-
ఆర్థిక ఉగ్రవాది అరాచకాలు
సాక్షి, అమరావతి: పచ్చళ్ల వ్యాపారి... చిట్ఫండ్ సంస్థ యజమాని... పత్రికాధిపతి... ఫిల్మ్ సిటీ అధినేత... ఇవన్నీ చెరుకూరి రామోజీరావు ధరించిన లొసుగుల ముసుగులే! దశాబ్దాలుగా సాగించిన అక్రమ డిపాజిట్లే ఆయన దోపిడీకి రాచబాట. మార్గదర్శి ఫైనాన్సియర్స్ పేరిట రామోజీ సేకరించినవి అక్రమ డిపాజిట్లేనని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) సుప్రీంకోర్టుకు నివేదించడంతో కేసు కీలక మలుపు తిరిగింది. రామోజీరావు ఓ ఆర్థిక నేరస్తుడే అన్నది స్పష్టమైంది. చిట్ఫండ్స్ బోర్డు.. ఫైనాన్సియర్స్ పేరిట భారీగా అక్రమ డిపాజిట్లు 2006 వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ప్రశ్నించే వరకు ‘మార్గదర్శి ఫైనాన్సియర్స్’ అనే సంస్థ ఉన్నట్లు కూడా సామాన్యులకు తెలియదు. రాష్ట్రం అంతటా ‘మార్గదర్శి చిట్ ఫండ్స్’ కార్యాలయాలే కనిపించేవి. ఆ కార్యాలయాల్లోనే గుట్టు చప్పుడు కాకుండా ‘మార్గదర్శి ఫైనాన్సియర్స్’ పేరిట మరో కంపెనీ ఆర్థిక కార్యకలాపాలు సాగించిందనే విషయం బయటి ప్రపంచానికి తెలియదు. అలా 1997 నుంచి 2006 వరకు మార్గదర్శి ఫైనాన్సియర్స్ యథేచ్ఛగా అక్రమ కార్యకలాపాలు సాగించింది. ఆర్బీఐ చట్టం 45ఎస్ ప్రకారం కంపెనీల చట్టం కింద నమోదైన ఇన్కార్పొరేటెడ్ కంపెనీలు మాత్రమే ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించాలి. రామోజీ తన గ్రూపు సంస్థలను ‘హిందూ అవిభాజ్య కుటుంబం(హెచ్యూఎఫ్) కింద నమోదు చేసినట్టుగా పేర్కొన్నారు. హెచ్యూఎఫ్ కింద నమోదైన కంపెనీలు ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేయకూడదు. 2006లో మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమ డిపాజిట్ల వ్యవహారం వెలుగులోకి వచ్చే నాటికి ఏకంగా రూ.2,600 కోట్ల అక్రమ డిపాజిట్లను సేకరించడం విభ్రాంతికర వాస్తవం. మార్గదర్శి ఫైనాన్సియర్స్పై కేసు న్యాయస్థానంలో విచారణలో ఉండగా మరో రూ.2 వేల కోట్ల వరకు అక్రమ డిపాజిట్లు సేకరించారని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది నిరంజన్ రెడ్డి సుప్రీంకోర్టుకు నివేదించడం ప్రాధాన్యం సంతరించుకుంది. లెంపలేసుకుని.. ‘మార్గదర్శి’ షట్టర్ క్లోజ్ మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమ డిపాజిట్ల దందా బయటపడటంతో రామోజీరావు కంగుతిన్నారు. నాటి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమాలపై దర్యాప్తు చేసేందుకు అప్పటి ప్రభుత్వ సలహాదారు రంగాచారిని విచారణ అధికారిగా నియమించింది. సీఐడీ తరపున న్యాయ స్థానాల్లో కేసులు దాఖలు చేసేందుకు టి.కృష్ణంరాజును అధీకృత అధికారిగా నియమించింది. మార్గదర్శి ఫైనాన్సియర్స్ పేరిట ఏకంగా రూ.2,600 కోట్ల అక్రమ డిపాజిట్లు సేకరించినట్టు వీరు గుర్తించారు. సెక్షన్ 45 ఎస్ ప్రకారం హెచ్యూఎఫ్లు డిపాజిట్లు సేకరించకూడదని ఆర్బీఐ స్పష్టం చేయడంతో రామో జీ తాము తప్పు చేసినట్టు అంగీకరించారు. నగదు రూపంలో డిపాజిట్లు వసూలు చేసినట్లు వెల్లడించారు. డిపాజిట్ దారులకు వారి డిపాజిట్లను తిరిగి చెల్లించి మార్గదర్శి ఫైనాన్సియర్స్ను మూసి వేస్తామని న్యాయస్థానానికి లిఖిత పూర్వకంగా తెలిపారు. అంతా నల్లధనం దందానే మార్గదర్శి చిట్ఫండ్స్ కార్యాలయాల్లో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహించిన ‘మార్గదర్శి ఫైనాన్సియర్స్’ ముసుగులో రామోజీరావు భారీగా నల్లధనం దందాను సాగించారు. సీఐడీ సోదాల్లో, ఆదాయ పన్ను శాఖ తనిఖీల్లో ఆ విషయం వెలుగు చూసింది. అందుకనే డిపాజిట్దారుల వివరాలను వెల్లడించేందుకు రామోజీరావు మొండికేశారు. డిపాజిట్ల ముసుగులో టీడీపీ పెద్దలు భారీగా నల్లధనాన్ని చలామణిలోకి తెచ్చారు. ♦ కేంద్ర ఆదాయపన్ను చట్టాన్ని కూడా ఉల్లంఘించి రామోజీ నల్లధనం దందా నడిపారు. రూ.20 వేలకు మించిన లావాదేవీలు నగదు రూపంలో తీసుకోకూడదని ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 269 స్పష్టం చేస్తోంది. మార్గదర్శి ఫైనాన్సియర్స్లో దాదాపు అన్ని డిపాజిట్లు నగదు రూపంలోనే తీసుకోవడం గమనార్హం. నగదు రూపంలో డిపాజిట్లు స్వీకరించి తమ సిబ్బంది ద్వారా డిమాండ్ డ్రాఫ్ట్ (డీడీ), పే ఆర్డర్లు(పీఓ)ల రూపంలోకి మార్చినట్టు ఆదాయ పన్ను శాఖ అధికారుల తనిఖీల్లో బయట పడింది. డిపాజిట్ చేసిన మొత్తాలను రూ.50 వేల కంటే తక్కువ మొత్తాలుగా విభజించి మరీ డీడీలు, పీఓలుగా మార్చారు. ♦ మార్గదర్శి ఫైనాన్సియర్స్ రశీదు రూపంలో సేకరించిన డిపాజిట్ల పత్రాలను పరిశీలిస్తే అదంతా నల్లధనం బాగోతమేనన్నది స్పష్టమవుతోంది. డిపాజిట్దారుల పాన్ నంబర్లు, పూర్తి చిరునామాలు కూడా లేకుండానే డిపాజిట్లు సేకరించడం గమనార్హం. ♦ రామోజీరావు 2008లో సమర్పించిన అఫిడవిట్లో రూ.1,864.10 కోట్లు డిపాజిట్దారులకు చెల్లించేశామని తెలిపారు. మరి మిగిలిన దాదాపు రూ.750 కోట్ల డిపాజిట్లు ఏమయ్యాయనే విషయంపై మౌనం వహించారు. గుట్టుచప్పుడు కాకుండా రికార్డుల నుంచి తొలగించిన ఆ డబ్బంతా రామోజీకి అత్యంత సన్నిహితుడైన టీడీపీ పెద్దలు, ఆయన గ్యాంగ్వేనని తెలుస్తోంది. -
ఐదు బ్యాంకులకు జరిమానా విధించిన ఆర్బీఐ - ఎందుకంటే?
రిజర్వ్ బ్యాంక్ ఇండియా (RBI) వివిధ ఉల్లంఘనలకు పాల్పడిన సహకార బ్యాంకులకు జనవరి 18న భారీ జరిమానా విధించింది. ఆర్బీఐ ఏ బ్యాంకులకు ఫైన్ వేసింది, ఎందుకు వేసిందనే వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం. ఆర్బీఐ జరిమానా విధించిన బ్యాంకుల జాబితాలో ఎన్కెజిఎస్బి కో-ఆపరేటివ్ బ్యాంక్, ముంబైకి చెందిన న్యూ ఇండియా కో-ఆపరేటివ్ బ్యాంక్, గుజరాత్కు చెందిన మెహసానా నాగ్రిక్ కో-ఆపరేటివ్ బ్యాంక్, ది పాడి నాగ్రిక్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ ఉన్నాయి. కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు ఎన్కెజిఎస్బి కో-ఆపరేటివ్ బ్యాంక్ RBI నిబంధనలను పాటించకపోవడం వల్ల రూ. 50 లక్షల జరిమానా విధించడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా ఆర్బీఐ ఈ బ్యాంకుకు షోకాజ్ నోటీసు కూడా జారీ చేసింది. ముంబైకి చెందిన న్యూ ఇండియా కో-ఆపరేటివ్ బ్యాంకుకు.. రిజర్వ్ బ్యాంక్ ఇండియా (RBI) రూ. 15 లక్షలు జరిమానా విధించింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ లాభం నుంచి విరాళం ఇస్తున్నప్పుడు ఆర్బీఐ నిబంధనలను పాటించకపోవడం వల్ల ఈ ఫైన్ వేసినట్లు సమాచారం. ఇదీ చదవండి: స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి - ఈ రోజు ధరలు ఇలా.. గుజరాత్కు చెందిన మెహసానా నాగ్రిక్ కో-ఆపరేటివ్ బ్యాంకుకు RBI రూ.7 లక్షల జరిమానా విధించింది. రుణాలు, అడ్వాన్సులు ఇచ్చే సమయంలో నిబంధనలను ఈ బ్యాంక్ ఉల్లంఘించడం వల్ల జరిమానా విధించింది. మిగిలిన రెండు బ్యాంకులు కొన్ని నిబంధనలను పాటించకపోవడం వల్ల పెనాల్టీని విధించినట్లు సమాచారం. -
కీలక వడ్డీ రేట్లను మార్చని ఆర్ బిఐ
-
నేటి నుంచి ఆర్బీఐ పాలసీ సమీక్ష
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) మూడురోజుల కీలక ద్వైమాసిక సమావేశాలు నేటినుంచి (4వ తేదీన) ప్రారంభం కానున్నాయి. మూడు రోజుల పాటు ఈ సమావేశాలు జరుగుతాయి. అక్టోబర్ 6వ తేదీన (శుక్రవారం) ఈ భేటీ కీలక నిర్ణయాలను గవర్నర్ మీడియాకు వెల్లడిస్తారు. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు రెపోను ఆర్బీఐ ఈ సమావేశాల్లో కూడా యథాతథంగా 6.5 శాతం వద్దే కొనసాగించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు. ఇదే జరిగితే వరుసగా నాలుగు ద్వైమాసిక సమావేశాల నుంచి యథాతథ రేటును కొనసాగించినట్లు అవుతుంది. ధరల స్పీడ్ను కట్టడి చేసే విషయంలో రాజీ పడేదే లేదని ఆర్బీఐ గవర్నర్ ఉద్ఘాటిస్తున్న సంగతి తెలిసిందే. ఉక్రేయిన్పై రష్యా యుద్ధం, క్రూడ్ ధరల తీవ్రత, అంతర్జాతీయంగా పెరిగిన క్రూడ్ ధరలు, దీనితో ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం భయాల నేపథ్యంలో ఈ సవాలును అధిగమించడానికి ఆర్బీఐ 2022 మే నుంచి 2023 ఫిబ్రవరి నాటికి రెపో రేటును 250 బేసిస్ పాయింట్లు పెంచింది. దీనితో ఈ రేటు 6.5 శాతానికి చేరింది. అయితే ద్రవ్యోల్బణం కొద్దిగా అదుపులోనికి వస్తుందన్న సంకేతాల నేపథ్యంలో తాజా సమీక్షసహా గడచిన మూడు సమావేశాల్లో యథాతథ రేటు కొనసాగింపునకే ఆర్బీఐ పెద్దపీట వేసింది. జూలైలో నమోదయిన 15 నెలల గరిష్ట స్థాయి (7.44 శాతం) రిటైల్ ద్రవ్యోల్బణం ఆగస్టులో 6.83 శాతానికి తగ్గినప్పటికీ ఈ స్థాయి సైతం ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న స్థాయికన్నా 83 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) అధికంగా ఉండడం గమనార్హం. -
మూడోసారీ మార్పులేదు
ముంబై: ధరల స్పీడ్ను కట్టడి చేసే విషయంలో రాజీ పడేదే లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) స్పష్టం చేసింది. ఆహార ధరలు పెరుగుతుంటే దీని కట్టడికి అవసరమైతే రేటు పెంపే ఉంటుందని ఉద్ఘాటించింది. రిటైల్ ద్రవ్యోల్బణం అనిశ్చితి నేపథ్యంలో బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపోను (ప్రస్తుతం 6.5 శాతం) యథాతథంగా కొనసాగిస్తున్నట్లు తెలిపింది. 2024 మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణానికి సంబంధించి క్రితం 5.1 శాతం అంచనాలను 5.4 శాతానికి పెంచుతూ ఆర్బీఐ గవర్నర్ నేతృత్వంలో సమావేశమైన ఆరుగురు సభ్యుల ద్రవ్య పరపతి విధాన (ఎంపీసీ) కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. వృద్ధి రేటు అంచనాలను ప్రస్తుత 6.5 శాతంగానే కొనసాగించాలని మూడురోజులపాటు సమావేశమైన కమిటీ నిర్ణయించింది. మంగళ, బుధ, గురు వారాల్లో జరిగిన ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమావేశ వివరాలను గవర్నర్ శక్తికాంతదాస్ వివరించారు. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం, క్రూడ్ ధరల తీవ్రత, అంతర్జాతీయంగా పెరిగిన క్రూడ్ ధరలు, దీనితో ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం భయాల నేపథ్యంలో ఈ సవాలును అధిగమించడానికి ఆర్బీఐ గడచిన మే నుంచి 2023 ఫిబ్రవరి నాటికి రెపో రేటును 250 బేసిస్ పాయింట్లు పెంచింది. దీనితో ఈ రేటు 6.5 శాతానికి చేరింది. ద్రవ్యోల్బణం కొద్దిగా అదుపులోనికి వస్తుందన్న సంకేతాల నేపథ్యంలో తాజా సమీక్ష సహా గడచిన మూడు సమావేశాల్లో యథాతథ రేటు కొనసాగింపునకే ఆర్బీఐ పెద్దపీట వేసింది. అయితే ద్రవ్యోల్బణం భయాలు పూర్తిగా తొలగిపోలేదని, అవసరమైతే కఠిన ద్రవ్య విధానానికే (రేటు పెంపు) మొగ్గుచూపుతామని కూడా ఆయా సందర్భాల్లో స్పష్టం చేస్తూ వచి్చంది. ఇదే విషయాన్ని తాజా సమీక్షా సమావేశం అనంతరం కూడా ఆర్బీఐ గవర్నర్ పునరుద్ఘాటించారు. పాలసీలో కొన్ని ముఖ్యాంశాలు.. వృద్ధి ధోరణి: 2023–24లో దేశ జీడీపీ 6.5 శాతం ఉంటుందని అంచనావేస్తుండగా, క్యూ1లో 8 శాతం, క్యూ2లో 6.5%, క్యూ3లో 6%, క్యూ4లో 5.7 శాతంగా అంచనా. 2024–25 మొదటి త్రైమాసికంలో వృద్ధిరేటు 6.6 శాతంగా అంచనా. ద్రవ్యోల్బణం దాదాపు 6% లోపే: 2023–24లో వినియోగ ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 5.4 శాతంగా ఉంటుందని అంచనావేస్తుండగా, క్యూ2లో 6.2 శాతం, క్యూ3లో 5.7 శాతం, క్యూ4లో 5.2 శాతంగా అంచనా. వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో అంచనా 5.2%. కొత్త ఉత్పత్తులతో ఊరట: భారీగా ధర పెరుగుతున్న టమాటా సహా కూరగాయల ధరలు పెరుగుతుండడంతో సమీప భవిష్యత్తులో ధరల తీవ్రత ఒత్తిడి ఉంటుంది. అయితే కొత్త పంట వస్తుండడంతో కూరగాయల ధరలు తగ్గవచ్చన్న అంచనాలూ ఉన్నాయి. డిజిటల్ లావాదేవీల చెల్లింపుల పెంపు లక్ష్యం: యూపీఐ చెల్లింపుల్లో ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ని వినియోగించే అంశాన్ని ఆర్బీఐ ప్రతిపాదించింది. యూపీఐ–లైట్లో ఆఫ్లైన్ చెల్లింపులలో నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్సీ) టెక్నాలజీ వినియోగాన్ని ప్రస్తావించింది. అలాగే యూపీఐ లైట్లో చిన్న విలువ కలిగిన డిజిటల్ చెల్లింపుల కోసం లావాదేవీల పరిమితిని రూ. 200 నుండి రూ. 500కి పెంచాలని ప్రతిపాదించింది. అయితే ఇందుకు సంబంధించి రూ.2,000 రోజూవారీ పరిమితిని యథాతథంగా కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఆయా ఇన్స్ట్రుమెంట్ల వినియోగం, ధ్రువీకరణల విషయంలో ఎటువంటి అవకతవకలూ చోటుచేసుకోకుండా త్వరలో మార్గదర్శకాలు విడుదల చేయనుంది. సీఆర్ఆర్లో లేని మార్పు: బ్యాంక్ మొత్తం డిపాజిట్లో లిక్విడ్ క్యాష్ రూపంలో ఆ బ్యాంక్ నిర్వహించాల్సిన నగదుకు సంబంధించిన నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్)ను యథాతథంగా 4.5% వద్ద కొనసాగింపు. దీనివల్ల ప్రస్తుత బ్యాంకింగ్ ద్రవ్య లభ్యత విషయంలో ఎలాంటి మార్పులూ ఉండవు. అధిక ద్రవ్య లభ్యతపై చర్యలు: రూ.2,000 నోట్లు బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరిగి రావడం, ఆర్బీఐ నుంచి ప్రభుత్వానికి అందిన డివిడెండ్ వంటి చర్యల వల్ల వ్యవస్థలో ఏర్పడిన అధిక ద్రవ్య లభ్యతను (లిక్విడిటీ) తగినంత వరకూ వెనక్కు తీసుకో వడానికి చర్యలు కొనసాగుతాయి. పెరుగుతున్న ఎన్డీటీఎల్ (నెట్ డిమాండ్, టైమ్ లయబిలిటీ)పై గత మూడు నెలలుగా ఇంక్రిమెంటల్ క్యాష్ రిజర్వ్ రేషియో (ఐ–సీఆర్ఆర్) 10 శాతానికి పెంపు. దీనివల్ల వ్యవస్థ నుంచి దాదాపు రూ.లక్ష కోట్లు వెనక్కు మళ్లుతున్నట్లు అంచనా. ద్రవ్యోల్బణం కట్టడి చర్యలో ఇదొక కీలక చర్య. తదుపరి ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశం అక్టోబర్ 4–6 మధ్య జరుగుతుంది. రుణ గ్రహీతలకు ఊరట ఫ్లోటింగ్ నుంచి ఫిక్సిడ్కు..! పెరుగుతున్న వడ్డీరేట్ల వ్యవస్థ నుంచి ఊరట నిచ్చేందుకు ఆర్బీఐ పాలసీ సమీక్ష కీలక నిర్ణయం తీసుకుంది. గృహ, ఆటో ఇతర రుణాలు సంబంధించి రుణగ్రహీతలు ఫ్లోటింగ్ రేటు నుంచి ఫిక్సిడ్ రేట్ విధానానికి మారే వెసులుబాటును కలి్పంచనుంది. ఫ్లోటింగ్ వడ్డీ రేటు నుండి స్థిర వడ్డీ రేటుకు మారడానికి అనుమతించే ఫ్రేమ్వర్క్ను త్వరలో ప్రకటించనుంది. ఈ విధానం కింద బ్యాంకులు... రుణ కాల వ్యవధి, ఈఎంఐల గురించి రుణ గ్రహీతకు తగిన వివరాలు అన్నింటినీ అందజేయాల్సి ఉంటుంది. ఈఎంఐ ఆధారిత ఫ్లోటింగ్ వడ్డీ రుణాల వడ్డీ రేటు నిర్దేశంలో మరింత పారదర్శకత తీసుకునిరావడం, రుణగ్రహీతలు ఫిక్సిడ్ రేట్ రుణాలకు మారడం లేదా రుణాలను ముందుగానే చెల్లించడం వంటి పలు అంశాలు త్వరలో విడుదల కానున్న ఆర్బీఐ ఫ్రేమ్వర్క్లో ఉండనున్నాయి. కాగా, రుణ జారీల విషయంలో బ్యాంకులు ‘‘మభ్యపెట్టే విధానాలను’’ విడనాడాలని, రుణ గ్రహీత వయస్సు, తిరిగి చెల్లింపుల సామర్థ్యం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని తగిన కాల వ్యవధిలో రుణం తీర్చగలిగేలా రుణాలు మంజూరు చేయాలని పాలసీ సమీక్ష సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ స్పష్టం చేశారు. ఆయా విషయంలో మభ్యపెట్టే విధానాలు విడనాడి, రుణగ్రహీతకు పూర్తి పారదర్శక విధానాలను పాటించాలని సూచించారు. జాగరూకతతో నిర్ణయాలు ద్రవ్యోల్బణాన్ని కట్టడిలోనే ఉంచుతూ వృద్ధి పటిష్టతకు దోహదపడే పాలసీ ఇది. ఆర్థిక వ్యవస్థ పటిష్టతే లక్ష్యంగా ఆర్బీఐ పాలసీ నిర్ణయాలు ఉన్నాయి. లిక్విడిటీకి (ద్రవ్య లభ్యత) సంబంధించి తీసుకున్న నిర్ణయాలు బ్యాంకింగ్ రుణ సామర్థ్యంపై ఎటువంటి ప్రతికూల ప్రభావం చూపబోవు. – దినేశ్ ఖారా, ఎస్బీఐ చైర్మన్ గృహ డిమాండ్కు ఢోకాలేదు ఆర్బీఐ యథాతథ రేటు విధానం వల్ల గృహ డిమాండ్కు తక్షణం వచ్చిన సమస్య ఏదీ లేదు. అయితే తదుపరి సమీక్షా సమావేశంలో రేటు కోత ఉంటుందని పరిశ్రమ విశ్వసిస్తోంది. ప్రస్తుతం ద్రవ్యోల్బణం కట్టడే లక్ష్యంగా పాలసీ విధానం కొనసాగినట్లు స్పష్టమవుతోంది. – బొమన్ ఇరానీ, క్రెడాయ్ ప్రెసిడెంట్ -
బ్యాంకింగ్ లోపాలు సరిదిద్దరా?
బ్యాంకింగ్ వ్యవస్థకు సంబంధించిన ప్రభుత్వ పాలసీల రూప కల్పనలోనూ, వాటి నిర్వహణా సామర్థ్యాలలోనూ అనేక లోపాలు ఏదో రూపంలో తలెత్తుతూనే ఉన్నాయి. అయినా కేంద్ర ప్రభుత్వం తప్పులను సరిదిద్దు కోకుండా నిర్లక్ష్య వైఖరినే ప్రదర్శి స్తోంది. ముఖ్యంగా గత కొద్ది నెల లుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పాలసీలో అనుసరిస్తున్న ద్రవ్య విధానం ఆర్థిక వ్యవస్థకు చేటు తెచ్చేలా ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సభ్యుడు జయంత్ వర్మ ఇదే విష యాన్ని చెబుతూ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ నెల ఆరంభంలో జరిగిన ఎంపీసీ సమావేశం మినిట్స్ వెల్లడయ్యాయి. వడ్డీరేట్ల పెంపుపై సభ్యుల మధ్య విభేదాలు పొడచూపినట్లుగా తెలుస్తోంది. ఏడాదికాలంలో ‘రెపో రేటు’ నాలుగు శాతం నుండి 6.5 శాతానికి పెరిగింది. ‘ద్రవ్య విధానం’ వాస్తవానికి దూరం జరిగిపో తున్నదంటూ జయంత్ వర్మ తాజా సమావేశంలో విమ ర్శించారు. ఈ నేపథ్యంలో ఆర్థిక అభివృద్ధి అంచనాలకంటే తక్కువగా ఉంటుందన్నారు. అహ్మదాబాద్ ఐఐఎం ప్రొఫెసర్ అయిన జయంత్ వర్మ, కేంద్రం ఎంపీసీలో నియ మించిన ముగ్గురు నామినీ సభ్యుల్లో ఒకరు. అలాగే గడిచిన ఈ 9 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం 15 లక్షల కోట్ల రూపాయలను ‘రైట్ ఆఫ్’ చేసి ఎగవేత దారులకు మేలు చేసింది. అంతే కాక ఉద్దేశపూర్వకంగా రుణాలనూ, వడ్డీలనూ ఎగ్గొట్టిన వారికి మళ్లీ రుణాలు ఇచ్చేందుకు కూడా రిజర్వ్ బ్యాంక్ సిద్ధపడింది. రాజీ పరిష్కారం (కాంప్రమైజ్ సెటిల్మెంట్) పేరిట ఈ ప్రక్రి యకు తలుపుల్ని బార్లా తెరిచింది. ఈ అనాలోచిత చర్యపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే, ఉద్దేశపూర్వకంగా ఎగవేతకు పాల్ప డిన వారు ఎంతమంది ఉన్నారు అన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. 2022 డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా ఉద్దేశపూర్వకంగా పెద్ద మొత్తాలను ఎగవేసిన వారు పదహారు వేల మందికి పైమాటే అని బ్యాంకు నివేదికను బట్టి తెలుస్తోంది. వీళ్లు దాదాపు రూ. 3.46 లక్షల కోట్ల రుణాలను ఎగ్గొట్టినట్లు సమాచారం. ఇందులో 85 శాతం రుణాలను (రూ. 2.92 లక్షల కోట్లు) ప్రభుత్వ బ్యాంకుల నుంచి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దేశంలో మొత్తం 11 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 6 బ్యాంకులకు గత కొన్నేళ్లుగా చైర్పర్సన్లను నియమించకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తోంది. ఇందువల్ల ఆయా బ్యాంకులు క్రమంగా బలహీన పడుతున్నాయి. ఇప్పటికే నోట్ల రద్దు ప్రక్రియతో మన ఆర్థిక వ్యవస్థ సతమతం అవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో గుండెకాయ లాంటి బ్యాంకింగ్ వ్యవస్థ ఇన్ని అంతర్గత వ్యవస్థాపరమైన లోపాలూ, నిర్వాహాణా లోపాలతో కొనసాగితే... దేశ ద్రవ్య వ్యవస్థ భవిష్యత్తులో ఏమికానుందో అనే ఆందోళన కలుగక మానదు. ఇటీవల అనేక విదేశీబ్యాంకులు వ్యవస్థాపర, నిర్వహణాపర లోపాలతో దివాలా తీసిన అనుభవాలు కళ్లెదుట కనిపిస్తున్నా వాటి నుండి మనం గుణపాఠం నేర్చుకోకుంటే ఎలా? డా‘‘ కోలాహలం రామ్ కిశోర్ వ్యాసకర్త ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ ‘ 98493 28496 -
రూ.88,000 కోట్ల విలువైన రూ.500 నోట్ల మిస్సింగ్.. స్పందించిన ఆర్బీఐ!
రూ. 88,000 కోట్ల విలువైన రూ. 500 నోట్లు కనిపించడం లేదంటూ వెలుగులోకి వచ్చిన నివేదికల్ని ఆర్బీఐ కొట్టిపారేసింది. కరెన్సీ నోట్లపై వివరణ తప్పుగా ఉందని పేర్కొంది. పలు నివేదికల ప్రకారం.. నాసిక్ కరెన్సీ నోట్ ప్రెస్లో 375.450 మిలియన్ల రూ.500 నోట్లను ముద్రించినట్లు రైట్ టూ ఇన్ఫర్మేషన్ (ఆర్టీఐ) వెల్లడించింది. అయితే, ఆర్బీఐ మాత్రం ఏప్రిల్ 2015 నుంచి డిసెంబర్ 2016 మధ్య కాలంలో కేవలం 345.000 మిలియన్ల నోట్లు మాత్రమే తమ వద్దకు వచ్చినట్లు చెప్పింది. మరి మిగిలిన కరెన్సీ నోట్లు ఎక్కుడున్నాయి? అనే అంశం చర్చాంశనీయంగా మారింది. ఈ క్రమంలో నోట్ల విషయంలో నివేదికలు అస్పష్టంగా ఉన్నాయని సెంట్రల్ బ్యాంక్ (ఆర్బీఐ) తెలిపింది. ప్రింట్ ప్రెస్లలో ముంద్రించిన నోట్లన్ని ఆర్బీఐ వద్దకు చేరాయని, అందుకు సంబంధించిన లెక్కలు పక్కాగా ఉన్నాయని స్పష్టం చేసింది. ఓ వర్గానికి చెందిన మీడియా సంస్థలు కరెన్సీ నోట్ల గురించి కథనాలు ప్రచురించాయి. ఆ కథనాలు తన దృష్టికి రావడంతో ఆర్బీఐ స్పందించింది. ఈ నివేదికలు సరైనవి కావని ఆర్బీఐ పేర్కొంది. Clarification on Banknote pic.twitter.com/PsATVk1hxw — ReserveBankOfIndia (@RBI) June 17, 2023 నోట్ల ఉత్పత్తి, నిల్వ, పంపిణీని పర్యవేక్షించే ప్రోటోకాల్లతో సహా, ప్రెస్లలో ముద్రించబడిన, సరఫరా చేయబడిన బ్యాంక్ నోట్ల పునరుద్ధరణ కోసం పటిష్టమైన వ్యవస్థలను కలిగి ఉన్నామని ఆర్బీఐ హామీ ఇచ్చింది. ఈ సందర్భంగా కరెన్సీ నోట్లపై ఆర్బీఐ ఇస్తున్న సమాచారం సరైందేనని, ప్రజలు వాటిని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని బ్యాంక్ ఆఫ్ ఇండియన్ బ్యాంక్స్ వెల్లడించింది. ఇదీ చదవండి : స్టార్టప్ కంపెనీ పంట పండింది.. అదానీ చేతికి ‘ట్రైన్మ్యాన్’! -
రూ. 500 నోట్ల రద్దు.. నిజమేనా?
భారతదేశంలో ప్రస్తుతం నోట్ల రద్దు, ఉపసంహరణ మాటలు జోరుగా వినిపిస్తున్నాయి. రూ. 2000 నోట్ల ఉపసంహరణ ఇప్పటికే ప్రారంభమైంది. కాగా రూ. 500 నోట్లను కూడా రిజర్వ్ బాంక్ అఫ్ ఇండియా రద్దు చేస్తుందని లేదా ఉపసంహరించుకుంటుందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీనిపైన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ స్పందించారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. శక్తికాంత దాస్ వెల్లడించిన సమాచారం ప్రకారం.. ఇప్పుడు రూ. 500 నోట్ల రద్దు & ఉపసంహరణకు సంబంధించిన వార్తలన్నీ అవాస్తవాలే అని, ఇప్పటి వరకు ఈ విషయంపై ఆర్బీఐ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, అలాంటి ఆలోచన కూడా లేదని తెలిసింది. అంతే కాకుండా రూ. 1000 నోట్లను మళ్ళీ ప్రవేశపెట్టే ఉద్దేశ్యం అసలే లేదని వెల్లడించారు. (ఇదీ చదవండి: రెపో రేటుపై ఆర్బీఐ ప్రకటన.. కీలక వడ్డీ రేట్లు యధాతథం) రూ. 500 నోట్ల రద్దు మీద జరుగుతున్న ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని శక్తికాంత దాస్ వెల్లడించారు. రూ.2000 నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకున్న నేపథ్యంలో ఆర్బీఐ గవర్నర్ వివరణ ఇచ్చారు. ఇప్పటికి చెలామణిలో ఉన్న రూ.2000 నోట్లలో 50 శాతం వెనక్కి వచ్చాయని దాస్ తెలిపారు. తిరిగి వచ్చిన నోట్ల విలువ సుమారు రూ.1.82 లక్షల కోట్లు. చెలామణిలో ఉన్న రెండు వేల నోట్ల విలువ రూ. 3.62 లక్షల కోట్లు అని గతంలోనే వెల్లడించారు. (ఇదీ చదవండి: వేల కోట్లు వద్దనుకుని చిన్న అపార్ట్మెంట్లో రతన్ టాటా తమ్ముడు - ఎందుకిలా..) తిరిగి వచ్చిన రూ. 2,000 నోట్లలో 85 శాతం నోట్లు బ్యాంకు డిపాజిట్లుగా, మిగిలినవి మార్పిడి కోసం వచ్చినట్లు ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. 2023 మే 19న ఆర్బీఐ రెండు వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ నోట్ల మార్పిడికి లేదా డిపాజిట్ చేసుకోవడానికి సెప్టెంబర్ 30 చివరి రోజు అని కూడా అప్పుడే తెలిపింది. -
RBI: దెబ్బకు ఆర్బీఐ వెబ్సైట్ క్రాష్.. కారణం ఇదే!
Reserve Bank of India: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రూ. 2000 నోట్ల చాలామని ఉండదని తాజాగా ప్రకటించిన కొంత సమయంలో బ్యాంక్ అధికారిక వెబ్సైట్ క్రాష్ అయింది. ఈ ప్రకటనలో ఎంత వరకు నిజముంది అని తెలుసుకోవడంలో భాగంగా చాలా మంది ఒక్కసారిగా ఆర్బీఐ అధికారిక వెబ్సైట్లోకి వెళ్లడంతో ఈ అంతరాయం ఏర్పడింది. 2016లో ప్రధానమంత్రి రూ. 500, రూ. 1000 నోట్ల రద్దు ప్రకటించినప్పుడు కూడా ఇలాంటి అంతరాయమే ఏర్పడింది. ఎవరూ ఊహించని విధంగా రాత్రి సమయంలో ఈ ప్రకటన చేసినప్పుడు చాలా మంది ప్రజలు దీని గురించి తెలుసుకోవడానికి అధికారిక వెబ్సైట్ సందర్శించారు. ఎక్కువ మంది ఒక్కసారిగా ఈ వెబ్సైట్ ఓపెన్ చేయడంలో క్రాష్ అయింది. మళ్ళీ అలాంటి సంఘటనే ఇప్పుడు పునరావృతమైంది. దేశంలో బ్లాక్ మనీ తగ్గించడానికి రూ. 500, రూ. 1000 నోట్లు రద్దు చేసి కొత్తగా రూ. 2000 నోట్లు తీసుకువచ్చారు. అయితే వాటి ముద్రణ కూడా 2018-19 ఆర్థిక సంవత్సరంలోనే నిలిచిపోయింది. 2018 మార్చి 31 నాటికి చెలామణిలో ఉన్న రెండువేల రూపాయల మొత్తం విలువ సుమారు రూ. 6.73 లక్షల కోట్లని సమాచారం. ప్రస్తుతం RBI వెల్లడించిన సమాచారం ప్రకారం 2023 మే 23 నుంచి ఏ జాతీయ బ్యాంకులోనైనా రూ. 2 వేల నోట్లను మార్చుకోవచ్చు. అయితే ఒక వ్యక్తి ఒక సారికి కేవలం 10 నోట్లను మాత్రమే డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ నోట్లను మార్చుకోవడానికి చివరి తేదీ సెప్టెంబర్ 30. కావున రెండు వేల రూపాయలు కలిగి ఉన్న ప్రజలు ఏ మాత్రం భయపడాల్సిన పనిలేదు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. -
Rs 2000 Note Ban: రూ. 2 వేల నోట్లు రద్దు
సాక్షి, ముంబై: కేంద్రబ్యాంకు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది.చలామణిలో ఉన్న రూ.2 వేల నోట్లను ఉపసంహరిస్తూ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. దేశంలో అతిపెద్ద 2000 డినామినేషన్ నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది. అయితే, ఈనోట్లు చట్టబద్ధమైన టెండర్గా కొనసాగుతాయని సెంట్రల్ బ్యాంక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. కండిషన్స్ అప్లయ్ ♦ మే 23 నుంచి ఏ జాతీయ బ్యాంకులోనైనా రూ. 2 వేల నోట్లను మార్చుకోవచ్చు. ♦ ఏ విత్ డ్రా అయినా, ఎంత డబ్బు ఇవ్వాలన్నా అందులో రూ. 2 వేల నోట్లను ఇవ్వొద్దని బ్యాంకులను ఆదేశించిన ఆర్బీఐ ♦ సెప్టెంబరు 30 లోగా ప్రజలు తమ దగ్గరున్న 2 వేల నోట్లను ఏ బ్యాంకులోనయినా డిపాజిట్ చేయొచ్చు ♦ ఒక వ్యక్తి ఒక విడతలో గరిష్టంగా పది రూ. 2 వేల నోట్లను మాత్రమే మార్చుకోవచ్చు. ♦ ఈ నెల 23 నుంచి రూ.2 వేల నోట్లు మార్చుకునే అవకాశం ఉంది ♦ మార్చుకోడానికి చివరి తేదీ సెప్టెంబర్ 30 ♦ 2018-19 ఆర్థిక సంవత్సరంలోనే నిలిచిపోయిన రూ.2 వేల నోటు ముద్రణ “క్లీన్ నోట్ పాలసీ” లో భాగంగానే ఈ నిర్ణయం : ఆర్బీఐ రూ.2000 డినామినేషన్ నోట్లలో దాదాపు 89శాతం మార్చి 2017కి ముందు జారీ చేసినవి. వాటి జీవితకాలం 4-5 సంవత్సరాలుగా అంచనా వేయబడింది. మార్చి 31, 2018 నాటికి (చెలామణిలో ఉన్న నోట్లలో 37.3శాతం) గరిష్టంగా ఉన్న రూ.6.73 లక్షల కోట్ల నుండి చెలామణిలో ఉన్న ఈ నోట్ల మొత్తం విలువ రూ.3.62 లక్షల కోట్లకు తగ్గింది, మార్చి 31, 2023న చెలామణిలో ఉన్న నోట్లలో కేవలం 10.8శాతం మాత్రమే ఉన్నాయి. ఈ విలువ సాధారణ లావాదేవీలకు ఉపయోగించడం లేదని గమనించినట్టు ఆర్బీఐ పేర్కొంది. అలాగే ఇతర డినామినేషన్లలోని నోట్ల స్టాక్ ప్రజల కరెన్సీ అవసరాలను తీర్చడానికి సరిపడా అందుబాటులో ఉంటాయని తెలిపింది. కాగా 2016లో నవంబరులో చలామణిలో ఉన్న రూ.1,000 రూ.500 నోట్ల రద్దు చేసిన తరువాత రూ.2వేల కరెన్సీ నోటును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. RBI to withdraw Rs 2000 currency note from circulation but it will continue to be legal tender. pic.twitter.com/p7xCcpuV9G — ANI (@ANI) May 19, 2023 -
'షిర్డి ఆలయం నుంచి నాణేలను తీసుకోం'..! అంటున్న బ్యాంకులు
మహారాష్ట్రలో ప్రఖ్యాతి గాంచి షిర్డీ సాయిబాబా ఆలయం నాణేల సమస్యలను ఎదుర్కొంటోంది. ఈ ఆలయానికి ప్రతి నెల నాణేల రూపంలో సుమారు రూ. 28 లక్షల వరకు విలువైన నగదు వస్తుంది. దీన్ని బ్యాంకులో జమ చేస్తారు. ఈ సంస్థ ట్రస్ట్కి ప్రభుత్వ సంబంధ బ్యాంకులకు సంబంధించి మొత్తం 13 శాఖల్లో ఖాతాలు ఉన్నాయి. వీటిలో ఎక్కువ బ్యాంకులు షిర్డీలో ఉండగా, ఒకటి నాసిక్లో ఉంది. ట్రస్ట్ ఖాతా ఉన్న ప్రతి బ్యాంకు ఆలయం నుంచి విరాళాలను, డిపాజిట్లను సేకరించడానికి ప్రతి నెల తమ సిబ్బందిని పంపుతాయి. ఐతే నాణేల రూపంలో ఇప్పటికే సుమారు రూ. 11 కోట్లు షిర్డీ సంస్థాన్కి సంబంధించిన బ్యాంకులో డిపాజిట్ అయ్యింది. ఇక నాణేలను దాచేందుకు అక్కడ బ్యాంకుల వద్ద స్థలంలో లేదు. దీంతో నాలుగు బ్యాంకుల అధికారులు ప్రతిరోజు లభించే నాణేలను ఉంచడానికి తమ వద్ద స్థలం లేదన్నారు. దీంతో షిర్డీ ట్రస్ట్ నాణేలను ఉంచడం ఒక సమస్యగా మారింది. దీంతో ఈ విషయంలో ఆర్బీఐని జోక్యం చేయయమంటూ..ట్రస్ట్ నేరుగా లేఖ రాయాలని యోచిస్తోంది. ఈ నాలుగు బ్యాంకుల తోపాటు ఇతర బ్యాంకులు కూడా ఇదే మాదిరి నాణేలను దాచేందుకు స్థలం సమస్యను ఎదుర్కొంటున్నట్లు సమాచారం. ఈ మేరకు ట్రస్ట్ సీఈవో మాట్లాడుతూ..కోవిడ్ మహమ్మారి తర్వాత నుంచి మళ్లీ నాణేల సమ్యస్య తెరపైకి వచ్చింది. ఆలయంలో సగటున రోజువారిగా 50 వేలకు పైగా నాణేలు పేరుకుపోయాయి. నాణేల సేకరణను నాలుగు బ్యాంకులు నిలిపేశాయి. దీంతోపాఏటు మిగిలిన బ్యాంకులు ఇదే సమస్యను ఎదుర్కొటున్నాయి. ఈ సమస్యను పరిష్కరించమని షిర్డీ సంస్థాన్ అధికారులు తనని సంప్రదించినట్లు తెలిపారు. ఈ విషయమై అహ్మదాబాద్లో మిగతా బ్యాంకులను సంప్రదించి..అక్కడ ఖాతాలనుతెరిచే యోచన కూడా చేస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా, బ్యాంకుల మాత్రం తమ వద్ద నాణేలు చాలా పెద్ద మొత్తంలో పేరుకుపోయాయని చెబుతున్నాయి. అప్పట్లో ట్రస్ట్ నాణేలను నిల్వ చేయడానికి ఆలయ ప్రాంగణంలో బ్యాంకుల గదులను ఇచ్చింది. కాని కానీ నిబంధనల ప్రకారం అందుకు అనుమతి లేనందున తిరస్కరించినట్లు చెప్పారు. (చదవండి: మోదీ పర్యటన వేళ ఆత్మాహుతి దాడి బెదిరింపు లేఖ..అప్రమత్తమైన అధికారులు) -
వామ్మో రూ. 35 వేల కోట్లా.. బ్యాంకులు ఏం చేశాయో తెలుసా?
దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఎవరూ క్లయిమ్ చేయని డిపాజిట్లు పేరుకుపోయాయి. 2023 ఫిబ్రవరి నాటికి దాదాపు రూ. 35 వేల కోట్ల అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు బ్యాంకుల వద్ద ఉన్నాయి. ఇవి 10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలంగా ఆపరేట్ చేయని 10.24 కోట్ల ఖాతాలకు సంబంధించినవి. ఈ డబ్బును ప్రభుత్వ రంగ బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్కి బదిలీ చేశాయి. (అంచనాలకు మించి పన్ను వసూళ్లు.. ఏకంగా రూ.16.61 లక్షల కోట్లు) ఆర్బీఐ వద్ద అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం... 2023 ఫిబ్రవరి చివరి నాటికి 10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలంగా నిర్వహించని డిపాజిట్లకు సంబంధించి ప్రభుత్వ రంగ బ్యాంకులు ఆర్బీఐకి బదిలీ చేసిన డిపాజిట్ల మొత్తం రూ. 35,012 కోట్లు అని ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాద్ తాజాగా లోక్సభలో తెలియజేశారు. (రియల్ ఎస్టేట్కు తగ్గని డిమాండ్.. హైదరాబాద్లో భారీగా పెరిగిన అమ్మకాలు) ఆర్బీఐకి బదిలీ చేసిన రూ. 35,012 కోట్ల అన్ క్లయిమ్డ్ డిపాజిట్లలో అత్యధికంగా రూ. 8,086 కోట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఖాతాదారులకు సంబంధించినవి. ఆ తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఖాతాదారులవి రూ. 5,340 కోట్లు, కెనరా బ్యాంక్ నుంచి రూ. 4,558 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి రూ. 3,904 కోట్లు ఉన్నాయి. -
పెరగనున్న వడ్డీ రేట్లు.. మరో పావు శాతం రెపో పెంపు ఖాయం!
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వచ్చే నెల 3,5,6వ తేదీల్లో జరపనున్న ఆర్థిక సంవత్సరం తొలి ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షలో రెపో రేటును మరో పావుశాతం పెంచడం ఖాయమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇదే జరిగితే బ్యాంకులకు ఆర్బీఐ తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు 6.75 శాతానికి పెరగనుంది. పాలసీ సమీక్ష నిర్ణయాలు 6వ తేదీన వెలువడనున్నాయి. ఇదీ చదవండి: Twitter gold tick: నీ బ్యాడ్జ్ బంగారం గానూ! ట్విటర్ గోల్డ్ టిక్ కావాలంటే అంతా? ఉక్రెయిన్పై రష్యా దాడి, అంతర్జాతీయంగా క్రూడ్ ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం తీవ్రత నేపథ్యంలో దీర్ఘకాలంగా 4 శాతంగా ఉన్న రెపో రేటు, మే 4వ తేదీన మొదటిసారి 0.40 శాతం పెరిగింది. జూన్ 8, ఆగస్టు 5, సెప్టెంబర్ 30 తేదీల్లో అరశాతం చొప్పున పెరుగుతూ, 5.9 శాతానికి చేరింది. డిసెంబర్ 7న ఈ రేటు పెంపు 0.35 శాతం ఎగసి 6.25 శాతాన్ని తాకింది. ఫిబ్రవరి మొదట్లో జరిగిన ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధానంలో వరుసగా ఆరవసారి (పావు శాతం) రేటు పెంపుతో మే నుంచి 2.5 శాతం రెపో రేటు పెరిగింది. ఈ రేటు 6.5 శాతానికి ఎగసింది. ఇదీ చదవండి: ఇంట్లో ఎక్కువ డబ్బు పెట్టుకుంటున్నారా.. ఏమవుతుందో తెలుసా? జాగరూకత అవసరం: కాగా, వడ్డీరేట్ల పెరుగుదల, దీనికి సంబంధించిన ఎదురయ్యే సవాళ్ల వంటి విషయాల్లో అప్రమత్తత అవసరమని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకింగ్కు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల చీఫ్లతో ఆమె ఒక అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. బ్యాంకింగ్ పనితీరు, పటిష్టతపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించడం జరిగింది. ఇదీ చదవండి: గ్యాస్ వినియోగదారులకు ఊరట.. ధరల పరిమితిపై కేంద్రం పరిశీలన! -
ఆర్బీఎల్ బ్యాంకుకు దిమ్మతిరిగే షాకిచ్చిన ఆర్బీఐ!
ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంక్ ఆర్బీఎల్ బ్యాంకుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) దిమ్మతిరిగిపోయే షాకిచ్చింది. లోన్ రికవరీ ఏజెంట్లకు సంబంధించి ఆదేశాలను ఉల్లంఘించినందుకు గానూ రూ. 2.27 కోట్ల జరిమానా విధించింది. ఇదీ చదవండి: Rs 2000 notes: రూ.2వేల నోట్లపై కేంద్రం కీలక ప్రకటన! లోన్ రికవరీకి సంబంధించి ఆర్బీఎల్ బ్యాంక్పై ఆర్బీఐకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో 2018-19 నుంచి 2021-22 ఆర్థిక సంవత్సరాల్లో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన ఆర్బీఐ.. రికవరీ ఏజెంట్ల విషయంలో ఆదేశాలను ఆర్బీఎల్ బ్యాంక్ ఉల్లంఘించినట్లు గుర్తించింది. దీంతో ఆ బ్యాంక్ భారీ జరిమానా విధించింది. ఇదీ చదవండి: టాటాతో కుదరలేదు.. ఇక బిస్లెరీకి బాస్ ఆమే... లోన్ రికవరీ ఏజెంట్లు కస్టమర్లను బెదిరింపులకు, వేధింపులకు గురిచేయకుండా చూసుకోవడంలో ఆర్బీఎల్ బ్యాంక్ విఫలమైందని కేంద్ర బ్యాంక్ ఆక్షేపించింది. ఏజెంట్లను నియమించుకునే ముందు వారి నేర చరిత్రను పోలీసుల ద్వారా ధ్రువీకరించుకోవాల్సి ఉందని పేర్కొంది. ఇదీ చదవండి: Apple Watch: ప్రాణం కాపాడిన యాపిల్ వాచ్!.. ఎలాగంటే... ఈ చర్య 2018-19 నుంచి 2021-22 ఆర్థిక సంవత్సరాల కాలంలో గుర్తించిన ఉల్లంఘనలపై మాత్రమే తీసుకున్నదని ఆర్బీఐ స్పష్టం చేసింది. తమ పరిధిలోని బ్యాంకులు లేదా ఇతర ఆర్థిక సంస్థలు రుణాల వసూలు కోసం నియమించుకున్న ఏజెంట్లు కస్టమర్లను బెదిరింపులకు, వేధింపులకు గురిచేయకుండా చూసుకోవాలని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని 2022లో ఆర్బీఐ ఒక సర్క్యులర్ను జారీ చేసింది. -
ఆన్లైన్లో డబ్బులు పోతే ఏం చేయాలి?!
కూతురు పుట్టినరోజుకు డ్రెస్ కొనుగోలు చేసిన సౌమ్య ఫోన్ యాప్ ద్వారా పేమెంట్ చేసింది. అయితే, పేమెంట్ మోడ్కి వచ్చేసరికి డబ్బులు డెబిట్ అయినట్టు బ్యాంక్ నుంచి మెసేజ్ వచ్చింది కానీ, షాప్ యజమాని ఖాతాలో నగదు క్రెడిట్ కాలేదు. దీంతో ఒకటికి రెండు సార్లు పేమెంట్ చేసింది. ఫెయిల్ అయిన ట్రాన్సాక్షన్ అమౌంట్ రిటర్న్ అవుతుందిలే అని ఊరుకుంది. కానీ, అలా రిటర్న్ అయిన మెసేజ్ ఏమీ రాలేదు. ఆ అమౌంట్ను తిరిగి ఎలాపొందడం, లేకపోతే అంతమొత్తం ఎలా వదిలేయడం.. ఓ రెండు రోజులు ఆగి చూద్దామా.. ఇలాంటి సందేహాలతోనే సౌమ్యకు ఆ రోజు గడిచిపోయింది. ఇటీవల స్మార్ట్ఫోన్ ఉన్న ప్రతి వ్యక్తికి ఆన్లైన్ పేమెంట్స్ గురించి తెలిసిందే. పండ్లు, కూరగాయల బండి వద్ద కూడా యాప్ ఆధారిత పేమెంట్ ఆప్షన్ కనిపిస్తుంటుంది. ఇందుకు గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎమ్ వంటి వాటి ద్వారా ఆర్థిక లావాదేవీలు జరుపుతుంటాం, ఇలాంటప్పుడు సర్వర్ సరిగ్గా పనిచేయకనో లేదా మరో కారణంగానో ఆన్లైన్ లావాదేవీలు నిలిచిపోయినప్పుడు లేదా ఆన్ లైన్ నగదు మోసాల జరిగినప్పుడు ఏం చేయాలో ప్రతిఒక్కరికీ అవగాహన తప్పక ఉండాలి. ఫిర్యాదులకు వేదిక సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ (CFCFRM ) ) అనేది భారతదేశంలో పౌరులు ఆర్థిక సైబర్ మోసాలను ఫిర్యాదు చేయడానికి ఒక వేదిక. ఆర్థిక సైబర్ మోసానికి సంబంధించిన సంఘటనలను నివేదించడానికి, నిర్వహించడానికి పౌరులకు అనుకూలమైన, సురక్షితమైన మార్గాన్ని అందించడం ఈ ప్లాట్ఫారమ్ లక్ష్యం. మోసానికి సంబంధించిన సంబంధిత పత్రాలు, సాక్ష్యాలను దీనిలో అప్లోడ్ చేయచ్చు. ఇది ఆర్థిక సైబర్ మోసాన్ని ఎలా నిరోధించాలనే దానిపై సమాచారం, మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది. నివేదిక ఇచ్చాక, విచారణ కోసం సంబంధిత చట్టాన్ని అమలు చేసే ఏజెన్సీకి పంపిస్తుంది. తగిన చర్య కోసం బ్యాంకింగ్ అధికారులకు పంపుతుంది. మోసగాడి ఖాతాలో బాధితుడి డబ్బు ఇంకా అందుబాటులో ఉంటే, బ్యాంకు దానిని హోల్డ్లో ఉంచుతుంది. తర్వాత, ఫిర్యాదుదారు అధికారికంగా కోర్టుకు హాజరు కావాలి. ఆ పై డబ్బు బాధితుడి ఖాతాకు బదిలీ చేయబడుతుంది. ఈ స్థితిని ట్రాక్ చేయడానికి ఒక యంత్రాంగాన్ని అందిస్తుంది. CFCFRM టోల్ ఫ్రీ నెంబర్: 1930 ♦ వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1930కి కాల్ చేయాలి (12 గంటల్లోపు) ♦ ప్రత్యామ్నాయంగా https://cybercrime.gov.in పోర్టల్కు లాగిన్ అయ్యి, ఫిర్యాదు చేయాలి. ♦బ్యాంక్ అకౌంట్ నెంబర్, వాలెట్ యుపిఐ, లావాదేవీ ఐడీ, తేదీ, డెబిట్/క్రెడిట్ కార్డ్ నంబర్లు మొదలైనవి ఇవ్వాలి. ♦ సమీపంలోని పోలీస్ స్టేషన్ కు వెళ్లి, రసీదు సంఖ్యను ఎఫ్ఐఆర్గా మార్చవచ్చు. RBI వన్ నేషన్ వన్ అంబుడ్స్మన్ : టోల్ ఫ్రీ నెం. 14448 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా ‘వన్ నేషన్ వన్ అంబుడ్స్మన్ పథకం’ అందుబాటులోకి వచ్చింది. మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఇతర ఎలక్ట్రానిక్ చెల్లింపు వ్యవస్థలకు సంబంధించిన వాటితో సహా అన్ని డిజిటల్ లావాదేవీలకు సంబంధించిన ఫిర్యాదులను పరిష్కరించడానికి వినియోగదారులకు ఒకే పా యింట్ ఆఫ్ కాంటాక్ట్ అందించడం ఈ పథకం లక్ష్యం. ఈ పథకం కింద, వినియోగదారుల నుండి ఫిర్యాదులను స్వీకరించడానికి, పరిష్కరించడానికి ప్రతి రాష్ట్రంలో ఆర్బిఐచే నియమించబడిన అంబుడ్స్మన్ ఉంటారు. ఫిర్యాదులను స్వీకరించడం, విషయాన్ని విచారించడం, ఫిర్యాదు సరైనదేనని తేలిన సందర్భాల్లో బాధిత వినియోగదారులకు పరిహారం అందించే అధికారం ఈ అంబుడ్స్మన్ కు ఉంటుంది. అంబుడ్స్మన్ స్వతంత్రంగా, నిష్పక్షపా తంగా పని చేస్తారు. వారి నిర్ణయాలకు బ్యాంకింగ్ సంస్థలు కట్టుబడి ఉంటాయి. దశల వారీగా నివేదించే ప్రక్రియ... ♦ సంబంధిత యుపిఐ సర్వీస్ప్రొవైడర్ పేటీఎమ్, గూగుల్ పే, ఫోన్ పె మొదలైన వాటిపై ఫిర్యాదు. ♦టోల్ ఫ్రీ నంబర్ 14448కి కాల్ చేయాలి. ♦https://cms.rbi.org.in పోర్టల్కు లాగిన్ చేసి, ఫిర్యాదు ఇవ్వచ్చు. ♦మీ ఫిర్యాదును CRPC@rbi.org కి ఇ–మెయిల్ చేయచ్చు. (బ్యాంక్ స్టేట్మెంట్ లావాదేవీ స్క్రీన్ షాట్లు / యుపిఐ, యాప్ లావాదేవీ స్క్రీన్ షాట్లు/ పంపిన, స్వీకరించిన ఫోన్ నంబర్లు రెండింటినీ జత చేయాలి) ♦ బాధితుడి డబ్బు ఇంకా అందుబాటులో ఉంటే, బ్యాంక్ దానిని హోల్డ్లో ఉంచుతుంది, తర్వాత ఫిర్యాదుదారు ఖాతాకు బదిలీ చేస్తుంది. డబ్బులు ఇరుక్కుపోతే.. డబ్బులు బదిలి చేసినప్పుడు మన అకౌంట్ నుంచి డిడక్ట్ అయినా అవతలి వారికి వెళ్లకపోవడం, లేదా పేమెంట్ ఆగిపోవడం వంటివి జరిగినప్పుడు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా యుపిఐ వివాదానికి పరిష్కారాన్ని తెలుసుకోవచ్చు. ప్రతి కస్టమర్ PSP యాప్ (పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు) / TPAPయాప్ (థర్డ్ పా ర్టీ అప్లికేషన్ప్రొవైడర్లు)లో UPIలావాదేవీకి సంబంధించి NPCI పోర్టల్ https://www.npci.org.in/what-we-do/upi/dispute-redressal-mechanism లో ఫిర్యాదు చేయవచ్చు. ఈ కింది కారణాల వల్ల మాత్రమే అభ్యర్థనలను ఇవ్వాలి.. (ఎ) ఖాతా నుంచి మొత్తం డెబిట్ అయ్యింది కానీ లబ్ధిదారునికి క్రెడిట్ కాలేదు (బి) ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయ్యింది కానీ మొత్తం నగదు డెబిట్ అయ్యింది (సి) చేయాల్సిన ఖాతాకు కాకుండా వేరొక ఖాతాకు తప్పుగా బదిలీ అయ్యింది (డి) లావాదేవీ సమయం ముగిసింది కానీ ఖాతా నుంచి డెబిట్ అయ్యింది (ఇ) మోసపూరితమైన లావాదేవీ జరిగింది (ఎఫ్) నగదు లావాదేవీ పెండింగ్లో ఉండిపోయింది (జి) లావాదేవీ అసలు యాక్సెస్ అవలేదు (హెచ్) లావాదేవీ రిజక్ట్ అయ్యింది (ఐ) పరిమితిని మించి పొ రపా టున లావాదేవీ జరిగింది. - ఇన్పుట్స్: అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
బ్యాంకులకు ఆర్బీఐ కీలక ఆదేశాలు!
-
ద్రవ్యోల్బణానికి అదే ప్రధాన కారణం: ఆర్బీఐ
ముంబై: దేశంలో ఈ ఏడాది తొలి నెలల్లో ద్రవ్యోల్బణం పెరుగుదలకు సరఫరాల సంబంధ సమస్యలే ప్రధాన కారణమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మంగళవారం విడుదల చేసిన ఒక బులెటిన్లో పేర్కొంది. అయితే ఇప్పుడు ఈ ప్రభావం క్షీణించిందని, తగ్గిన ద్రవ్యోల్బణం తీవ్రత నేపథ్యంలో వ్యవస్థలో డిమాండ్, వ్యయాలు భారీగా పెరుగుతున్నాయని బులెటిన్ వివరించింది. ద్రవ్యోల్బణం దిగివచ్చి, డిమాండ్ నిరంతరం కొనసాగే పరిస్థితులు కనిపిస్తున్నాయని వివరించింది. 2022 ఫిబ్రవరి తర్వాత ద్రవ్యోల్బణం పరిస్థితిని విశ్లేషించిన ఆర్బీఐ పేపర్ ప్రకారం, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ఫలితంగా ఏర్పడిన సరఫరాల వైపు సమస్యలు– రిటైల్ ద్రవ్యోల్బణాన్ని నవంబర్ వరకూ గడచిన 10 నెలల్లో ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న 6 శాతానికి మించి పెంచాయి. అయితే నవంబర్ నెల్లో భారీగా 90 బేసిస్ పాయింట్లు తగ్గి 5.9 శాతంగా నమోదయిన సంగతి తెలిసిందే. ‘అటానమీ ఆఫ్ ఇన్ఫ్లెషన్’ అన్న శీర్షికన రూపొందిన ఈ విశ్లేషణా పత్రం రాసిన బృందానికి ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ మైఖేల్ దేబబ్రత పాత్ర నేతృత్వం వహించారు. ద్రవ్యోల్బణం నిర్దేశిత 6 శాతం దాటి ఎందుకు పెరిగిందన్న అంశంపై ఆర్బీఐ ఇటీవలే కేంద్రానికి ఒక నివేదికను అందజేసింది. ఇది రహస్యంగా సమర్పించిన నివేదిక అని, దీనికి బహిర్గతం చేయడం జరగదని ఆర్బీఐ వర్గాలు పేర్కొన్నాయి. ద్రవ్యోల్బణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2022–23) సగటున 6.7 శాతంగా ఉంటుందని ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) అంచనావేస్తోంది. చదవండి: ఆరేళ్లలో బ్యాంకింగ్ రుణ మాఫీ ఎన్ని లక్షల కోట్లు తెలుసా? -
ఆ బ్యాంకులకు షాకిచ్చిన ఆర్బీఐ.. భారీగా ఫైన్!
నియమాలను ఉల్లంఘించే బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొరడా ఘుళిపించింది. రూల్స్ పాటించని బ్యాంకులపై చర్యలకు పూనుకుంది. ఈ నేపథ్యంలోనే 13 బ్యాంకులపై జరిమానా విధిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. వీటిలో చంద్రాపూర్లోని శ్రీ కన్యకా నగరి సహకారి బ్యాంక్పై గరిష్టంగా రూ. 4 లక్షలు, బీడ్లోని వైద్యనాథ్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్పై రూ. 2.50 లక్షల జరిమానా విధించింది. వాయ్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్, సతారా, ఇండోర్లోని ఇండోర్ ప్రీమియర్ కో-ఆపరేటివ్ బ్యాంక్పై ఒక్కొక్కరికి రూ.2 లక్షలు, పటాన్ నగరిక్ సహకారి బ్యాంక్, పటాన్, మేఘాలయలోని ది తురా అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్లపై ఒక్కొక్కరికి రూ.1.50 లక్షలు ఫైన్ వేసింది. జరిమానాలు విధించిన ఇతర బ్యాంకులు: నాగ్రిక్ సహకరి బ్యాంక్ మర్యాడిట్, జగదల్పూర్; జిజౌ కమర్షియల్ కో-ఆపరేటివ్ బ్యాంక్, అమరావతి; తూర్పు & నార్త్-ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే కో-ఆప్ బ్యాంక్, కోల్కతా; జిలా సహకరి కేంద్రీయ బ్యాంక్ మర్యాదిత్, ఛతర్పూర్; నాగ్రిక్ సహకారి బ్యాంక్ మర్యాడిట్, రాయ్ఘర్; జిలా సహకరి కేంద్రీయ బ్యాంక్ మర్యాదిట్, బిలాస్పూర్; జిలా సహకారి కేంద్రీయ బ్యాంక్ మర్యాడిట్, షాడోల్లకు కూడా భారీగా జరిమానా విధించింది. అయితే ఈ జరిమానాలు కస్టమర్లపై ఎలాంటి ప్రభావం చూపించదని ఆర్బీఐ తెలిపింది. చదవండి టోల్ప్లాజా, ఫాస్టాగ్ కథ కంచికి..ఇక కొత్త పద్ధతిలో టోల్ వసూళ్లు! -
ఏపీ ప్రగతిని ప్రశంసించిన రిజర్వ్ బ్యాంక్ నివేదిక
-
రేటు పెంపు కొనసాగించక తప్పదు
కోల్కతా: ద్రవ్యోల్బణం కట్టడికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రస్తుత కఠిన ద్రవ్య పరపతి విధానం కొనసాగించక తప్పదని మాజీ గవర్నర్ సీ రంగరాజన్ పేర్కొన్నారు. దేశంలోకి విదేశీ పెట్టుబడులు తిరిగి పుంజుకుంటే, రూపాయి బలోపేతం అవుతుందని అభిప్రాయపడ్డారు. భారత్ కోరుకుంటున్న 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్య సాధనకు వచ్చే ఐదేళ్లూ ఆర్థిక వ్యవస్థ 8 నుంచి 9 శాతం పురోగతి సాధించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. రామకృష్ణ మిషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కల్చర్లో సమర్కాంతి పాల్ స్మారక ప్రసంగంలో రంగరాజన్ పేర్కొన్న అంశాల్లో ముఖ్యమైనవి... ► ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దేశం ఏడు శాతం వృద్ధి సాధిస్తే, అది హర్షణీయమైన అంశమే. ► ఆర్బీఐ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపో (మే నుంచి 1.4 శాతం పెంపుతో ప్రస్తుతం 5.40 శాతం) పెంపు విధానాన్ని కొనసాగించాలి. అభివృద్ధి చెందిన దేశాలు సైతం రేట్ల పెంపు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. మరిన్ని రేటు పెంపు చర్యలు కొనసాగుతాయని భావిస్తున్నా. ► దేశం నుంచి పెట్టుబడులు తరలిపోవడం వల్లే డాలర్ మారకంలో రూపాయి విలువ 79 నుంచి 80 శ్రేణిలో పతనమైంది. ఇప్పుడు తిరిగి పెట్టుబడులు పుంజుకుంటున్నాయి. దీనితో దేశీయ కరెన్సీ విలువ మళ్లీ బలోపేతం అవుతుందని భావిస్తున్నాం. పలు నెలలపాటు ఎడతెగని అమ్మకాల తర్వాత, ఆగస్టు 2022లో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల నుంచి రూ. 22,000 కోట్ల పెట్టుబడులు దేశంలోకి వచ్చాయి. ► 27 నుంచి 28 శాతానికి పడిపోయిన పెట్టుబడులు రేటు 33 శాతానికి పెరగాల్సిన అవసరం ఉంది. మొత్తం పెట్టుబడుల్లో ప్రైవేటు రంగం పెట్టుబడులు కూడా భారీగా పెరగాలి. ► విద్యుత్, వ్యవసాయం, మార్కెటింగ్, కార్మిక వంటి కీలక రంగాల్లో సంస్కరణలు కొనసాగాలి. ఆర్థికాభివృద్ధిలో ఇది కీలకం. 1990లలో చేపట్టిన సంస్కరణ చర్యలు ‘మంచి సమన్వయంతో, విస్తృత ప్రాతిపదికన జరిగాయి. ► దేశం మరింత పురోగతి సాధించడానికి కేంద్రం–రాష్ట్రాల మధ్య సమన్వయం అవసరం. వృద్ధి ప్రక్రియలో రెండు వర్గాలూ భాగాస్వాములే. ► కొత్త టెక్నాలజీకి అనుగుణంగా సవాళ్లను, ఉపాధి కల్పనకు సంబంధించిన సమస్యలను ప్రభుత్వాలు పరిష్కరించాలి. ఎలక్ట్రిక్ వాహనాలకు మారడం మంచిదే, కానీ... శిలాజ ఇంధన వినియోగం తగ్గింపుతో ఎలక్ట్రిక్ వాహనాలకు మారడం ప్రయోజనకరంగా ఉంటుందని రంగరాజన్ పేర్కొన్నారు. అయితే దేశం ఈవీల కోసం ఇతర ఉత్పత్తులను దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఉందని విశ్లేషించారు. దీనికితోడు ప్రస్తుత పరిస్థితులు, అంశాల ప్రాతిపదికన ఉపాధి రంగంపై ఈ తీవ్ర ప్రభావం వుండే వీలుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ అభిప్రాయడ్డారు. -
AP: మూడేళ్లల్లో 34.88 శాతం పెరిగిన రాష్ట్ర తలసరి ఆదాయం
సాక్షి, అమరావతి: తొలిసారిగా రాష్ట్ర తలసరి ఆదాయం రెండు లక్షల రూపాయలు దాటింది. 2021–22కి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఇండియా విడుదల చేసిన ఆర్థిక వ్యవస్థ గణాంకాల నివేదికలో వివిధ రాష్ట్రాల తలసరి ఆదాయ వివరాలను వెల్లడించింది. ఆర్బీఐ విడుదల చేసిన ప్రొవిజనల్ గణాంకాల మేరకు రాష్ట్ర తలసరి ఆదాయం 2021–22 ఆర్థిక సంవత్సరంలో రూ. 2,07,771కి పెరిగింది. ఇదే సమయంలో జాతీయ తలసరి ఆదాయం రూ.1,50,007 మాత్రమే నమోదు కావడం గమనార్హం. ఆదుకున్న నవరత్నాలు.. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది ఆర్థిక మందగమనం నెలకొనగా ఆ తరువాత కోవిడ్ సంక్షోభం తలెత్తింది. అయినప్పటికీ 2019 – 20 నుంచి వరుసగా రాష్ట్ర తలసరి ఆదాయం పెరుగుతుండటం గమనార్హం. ఇందుకు ప్రధాన కారణం నవరత్నాల ద్వారా వివిధ పధకాలను నేరుగా లబ్ధిదారులకు చేరవేయడమేనని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రజల కొనుగోలు శక్తి, వస్తు వినియోగం పడిపోకుండా రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ సంక్షోభంలోనూ వివిధ పథకాల ద్వారా ప్రజల చేతికి నగదు అందించింది. దీనివల్ల ఆర్థిక కార్యకలాపాలు స్తంభించకుండా కొనసాగాయి. చాలా రాష్ట్రాలు వృద్ధిలో తిరోగమనంలో ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్య, ఆరోగ్య రంగంలో పెద్దఎత్తున మౌలిక వసతుల ప్రాజెక్టులను చేపట్టడంతో పాటు పేదలకు గృహ నిర్మాణాలను జోరుగా కొనసాగించడంతో మూడేళ్లుగా వృద్ధితో పాటు తలసరి ఆదాయంలో పెరుగుదల నమోదవుతోందని ఆర్థిక శాఖ అధికారులు పేర్కొన్నారు. లాక్డౌన్, కోవిడ్ సంక్షోభ సమయంలో కూడా వ్యవసాయంతో పాటు ఎంఎస్ఎంఈల కార్యకలాపాలు నిరాటంకంగా కొనసాగేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఫలితంగా ముగిసిన ఆర్థిక సంవత్సరం (2021–22)లో రాష్ట్ర తలసరి ఆదాయం ఏకంగా 17.57 శాతం పెరిగింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంతో పోల్చితే రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 31,064 పెరిగింది. మూడేళ్లల్లో 34.88 శాతం పెరుగుదల గత సర్కారు దిగిపోయే నాటికి 2018 – 19లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1,54,031 మాత్రమే ఉండగా 2021 – 22లో ఏకంగా రూ.2,07,771కి పెరిగింది. వైఎస్సార్సీపీ పాలనలో మూడేళ్లలో రాష్ట్ర తలసరి ఆదాయం 34.88 శాతం మేర పెరిగినట్లు స్పష్టమవుతోంది. తలసరి ఆదాయం పెరుగుదల వార్షిక సగటు వృద్ధి 11.62 శాతంగా ఉంది. మూడేళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం నేరుగా నగదు బదిలీ పథకాల ద్వారా రూ.1.65 లక్షల కోట్లను ప్రజల చేతికి పారదర్శకంగా అందించింది. సంక్షోభ సమయంలోనూ పథకాలను నిర్విఘ్నంగా కొనసాగించి పేదలను ఆదుకుంది. ఉపాధి పనులు, పేదల ఇళ్ల నిర్మాణాలను పెద్ద ఎత్తున కొనసాగించడం ద్వారా ఆర్థిక వ్యవస్థకు ఊతం అందించింది. వీటి ఫలితంగా జాతీయ తలసరి ఆదాయం కంటే రాష్ట్ర తలసరి ఆదాయమే ఎక్కువగా నమోదైంది. డీబీటీ కీలకం జాతీయ తలసరి ఆదాయం కంటే రాష్ట్ర తలసరి ఆదాయమే అధికంగా ఉంది. రాష్ట్ర తలసరి ఆదాయం పెరుగుదలలో డీబీటీ (నేరుగా నగదు బదిలీ)ప్రధాన పాత్ర పోషించింది. రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లలో వివిధ సంక్షేమ పథకాల ద్వారా సుమారు రూ.1.65 లక్షల కోట్లకుపైగా నేరుగా ప్రజల ఖాతాల్లోకి జమ చేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించింది. దీనికి తోడు నాడు – నేడు ద్వారా పాఠశాలలు, ఆస్పత్రుల నిర్మాణాలను పెద్ద ఎత్తున చేపట్టడం తయారీ రంగానికి ఊతమిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక పురోగతి కనిపిస్తోంది. – ప్రొఫెసర్ ప్రసాదరావు, ఆర్థిక శాస్త్ర విభాగం మాజీ అధిపతి, ఆంధ్రా యూనివర్సిటీ -
'దేశంలో పెరిగిన నకిలీ నోట్లు'
కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్లను రద్దుచేసి దాదాపు ఆరేళ్లవుతోంది. సమాంతర ఆర్థిక వ్యవస్థను అరికట్టి, నగదు రహిత లావాదేవీలను పెంచడానికి, దేశంలో నకిలీ నోట్లను కనిపించకుండా చేయడానికి నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నట్లు అప్పట్లో అట్టహాసంగా ప్రకటించింది. పాత వెయ్యి, ఐదువందల రూపాయల నోట్లను రద్దు చేసి, వాటికి బదులుగా కొత్తగా రెండువేలు, ఐదువందల రూపాయల నోట్లను ప్రవేశపెట్టింది. కొత్త నోట్లకు నకిలీలు సృష్టించడం అసాధ్యమన్న రీతిలో కేంద్రం ప్రకటనలు గుప్పించింది. ఇంత జరిగినా, దేశంలో నకిలీ నోట్ల చలామణీ ఇంకా జరుగుతూనే ఉంది. అంతేకాదు, నానాటికీ పెరుగుతూనే ఉంది కూడా. నకిలీ నోట్లు గత ఏడాదిలో 102 శాతం మేరకు పెరిగినట్లు సాక్షాత్తు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. నకిలీ కరెన్సీ బెడద అగ్రరాజ్యాల్లో సైతం ఉంది. ఎన్ని చట్టాలు తెచ్చినా, కట్టలు కట్టలుగా, గుట్టలు గుట్టలుగా నకిలీ కరెన్సీ పుట్టుకొస్తూ ఆర్థిక వ్యవస్థకు సవాలు విసురుతూనే ఉంది. ఆర్థిక వ్యవస్థకు చిరకాల సమస్యగా మారిన నకిలీ కరెన్సీ కథా కమామిషూ తెలుసుకుందాం. నోట్ల రద్దు తర్వాత ప్రవేశపెట్టిన రెండువేల రూపాయల నోట్ల ముద్రణను రిజర్వ్బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంతోకాలం కొనసాగించలేదు. దాదాపు మూడేళ్లుగా వీటి ముద్రణ నిలిచిపోయింది. ఈ విషయాన్ని కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్వయంగా ప్రకటించింది. దేశంలో ప్రస్తుతం చలామణీ ఉన్న చోట్ల మొత్తం విలువలో రెండువేల రూపాయల నోట్ల వాటా 1.6 శాతం మాత్రమే. అయినా, గత ఏడాదితో పోల్చుకుంటే, ఈ ఏడాది 54.16 శాతం అధికంగా రెండువేల రూపాయల నకిలీ నోట్లు చలామణీలోకి వచ్చాయి. వీటి కంటే కొంత విరివిగా ఉన్న ఐదువందల రూపాయల నోట్లు గత ఏడాది కంటే ఈ ఏడాది 101.9 శాతం అధికంగా చలామణీలోకి వచ్చాయి. ఈ సంగతిని ఆర్బీఐ 2021–22 వార్షిక నివేదికలో వెల్లడించింది. అంతకు ముందు ఏడాది నకిలీ కరెన్సీ చలామణీలో 190 శాతం పెరుగుదల నమోదైంది. బ్యాంకింగ్ వ్యవస్థ గుర్తించిన నకిలీ నోట్లలో 6.9 శాతం ఆర్బీఐ వద్ద బయటపడితే, మిగిలిన 93.1 శాతం నకిలీ నోట్లను ఇతర బ్యాంకులు గుర్తించాయి. దేశవ్యాప్తంగా 2019లో రూ.25 కోట్ల విలువైన 2,87,404 నకిలీ నోట్లను స్వాధీనం చేసుకోగా, 2020లో రూ.92 కోట్ల విలువైన 8,34,947 నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) వెల్లడించింది. అధికారిక సంస్థలు వెల్లడించిన మొత్తంలో మాత్రమే దేశంలో నకిలీ కరెన్సీ చలామణీలో ఉందనుకుంటే పొరపాటే! దేశంలో చలామణీ అవుతున్న నకిలీ కరెన్సీకి సంబంధించిన కచ్చితమైన లెక్కలు ప్రభుత్వానికి కూడా తెలీవు. ఈ విషయాన్ని పదేళ్ల కిందటే, అప్పటి ఆర్థిక మంత్రి చిదంబరం పార్లమెంటులో స్వయంగా చెప్పారు. యూపీఏ ఓటమి తర్వాత నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దేశంలో నకిలీ కరెన్సీ కనిపించకుండా చేస్తానని మోదీ గంభీరంగా ప్రకటించారు. నకిలీ కరెన్సీని చలామణీ నుంచి మాయం చేయడానికేనంటూ 2016 నవంబర్ 8న ఉన్నపళాన పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించారు. అప్పటి వరకు దేశంలో చలామణీలో ఉన్న వెయ్యి, ఐదువందల రూపాయల నోట్లు చెల్లకుండా పోయాయి. వీటిని మార్చుకోవడానికి పరిమిత గడువు విధించడంతో జనాలు బ్యాంకుల మీదకు ఎగబడ్డారు. మరోవైపు కనీస అవసరాల కోసం డబ్బులు విత్డ్రా చేసుకుందామనుకున్నా, ఏటీఎంల నుంచి గరిష్ఠంగా రెండువేల రూపాయల వరకు మాత్రమే తీసుకునే అవకాశం కల్పించడంతో, దేశవ్యాప్తంగా ఏటీఎంల వద్ద చాంతాడంత క్యూలైన్లలో జనాలు గంటల తరబడి పడిగాపులు పడ్డారు. మెల్ల మెల్లగా పరిస్థితులు దారిలోకి వచ్చినా, దేశంలో నకిలీ కరెన్సీ కలకలం యథావిధిగా మళ్లీ మొదలైంది. నకిలీ కరెన్సీ సమస్య అంత తేలికగా వదిలించుకోగల వ్యవహారం కాదు. నకిలీ కరెన్సీ తయారీలో కొద్దిమంది స్థానికుల పాత్ర ఉంటే, చాలావరకు విదేశీ గూఢచర్య సంస్థలు, మాఫియా ముఠాలు, ఉగ్రవాద మూకల పాత్ర కూడా ఉంటోంది. చివరకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించగలుగుతున్న అగ్రరాజ్యాలకు సైతం ఈ బెడద తప్పడం లేదు. అతి పురాతన వృత్తుల్లో రెండోది నకిలీ కరెన్సీ తయారీ, చలామణీ ప్రపంచంలోని అతి పురాతన వృత్తుల్లో రెండోది అని చరిత్రకారులు చెబుతున్నారు. కాగితపు కరెన్సీ వాడుకలోకి రాకముందు నుంచే నకిలీ కరెన్సీ తయారీ బెడద చాలా చోట్ల ఉండేది. అప్పట్లో నకిలీ నాణేలను తయారు చేసేవారు. రోమన్ సామ్రాజ్యంలోని ఆసియా మైనర్ ప్రాంతానికి చెందిన లిడియాలో క్రీస్తుపూర్వం 600 నాటికి నాణేల తయారీ తొలిసారిగా మొదలైంది. తొలినాళ్లలో బంగారు, వెండి నాణేలు వాడుకలో ఉండేవి. తర్వాతికాలంలో కంచు, రాగి వంటి తక్కువ విలువ కలిగిన లోహాల నాణేలు, ఆ తర్వాత అల్యూమినియం, నికెల్ వంటి అతిచౌక లోహాలతో తయారైన నాణేలు క్రమంగా వాడుకలోకి వచ్చాయి. నాణేలు డబ్బుగా వాడుకలోకి వచ్చి, అవి ప్రజలకు అలవాటైన తొలి రోజుల నుంచే నకిలీ నాణేల తయారీ, చలామణీ కూడా ఉండేది. క్రీస్తుశకం పదమూడో శతాబ్దిలో చైనా తొలిసారిగా కాగితపు కరెన్సీ తయారు చేయడం మొదలుపెట్టింది. చైనాలో అప్పట్లో కరెన్సీ నోట్ల తయారీకి మల్బరీ కలపను ఉపయోగించేవారు. అందువల్ల మల్బరీ అడవులకు కట్టుదిట్టమైన కాపలా ఏర్పాటు చేసేవారు. నకిలీ కరెన్సీ తయారు చేసేవారికి అప్పట్లో పలుదేశాల్లో మరణదండన విధించేవారు. అయినా నకిలీ కరెన్సీ తయారీ, చలామణీ కొనసాగుతూనే ఉండేది. పదమూడో శతాబ్దికి చెందిన ఇటాలియన్ రచయిత డాంటే తొలిసారిగా నకిలీ కరెన్సీ ఉదంతాన్ని గ్రంథస్థం చేశాడు. అప్పట్లో ఇటలీలో చలామణీలో ఉన్న ‘ఫ్లోరినో’ అనే బంగారు నాణేలకు నకిలీలు సృష్టించిన మాస్ట్రో ఆడమో అనేవాణ్ణి ఉరితీసిన సంఘటనను డాంటే తన పుస్తకంలో వివరంగా రాశాడు. నకిలీ కరెన్సీకి సంబంధించి చరిత్రలో నమోదైన తొలి ఉదంతం ఇదే! మన దేశంలో క్రీస్తుపూర్వం మూడో శతాబ్ది నాటికే నకిలీ నాణేల బెడద ఉండేది. కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో వీటిని ‘కూట నాణేలు’గా పేర్కొన్నాడు. శత్రురాజ్యాల ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యేలా చేసి, వాటిని లొంగదీసుకునే ఉద్దేశంతో అప్పటి గూఢచర్య వ్యవస్థలు కూట నాణేలను సాధనంగా ఉపయోగించుకునేవి. క్రీస్తుపూర్వం నాటి ఆ పద్ధతి ఇప్పటికీ మారలేదు. ఉదాహరణ చెప్పుకోవాలంటే, మన దేశంలోకి ఏటా వచ్చిపడుతున్న నకిలీ కరెన్సీ కట్టల్లో పాకిస్తానీ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ హస్తం ఉంటోందనే విషయమై లెక్కలేనన్ని కథనాలు వెలువడ్డ సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్త సమస్య నకిలీ కరెన్సీ ప్రపంచవ్యాప్త సమస్య. నకిలీ కరెన్సీ బెడదను అరికట్టడానికి ప్రతిదేశం తను అధికారికంగా ముద్రించే కరెన్సీలో ఎప్పటికప్పుడు సెక్యూరిటీ ఫీచర్స్ ఏర్పాటు చేసుకుంటూనే ఉంటుంది. అయినా, నకిలీ నిపుణులు వాటికి దీటుగా నకిలీ కరెన్సీని చాపకింద నీరులా చలామణీలోకి తెస్తూనే ఉంటారు. ప్రపంచంలో విరివిగా నకిలీలకు గురయ్యే కరెన్సీ అమెరికన్ డాలర్. ఆ తర్వాత ఇదే వరుసలోకి బ్రిటన్ పౌండ్, యూరోప్ దేశాల ఉమ్మడి కరెన్సీ యూరో వస్తాయి. అత్యధిక శాతం నకిలీలకు లోనయ్యే ఘనత మెక్సికన్ పెసోకు దక్కుతుంది. 9.91 కోట్ల మెక్సికన్ పెసో నోట్లలో కనీసం 3 లక్షల నకిలీ నోట్లు ఉంటాయంటే, మెక్సికోలో నకిలీ కరెన్సీ బెడద ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, హాంకాంగ్, ఇటలీ, జపాన్, దక్షిణ కొరియా, నెదర్లాండ్స్, పోలండ్, పోర్చుగల్, జాంబియా, కొలంబియా, ఆస్ట్రేలియా తదితర దేశాల్లోనూ నకిలీ కరెన్సీ బెడద చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉంది. నకిలీ కరెన్సీ తయారీకి పాల్పడే వారికి జైలు శిక్షలు, జరిమానాలు విధిస్తూ, కట్టుదిట్టమైన చట్టాలను దాదాపు అన్ని దేశాలూ చట్టాలను రూపొందించుకున్నాయి. భారత్ సహా చాలా దేశాల్లో నకిలీ కరెన్సీ తయారీకి పాల్పడితే, గరిష్ఠంగా యావజ్జీవ శిక్ష వరకు పడే అవకాశాలు ఉంటాయి. చట్టాల్లో ఇన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఉన్నా, నకిలీ కరెన్సీ బెడద మాత్రం తగ్గడమే లేదు. అనాయాసంగా డబ్బు సంపాదించాలనే దురాశతో కొందరు నకిలీ కరెన్సీ తయారీని ఒక మార్గంగా ఎంచుకుంటారు. సాధారణంగా ఇలాంటి వాళ్లు తయారు చేసే నకిలీ కరెన్సీ అంత నాణ్యంగా ఉండదు. అందువల్ల ఇలాంటి వాళ్లు పోలీసులకు దొరికిపోతుంటారు. గూఢచర్య సంస్థల అండతో కొన్ని ముఠాలు పకడ్బందీగా నకిలీ నోట్లు తయారు చేస్తుంటాయి. శత్రుదేశాల ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడమే వాటి లక్ష్యం. ఇలాంటి అధికారిక అండదండలతో తయారయ్యే నకిలీ నోట్లు దాదాపు అసలు నోట్లను పోలి ఉంటాయి. ఇవి నాణ్యతలో అసలు నోట్లకు ఏమాత్రం తీసిపోవు. వీటిని గుర్తించడమూ కష్టమే. ఇంకోవైపు అంతర్జాతీయ మాఫియా ముఠాలు, ఉగ్రవాద మూకలు కూడా నకిలీ కరెన్సీ తయారీలోను, వ్యాప్తిలోను ఇతోధిక పాత్ర పోషిస్తున్నాయి. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో హిట్లర్ నాయకత్వంలోని నాజీ సైన్యం ‘ఆపరేషన్ బెర్న్హార్డ్’ పేరిట భారీ ఎత్తున నకిలీ అమెరికన్ డాలర్లు, బ్రిటన్ పౌండ్లు ముద్రించింది. ఆ నోట్ల కట్టలను నిర్ణీత దేశాలకు నిర్దేశిత సమయానికి చేర్చలేకపోవడంతో చరిత్రల అదో విఫలయత్నంగా మిగిలిపోయింది. అమెరికా–సోవియట్ రష్యాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగుతున్న కాలంలో అప్పటి సోవియట్ గూఢచర్య సంస్థ ఇబ్బడి ముబ్బడిగా అమెరికన్ డాలర్లకు నకిలీలను ముద్రించి, అమెరికన్ మార్కెట్లోకి సరఫరా చేసేది. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్ఐ తరచుగా మన భారత్ రూపాయలకు, బంగ్లాదేశ్ టాకాలకు నకిలీలను ముద్రించి, రెండు దేశాల్లోకి చేరవేస్తూ వస్తోంది. ఇలా ఒక దేశంలోకి మరో దేశం నకిలీ సరఫరా చేయడం తరతరాలుగా సాగుతూనే ఉంది. ఐక్యరాజ్య సమితి సహా అంతర్జాతీయ సంస్థలేవీ ఈ సమస్యను అరికట్ట లేకపోతున్నాయి. ఇదిలా ఉంటే, అధునాతన ముద్రణ యంత్రాలు, పరికరాలు అందుబాటులోకి వచ్చాక నకిలీ కరెన్సీ తయారీ ప్రపంచవ్యాప్తంగా పెరిగింది. యూట్యూబ్ వీడియోలు చూసి నకిలీ కరెన్సీ తయారీకి పాల్పడుతూ పోలీసులకు పట్టుబడుతున్న ముఠాలు కూడా ఉంటున్నాయంటే, పరిస్థితి ఏ స్థాయిలో దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. మనకు వచ్చిన నోట్లలో ఏవైనా నకిలీవి ఉన్నట్లు అనుమానం వస్తే, వాటిని ఏ బ్యాంకుకైనా తీసుకు వెళ్లవచ్చు. బ్యాంకు సిబ్బంది వాటిని పరిశీలించి, అసలువో నకిలీవో చెబుతారు. ఒకవేళ నకిలీ నోటు అయితే, బ్యాంకు సిబ్బంది ఆ నోటును తీసుకుని, దాని విలువ తెలుపుతూ ఒక రసీదు ఇస్తారు. నకిలీ నోటు మనకు ఎవరి వద్ద నుంచి వచ్చిందో, వారికి ఆ రసీదు చూపించి, ఇచ్చినది నకిలీ నోటని చెప్పవచ్చు. అయితే, ఆ రసీదుకు ఎలాంటి మారక విలువ ఉండదు. బ్యాంకులో డబ్బు డిపాజిట్ చేసేటప్పుడు అక్కడి యంత్రాలు గాని, సిబ్బంది గాని నకిలీ నోట్లను గుర్తిస్తే, బ్యాంకు సిబ్బంది వాటిని తీసుకుంటారు. అయితే, లావాదేవీలో దాని విలువ శూన్యం. ఒకసారి డిపాజిట్ చేసిన నగదులో నాలుగు లేదా అంతకు మించిన సంఖ్యలో నకిలీ నోట్లను గుర్తిస్తే, బ్యాంకు సిబ్బంది వెంటనే పోలీసులను ఆప్రమత్తం చేస్తారు. ఐదు లేదా అంతకు మించి నకిలీ నోట్లు వస్తే, సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి, కేసు పెడతారు. కరెన్సీ కట్టుదిట్టాలు నకిలీ కరెన్సీ చలామణీలోకి రాకుండా ఉండేందుకు దాదాపు ప్రతిదేశం చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా అంత తేలికగా ఎవరూ నకిలీలు తయారు చేయలేని రీతిలో అధికారిక కరెన్సీని రూపొందిస్తుంది. అధికారిక కరెన్సీ రూపకల్పనలో ఎప్పటికప్పుడు తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే ఉంటుంది. మన దేశం కూడా కరెన్సీ రూపకల్పనలో అనేక జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రస్తుతం మన కరెన్సీలో నకిలీలను కట్టడి చేసేందుకు పొందుపరచిన ముఖ్యాంశాలు ఏమిటంటే... సెక్యూరిటీ త్రెడ్: మన దేశంలో పాత నోట్లలో కూడా సెక్యూరిటీ త్రెడ్ ఉండేది. కొత్తగా 2016 నుంచి చలామణీలోకి తెచ్చిన రెండువేలు, ఐదువందలు, వంద రూపాయలు సహా అన్ని నోట్లలోనూ ఈ సెక్యూరిటీ త్రెడ్ను మరింత కట్టుదిట్టంగా రూపొందించారు. వెలుతురులో పెట్టి చూస్తే, ఈ సెక్యూరిటీ త్రెడ్ సన్నని గీతలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. దీనిపై హిందీ ‘భారత్’ అనే చిన్న అక్షరాలు కనిపిస్తాయి. అసలు నోట్లను గుర్తించడంలో సెక్యూరిటీ త్రెడ్ మొదటి అంశం. సెక్యూరిటీ త్రెడ్ మామూలుగా ఆకుపచ్చ రంగులో ఉంటుంది. దీనిని 45 డిగ్రీల కోణంలో చూస్తే నీలిరంగులో కనిపిస్తుంది. నకిలీ నోట్లలో ఇలా రంగు మార్పు కనిపించదు. వాటర్ మార్క్: మహాత్మాగాంధీ బొమ్మతో చలామణీలో ఉన్న ప్రతి నోటుపైనా మహాత్మాగాంధీ బొమ్మ వాటర్ మార్క్ ఉంటుంది. నోటుపై సెక్యూరిటీ త్రెడ్ పక్కన ఆర్బీఐ గవర్నర్ సంతకం, ఆర్బీఐ ముద్ర ఉంటాయి. ఆ పక్కనే ఖాళీగా కనిపించే భాగాన్ని వెలుగులో చూస్తే, అందులో మహాత్మాగాంధీ బొమ్మ వాటర్ మార్క్ కనిపిస్తుంది. గాంధీ వాటర్ మార్క్ బొమ్మ పక్కనే నోటు విలువ తెలిపే సంఖ్య వాటర్ మార్క్ కూడా కనిపిస్తుంది. సీత్రూ రిజిస్టర్: రూ. 500 నోటుకు ఎడమవైపు 500 సంఖ్య సగం మాత్రమే ముద్రించారా అనేలా కనిపిస్తుంది. దీనికి సరిగ్గా వెనుక భాగంలోనూ అలాగే ఉంటుంది. వెలుతురుకు ఎదురుగా పెట్టి చూస్తే, 500 సంఖ్య పూర్తిగా కనిపిస్తుంది. రూ.2000 నోటులోనూ కనిపించే ఈ సెక్యూరిటీ ఫీచర్నే సీత్రూ రిజిస్టర్ ఫీచర్ అంటారు. న్యూ నంబరింగ్ ప్యాటర్న్: నోటుకు కుడివైపున కింది భాగంలో ముద్రించి ఉండే సంఖ్యలో 2015 నుంచి ఒక సెక్యూరిటీ ఫీచర్ ఏర్పాటు చేశారు. ఎడమ నుంచి కుడివైపు చూస్తున్నప్పుడు ఆ సంఖ్య సైజు పెరుగుతుంది. అయితే, సంఖ్యకు ముందు ఉండే మూడు ఇంగ్లిష్ అక్షరాల సైజు మాత్రం పెరగదు. ఈ సంఖ్య ఏ రెండు నోట్లకు ఒకేలా ఉండదు. ఆప్టికల్లీ వేరియబుల్ ఇంక్: నోటుకు కుడివైపున ఆర్బీఐ చిహ్నం, అశోక స్తంభానికి మధ్యలో నోటు విలువ తెలిపే సంఖ్య ఉంటుంది. కంటికి ఎదురుగా పెట్టుకున్నప్పుడు ఇది ఆకుపచ్చ రంగులో కనిపిస్తుంది. కంటికి సమాంతరంగా పట్టుకున్నప్పుడు నీలం రంగులోకి మారి కనిపిస్తుంది. ఈ సంఖ్య ముద్రణకు ఆప్టికల్లీ వేరియబుల్ ఇంక్ వాడుతారు. అలాగే, నోటుకు కుడివైపు చివరి భాగంలో రైజ్డ్ ప్రింటింగ్లో చిన్న గుర్తు కనిపిస్తుంది. ఇలా రైజ్డ్ ప్రింటింగ్లో రూ.2000 నోటుపై దీర్ఘ చతురస్రం, రూ.500 నోటుపై వృత్తం, రూ.100 నోటుపై త్రిభుజం, రూ.50 నోటుపై చతురస్రం, రూ.20 నోటుపై నిలువుగా ఉండే దీర్ఘ చతురస్రం ఉంటాయి. దృష్టి లోపాలు ఉన్నవారు నోటు విలువను సులువుగా తెలుసుకునేందుకు చేసిన మరో ఏర్పాటు ఇది. నోటు వెనుక వైపు: నోటు వెనుకవైపు తిప్పి చూస్తే, ఎడమవైపు మధ్య భాగంలో నోటు ముద్రించిన సంవత్సరం, దాని పక్కన కింది భాగంలో స్వచ్ఛ భారత్ చిహ్నం, నినాదం ఉంటాయి. దాని పక్కన లాంగ్వేజ్ ప్యానెల్లో తెలుగు సహా పదిహేను భాషల్లో నోటు విలువ రాసి ఉంటుంది. కుడివైపు చివరి భాగంపైన నోటు విలువ సంఖ్య దేవనాగరి లిపిలో ఉంటుంది. రూ.2000 నోటుపై మంగళయాన్, రూ.500 నోటుపై ఎర్రకోట, రూ.200 నోటుపై సాంచీ స్థూపం, రూ.100 నోటుపై రాణీ కా వావ్ చిత్రాలు ఉంటాయి. ఇంటాగ్లియో ప్రింటింగ్: నోటుకు మధ్యలో మహాత్మగాంధీ బొమ్మ, ఆర్బీఐ ముద్ర, కుడివైపున అశోక స్తంభం ఉంటాయి. వీటితో పాటు నోటుకు ఇరువైపులా బ్లీడ్ లైన్స్ను ప్రత్యేక విధానంలో ముద్రిస్తారు. ఈ విధమైన ముద్రణను ఇంటాగ్లియో ప్రింటింగ్ అంటారు. ఇలా ముద్రించిన నోట్లను తాకుతున్నప్పుడు ఉబ్బెత్తుగా చేతికి తగులుతాయి. రూ.100 నుంచి రూ.2000 వరకు విలువ గల నోట్లపై ఇది కనిపిస్తుంది. మైక్రో లెటరింగ్: ప్రతి నోటులోనూ మహాత్మాగాంధీ బొమ్మకు, దాని పక్కనే ఉన్న నిలువుగీతకు మధ్య ‘ఆర్బీఐ’ అనే అతి చిన్న అక్షరాలు కనిపిస్తాయి. భూతద్దం సాయంతో వీటిని స్పష్టంగా చూడవచ్చు. లాటెంట్ ఇమేజ్: నోటు ఎడమవైపు కింది భాగంలో ఒక బొమ్మ కనిపిస్తుంది. దీనిని లాటెంట్ ఇమేజ్ అంటారు. లాటెంట్ ఇమేజ్ అంటే దాగి ఉన్న బొమ్మ. ఈ బొమ్మ లోపల ఏముందో మామూలుగా చూస్తే కనిపించదు. కంటి ఎదుట సమాంతరంగా ఉంచి, వెలుతురులో పెట్టి చూస్తే, అందులో నోటు విలువ అంకెల్లో కనిపిస్తుంది. ఇది 2005 తర్వాత వచ్చిన వంద రూపాయలు, అంతకు పైబడిన విలువ కలిగిన ప్రతి నోటులోనూ ఉంటుంది. -
ఆర్బీఐ కీలక నిర్ణయం, ప్రముఖులు ఏమంటున్నారంటే!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అనూహ్యరీతిలో వడ్డీరేట్ల షాక్ ఇచ్చింది. కీలకమైన రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) పెంచుతున్నట్లు బుధవారం ప్రకటించింది. ఈ సందర్భంగా రెపోరేటు ఎందుకు పెంచుతున్నామనే కారణాల్ని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వివరించారు. ►పెరుగుతున్న ద్రవ్యోల్బణం, భౌగోళిక–రాజకీయ ఉద్రిక్తతలు, అధిక ముడి చమురు ధరలు, ప్రపంచవ్యాప్తంగా వస్తువుల కొరత, సప్లై చైన్లో సమస్యలు, భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నందున ఈ నిర్ణయం తీసుకుంటున్నాం. ►భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, పెరిగిన వస్తువుల ధరల కారణంగా ద్రవ్యోల్బణానికి సంబంధించి ఎకానమీ అంతర్జాతీయంగా సవాళ్లను ఎదుర్కొంటోంది. ఆయా అంశాల పట్ల జాగరూకత అవసరం. ద్రవ్యోల్బణం సవాళ్లు కొనసాగే అవకాశం ఉంది. ►ఈ రోజు రెపో రేటును పెంచాలనే నిర్ణయం మే 2020 తరువాత తొలి ‘యూ’ టర్న్గా పరిగణించవచ్చు. గత నెలలో మేము సరళతర ద్రవ్య విధానాన్ని క్రమంగా ఉపసంహరించుకునే వైఖరిని వ్యక్తపరిచాము. ఆ చర్యకు అనుగుణంగానే నేటి చర్యను చూడాలి. ►ద్రవ్య విధాన చర్య ద్రవ్యోల్బణం పెరుగుదలను నియంత్రించడం, ద్రవ్యోల్బణ అంచనాలను అదుపులోనికి తేవడం లక్ష్యంగా ఉందని నేను స్పష్టం చేయదలచుకున్నాను. అధిక ద్రవ్యోల్బణం వృద్ధికి హానికరం. ►ఆగస్ట్ 2018 తర్వాత పాలసీ రేటును పెంచడం ఇదే మొదటిసారి. ఇది కార్పొరేట్లకు, వ్యక్తులకు రుణ వ్యయాలను పెంచే అవకాశం ఉంది. తాజా ఆశ్చర్యకరమైన పెంపు మే 2020నాటి కోవిడ్ సవాళ్లను ఎదుర్కొనడానికి తీసుకున్న పాలసీ చర్యకు (రేటును 4 శాతం కనిష్టానికి తగ్గించడం) భిన్నమైనది. ►ద్రవ్యోల్బణం లక్ష్యంలోనే ఉండేలా చూసుకోవడానికి సరళతర ద్రవ్య విధానాన్ని ఉపసంహరించుకుంటూనే, అదే సమయంలో అవసరమైతే సరళతరం వైపు మొగ్గుచూపే అవకాశాలవైపు దృష్టి సారించడాన్ని ఆర్బీఐ కొనసాగిస్తుంది. ►దేశీయ సరఫరాల పరిస్థితి బాగున్నప్పటికీ, అంతర్జాతీయంగా గోధుమల కొరత.. దేశీయ గోధుమ ధరలపై ప్రభావం చూపుతోంది. ఇది ద్రవ్యోల్బణం సవాళ్లను పెంచుతోంది. ►రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, ఆంక్షల నేపథ్యంలో వంట నూనెల ధరలు పెరగవచ్చు. ఇటీవలి వాణిజ్య ఒప్పందాలు, భౌగోళిక రాజకీయ పరిస్థితులు భారతదేశానికి మంచి మార్కెట్ అవకాశాలను తెస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ప్రతికూల భౌగోళిక పరిస్థితుల్లోనూ భారత్ స్థిరంగా, సవాళ్లను తట్టుకోగలిగిన స్థాయిలో నిలబడుతోంది. ద్రవ్యోల్బణంపై సీరియస్ ద్రవ్యోల్బణాన్ని ఆర్బీఐ తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తాజా పాలసీ స్పష్టం చేస్తోంది. ద్రవ్యోల్బణం సమస్య వేళ్లూనుకునే పరిస్థితిని తలెత్తబోనీయమని స్పష్టమైన సందేశం ఇచ్చినట్లు దీనిని అర్థం చేసుకోవచ్చు. ఈ తరహా నిర్ణయం ఎకానమీ దీర్ఘకాలిక ప్రయోజనాలకు బలాన్నిస్తుంది. తాజా నిర్ణయంతో బ్యాంకింగ్ డిపాజిట్, రుణ రేట్లు క్రమంగా పెరుగుతాయి. – ఉదయ్ కోటక్, ప్రముఖ బ్యాంకర్ హౌసింగ్కు ప్రతికూలమే... రెపో రేటు దిగువ స్థాయిలో ఉంటే, రియల్టీకి అది మేలు చేస్తుంది. మహమ్మారి సమయంలో సరళతర విధానం హౌసింగ్ రంగానికి సానుకూలత అందించింది. తాజా ఆర్బీఐ నిర్ణయం రియల్టీని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ నిర్ణయం వినియోగదారుల కొనుగోలు శక్తిని తగ్గిస్తుంది. హౌసింగ్ డిమాండ్కు ఇది ప్రతికూలమే. – హర్ష్ వర్దన్ పటోడియా, క్రెడాయ్ ప్రెసిడెంట్ బిజినెస్ సెంటిమెంట్కు దెబ్బ రెపో రేటు, సీఆర్ఆర్ పెంపు ఒకవైపు బిజినెస్ సెంటిమెంట్ను, మరోవైపు కొనుగోలుదారు వినియోగ శక్తిని దెబ్బతీస్తుం ది. కరోనా వైరస్ ప్రభావాల నుంచి ఇప్పటికీ తేరుకోని ఎకానమీపై తాజా ఆర్బీఐ నిర్ణయం ప్రతికూల ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది. వ్యవస్థలో ఎటువంటి ద్రవ్య లభ్యతకు తగిన చర్యలు తీసుకుంటామన్న ఆర్బీఐ ప్రకటన హర్షణీయం.–ప్రదీప్ ముల్తానీ, పీహెచ్డీసీసీఐ ప్రెసిడెంట్ ఆటోకు బ్రేకులు... ఆటోమొబైల్ రంగంలో రుణాలు వ్యయభరితం అవుతాయి. అధిక వెయిటింగ్ పిరియడ్ వల్ల పాసింజర్ వాహన విక్రయాలపై తక్షణ ప్రభావం ఉండకపోవచ్చు. కానీ, ద్విచక్ర వాహన రంగం మాత్రం రేటు పెంపు ప్రభావాన్ని ఎదుర్కొంటుంది. అధిక ఇంధన ధరలకుతోడు తాజా రెపో రేటు పెంపు ప్రభావం చూపుతాయి – వికేశ్, గులాటి, ఎఫ్ఏడీఏ ప్రెసిడెంట్ చదవండి👉నాలుగేళ్ల తర్వాత..ఆర్బీఐ భారీ షాక్!, సామాన్యులపై వడ్డీరేట్ల పిడుగు! -
Telangana: ఎగసిన జల.. లక్ష్మీ కళ
సాక్షి, హైదరాబాద్: ‘నీళ్లు, వ్యవసాయంపై గత ఏడేళ్లలో పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు రాష్ట్రానికి లక్ష్మిని తెచ్చిపెడుతున్నాయి. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులపై భారతీయ రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ) తాజా వార్షిక నివేదిక ప్రకారం 2014–15లో రూ. 5.50 లక్షల కోట్లుగా ఉన్న రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీఎస్డీపీ) విలువ 2021–22లో రెట్టింపై రూ. 11.54 లక్షల కోట్లకు పెరిగింది. వ్యవసాయం, అను బంధ రంగాల్లో సాధించిన వృద్ధి జీఎస్డీపీ పెరుగుదలకు దోహదపడింది. ఈ రంగాల ఉత్పత్తి విలువ రూ. 90,828 కోట్ల నుంచి రూ. 2,16,285 కోట్లకు పెరగడమే ఇందుకు నిదర్శనం. రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం సైతంరూ. 2,78,933కు పెరిగింది. జీఎస్డీపీ వృద్ధిలో ఏటా ఒక రాష్ట్రాన్ని అధిగమిస్తూ రాష్ట్రం పురోగమిస్తోంది. తలసరి ఆదాయంలో పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది’అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు తెలిపారు. ఆదివారం హైదరాబాద్లోని విశ్వేశ్వరయ్య భవన్లో నదులపై జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావించిన వెంటనే నదుల పునరుజ్జీవం, చెరువుల పునరుద్ధరణను సీఎం కేసీఆర్ ప్రాధాన్య అంశంగా చేపట్టారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన 46 వేల చెరువులను మిషన్ కాకతీయ కింద పునరుద్ధరించడంతో 25 లక్షల ఎకరాలకు ప్రత్యక్షంగా, మరో 25 లక్షల ఎకరాలకు పరోక్షంగా సాగునీరు లభిస్తోందని హరీశ్రావు చెప్పారు. గతంలో భారీ వర్షాలకు చెరువులు తెగిప్రాణ, ఆస్తి నష్టం జరిగేదని, మిషన్ కాకతీయ కింద చెరువు కట్టలు, తూ ములు, అలుగులను పటిష్టం చేయడంతో అలాంటి ఘటనలు జరగడం లేదన్నారు. వా గులు, వంకల్లోని నీళ్లు వృథా కాకుండా రూ. 6 వేల కోట్లతో రాష్ట్రంలో 4 వేల చెక్డ్యాంలు నిర్మిస్తున్నామన్నారు. ప్రతి వర్షపు చుక్కను చెరువులు ఒడిసి పట్టుకుంటున్నాయని, చెక్డ్యాముల్లో ఏడాదంతా నీళ్లు నిల్వ ఉంటున్నాయని ఆయన పేర్కొన్నారు. గోదావరిపై 141 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో 5 రిజర్వాయర్లను నిర్మించడంతో 300 కి.మీల జీవనదిగా మారిందని వివరించారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లను వెనక్కి తీసుకొచ్చి నదికి కొత్త నడకను సీఎం కేసీఆర్ నేర్పారని ప్రశంసించారు. వాటర్మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేం ద్రసింగ్ ఆలోచనల్నే సీఎం కేసీఆర్ అమలు చేశారని వివరించారు. ప్రాజెక్టులకు పర్యావరణ, అటవీ అనుమతులకు ఏళ్లు పడుతున్నాయని, ఈ విధానంలో మార్పులు రావాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. రెండేళ్లలో రైతు ఆత్మహత్యలు కనుమరుగు: పల్లా రాజేశ్వర్రెడ్డి రైతుబంధు, సాగునీరు, కరెంట్ సదుపాయంతో రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయని, రెండేళ్లలో పూర్తిగా నిర్మూలిస్తామని రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. జల సంరక్షణకు కృషి చేసిన వ్యక్తులు, సంస్థలకు సదస్సు చివరలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున పురస్కారాలు అందజేశారు. మూడేళ్లలో మూసీలో తాగునీళ్లు... మూసీ నది ప్రక్షాళన ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని, ఎస్టీపీల నిర్మాణం, మురుగు కాల్వ మళ్లింపు పనులు జరుగుతున్నాయని మంత్రి హరీశ్రావు తెలిపారు. గోదావరి నీళ్లను సైతం మూసీకి తరలిస్తున్నామన్నారు. రెండు, మూడేళ్లలో మూసీలో స్వచ్ఛమైన తాగునీళ్లను చూస్తామన్నారు. మూసీని ప్రక్షాళన చేయాలని రాజేంద్రసింగ్ విజ్ఞప్తి చేయగా హరీశ్రావు ఈ మేరకు హామీ ఇచ్చారు. స్వచ్ఛమైన మూసీ నది ఒడ్డున మూడేళ్ల తర్వాత రాజేంద్రసింగ్ పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలో జలవిశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని రాజేంద్రసింగ్ ఈ అంళాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. దేశంలోని నదులన్నీ ఐసీయూలో..: రాజేంద్రసింగ్ గంగ, యమున, మూసీ సహా దేశంలోని నదులన్నీ ఐసీయూలో ఉన్నాయని, వాటి పరిరక్షణకు అధిక చొరవ తీసుకోవాల్సిన అవసరముందని రాజేంద్రసింగ్ స్పష్టం చేశారు. దేశంలో ఒక్క నది కూడా ఆరోగ్యంగా లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు కళ్లలో నీళ్లున్నాయని, నీళ్లపై లక్ష్మిని ఖర్చు పెడుతున్నారని అభినందించారు. -
India GDP: వృద్ధి జోరులో మనమే టాప్..!
న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) రెండవ త్రైమాసికంలో అంచనాలకు మించి 8.4 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంది. తద్వారా ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ హోదాను భారత్ నిలబెట్టుకుంది. మొదటి త్రైమాసికంలో వృద్ధి రేటు 20.1 శాతంగా నమోదయిన సంగతి తెలిసిందే. వెరసి రెండు త్రైమాసికాల్లో (ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో) వృద్ధి రేటు 13.7 శాతమని మంగళవారం వెలువడిన గణాంకాలు వెల్లడించాయి. ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల్లో (ఏప్రిల్, మే) సెకండ్వేవ్ ప్రభావం లేకపోతే ఎకానమీ మరింత పురోగమించేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. క్యూ2లో 7.9 శాతం వృద్ధి రేటు నమోదవుతుందన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అంచనాలకన్నా అధికంగా తాజా గణాంకాలు వెలువడ్డం గమనార్హం. వివిధ సంస్థలు, రేటింగ్ సంస్థల అంచనాలు సైతం 7.8 శాతం నుంచి 8.3 శాతం శ్రేణిలోనే ఉన్నాయి. మరోవైపు రెండవ త్రైమాసికంలో ఈ స్థాయి గణాంకాల నమోదుకు గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో లో బేస్ ప్రధాన (బేస్ ఎఫెక్ట్) కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. కరోనా సవాళ్లతో అప్పట్లో ఎకానమీ వృద్ధిలేకపోగా 7.4 శాతం క్షీణతను నమోదుచేసుకుంది. ‘పోల్చుతున్న నెలలో’ అతి తక్కువ లేదా ఎక్కువ గణాంకాలు నమోదుకావడం, అప్పటితో పోల్చి, తాజా సమీక్షా నెలలో ఏ కొంచెం ఎక్కువగా లేక తక్కువగా అంకెలు నమోదయినా అది ‘శాతాల్లో’ గణనీయ మార్పును ప్రతిబింబించడమే బేస్ ఎఫెక్ట్. విలువల్లో ఇలా... తాజా సమీక్షా త్రైమాసికం జూలై–సెప్టెంబర్ మధ్య ఎకానమీ విలువ రూ.35.73 లక్షల కోట్లు. గత ఏడాది ఇదే కాలంలో ఈ విలువ రూ.32.96 లక్షల కోట్లు. వెరసి ఎకానమీ వృద్ధి రేటు 8.4 శాతంగా నమోదయ్యింది. కోవిడ్–19 సవాళ్లు దేశంలో ప్రారంభంకాని 2019–20 ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో ఎకానమీ విలువతో పోల్చి చూస్తే, ఎకానమీ విలువ స్వల్పంగా 0.33 శాతం అధికంగా నమోదయ్యింది. కాగా, ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య ఎకానమీ విలువలు రూ.59.92 లక్షల కోట్ల నుంచి (2020–21 తొలి ఆరునెలల్లో) రూ.68.11 లక్షల కోట్లకు (13.7 శాతం వృద్ధి) పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో అసలు వృద్ధి లేకపోగా 15.9 శాతం క్షీణత నమోదయ్యింది. కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ♦తాజా సమీక్షా నెల్లో ప్రభుత్వ వ్యయాల్లో 8.7% వృద్ధి నమోదవడం, తక్కువ వడ్డీరేట్ల వ్యవస్థ, పెరిగిన వినియోగం ఎకానమీ లో సానుకూలతను సృష్టించాయి. ♦తగిన వర్షపాతంలో జీడీపీలో దాదాపు 15 శాతం వాటా ఉన్న వ్యవసాయ రంగం మంచి ఫలితాన్ని ఇచ్చింది. 4.5 శాతం వృద్ధి నమోదయ్యింది. ♦దేశీయ డిమాండ్, ఎగుమతులు పెరగడంతో తయారీ రంగంలో 5.5 శాతం పురోగతి నమోదయ్యింది. మొత్తం జీడీపీలో పారిశ్రామిక రంగం వాటా దాదాపు 15 శాతం అయితే, అందులో తయారీ రంగం వాటానే దాదాపు 78 శాతం. ♦నిర్మాణం, ట్రేడ్, హోటల్స్ రవాణా, ఫైనాన్షియల్ సేవల రంగాల్లో 7 నుంచి 8 శాతం వృద్ధి రేట్లు నమోదయ్యాయి. ♦ప్రభుత్వ సేవలు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, డిఫెన్స్ రంగాల్లో 17.4 శాతం వృద్ధి నమోదుకావడం సానుకూల పరిణామం. ♦ఇక ఉత్పత్తి స్థాయి వరకూ లెక్కించే జీవీఏ (గ్రాస్ వ్యాల్యూ యాడెడ్)లో వృద్ధి రేటు జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో 8.5 శాతంగా నమోదయ్యింది. ♦కాగా, జూలై–సెప్టెంబర్ మధ్య చైనా వృద్ధి రేటు 4.9 శాతం. 2021–22పై అంచనాలు ఇలా... గడచిన ఆర్థిక సంవత్సరం (2020–21) కరోనా సవాళ్లతో ఎకానమీ 7.3 శాతం క్షీణతను నమోదుచేసుకున్న సంగతి తెలిసిందే. అయితే 2021–22లో వృద్ధి రేటు 11 శాతంగా ఉంటుందని ఈ ఏడాది జనవరిలో విడుదలైన ఎకనమిక్ సర్వే పేర్కొంది. అయితే అటు తర్వాత ఏప్రిల్, మే నెలల్లో సెకండ్వేవ్ దేశాన్ని కుదిపివేసింది. ఈ నేపథ్యంలో ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 9.3 శాతం–9.6% శ్రేణిలో ఉంటుందని ఆర్బీఐ అంచనా వేస్తోంది. క్యూ3లో 6.8%, క్యూ4లో 6.1% వృద్ధి నమోదవుతుందని ఆర్బీఐ ఇటీవలి పాలసీ సమీక్ష పేర్కొంది. అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం– స్టాండెర్డ్ అండ్ పూర్స్ (ఎస్అండ్పీ) మంగళవారం ఒక నివేదికను విడుదల చేస్తూ, 2021–22లో భారత్ ఎకానమీ 9.5 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంటుందని అంచనా వేసింది. 2022–23 ఏడాదిలో ఈ రేటు 7.8% ఉంటుందని విశ్లేషించింది. రెండంకెల వృద్ధి దిశగా... భారత్ 2021–22 ఆర్థిక సంవత్సరంలో రెండంకెల వృద్ధి దిశగా పయనిస్తోంది. డిమాండ్లో గణనీయ వృద్ధి, బ్యాంకింగ్ రంగం పురోగతి ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయి. క్రితం త్రైమాసికాల్లో దాదాపు 6 శాతం వృద్ధి రేటు నమోదుకాగా, సెప్టెంబర్ వరకూ గడచిన త్రైమాసికాల్లో వృద్ధి రేటు 13.7 శాతం నమోదుకావడం హర్షణీయ పరిణామం. 2022–23, 2023–24 ఆర్థిక సంవత్సరాల్లో వృద్ధి రేట్లు వరుసగా 7 శాతం వరకూ ఉంటుందని భావిస్తున్నాం. కేంద్రం చేపడుతున్న రెండవ తరం ఆర్థిక సంస్కరణలు ఇందుకు దోహపడతాయని భావిస్తున్నాం. ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు, రుణ భారాల కట్టడికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది. మూలధన వ్యయాల పెంపునకు కృషి జరుగుతుంది. – కేవీ సుబ్రమణియన్, ప్రధాన ఆర్థిక సలహాదారు
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
త్రినయని సీరియల్ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్ (ఫోటోలు)
స్టార్ హీరో గొప్పమనసు.. రూ. కోటి చెక్ విరాళం!
ఎరక్కపోయి ఇరుక్కుపోయి
మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
కేఎల్ రాహుల్ మాస్టర్ ప్లాన్.. మెక్ గర్క్ సిల్వర్ డక్! వీడియో
Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్గా మళ్లీ కోహ్లినే!
రామ్- పూరి కాంబో.. డబుల్ మాస్ అప్డేట్ వచ్చేసింది!
స్వాతి మలివాల్పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
'ఆ రూలే ఐపీఎల్ను మార్చేసింది.. వారు పునరాలోచనలో పడ్డారు'
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement