’లు చాలా చిన్న విషయాలు అని. విద్యా సిన్హా అదృష్టమో ఏమో ఈ సినిమాలో కూడా ఆమె పై చిత్రించిన ‘నా జానే క్యూ హోతా హై ఏ జిందగీకే సాథ్’ పాట అపురూపమైనది. కొందరి రూపాలు కృత్రిమ అద్దకాలకు పనికిరావు. విద్యా సిన్హా రూపం విగ్గులూ వానపాటలూ డిస్కో దరువులకు అనువైనది కాదు. అవి విజృంభించిన ఎనభైల కాలంలో ఆమెకు తగిన పాత్రలు రాలేదు. మొదటి భర్త 1996లో మరణించాడు. దత్తత తీసుకున్న అమ్మాయి పెంపకం ఆమెను సినిమాలకు దూరం అయ్యేలా చేసింది. రెండోసారి పెళ్లి కూడా వేదన మిగిల్చింది.సాధారణంగా ఇలాంటివి కొంతమంది అందరికీ చెప్పుకుంటారు. విద్యా సిన్హా ఏనాడూ నోరు మెదపలేదు. పరిమళించి రాలిపోవాలి అన్నట్టు రాలిపోయింది. మొన్న ఆగస్టు 15న ఆమె మరణవార్త విని డెబ్బయిల్లో హిప్పీలు పెంచిన చాలామంది కుర్రవాళ్లు బాల్కనీలోకి వెళ్లి గట్టిగా ఒక దమ్ములాగి ఆకాశం వైపు చూసి ఉంటారు. కొద్దిపాటి ద్రావకాన్ని గొంతున జార విడిచి ‘రజనీగంధ ఫూల్ తుమ్హారే’... అని హమ్ చేసి ఉంటారు.సినీ అభిమానుల లలితమైన జ్ఞాపకం విద్యా సిన్హా.– ఖదీర్ -
మారి–2లో మరో నాయకి
తమిళసినిమా: కోలీవుడ్ దాటి బాలీవుడ్, హాలీవుడ్ వరకూ వెళ్లి నటుడిగా తన సత్తా చాటుకుంటున్న నటుడు ధనుష్. చేతిలో చాలా చిత్రాలు ఉన్నా, వేలై ఇల్లా పట్టాదారి–2 చిత్రం తరువాత ఆయన నటించిన చిత్రం విడుదల కాలేదు. దీంతో ఆయన అభిమానులు తదుపరి చిత్రం కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారని చెప్పవచ్చు. అయితే ఇంత వరకూ తన మామ, సూపర్స్టార్ రజనీకాంత్ హీరోగా నిర్మించిన కాలా చిత్ర నిర్మాణం, విడుదల కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. కాలా విడుదల కావడంతో ధనుష్ తాజాగా వరుసగా తన చిత్రాలను విడుదల చేయడానికి ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నారు. ఆయన నటించిన వడచెన్నై, మారి–2 చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. మధ్యలో ఆంగ్ల చిత్రం ది ఎక్స్ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్ విడుదలకు సిద్ధం అవుతోంది. చాలా కాలంగా నిర్మాణంలో ఉన్న గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నటిస్తున్న ఎన్నై నోకి పాయుం తూట్టా చిత్రం ఇంకా నిర్మాణంలోనే ఉంది. ఈయన తన వండర్బార్ ఫిలింస్ పతాకంపై కథానాయకుడిగా నటించి నిర్మించిన మారి చిత్రం కమర్షియల్గా మంచి సక్సెస్ను అందుకుంది. బాలాజీ మోహన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సీక్వెల్గా తెరకెక్కుతున్న చిత్రం మారి–2. నటుడు ధనుష్నే నిర్మించి నటిస్తున్న ఇందులో నటి సాయిపల్లవి కథానాయకిగా నటిస్తోంది. నటి వరలక్ష్మీశరత్కుమార్ కీలక పాత్రను పోషిస్తున్న ఇందులో తాజాగా మరో కథానాయకిగా నటి విద్య వచ్చి చేరింది. ఇరవుక్కు ఆయిరం కన్గళ్, పంసంగ–2 చిత్రాల్లో నటించిన ఈ అమ్మడికి ధనుష్తో మారి–2 చిత్రంలో నటించే లక్కీచాన్స్ తలుపుతట్టింది. ఈ విషయాన్ని విద్య తన ట్విట్టర్లో పేర్కొంది. నటి సాయిపల్లవి ఈ చిత్రంలో ఆటోడ్రైవర్గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక వరలక్ష్మీశరత్కుమార్ కలెక్టర్గా నటిస్తోంది. మలయాళ నటుడు టోవినో థామస్ విలన్గా, నటుడు కృష్ణ ముఖ్య పాత్రలోనూ నటిస్తున్నారు. ఈ చిత్రం తెన్కాశి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటోంది. దీనికి యువన్శంకర్రాజా సంగీతం అందిస్తున్నారు. -
యాక్షన్.. థ్రిల్
శేఖర్ వర్మ, వివియా, విద్యలు హీరోహీరోయిన్లుగా నూతన దర్శకుడు సతీష్ రేగళ్ల రూపొందిస్తున్న ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్ ‘నివాసి’. గాయత్రి, దత్తాత్రేయా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై కె.యన్. రామారావు, టి.వి.వి.యస్.యన్. వర్మలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 75% షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ఈ నెల 17న స్టార్ట్ కానుంది. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ– ‘‘హీరో శేఖర్ నటించిన ‘శ్రీరాముడింట శ్రీకృష్ణుడంట’ సినిమా చూశాను. చాలా బాగా చేశాడు. అతన్ని దృష్టిలో పెట్టుకొనే ఈ కథ రాసుకున్నాను. ఫ్యామిలీ ఎమోషన్స్తో థ్రిల్కి గురి చేసేలా సినిమా ఉంటుంది. రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తయింది. త్వరలో విడుదలకు సన్నాహాలు చేస్తాం’’ అని అన్నారు. ఈ సినిమాకు సంగీతం: చరణ్– అర్జున్, కెమెరా: చిట్టిబాబు. -
కళబోత
ఈ ఈస్ట్కి ఆ వెస్ట్కి రాగాల దారాలల్లింది. ఇక్కడి రెహమాన్కి... అక్కడి చియారాకి బంధం కలిపింది. స్వర సంకరం అన్నారామె నాన్న. అపస్వరం రానివ్వనన్నది విద్య. ఇవేం రాగాలు అన్నారు విన్నవాళ్లు. మాషప్ రాగాలు అందా పాతికేళ్లమ్మాయి. విద్యా వోక్స్... ఈ వారం హైదరాబాద్కొస్తోంది.. రాగాల హరివిల్లును ఆవిష్కరించడానికి! ఇది ఈ మాషప్ క్వీన్ అల్లిన సంగీత కళబోత! వజ్రాలు, బంగారం.. గోరింటాకు, గాజులు.. సో బ్యూటిఫుల్! ఒక ఏంజెల్లా ఉంది ఆ అమ్మాయి. చుట్టూ బలహీనమైన పురుష హృదయాలు ఉంటాయేమోనన్న కనికరం లేకుండా.. కేర్లెస్గా డ్యాన్స్ చేస్తోంది. (బై ది వే.. ఇవాళ వరల్డ్ కైండ్నెస్ డే). ఏలే ఏలే.. లేలేలే ఓ వో! ఆమె పాదాల కింద సూర్యోదయం పసుపు రంగులో దుమ్ము దుమారం అవుతోంది. అమ్మాయి ఆగట్లేదు. ‘ఆకాశం వైపు చూడు. చుక్కలెప్పుడూ ఒంటరిగా మినుకు మినుకు మనవు. ఇది నీ రాత్రి... గట్టిగా ఒంట్లోకి ఊపిరి పీల్చుకుని జరగాల్సిన దాన్ని జరగనివ్వు’. పాడుతున్న పచ్చి పారాణి పడీపడీ నవ్వింది. న్యూ బ్రైడ్. పెళ్లికుమారుడు దఢేల్మని పడిపోయాడు. ‘ఇటీజ్ ద వే దట్ యు స్మైల్. బేబీ, ఐ యామ్ లూసింగ్ మై మైండ్..’ వీడియో కంప్లీట్ అయింది. హేయ్ గైస్ అంటూ.. విద్య వచ్చేసింది. ‘పాట ఎలా ఉంది?’ అని అడిగింది. పాటలోని ‘సో.. బ్యూటిఫుల్ ఏంజెల్’ ఆమే. ఈ సాంగ్ను, ఈ అమ్మాయినీ త్వరలోనే మనం లైవ్లో చూడొచ్చు. విద్య ఈవారం హైదరాబాద్ వస్తోంది. హూ ఈజ్ దిస్ ఎలక్ట్రానిక?! ఇంట్లో.. కర్ణాటక కృతులు, భజన్స్, ఎ.ఆర్.రెహమాన్. స్కూల్కి వెళుతున్నప్పుడు దారిలో.. రేడియోలోంచి కోల్డ్ప్లే, డెస్టినీస్ చైల్డ్, చియారా! భూగోళాన్ని ఉత్తరార్థం, దక్షిణార్థం అని.. భూమధ్య రేఖతో కాకుండా, ‘భూనిలువు రేఖ’తో రెండుగా కట్ చేస్తే ఈస్టు వెస్టు అవుతాయి కదా. ఆ రెండు చెక్కల సంగీతాన్ని పిండుకుని షర్బత్లా తాగేస్తుండేది విద్య. సడన్గా ఆమె బుర్రలో మాషప్ అయిపోయే వాళ్లు రెహమాన్, చియారా! కోల్డ్ప్లే.. బ్రిటిష్ రాక్ బ్యాండ్. ఇద్దరుండేవాళ్లు అందులో. క్రిస్మార్టిన్, జానీ బక్లాండ్. డెస్టినీస్ చైల్డ్.. అమెరికన్ అమ్మాయిల గ్రూప్. ముగ్గురుండేవాళ్లు అందులో. బియాన్సే నోల్స్, కెల్లీ రోలాండ్, మిషెల్ విలియమ్స్. ఇక చియారా ఇండివిడ్యువల్. అమెరికన్ ఫిమేల్ సింగర్. బుద్ధి వికసించే వయసులో వర్జీనియాలో తొలిసారి విద్యను వెస్ట్రర్న్ పడవల్లో తెడ్డేసి తిప్పింది షికారుకు తీసుకెళ్లింది ఈ ఐదుగురే. క్రిస్ మార్టిన్ గొంతులోని నరాలు తెంపి, తన గిటార్కు తీగలుగా చుట్టుకుని జానీ బక్లాండ్ ప్రకంపనల్ని క్రియేట్ చూస్తున్నాడా ఏంటి అనుకునేది విద్య ‘కోల్డ్ప్లే’ సాంగ్స్ ప్లే అవుతున్నంతసేపూ. ఇంటికొచ్చాక మళ్లీ.. యే హై మేరా హిందూస్థానీ! ఓసారి రెండు తీగల్నీ కలిపింది విద్య. భగ్గుమని ఓ బ్రైట్నెస్. ‘‘ఏమిటమ్మా.. ఆ స్వర సంకరం’’ అన్నారు నాన్నగారు. ఇంచుమించు ఆయన శంకరశాస్త్రి గారు. ‘‘అపస్వరం మాత్రం కానివ్వను నాన్నా’’ అంది విద్య. ‘‘మరేంటి నువ్వు చేస్తున్న పని’’ అన్నారు ఆయన. ‘‘మాషప్’’ అంది విద్య. మాషప్ అంటే రుబ్బేయడం. ఎలా పడితే అలా రుబ్బేయడం కాదు. కొత్త రిథమ్ని అవుట్పుట్గా తేవడం. కొత్త లిరిక్తో ప్రపంచాన్ని వెలిగించడం. ఆ విద్య తెలుసుకుంది చిన్నప్పుడే విద్య. సే మై నేమ్ ‘డెస్టినీస్ చైల్డ్’ బ్యాండ్కు మొదట ఉన్న పేరు ‘గర్ల్ టైమ్’. విద్య పుట్టిన ఏడాదే ఆ ‘గర్ల్ టైమ్’ పాప్ బ్యాండ్ పుట్టింది. తర్వాత ఏడేళ్లకు అది ‘డెస్టినీస్ చైల్డ్’ అయింది. ఆ బ్యాండ్లోని ‘సే మై నేమ్’ అనే పాట అంటే విద్యకు ఇప్పటికీ ఇష్టం. రెస్పెక్ట్ని డిమాండ్ చేసే పాట అది. ‘ఊరికే ఐలవ్యూ అని చెప్పేస్తే కాదురా అబ్బాయ్.. కాస్త ముందూ వెనుకా చూసుకుని చెప్పు’ అనేది థీమ్. ఇండియన్ గర్ల్స్ మనసుకు దగ్గరగా ఉంది కదా! విద్య సెమీ ఇండియన్లా కనిపిస్తుంది. అయితే లోపల ఉన్నదంతా ఆమె భారతీయ ఆత్మే. విద్య చెన్నైలో పుట్టింది. విద్య అమ్మమ్మ వాళ్లది పాలక్కాడ్. కేరళ. విద్య అమ్మ, విద్య అమ్మమ్మ కూడా పాలక్కాడ్లోనే పుట్టి పెరిగారు. వాళ్ల నుంచి విద్యకు మలయాళం వచ్చింది. చెన్నై నుంచి యు.ఎస్. వెళ్లిపోయినా, ఇప్పటికీ ఇంట్లో ఎక్కువగా మలయాళమే. పుంజితంజి కొంజిక్కో.. ముంతురి ముత్తొలి చిందిక్కో.. వంజని వర్న చుందరివానే. వాళ్ల మాటలన్నీ పాటల కంపోజిషన్లోనే! బాగా చిన్నప్పుడు విద్య.. అమ్మమ్మవాళ్లింట్లో కొన్నాళ్లు ఉంది. అప్పటి కోవెలలు, అక్కడి ఈత కొలనులు, తను ఇష్టంగా తినే ‘అవియల్’... ఇవేవీ విద్యను ఒంటరిగా యు.ఎస్. పంపించలేదు. మ్యూజికల్ మెమరీస్గా ఆమెకంటే ముందెళ్లి ఫ్లయిట్లో ఆమె పక్కన కూర్చున్నాయి. విద్యకు మలయాళీ మ్యూజిక్ అంటే ఇష్టం. జేసుదాస్ అంటే మహా ఇష్టం. ఆమధ్య విద్య విడుదల చేసిన మాషప్ ట్రాక్ ‘కుట్టనాదన్ పుంజయిలే’ మలయాళమే. ఆన్లైన్ సెన్సేషన్ అయింది. కేరళ బోట్ సాంగ్ అది. సరస్సులు, కొబ్బరి చెట్లు, కేరళ మహిళలు; తెలుపు, బంగారు బార్డర్ల మెరుపు చీరల్లో వారి సంప్రదాయ నృత్యం, ఆ నృత్యానికి విద్య వెస్ట్రన్ బీట్. ‘విద్యావోక్స్’ అల్లాడింది. అది ఆమె యూట్యూబ్ చానల్. బాయ్ నీడ్స్ గర్ల్ స్కూల్ నుంచి కాలేజ్కి వచ్చింది విద్య. స్కూల్ నుంచి ఆమెను ఫాలో అవుతున్న మ్యూజికల్ గ్యాంగే కాలేజ్కీ ఆమెను ఫాలో అయింది. విద్యకు అర్థమైంది.. తన డెస్టినీ మ్యూజిక్ అని! సైకాలజీలో డిగ్రీ కంప్లీట్ చేసుకుని వెళుతుంటే.. ‘హాయ్’ అనే పిలుపు వినిపించింది. తిరిగి చూసింది. ‘‘ఐ యామ్ శంకర్ టకర్’’. శంకర్ ఇంగ్లీష్లో పాటలు బాగా రాస్తాడు. క్లారియనిస్ట్. మ్యూజిక్ కంపోజర్. వీడియో డైరెక్టర్. భారతీయ సంప్రదాయ సంగీతాన్ని, జాజ్నీ మిక్స్ చేసి శ్రోతల్ని అలౌకిక స్థితిలోకి తీసుకెళ్లడంలో శంకర్ ఎక్స్పర్ట్. విద్య కన్నా వయసులో నాలుగేళ్లు పెద్ద. విద్యలాగే అతడూ ఈస్టు వెస్ట్లను కలిపి చిలుకుతాడు. ఇండియాలో అతడికీ చుట్టాలు ఉన్నారు. ‘‘ఇద్దరం కలిసి ఏదైనా చేద్దాం’’ అన్నాడు శంకర్. ‘‘నా గురించి ఎలా తెలుసు?’’ అంది విద్య. ‘‘మీ గురించి తెలియదు. మీలోని మ్యూజిక్ లవర్ గురించి తెలుసు. ఏదో ఫంక్షన్లో హమ్ చేస్తుంటే విన్నాను. ఇండియాను, అమెరికాను తగుపాళ్లలో మిక్స్ చెయ్యగలరు మీరు’’ అన్నాడు నవ్వుతూ. విద్య ఎగ్జయిట్ అయింది. శంకర్, తను ఒకే రూట్లో ఉన్నారని ఆమెకు అనిపించింది. మీరు షూట్ చేస్తానంటే నేను మాషప్ చేస్తాను అంది. మాషప్ ఎవరైనా చేస్తారు. విద్య ఫస్ట్ టైమ్ మాషప్ చేసినప్పుడు మాత్రం ‘ఎవరా!’ అని చూశారు. దాన్ని షూట్ చేసింది శంకరే. ఇప్పుడున్న విద్య మ్యూజిక్ వీడియోల డైరక్టర్ కూడా అతడే. ‘‘లవ్లో ఉన్నారా.. మీ ఇద్దరూ..’’ అడిగారెవరో విద్యను. విద్య పెద్దగా నవ్వింది. ‘‘ఇద్దరు మ్యూజిక్ లవర్స్ మధ్య స్నేహం మాది’’ అంది. చిటికెలు, చిందులు లీన్ ఆన్–జింద్ మహీ (2015), క్లోజర్–కబీరా (2016) మాషప్లతో విద్య టాలెంట్ గురించి ప్రపంచానికి ఫస్ట్ టైమ్ తెలిసింది. ఆమె డిస్కోగ్రఫీ మొదలైంది కూడా ఆ రెండేళ్లలోనే. ‘లీన్ ఆన్’ అనే వీడియో సాంగ్ ‘మేజర్ లేజర్’ అనే అమెరికన్ ఎలక్ట్రానిక్ బ్యాండ్ది. ‘జింద్ మహీ’ పంజాబీ సాంగ్. మాషప్లో ఒరిజినల్ని అంతర్లయగా సాగిస్తూ, రెంటినీ చక్కగా రుబ్బి, బాణలిలో ‘సుయ్’మని మెదుపు వడ వేసింది విద్య. ఇప్పటి వరకు ఈ మాషప్ని రెండు కోట్ల డెబ్బై లక్షల మంది నెట్లో ఆస్వాదించారు. ‘క్లోజర్’ సాంగ్ అమెరికన్ డీజేలు ఆండ్రూ, అలెక్స్ల పాప్ బ్యాండ్ ‘చెయిన్ స్మోకర్స్’ ఆల్బమ్ లోనిది. దానికి విద్య ‘ఏ జవానీ హై దివానీ’ చిత్రంలోని ‘కబీరా’ సాంగ్ను కలిపి కొత్త బీట్తో బయటికి తెచ్చింది. మాషప్లు ఏం గొప్ప అనేవారెవరైనా ఉంటే వీటికి విద్య అందించిన లిరిక్స్ని వినొచ్చు. సైకాలజీని జోడించి మరీ సాహిత్యాన్ని ట్యూన్ చేసు కుంటుంది ఈ అమ్మాయి. విద్య ఒరిజినల్ కంపోజిషన్స్ లేటెస్టుగా ‘డైమండ్స్’, ‘కుతు ఫైర్’ చిటికెలు, చిందులు వేయిస్తున్నాయి. ఆ ‘వజ్రాలు, బంగారం, గోరింటాకు, గాజులు..’ కవిత్వం డైమండ్స్లోనిదే. విద్య అసలు పేరు విద్యా అయ్యర్. ‘విద్యా వోక్స్’ అనేది ఆమె స్టేజ్ నేమ్. ప్రపంచంలోని చాలా ప్రదేశాల్లో ఈ ఇరవై ఆరేళ్ల వయసుకే స్టేజ్ షోలు ఇచ్చింది విద్య. వైట్ హౌస్, వెబ్స్టర్ హాల్ (అమెరికా), నేషనల్ సెంటర్ ఫర్ ది పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ (ఇండియా), రీయూనియన్ ఐలాండ్, సురినామ్, దుబాయ్ నెదర్లాండ్ దేశాలలో పెర్ఫార్మ్ చేసింది విద్య. ది కుతు ఫైర్ టూర్ ఈ నెల 17న పుణెలోని అమనోరా గ్రౌడ్లో విద్య ‘లైవ్ షో’ ఉంది. ‘ది కుతు ఫైర్ టూర్’ అనే పేరుతో ఇండియాలో పుణెతో విద్య మ్యూజిక్ కాన్సర్ట్ మొదలవుతోంది. 18న కోల్కతాలో, 19న హైదరాబాద్లో, 24న బెంగళూరులో, 25న ఢిల్లీలో, 26న అహ్మదాబాద్లో విద్య షో టిక్కెట్లకు ఇప్పటినుండే తొందర ఎక్కువైంది. ఈ మొత్తం టూర్ పేరు ‘విద్య వోక్స్: ది కుతు ఫైర్ టూర్’. వోక్స్ అంటే లాటిన్లో వాయిస్ అని. ఈ పేరును సజెస్ట్ చేసింది ఆమె ఫ్రెండ్ శంకరే. తన చానల్కు కూడా విద్య ఇదే పేరు పెట్టుకున్నారు. ‘కుతు’ అనేది తమిళ జానపద సంగీతంలోని ‘దబన్కుతు’ అనే సంప్రదాయానికి షార్ట్ నేమ్. దానికి ‘ఫైర్’ను కలిపి విద్య భగ్గుమనిపించారు. ఆ మ్యూజిక్ వీడియోనే ‘కుతు ఫైర్’. విద్యకు ఇదొక డ్రీమ్ జర్నీ. మునుపొకసారి విద్య ముంబై వచ్చివెళ్లింది కానీ, ఎప్పటికప్పుడు ఇండియా తనకు కొత్తగా, లవ్లీగా ఉంటుందట! నెట్లో ప్రస్తుతం విద్యవి 40 పాటల వరకు ఉన్నాయి. కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. విద్య చానల్కు దాదాపు నాలుగు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఆమె ఫేస్బుక్ని పది లక్షల మంది, ఇన్స్టాగ్రామ్ని 6 లక్షల మందికి పైగా ఫాలో అవుతున్నారు. - విద్యా అయ్యర్ (గాయని, గేయ రచయిత్రి, యూట్యూబ్ స్టార్, డ్యాన్సర్). -
హైందవ ధర్మాన్ని రక్షించాలి
పుష్పగిరి స్వామీజీ శ్రీ విద్యాశంకర భారతీస్వామి కాకినాడ కల్చరల్ : హైందవ ధర్మాన్ని పరిరక్షించాలని పుష్పగిరి పీఠాధిపతి శ్రీ విద్యాశంకర భారతీస్వామి పిలుపునిచ్చారు. కాకినాడలోని జిల్లా పురోహిత సంఘం అధ్యక్షుడు ఆకెళ్ళ మురళీకృష్ణ స్వగృహంలో స్వామీజీకి వేదమంత్ర పూర్వక పూర్ణకుంభంతో శనివారం స్వాగతం పలికారు. దేశంలో జరగుతున్న అన్యమత ప్రచారాల వల్ల హిందూమతం సంక్షోభంలో పడిందన్నారు. అన్యమత ప్రచారాలను సమర్థంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ధర్మ సంస్థాపన కోసం తాము దేశ పర్యటన చేస్తున్నామన్నారు. దేవాదాయశాఖలో జరుగుతున్న హైందవ విరుద్ధ కార్యక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందన్నారు. భగవంతుని బోధనలను అనుసరిస్తే మానవ జీవితానికి సార్ధకత చేకూరుతుందన్నారు. కార్తికమాసం సందర్భంగా శ్రీ చక్రార్చన, మహన్యాస పూర్వక రుద్రాభిషేకాలను నిర్వహించి భక్తులను అనుగ్రహిస్తున్నామన్నారు. కార్తికమాసం పుణ్యఫలం గురించి, ప్రత్యేకత గురించి భక్తులకు స్వామీజీ వివరించారు. కార్యక్రమంలో వై.పద్మనాభం, బ్రాహ్మణ సంఘం కార్యదర్శి వాడ్రేవు సుబ్మహ్మణ్యం, ఆర్గనైజింగ్ కార్యదర్శి అజ్జరపు సత్యనారాయణ, చల్లా నిరంజ¯ŒS పాల్గొన్నారు. -
రేడియోలు కనబడవు... పాఠాలు వినబడవు
తొలి రోజు సగం పాఠశాలలకే పరిమితం ఉపాధ్యాయుల్లో కానరాని చైతన్యం బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్న అధికారులు భానుగుడి (కాకినాడ): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించేందుకు రాజీవ్ విద్యామిషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించిన ‘విందాం–నేర్చుకుందాం’ కార్యక్రమం తొలి రోజు జిల్లాలో సగం పాఠశాలలకే పరిమితమైంది. ప్రాథమిక పాఠశాలల విద్యార్థుల్లో చైతన్యం తెచ్చి, సులభంగా పాఠాలు అర్థమయ్యేందుకు రూపొందించిన ఈ కార్యక్రమంపై క్షేత్రస్థాయి సిబ్బందిలో చిత్తశుద్ధి కొరవడడం, అ«ధికారులు– ఉపాధ్యాయుల మధ్య సమన్వయ లోపంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఈ నెల 23 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకూ పాఠశాలల పనివేళల్లో ఉదయం 11 నుంచి 11.30 గంటల వరకూ ఈ కార్యక్రమం రేడియోలో ప్రసారం కానుంది. విద్యాశాఖ, సర్వశిక్షాభియాన్, ఆకాశవాణి, దూరదర్శన్ చానళ్ల సంయుక్త పర్యవేక్షణలో ఉండే ఈ కార్యక్రమానికి రాజీవ్ విద్యామిషన్ పాఠ్యాంశాలకు రూపకల్పన చేయగా, ఆకాశవాణి దూరదర్శన్ చానల్ ప్రసారం చేస్తుంది. ఇదీ కార్యక్రమం... ప్రతి మంగళవారం ఒకటి, రెండు తరగతులకు, బుధ, గురు, శుక్రవారాల్లో 3, 4, 5 తరగతుల విద్యార్థులకు పాఠాలు బోధించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో పద్యాలు, పాఠాలు, కృత్యాలు, పొడుపు కథలు, హాస్యోక్తులు, నాటికలతో పాటు విలువైన సమాచారంతో విద్యా సంవత్సరం పొడవునా పాఠాలు ప్రసారమయ్యేలా కార్యక్రమం రూపొందించారు. నిష్ణాతులయిన ఉపాధ్యాయుల ద్వారా రాజీవ్ విద్యామిషన్ పాఠాలను ప్రసారం చేస్తుంది. జిల్లాలో 3751 పాఠశాలల్లో 4 లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీటిలో 3320 ప్రాథమిక,, 431 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి. తొలిరోజు అధికారిక అంచనా ప్రకారం 1900 పాఠశాలల్లో మాత్రమే రేడియో పాఠాల కార్యక్రమం జరిగినట్టు సమాచారం. కొరవడిన సమన్వయం ఈ కార్యక్రమంపై ఉపాధ్యాయులు అధికారుల్లో సమన్వయం లేకపోవడం వల్లే సుమారు 1850 పాఠశాలల్లో రేడియో పాఠాలు వినలేని పరిస్థితి ఏర్పడిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తక్కువ సమయంలో ఆదేశాలివ్వడం, పాఠశాలల్లో రేడియోలు పనిచేయకపోవడం, కొన్ని చోట్ల రేడియోలే లేకపోవడంతో తొలిరోజు సగం పాఠశాలల్లోని విద్యార్థులు పాఠాలు వినలేకపోయారు. తొలిరోజు కాలం, క్యాలెండర్ తదితర పాఠాలు బోధించారు. పాఠశాలలకు కేటాయించిన మేనేజ్మెంట్ నిధుల్లో రేడియోలను కొనుగోలు చేయాలని, ఆ నిధులతో రేడియోలు రిపేర్ చేయించుకోవాలని అ«ధికారులు ఆదేశాలు జారీ చేసినా ఉపాధ్యాయులు అంతగా పట్టించుకోలేదన్న ఆక్షేపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పాఠశాలలు గ్రాంట్లను పలు పనులకు ఉపయోగించడం వల్ల నిధుల కొరతతో ఈ పరిస్థితి ఏర్పడినట్టు తెలిసింది. పూర్తిస్థాయిలో అమలయ్యేలా చూస్తాం విందాం– నేర్చుకుందాం కార్యక్రమాన్ని అన్ని పాఠశాలల్లోనూ పూర్తిస్థాయిలో అమలయ్యేందుకు అన్ని చర్యలు తీసుకుంటాం. దీనికి సంబంధించి ఎంఈఓలు, డీవైఈఓలకు సమాచారం ఇచ్చాం. ఏడాది పాటు కార్యక్రమానికి గ్యాప్ రావడం కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడింది. - చామంతి నాగేశ్వరరావు, అకడమిక్ మానటరింగ్ ఆఫీసర్ (రాజీవ్ విద్యామిషన్) చర్యలు తీసుకుంటాం విద్యార్థుల్లోని సృజనకు పదునుపెట్టే ఈ కార్యక్రమం పాఠశాలల్లో ప్రారంభం కాలేదన్న విషయంపై విచారణ నిర్వహించి బాధ్యులపై చర్యలకు డీఈఓకు నివేదిస్తాం. ఈ కార్యక్రమంపై కొన్ని రోజుల ముందే నియమ, నిబంధనలతో పాఠశాలలకు సమాచారం అందించాం. రేడియో పాఠాలు ప్రారంభం కాని పాఠశాలలను గుర్తించాలని మానటరింగ్ అధికారులను ఆదేశించాను. - మేకా శేషగిరి, రాజీవ్ విద్యామిషన్ పీఓ -
నన్నయ వీసీకి విద్యాభూషణ్ అవార్డు ప్రదానం
రాజరాజనరేంద్రనగర్ (రాజాన గరం): ప్రపంచ ఉపాధ్యాయదినోత్సవం సందర్భంగా ‘మేజిక్ ఫర్ సోషల్ సర్వీస్’ స్వచ్ఛంద సంస్థ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సేవలందించిన విశిష్ట వ్యక్తులకు ఏటా ఇస్తున్న విద్యాభూషణ్ అవార్డును ఈ ఏడాది నన్నయ వర్సిటీ వీసీ ఆచార్య ముత్యాలు నాయుడికి అందజేసింరు. ఈ సందర్భంగా ఆయనను బుధవారం యూనివర్సిటీలో ఆ సంస్థ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ అవార్డును సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్ చింతా శ్యామ్, జ్యూరీ సభ్యులు ఆయనకు అందజేశారు. వీసీ ముత్యాలునాయుడు కృతజ్ఞతలు తెలిపారు. రిజిస్ట్రార్ ఆచార్య ఎ. నరసింహారావు, అధ్యాపకులు డాక్టర్ టి. సత్యనారాయణ, డాక్టర్ ఎస్. టేకి తదతరులు పాల్గొన్నారు. -
వాళ్లతో రొమాన్స్ చేయాలని ఉంది!
ఏడు పదుల వయసులోనూ ఏమాత్రం తగ్గని ఎనర్జీతో వరుసగా సినిమాలు చేసేస్తున్నారు అమితాబ్ బచ్చన్. అలాగే, యాడ్స్లోనూ నటిస్తున్నారు. ఇంత బిజీగా ఉన్న బచ్చన్కి ఓ అసంతృప్తి ఉందట. కథానాయికలతో రొమాన్స్ చేసే వయసులో లేకపోవడం అనే అసంతృప్తి వెంటాడుతోందని అమితాబ్ అంటున్నారు. ముఖ్యంగా విద్యాబాలన్, దీపికా పదుకొనె, కంగనా రనౌత్, ఆలియా భట్ వంటి భామలతో హీరోగా నటించే వయసులో లేకపోవడం చాలా బాధగా ఉందని ఆయన పేర్కొన్నారు. వాళ్లతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేస్తున్న హీరోలను చూస్తే అసూయగా ఉందని బిగ్ బి సరదాగా అన్నారు. -
New Solicitor General of India?
SBI POs, Clerks General Awareness 1. Who will take over from S.D. Shibulal as the Chief Executive Officer and Managing Director of Infosys on August 1, 2014? 1) U.B. Pravin Rao 2) K.V. Kamath 3) Srinath Batni 4) Vishal Sikka 5) Rohan Murthy 2. Petro Poroshenko became the President of which of the follo-wing countries on June 7, 2014? 1) Belarus 2) Ukraine 3) Georgia 4) Latvia 5) Czech Republic 3. FIFA World Cup was started on June 12, 2014. Which two teams played the first match in Sao Paulo, Brazil? 1) Brazil, Mexico 2) Brazil, Cameroon 3) Brazil, Croatia 4) Spain, Netherlands 5) Spain, Chile 4. Who was appointed as the Solicitor General of India on June 7, 2014? 1) Maninder Singh 2) Tushar Mehta 3) L. Nageshwar Rao 4) Ranjit Kumar 5) P.S. Narasimha 5. Which city will host the world chess championship from Nove-mber 7 to 28, 2014? 1) Oslo, Norway 2) Madrid, Spain 3) Sofia, Bulgaria 4) Helsinki, Finland 5) Sochi, Russia 6. Reuven Rivlin was elected as the President of which of the following countries on June 10, 2014? (He will take office on July 24, 2014) 1) Hungary 2) Iceland 3) Israel 4) Italy 5) Macedonia 7. Identify the mismatched pair? 1) Bank rate - 8% 2) Repo rate - 8% 3) Reverse repo rate -7 % 4) Cash reserve ratio - 4% 5) Statutory LiquidityRatio-22.5% 8. Identify the mismatched pair? Cabinet Minister Portfolio 1) Sadananda Gowda: Railways 2) Harsh Vardhan: Health and Family Welfare 3) Nitin Gadkari: Road Transport and Highways 4) Ananth Kumar: Chemicals and Fertilizers 5) Radha Mohan Singh: Food Processing Industries 9. N.R. Narayana Murthy stepped down as Executive Chairman of which of the following com-panies on June 14, 2014? 1) TCS 2) Cognizant 3) Infosys 4) Wipro 5) None of these 10. Which country's parliament passed a bill allowing euthanasia for terminally ill children with-out any age limit in February 2014? (It is the first country to remove any age limit on mercy killing) 1) Portugal 2) UK 3) Belgium 4) Denmark 5) Netherlands 11. Taishan Station was opened on February 8, 2014. It is the fourth Antarctic research station of? 1) South Korea 2) Japan 3) China 4) Russia 5) North Korea 12. Which of the following is not the name of a station in Antarctica? 1) Dakshin Gangotri 2) Maitri 3) Bharti 4) Great Wall 5) Prithvi 13. Who became the first Indian squash player to win the IMET Open in Bratislava, Slovakia in December 2013? 1) Ravi Dixit 2) Mahesh Mangaonkar 3) Harinder Pal Sandhu 4) Ramit Tandon 5) None of these 14. Which of the following Indian airlines tied up with Tigerair to increase connectivity between flights operated by both carriers? 1) GoAir 2) IndiGo 3) Jetkonnect 4) Kingfisher 5) SpiceJet 15. Abdiweli Sheikh Ahmed is the Prime Minister of? 1) Sudan 2) South Sudan 3) Somalia 4) Egypt 5) Ethiopia 16. The 27th South East Asian Ga-mes were held in December 2013 in? 1) Vietnam 2) Philippines 3) Thailand 4) Myanmar 5) Indonesia 17. The South East Asian Games is a biennial multi sporting event involving participants from the countries of South East Asia. Which country will host the 2015 South East Asian Games? 1) Singapore 2) Cambodia 3) Malaysia 4) Philippines 5) Brunei 18. India's first supersonic jet fighter was decommissioned after 50 years of service in December 2013. What is its name? 1) Boeing P-12 2) MIG-21 FL 3) Tejas 4) Hawker Hunter 5) IAR-15 19. The cabinet approved a free trade agreement (FTA) in trade and services with which of the follo-wing organizations in December 2013? 1) SAARC 2) APEC 3) ASEAN 4) SCO 5) BRICS 20. Which of the following has launched the world's most powerful star-surveying satellite Gaia into space from Kourou in French Guiana? 1) Mexican Space Agency 2) Iranian Space Agency 3) Israeli Space Agency 4) European Space Agency 5) South African National Space Agency 21. Tigerair is a low-cost airline headquartered in? 1) Singapore 2) Kuala Lumpur 3) Jakarta 4) Riyadh 5) Manama 22. European Space Agency is an in-ter governmental organization of 20 member States. It is head-quartered in? 1) London 2) Paris 3) Lisbon 4) Madrid 5) Berlin 23. The Centre has ruled out im-position of the Inner-Line Permit (ILP) system in which of the following States in December 2013? 1) Meghalaya 2) Assam 3) Tripura 4) Manipur 5) West Bengal 24. Inner Line Permit (ILP) is an official travel document issued by an empowered State government to allow inward travel of an Indian citizen into a protected or restricted area for a limited period. Currently ILP is in force in? 1) Arunachal Pradesh 2) Nagaland 3) Mizoram 4) Both 1 and 2 5) All 1, 2 and 3 25. The government has approved a proposal to increase foreign holding in which of the following banks to 62 percent from the current 49 percent? 1) ICICI Bank 2) Axis Bank 3) HDFC Bank 4) Yes Bank 5) IndusInd Bank 26. A committee, set up by the SEBI for reviewing insider trading norms, has submitted its report. The committee was headed by? 1) N.K. Sodhi 2) Nirmal Jain 3) Motilal Oswal 4) Milind Barve 5) None of these 27. Noted writer and journalist Kh-ushwant Singh passed away on March 20, 2014. Which one of the following books was not written by him? 1) Train to Pakistan 2) Truth, Love and a Little Malice 3) A History of the Sikhs 4) Delhi: a Novel 5) The Mountain of Light 28. The Asian Development Bank will provide $350 million loan for improving power transmission and distribution system in? 1) Bihar 2) Jharkhand 3) Chhattisgarh 4) M.P 5) None of these 29. The Reserve Bank of India has advised banks to treat a credit card account as a non performing asset if the customer fails to pay the minimum due amount within? 1) 30 days 2) 60 days 3) 90 days 4) 100 days 5) None of these 30. Which of the following would set up a Central Repository of Infor-mation on Large Credits (CRI-LC) to collect, store and diss-eminate credit data to lenders? 1) NHB 2) CRISIL 3) RBI 4) CARE 5) SEBI 31. According to the Motilal Oswal annual wealth creation study, which Indian company is the biggest wealth creator during the 2008-2013 period? 1) Tata Consultancy Services 2) ITC 3) HDFC Bank 4) Infosys 5) ICICI Bank 32. JIMEX is a bilateral maritime exercise between India and? 1) Germany 2) Jamaica 3) Jordan 4) Japan 5) None of these 33. Who became the Chief Executive of India unit of the world's largest retailer Wal-Mart in Janu ary 2014? 1) Ajay Nihalani 2) B.S. Nagesh 3) Krish Iyer 4) Aditya Nadkarni 5) None of these 34. M.V. Tanksale is the Chief Exe-cutive of the Indian Banks' Association. He is the former CMD of? 1) Bank of India 2) Union Bank of India 3) Indian Bank 4) Indian Overseas Bank 5) Central Bank of India 35. Which of the following is a step towards enhancing customer convenience through Anywhere Banking? 1) RTGS 2) NEFT 3) DICGC 4) CBS 5) BPLR KEY 1) 4 2) 2 3) 3 4) 4 5) 5 6) 3 7) 1 8) 5 9) 3 10) 3 11) 3 12) 5 13) 2 14) 5 15) 3 16) 4 17) 1 18) 2 19) 3 20) 4 21) 1 22) 2 23) 1 24) 5 25) 2 26) 1 27) 5 28) 4 29) 3 30) 3 31) 1 32) 4 33) 3 34) 5 35) 4 -
Find the average votes of four students?
SBI POs, Clerks Quantitative Aptitude Pie Charts Pie charts are used to show the share of various sectors in the total. They usually show the percentage share of each sector in the whole taken as 100%. A pie chart is a pictorial representation of the numerical data by non intersecting adjacent sectors of the circle such that area of each sector is proportional to the magnitude of the data represented by the sector. Note n Different sectors of a pie chart represent various component parts. n Each of the component values is expressed either as a percentage of the respective total or as sectorial angle of the respective total. n Since the angle at the centre of the circle is 360°, the total magnitude of the various components is taken to be equal to 360°. n 100% = 360° 1% = 3.6° n The degrees represented by the various components parts of a given magnitude can be obtained without computing their percentage to the total value as follow. Angle of the any component part Practice questions Directions (Q 1 – 6): The following pie chart shows the amount of subscriptions generated for India Bonds from different categories of investors. Subscription Generated for India Bonds 1. If the investments by NRIs are Rs 4,000 crore, then the investment by corporate houses and FIIs together is: 1) 24,000 crore 2) 24,363.6 crore 3) 25,423.4 crore 4) 25,643.3 crore 5) None of these Ans: 2 NRI's Investment = 11% = Rs 4000 cr The investment by corporate houses and FIIs together = 34 + 33 = 67% 2. What percentage of the total investment is coming from either FIIs or NRIs? 1) 33% 2) 11% 3) 44% 4) 22% 5) None of these Ans: 3 Percentage of the total investm- ent is coming from either FIIs or NRIs = 33 + 11= 44% 3. If the total investment other than by FII and corporate houses is Rs 335,000 crore, then the investment by NRIs and offshore funds will be (approximately): 1) 274,090 2) 285,600 3) 293,000 4) Can't be determine 5) None of these Ans: 1 Investment other than NRI and corporate houses is 33% = 335000. Also, investment by offshore funds and NRIs is equal to: 27%. 4. What is the approximate ratio of investment flows into India Bonds from NRIs to corporate houses? 1) 1 : 4 2) 1 : 3 3) 3 : 1 4) Can't be determine 5) None of these Ans: 2 Investment flows into India Bonds from NRIs = 11% Investment flows into India Bo- nds from corporate houses = 34% Required ratio = 11:34 » 1:3 5. In the corporate sector, approxi- mately how many degrees should be there in the central angle? 1) 120 2) 121 3) 122 4) 123 5) None of these Ans: 3 The corporate sector accounts for 34%. So total degrees in the central angle = 34 ׳ 3.6 = 122.4 (since 1 % = 3.6 degrees) » 122 6. If the total investment flows from FIIs were to be doubled in the next year and the investment flows from all other sources had remained constant at their existing levels for this year, then what would be the proportion of FII investment in the total investment flows into India Bonds in the next year (approximately)? 1) 40% 2) 50% 3) 60% 4) 70% 5) None of these Ans: 2 FIIs currently account for 33 out of 100. If FII value is doubled and all other investments are kept constant then their new value would be 66 out of 133 It is approximately equal to: Directions (Q 7 – 10): Use the pie diagrams given to answer the following questions. The pie chart given below shows the distribution of the New York market share by value of different computer companies in 2005. Distribution of New york market share by value The pie chart given below shows the distribution of New York market share by volume of different computer companies in 2005. Distribution of New York market share by volume Number of units in 2005 in New York = 1,500 Value of units sold in 2005 in New York = US $ 1,650,000 7. In 2005, the average unit sale price of an IBM PC was approximately in (US$) 1) 3180 2) 2800 3) 393 4) 3080 5) 3200 Ans: 4 IBM accounts for 28% of the share by value and 10% of the share by volume. 28% of 1650000 10% of 1500 Therefore, average unit sale price 8. For the year 2005, which company has realized the lowest average unit sales price for a PC? 1) Commodore 2) IBM 3) Tandy 4) Can't be determined 5) None of these Ans: 4 Although it seems to be Commodore, the answer can't be determined due to the fact that we are unaware of the break-up of the sales value and volume of companies compro- mising the other categories. 9. Over the period 2005 – 06, if sales (value -wise) of IBM PC's increased by 50% and of Apple by 15%, assuming that PC sales of all other computer companies remained the same, by what percentage (approximately) would the PC sales in New York (value–wise) increase over the same period? 1) 16.1% 2) 18% 3) 14% 4) 22% 5) None of these Ans: 1 If we assume the total sales to be 100 in the first year, IBM's sales would go up by 50% (from 28 to 42) contributing an increase of 14 to the total sales value. Similarly, Apple's increase of 15% would contribute an increase of 2.1 to the total sales value. The net change would be 14 + 2.1 on 100. (i.e., 16.1%) 10. In 2005, the average unit sale price of HP PC was approxi- mately in (US$)? 1) 800 2) 825 3) 900 4) 975 5) None of these Ans: 2 HP accounts for 6% of the share by value and 8% of the share by volume. 6% of 1650000 8% of 1500 Therefore, average unit sale price Directions (Q 11 – 13): The pie chart, given here represents the number of valid votes obtained by four students who contested election for school leadership. The total number of valid votes polled was 720. Observe the chart and answer the question based on it. 11. What was the minimum number of votes obtained by any candidate? 1) 100 2) 110 3) 120 4) 130 5) 140 Ans: 3 Yasin got minimum votes, i.e 12. By how many votes did winner defeat his nearest rival? 1) 40 2) 45 3) 48 4) 50 5) 65 Ans: 1 Required votes = 120° – 100° = 20° 13. Find the average votes of four students? 1) 90 2) 180 3) 270 4) 360 5) 450 Ans: 2 The average votes
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
17, 18 తేదీల్లో గైట్లో ఎస్టీయూ రాష్ట్ర స్థాయి శిక్షణ
నేడు, రేపు గురుకుల పాఠశాలల్లో సీట్ల భర్తీ
No Headline
No Headline
శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణం
శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకున్న ‘గంగుల’
కరీంనగర్లో ‘లండన్’ ఎగ్జిబిషన్
నేలకు సారం.. పంటకు ప్రాణం
పనులు సత్వరమే పూర్తి చేయాలి
బీమా చెక్కు అందజేత
తప్పక చదవండి
- ముంబై హోర్డింగ్ ఘటన.. కారులోనే నలిగిన దంపతుల ప్రాణాలు
- భర్తతో విడిపోయిన సీరియల్ నటి.. సోషల్ మీడియాలో పోస్ట్
- ‘ఫ్యాన్’దే ప్రభంజనం.. సీఎం జగన్ సరికొత్త రికార్డ్!
- ఐశ్వర్యారాయ్ టోట్ బ్యాగ్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!
- టీడీపీ గుండాల అరాచకం.. ఫ్యాన్కు ఓటేసిందని ట్రాక్టర్తో తొక్కించబోయారు
- కొత్త మార్కును దాటిన బంగారం! ఏకంగా ఎంత ఎగిసిందంటే..
- Virat Kohli: ఒక్కసారి క్రికెట్కు వీడ్కోలు పలికితే.. కోహ్లి నోట రిటైర్మెంట్ మాట!
- భారత సంతతి బాలుడికి దుబాయ్ పోలీసుల సత్కారం!
- IPL 2024: సన్రైజర్స్ ప్లే ఆఫ్స్ చేరదు.. ఆ నాలుగు జట్లే! ఫ్యాన్స్ ఫైర్
- మళ్లీ మనదే అధికారం.. చరిత్ర సృష్టించబోతున్నాం: సీఎం జగన్
Advertisement