భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు
Breaking News
Sri Rama తిరిగి రా, స్వామీ!
Published on Fri, 06/06/2025 - 10:43
‘లోక హితం కోసం నేను శ్రీరాముడిగా మానవ అవతారంలో జన్మిస్తాను. లోక కంటకుడయిన రావణాసురుడిని వధిస్తాను. ఆ తరవాత పదకొండు వేల సంవత్సరాలు భూలోకంలోనే ఉండి రాజ్యం చేస్తాను’ అని శ్రీహరి బ్రహ్మాది దేవతలకు వాగ్దానం చేయటం రామాయణం బాలకాండ ఆరంభంలో కనిపిస్తుంది. అలా మానవ రూపంలో జన్మనెత్తిన తరువాత, శ్రీరాముడు ‘నేను భగవదవతా రాన్ని!’ అని ఎక్కడా చెప్పలేదు. తనను తాను మానవమాత్రుడిగానే భావించుకొని, ధర్మమూర్తిలా జీవించాడు.
దేవతల కిచ్చిన వాగ్దానం ప్రకారం లంకేశ్వరుడిని వధించాడు. పదకొండు వేల సంవత్సరాలు ధర్మబద్ధంగా రామరాజ్యాన్ని సాగించాడు. ఆయన భూలోకంలో ఉన్నంత కాలం భూమి మీది ప్రజలు చల్లగా, సుఖంగా ఉన్నారు. కానీ హరి తమకు దూరమవడంతో, దేవతలకు మాత్రం ఆ కాలమంతా క్షణమొక యుగంగా గడిచింది. అనుకొన్న పదకొండు వేల సంవత్సరాల అవధి పూర్తి కాగానే, బ్రహ్మదేవుడు కాలపురుషుడిని తన దూతగా శ్రీరాముడి దగ్గరకు పంపాడు. ఆయన సందేశం ఇది: ‘దేవా! నువ్వు వైకుంఠానికి తిరిగి రావలసిన సమయం వచ్చిందని సవినయంగా గుర్తు చేస్తున్నాను. అయినా మరికొంత కాలం భూలోకంలో ఉండాలని నీకు అనిపిస్తే అలాగే చేయి. లేక ముందు అనుకొన్న ప్రకారం తిరిగి వస్తావా, దేవతలందరూ నీ రాకతో మరింత నిశ్చింతగా జీవించ గలుగుతారు. నిర్ణయం నీది!’
మానవావతారంలో ఉన్న మాధవుడు ‘నేను ఇన్నాళ్ళుగా ఇక్కడ ఉన్నది త్రిలోక క్షేమ కారణమయిన పని మీద! అది పూర్తయింది. కాబట్టి నా వశవర్తులుగా నడుచుకొనే దేవతా గణానికి, ఎప్పటిలాగే అన్ని విష యాలలోనూ అండగా ఉండటం నా కర్తవ్యం. త్వరలోనే నేను తిరిగి వస్తున్నాను’ అని సమాధానం పంపాడు. తరవాత కొద్ది కాలానికే రామావతారం చాలించి, పరంధామానికి తిరిగి వెళ్ళాడు. రామావతార సమాప్తి గురించిన ఆసక్తికరమైన వృత్తాంతం రామాయణం ఉత్తర
కాండలో కనిపిస్తుంది.
–ఎం. మారుతి శాస్త్రి
Tags : 1