కీవ్ లో రష్యా డ్రోన్ల బీభత్సం.. 37 మంది మృతి
Breaking News
ఆహారం తీసుకోగానే గర్భిణులకు కడుపులో ఇబ్బందా?
Published on Sun, 08/30/2026 - 05:00
కొందరు గర్భవతుల్లో ఆహారం తీసుకోగానే కడుపులో ఇబ్బందిగా ఉండవచ్చు. మరీ ముఖ్యంగా 28 వారాల ప్రెగ్నెన్సీ టైమ్లో ఇది కాస్త ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో తెలిపే కథనమిది.
కొందరు గర్భిణుల్లో తినగానే ఛాతీలో ఇబ్బంది, ఆహారం గొంతుకు అంటుకుపోయినట్టుగా ఉండటం, ఛాతీలో / గుండెల్లో మంట, కడుపులోని ఆహారం పైకి ఎగజిమ్ముతున్న భావన, అజీర్తి, తేన్పులు వంటి బాధలు కనిపిస్తుంటాయి.
ఇదీ కారణం... ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఉపయోగపడే గ్యాస్ట్రిక్ జ్యూస్... జీర్ణాశయం నుంచి పై వైపునకు అంటే గొంతువైపు ఎగజిమ్మడమే ఇలా జరగడానికి కారణం. ఇక గర్భవతుల్లో కండరాలు వదులుగా అయ్యేలా చేసేందుకు ప్రోజెస్టెరాన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంటుంది. గర్భసంచిలోని పిండం పెరుగుతున్న కొద్దీ దానికి చోటు కల్పించడం కోసం... గర్భసంచి కండరాలు వదులయ్యేలా చేసేందుకు ఇలా జరుగుతుంటుంది.
అయితే ఈ హార్మోన్ కేవలం గర్భసంచిని మాత్రమే వదులు చేయకుండా ఇతర కండరాలు అంటే... పక్కనే ఉన్న జీర్ణాశయం–అన్నవాహిక మధ్యన ఉండే స్ఫింక్టర్ (లోవర్ ఈసోఫేజియల్ స్ఫింక్టర్ – లెస్ అనే కవాటం వంటిది) మీద కూడా తన ప్రభావం చూపడంతో అది కాస్త వదులైపోవడమన్నది సాధారణంగా జరుగుతుంది. దాని ఫలితంగా ఈ గ్యాస్ట్రిక్ జూసెస్ జీర్ణాశయం నుంచి అన్నవాహిక వైపునకు పైకి ఎగజిమ్ముతాయి.
నివారణ ఇలా..: అందుకే గర్భవతులు ఒకేసారి పెద్దమొత్తంలో కాకుండా ఎక్కువసార్లు చిన్న చిన్న మోతాదుల్లో తినడం, తినగానే పక్కకు ఒరగకుండా కాస్త వాకింగ్ చేయడం, పడుకున్నప్పుడు తలగడ పెట్టుకోవడం, తినే ఆహారంలో కారం, వేపుళ్లు, మసాలాలు చాలా పరిమితంగా తీసుకుంటూ మజ్జిగలాంటివి తాగుతూ ఉండటం వల్ల ఈ సమస్యను చాలావరకు నివారించవచ్చు. అప్పటికీ సమస్య తగ్గకపోతే ఒకసారి డాక్టర్ను సంప్రదించి వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే వారు సూచించిన యాంటాసిడ్స్ వాడాల్సి ఉంటుంది. ఇది మినహా గర్భవతులు డాక్టర్ల సూచన లేకుండా తమంతట తాము ఎలాంటి ట్యాబ్లెట్స్ వేసుకోకపోవడమే మంచిది.
Tags : 1