AP: దారుణంగా పెరిగిపోతున్న హత్యలు నెల్లూరులో ఏం జరిగిందంటే..
Breaking News
కాలేజీ అడ్మిషన్ల సంసిద్ధతపై నాట్స్ అవగాహన సదస్సు
Published on Fri, 10/18/2024 - 17:13
అమెరికాలో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా అయోవాలో కాలేజీ అడ్మిషన్ల సంసిద్ధతపై అవగాహన సదస్సు నిర్వహించింది. విద్యార్ధులు అత్యుత్తమ కాలేజీల్లో ఎలా సీట్లు పొందాలి.? దానికి ముందుస్తుగా ఎలాంటి కసరత్తు చేయాలి.? ఎలాంటి పరీక్షలకు సిద్ధం కావాలి.? మిడిల్ స్కూల్, హైస్కూల్ స్థాయిలోనే దానిని ఎలా సన్నద్దమవ్వాలనే కీలక విషయాలపై ఈ సదస్సు ద్వారా నాట్స్ అవగాహన కల్పించింది.
సెడార్ రాపిడ్స్, మారియన్, రాబిన్స్, హియావత నగరాల నుండి పలువురు భారతీయ తల్లిదండ్రులు, విద్యార్ధులు ఈ అవగాహన సదస్సుకు హాజరయ్యారు. అయోవా నాట్స్ చాప్టర్ సమన్వయకర్త శివ రామ కృష్ణారావు గోపాళం ఈ సదస్సుకు అనుసంధానకర్త వ్యవహారించారు. కృష్ణ ఆకురాతి, సాగర్ పురాణం, జగదీష్ బాబు బొగ్గరపులు ఈ సదస్సులో ఎన్నో విలువైన సూచనలు చేశారు. తల్లిదండ్రుల, విద్యార్ధుల సందేహాలను నివృత్తి చేశారు..
విద్యార్ధుల చక్కటి భవిష్యత్తుకు బాటలు వేసే ఇలాంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్వహిస్తామని శివ రామకృష్ణారావు గోపాళం తెలిపారు. తల్లిదండ్రులకు, విద్యార్ధులకు కాలేజీ ప్రవేశాలపై చక్కటి అవగాహన ఇలాంటి సదస్సుల వల్ల లభిస్తుందన్నారు. నాట్స్ తెలుగువారి కోసం కోసం ఇంత చక్కటి సదస్సును ఏర్పాటు చేసినందుకు తల్లిదండ్రులు నాట్స్ నాయకత్వాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రజలకు గిరీష్ కంచర్ల, నవీన్ ఇంటూరి అవసరమైన ఆహార ఏర్పాట్లు చేశారు.
ఈ కార్యక్రమంలో తమ వ్యక్తిగత అనుభవాలను వివరించిన హిమాన్షు భూషణ్, రవి కొంపెల్లాలకు నాట్స్ ధన్యవాదాలు తెలిపింది. సుమన్ ఒంటేరు ఫోటోగ్రాఫింగ్, ఆడియో విజువల్ సిస్టమ్లలో సహాయం చేసినందుకు నాట్స్ అభినందించింది. అయోవాలో కాలేజీ ప్రిపరేషన్ అవగాహన సదస్సు విజయవంతం చేయడంలో కృషి చేసిన ప్రతి ఒక్కరికి నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
(చదవండి: లండన్లో ఘనంగా దసరా అలాయి బలాయి)
Tags : 1