డబ్బే డబ్బు..! | Sakshi
Sakshi News home page

డబ్బే డబ్బు..!

Published Wed, Oct 26 2016 8:26 PM

డబ్బే డబ్బు..! - Sakshi

పెనమలూరు : మీ బ్యాంకు ఖాతాకు మీ ప్రమేయం లేకుండా ఉన్నట్టుండి ఒక్కసారిగా రూ.లక్షల్లో సొమ్ము జమ అయితే ఎలా ఉంటుంది. ముందు ఆశ్చర్యం.. ఆనక ఆనందం కలుగుతుంది కదూ. పెనమలూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన బ్యాంకింగ్‌ కరస్పాండెంట్‌ (బీసీ) బ్యాంకు ఖాతాలోకి అనధికారికంగా సొమ్ము అలాగే వచ్చి పడింది. అది కూడా.. లక్షో, రెండు లక్షలో కాదు.. ఏకంగా రూ.70లక్షలు. దీంతో ఆ బ్యాంకింగ్‌ కరస్పాండెంట్‌ పండుగ చేసుకుంది. ఆశలు ఆకాశాన్ని తాకాయి. రెండు ఇళ్లు, రెండు స్థలాలు, ఎకరం పొలం, రెండు వాహనాలు కొనుగోలు చేసేసింది. చివరకు అది బ్యాంకు ఆన్‌లైన్‌ తప్పిదం వల్లే జరిగిందని తేలడంతో ప్రస్తుతం ఏం చేయాలో తెలియక సతమతమవుతోంది.
వివరాల్లోకి వెళితే.. మండలంలోని శివారు గ్రామానికి చెందిన బ్యాంకింగ్‌ కరస్పాండెంట్‌ ఆ గ్రామంలో పేదలకు బ్యాంకుల ద్వారా పింఛన్‌ పంపిణీ చేస్తుంటుంది. ఆమెకు పెనమలూరులోని ఓ బ్యాంకులో ఖాతా ఉంది. పింఛన్‌ సొమ్ము ఆమె ఖాతాలో జమ కాగానే, లబ్ధిదారుల ఖాతాకు మారుస్తుంది. ప్రతినెలా ఇలాగే జరుగుతుంది. కాగా, కొద్దిరోజుల కిందట ఆమె ఖాతాకు పలు దఫాలుగా రూ.70లక్షల వరకూ డబ్బు జమ అయ్యిందని సమాచారం. ఆశ్చర్యానికి గురైన ఆమె ఆ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లకుండా భర్తతో కలిసి మొత్తం డ్రా చేసింది. గ్రామంలో రెండు ఇళ్లు, రెండు స్థలాలు, ఎకరం పొలం, రెండు వాహనాలు కొనుగోలు చేసింది.
బ్యాంకు అధికారుల పరుగులు
వేరే ఖాతాలో జమ కావాల్సిన సొమ్ము బీసీ ఖాతాలోకి వెళ్లిందని ఆలస్యంగా గమనించిన బ్యాంకు అధికారులు పరుగులు పెట్టారు. సాఫ్ట్‌వేర్‌ సమస్య వల్లే ఇలా సొమ్ము జమ అయ్యిందని వారు కనుగొన్నారు. ఇది ఓ ప్రముఖ కంపెనీకి చెందిన సొమ్ముగా పేర్కొంటున్నారు. పలు బ్యాంకుల నుంచి దఫదఫాలుగా ఈ సొమ్ము వచ్చి చేరిందని చెబుతున్నారు. ఈ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న బ్యాంకు అధికారులు విచారణ చేపట్టారు. హైదరాబాద్‌ నుంచి పోలీసులు వచ్చి విచారణ చేస్తున్నారు. బీసీ వద్ద కొంత సొమ్ము రికవరీ చేశారని తెలిసింది. అయితే, ఆస్తులు కొనుగోలు చేయడంతో అవి అమ్మి సొమ్ము జమ చేస్తానని సదరు బీసీ పత్రాలు అందజేసిందని చెబుతున్నారు. ఈ విషయంపై బీసీ వివరణ కోసం యత్నించగా, అందుబాటులో లేదు. బ్యాంకు అధికారులు విషయం బయటకు రాకుండా పరిష్కరించే పనిలో పడ్డారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement