కలెక్షన్స్ లో ఖలేజా సెన్సేషన్
Breaking News
అళగర్ స్వామిపై నీరు చల్లడం నిషేధం
Published on Thu, 04/04/2024 - 02:25
● మదురై ధర్మాసనం ఆదేశాలు
సాక్షి, చైన్నె: కళ్లలగర్ వైగై నదీ ప్రవేశానంతరం స్వామి వారిపై పసుపు నీళ్లు, స్వచ్ఛమైన మంచి నీళ్లు చల్లడంపై నిషేధం విధిస్తూ మదురై ధర్మాసనం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. వివరాలు.. ప్రపంచ ప్రసిద్ధి చెందిన మదురై మీనాక్షి అమ్మవారి సన్నిధిలో చిత్తిరై ఉత్సవాలు కనుల పండువగా సాగుతాయన్న విషయం తెలిసిందే. ఈ ఉత్సవాల్లో అత్యంత ప్రధాన ఘట్టం కళ్లలగర్(అళగర్) స్వామి వైగై నదీ ప్రవేశం. ఈ ఉత్సవాన్ని కనులార తిలకించేందుకు భక్త కోటి మదురైకు లక్షల్లో పోటెత్తడం జరుగుతోంది. వైగై నదీ ప్రవేశ అనంతరం స్వామి వారు రామరాయర్ మండపానికి చేరుకోగానే, అళగర్ వేషాధారణలో ఉండే భక్తులు స్వామి వారిపై అధిక ఫ్రెషర్ కలిగిన పంపుల ద్వారా మంచి నీరు, పసుపు నీళ్లు చల్లుతూ మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అయితే కాలక్రమేనా ఈ నీళ్లలో రసాయనాలు కలపడం, ద్రవ్యాలు కలపడం చోటు చేసుకుంటున్నాయి. ఈ కారణంగా అళగర్ స్వామి విగ్రహం, బంగారు అశ్వ వాహనంతో పాటు ఆభరణాలపై ప్రభావం పడుతోందని, అలాగే, భట్టాచార్యులు, శివాచార్యులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉందని పేర్కొంటూ, మదురైకు చెందిన నాగరాజన్ మద్రాసు హైకోర్టు, మదురై ధర్మాసనం దృష్టికి తెచ్చారు. విచారణ ముగియడంతో ధర్మాసనం పిటిషనర్ వాదనలతో ఏకీభవించింది. కళ్లలగర్పై నీళ్లు చల్లడంపై నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉండగా మదురైలో ఈనెల 12 నుంచి 23వ తేదీ వరకు చిత్తిరై ఉత్సవాలు కనుల పండువగా జరగనున్నాయి. 23వ తేదీన కళ్లలగర్ వైగై నదీ ప్రవేశం జరగనుంది. ఈ సమయంలో భక్తులు స్వామి వారిపై ఎలాంటి నీళ్లు చల్లకుండా ఉండే రీతిలో అధికారుల జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా వ్రతం ఆచరించి స్వామి వారిపై పసుపు నీరు చల్లి మొక్కులు తీర్చకోవడం సాంప్రదాయమని భక్తులు చెబుతున్నారు.
Tags : 1