Breaking News

వేడి రాజుకుంది.. తెలంగాణ బీజేపీలో ఆసక్తికర పరిణామాలు

Published on Mon, 06/12/2023 - 03:14

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర బీజేపీలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. త్వరలోనే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పుతో పాటు ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్‌ నియామకం, ఇతర మార్పు­లు జరగనున్నాయనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆదివారం సమావేశమైన సీనియర్‌ నేతలు కొందరు ప్రచార కమిటీ చైర్మన్‌గా ఈటల నియామకంతో పాటు రాష్ట్ర అధ్యక్షుడి మా­ర్పు వంటి అంశాలపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ మేరకు తమ అభిప్రాయాన్ని జాతీ­య నాయకత్వం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు సమాచారం. 

వారం క్రితం ‘అసంతృప్తి’ సెగ 
దాదాపు వారం రోజుల క్రితం కొందరు అసంతృప్త నేతలు సమావేశమై, సీనియర్లమైన తమకు పార్టీలో తగిన ప్రాధాన్యత, గుర్తింపు లభించడం లేదని, పా­ర్టీ ముఖ్యనేత ఆధిపత్య ధోరణితో వ్యవహరిస్తూ పా­ర్టీకి నష్టం చేస్తున్నారని ధ్వజమెత్తారు. నేతల మధ్య సమన్వయం కొరవడటం లాంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని జాతీయ నాయకత్వాన్ని కోరారు.

ఈ నేపథ్యంలోనే బీజేపీ కమిటీల్లో మార్పు­లు, బండి సంజయ్‌కి కేంద్ర మంత్రి పదవి, ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్‌గా ఈటల నియామ­కం అనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర అధ్య­క్షుడు బండి సంజయ్‌ శనివారం రాత్రి మీడియా­తో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. పార్టీలో మార్పుల­పై జరుగుతున్నది ప్రచారం మాత్రమేనని అన్నారు. తాను పార్టీ కోసం కమిట్‌మెంట్‌తో కష్టపడి పనిచేస్తానని, బీజేపీలో ఏ పదవీ శాశ్వతం కాదని, నాయకత్వం ఏ నిర్ణయం తీసుకున్నా పాటించేందు­కు బిస్తర్‌ రెడీగా పెట్టుకున్నానంటూ వ్యాఖ్యానించారు.  

తాజాగా అనుకూల వర్గం భేటీ.. 
ఆదివారం పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డి నివాసంలో జరిగిన సమావేశంలో జాతీయ కార్యవర్గసభ్యులు జి.వివేక్‌ వెంకటస్వామి, విజయశాంతి, మాజీ ఎంపీలు రవీంద్రనాయక్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, డా.బూర నర్సయ్యగౌడ్, డా.విజయ రామారావు, సుద్దాల దేవయ్య, సీహెచ్‌ విఠల్, రచనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బండి సంజయ్‌కు అనుకూల వర్గంగా భావిస్తున్న ఈ నేతలు.. ఇతర అంశాలతో పాటు రాష్ట్ర నాయకత్వ మార్పు, జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్‌ను రాష్ట్ర ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్‌గా నియమించడంపై ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బండి సంజయ్‌ను మార్చొద్దని, ఈటలకు కీలక పదవి ఇవ్వొద్దంటూ అధిష్టానాన్ని గట్టిగా కోరాలని నిర్ణయించినట్లు సమాచారం.

తాము కూడా ఉద్యమకారులమేనని, జాతీయ కార్యవర్గసభ్యులుగా ఉన్నామని, సీనియర్‌ నేతలైన తమకు తెలియకుండానే కీలక నిర్ణయాలు ఎలా తీసుకుంటారంటూ అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈటలకు ప్రాధాన్యత ఇవ్వడాన్ని వ్యతిరేకించడంతో పాటు, ఆయనకు కీలక పదవి ఇవ్వొద్దని, తాము ఆయన కంటే సీనియర్లమని, తమకు కూడా తగిన గుర్తింపునిచ్చే పదవులు ఇవ్వాలని అభిప్రాయ పడినట్లు సమాచారం.

జాతీయ కార్యవర్గ సభ్యులుగా ఉన్న తమకు పార్టీలో జరుగుతున్న పరిణామాలు తెలియడం లేదని కొందరు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ అంశాలన్నీ జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించినట్టు చెబుతున్నారు. తమతో కలిసి భోజనం చేసేందుకు రావాలనే ఆహ్వానంతో ఒక మాజీ ఎంపీ అక్కడకు వెళ్లగా, కొంతకాలంగా అంతగా చురుగ్గా లేని ఒకరిద్దరు నేతలు కూడా ఇదే విధమైన ఆహ్వానంతో అక్కడకు వెళ్లారని తెలుస్తోంది. 

అసలు ఆ పోస్టే ఉండదు.. 
బీజేపీలో ప్రచార కమిటీ చైర్మన్‌ అనే పదవి లేదని సమావేశానంతరం జితేందర్‌రెడ్డి మీడియాతో అన్నారు. ‘రాష్ట్ర నేతలతో చర్చించకుండా అధ్యక్షుడి మార్పుపై జాతీయ నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. పదవులు ఇచ్చే ముందు లీకులు ఇచ్చే సంస్కృతి బీజేపీలో ఉండదు. దీనిపై సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో వస్తున్న లీకులను పార్టీ క్యాడర్‌ నమ్మొద్దు. బీజేపీ స్టేట్‌ చీఫ్‌ను మారుస్తున్నారని కేసీఆర్‌ లీకులు ఇప్పిస్తున్నారు.

బీజేపీ బలం తగ్గిందని చెప్పడానికే కాంగ్రెస్‌పై కేసీఆర్‌ విమర్శలు చేస్తున్నారు. క్యాడర్‌ను కన్ఫ్యూజ్‌ చేయడానికి ఇలాంటి ప్రచారం చేస్తున్నారు. తెలంగాణలో బీజేపీ బలంగా ఉంది. మాకు ఎలాంటి రహస్య అజెండా లేదు. బీజేపీ బలోపేతమే మాకు ముఖ్యం. పొంగులేటి, జూపల్లి కూడా బీజేపీలో చేరాలని కోరుతున్నా. శత్రువుకు శత్రువు.. మిత్రుడు అన్నట్టు కేసీఆర్‌ను కొట్టాలంటే పొంగులేటి, జూపల్లి బీజేపీ వైపు రావాలి..’ అని వ్యాఖ్యానించారు. 

భేటీపై స్పందించేందుకు ఈటల నిరాకరణ.. 
బీజేపీ సీనియర్‌ నేతలు ప్రత్యేకంగా భేటీ కావడంపై స్పందించేందుకు ఈటల రాజేందర్‌ నిరాకరించారు. ఇలాంటి వాటిపై తాను మాట్లాడనని, ఎలాంటి చిట్‌చాట్‌ చేయనని తన నివాసం వద్ద ఆయన మీడియాతో చెప్పారు.

అధిష్టానం ఎలా స్పందిస్తుందో? 
సీనియర్ల భేటీ బీజేపీలో చర్చకు దారితీసింది. ఇది దేనికి సంకేతం? దీనిపై అధిష్టానం ఎలా స్పందిస్తుంది? సీనియర్ల అభ్యంతరాలను ఎలా తీసుకుంటుంది? ప్రచార కమిటీ చైర్మన్‌గా ఈటల నియామకంపై ఈ సమావేశం ఎఫెక్ట్‌ పడుతుందా? అనే దానిపై పార్టీ నేతల్లో ఆసక్తి నెలకొంది.

మీడియా ద్వారా లీకులు సరికాదు: విజయశాంతి 
బీజేపీ తెలంగాణ అధ్యక్ష పదవి మార్పుపై మీడియా ద్వారా లీకులు సరికాదని విజయశాంతి అన్నారు. బీజేపీలో వార్తలు లీక్‌ చేసే పద్ధతి ఉండదని పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికలు పూర్తి అయ్యేవరకూ బండి సంజయ్‌ కొనసాగుతారని రాష్ట్రపార్టీ ఇన్‌చార్జి తరుణ్‌ చుగ్‌ గతంలో చెప్పారని గుర్తు చేశారు. ఇప్పటివరకు ఇదే అధికారిక ప్రకటన అని, ఊహాగానాలతో మీడియాలో వచ్చే కథనాలు అధికారిక ప్రకటనలు కావని స్పష్టం చేశారు.   

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)