గర్భంనిండా గరుకే | Sakshi
Sakshi News home page

గర్భంనిండా గరుకే

Published Sun, Jun 11 2017 11:57 PM

గర్భంనిండా గరుకే - Sakshi

కొవ్వూరు : గోదావరి డెల్టా ఆయకట్టు రైతులు ఏటా సార్వాలో ముంపు.. దాళ్వాలో నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నారు. ధవళేశ్వరం ఆనకట్టకు ఎగువన ఇసుక మేటలు పేరుకుపోవడంతో నదిలో నీటినిల్వ సామర్థ్యం తగ్గిపోయింది.  సహజ జలాలు ఆశించిన స్థాయిలో అందకపోవడంతో గడచిన ఎనిమిదేళ్ల కాలంలో నాలుగు సార్లు దాళ్వాలో లో తెలంగాణ ప్రభుత్వం ఏకంగా తొమ్మిది ప్రాజెక్టులు నిర్మిస్తోంది. ఇవి పూర్తయితే దిగువకు నీరు వచ్చే దారిలేదు. ఈ తరుణంలో ఆనకట్ట వద్ద నీటి నిల్వ సామర్థ్యం పెంచుకోకపోతే రైతుల కష్టాలు మరింత తీవ్రమవుతాయని. ఈ సమస్య నుంచి గట్టెక్కాలంటే నదిలో ఇసుక మేటల తొలగింపే ఏకైక మార్గమని నిపుణులు సూచిస్తున్నారు.
మొక్కుబడిగా డ్రెడ్జింగ్‌
ఆనకట్ట రిజర్వాయర్‌ ఎగువన సుమారు 65–70 లక్షల క్యూబిక్‌ మీటర్ల మేర ఇసుక మేటలు పేరుకుపోయినట్టు 2015లో నిపుణుల బృందం నిర్థారించింది. రాష్ట్ర ప్రభుత్వం రూ.16 కోట్లు వెచ్చించి 10 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుకను మాత్రమే తొలగించి చేతులు దులిపేసుకుంది. గత ఏడాది పిచ్చుకల్లంక వద్ద 9.70 లక్షల క్యూబిక్‌ మీటర్లు, రాజమండ్రిలో కోటిలింగాల ఘాట్‌ వద్ద 30 వేల క్యూబిక్‌ మీటర్ల ఇసుకను డ్రెడ్జింగ్‌ చేసి తొలగించారు. ఈ మేటలు తొలగించడం వల్ల ఆనకట్ట వద్ద నీటి నిల్వ సామర్థ్యం 0.30 టీఎంసీలు పెరిగిందని జల వనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. 
లంకలతో కలిపితే 2.5 కోట్ల క్యూబిక్‌ మీటర్లు
లంకలతో కలుపుకుంటే గోదావరిలో పేరుకుపోయిన ఇసుక 2.50 కోట్ల నుంచి 3 కోట్ల క్యూబిక్‌ మీటర్ల వరకు ఉంటుందని నిపుణుల బృందం ప్రాథమికంగా అంచనా వేసింది. ఆనకట్ట భద్రతను దృష్టిలో ఉంచుకుని దానికి ఎగువన మూడు కిలోమీటర్లు, దిగువన కిలోమీటర్‌ వరకు ఇసుక త్వవకాలపై నిషేధం ఉంది. కొవ్వూరు–కాతేరు మధ్య నిర్మించిన రెండో రోడ్డు వంతెన నుంచి వాడపల్లి సమీపం వరకు 8 కిలోమీటర్ల వరకు ఇసుక మేటలు భారీగా ఉన్నట్టు నిపుణుల బృందం గుర్తించింది. వీటిని తొలగించటం ద్వారా నీటినిల్వ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుకోవడంతోపాటు.. ఆ ఇసుకను విక్రయించటం ద్వారా రూ.వెయ్యి కోట్లకు పైగా ఆదాయం వస్తుం దని అంచనా వేశారు. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మూడున్నర దశాబ్దాల క్రితం వరకు గోదావరిలో ఏటా డ్రెడ్జింగ్‌ చేసి ఇసుక మేటలు తొలగించేవారు. ఆ తరువాత ప్రభుత్వాలు శ్రద్ధ చూపకపోవడంతో ఆ ప్రక్రియ మరుగున పడింది. 
మేటలు పూర్తిగా తొలగించాలి
ఇసుక మేటల తొలగింపు కార్యక్రమం మొక్కుబడిగా చేయడం వల్ల ప్రయోజనం ఉండదు. ధవళేశ్వరం ఆనకట్టకు ఎగువన ఉన్న ఇసుక మేటలన్నీ డ్రెడ్జింగ్‌ చేసి పూర్తిస్థాయిలో  తొలగించేందుకు ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకోవాలి. తద్వారా ఆనకట్ట వద్ద నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. రబీలో డెల్టా రైతులకు సాగునీటి ఇబ్బందులు అధిగవిుంచే అవకాశం ఏర్పడుతుంది.– విప్పర్తి వేణుగోపాల్, రిటైర్డ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్, ధవళేశ్వరం
0.30 టీఎంసీల సామర్థ్యం పెరిగింది
పిచ్చుకల్లంక, కోటి లింగాల ఘాట్‌ వద్ద డ్రెడ్జింగ్‌ చేసి 10 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుకను వెలికితీశాం. దీంతో ధవళేశ్వరం ఆనకట్ట వద్ద నీటినిల్వ సామర్థ్యం 0.30 టీఎంసీలు పెరిగింది. ముఖ్యంగా ఆనకట్టకు సమీపంలో కోటి క్యూబిక్‌ మీటర్లు ఇసుక మేటలున్నాయి. వీటిని పూర్తిస్థాయిలో తొలగిస్తే మంచి ఫలితం ఉంటుంది.– ఎన్‌ .కృష్ణారావు, ఈఈ, గోదావరి హెడ్‌వర్క్స్‌ 
 

Advertisement
Advertisement