ప్రత్యక్ష సాక్షిగా చెప్తున్నా.. ఆ స్థలం YSRCP దే..
Breaking News
విజయపథంలో ఆమె పాదం
Published on Fri, 02/13/2026 - 05:53
వైకల్యం అనే ఓ పదం మనిషి ఆశలను, ఆశయాన్ని చలనం లేకుండా చేయలేదు అని నిరూపించింది. తనను చూసి ఎగతాళి చేసిన అయిన వాళ్లతో పాటు.. కరుడుగట్టిన బయటవాళ్లనూ గెలిచారు కృష్ణవేణి. ఇటీవల వెలువడ్డ గ్రూప్–1 ఫలితాల్లో చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలంలోని శ్రీరంగరాజపురం (ఎస్ఆర్)కు చెందిన ముద్దంగల కృష్ణవేణి రాష్ట్ర వాణిజ్య పన్నుల విభాగం అసిస్టెంట్ కమిషనర్గా ఎంపికయ్యారు. తల్లి రోజువారీ తాపీ పనులకు వెళితే.. తండ్రి వ్యవసాయ కూలి పనులు చేసి బిడ్డను చక్కగా చదివించారు. ఇపుడు ఊరంతా కృష్ణవేణి విజయం గురించి మాట్లాడుతోంది. కానీ ఆ విజయం వెనుక కష్టం గురించి మాత్రం కృష్ణవేణే మాట్లాడాలి. ఆమె ఏం చెబుతోందో తెలుసుకుందాం...
మాది పేద కుటుంబం. అన్న, నేను, తమ్ముడు ముగ్గురం. నాన్న దొరస్వామి. రోజూ ΄÷లంలో కూలి పనులు చేస్తాడు, అమ్మ పేరు రత్నమ్మ. మగాళ్లకు సమానంగా ఇసుక–సిమెంటు కలపడం, ఇటుకరాళ్లు మోయడం లాంటి తాపీ పనులు చేసింది. రోజూ ఎవరో ఒకరు పనికి వెళితే తప్ప.. ఆ రోజు ఇల్లు గడవదు. తిన్నా, తినకున్నా.. నాకు మాత్రం స్కూల్లో ఉండడం ఇష్టం. నేను ఆరోతరగతి చదువుతుండగా 2010లో ఓ రోజు ఇంటి దగ్గర బట్టలుతికి, ఆరేస్తుండగా.. 11 కేవీ విద్యుత్ వైరు తగలడంతో నేను కిందపడి పోయాను. మా కుటుంబం పరిస్థితి తలకిందులై పోయింది.
అప్పుల ఊబిలో చిక్కుకున్నాం
ట్రాన్స్కో అధికారులకు అప్పటికే చాలాసార్లు చెప్పాం. లైను మార్చమని, వాళ్లు పట్టించుకోక పోవడంతో కరెంటు తీగలు తాకిన నాకు షాక్ తగిలి శరీరమంతా నల్లగా మారి పోయింది. ఇక బతకదన్నారు. చివరి ప్రయత్నంగా తమిళనాడు వేలూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు నన్ను ఎలాగో బతికించారు. మూడు నెలల తరువాత కాలు, చేయి కోల్పోయిన నన్ను ఇంటికి తీసుకొచ్చారు. అప్పటికే నా వైద్యంకోసం భూములు పోయినాయి. అప్పుల్లో చిక్కుకున్నాం. (ఇప్పటికీ వడ్డీలు కడుతున్నాం) కానీ నాకేమో ఇంట్లో ఉండడం నచ్చదు. ఏది ఏమైనా బడికి వెళ్లాలి. ఊరి నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న బడికి వెళ్లడానికి రోడ్డుపై నిలబడితే ఊర్లో ఉన్న ఎవరో ఒకరు నన్ను స్కూటర్పై ఎక్కించుకుని బడిలో వదిలితే అమ్మో నాన్నో వచ్చి పిలుచుకెళ్లేవాళ్లు. ఆ తర్వాత కృత్రిమ కాలు అమర్చుకున్నాను.
ఆ నిర్లక్ష్యమే కసిని పెంచింది.
ట్రాన్స్ కో అధికారుల నిర్లక్షా్యనికి పరిహారం కోరుతూ కలెక్టరేట్ చుట్టూ తిరిగేవాళ్లం. చేయి, కాలు పనిచేయని నన్ను అమ్మ–నాన్న చిత్తూరులో ఉండే కలెక్టరేట్కు తీసుకెళ్లేవాళ్లు. క్యూలో నిలబడి చాలాసార్లు మాకు జరిగిన అన్యాయం గురించి మొర పెట్టుకున్నాం. అప్పుడే నేనొకటి గమనించాను. మాకన్నా దారుణమైన పరిస్థితి ఉన్న వాళ్లు కూడా కలెక్టర్ పిలిస్తే వెంటనే అక్కడ నిలబడటం, ఆయన ఆదేశాలు పాటించడం చూశాం. అంటే చదువుకుని చేతిలో అధికారం ఉంటే అన్యాయం జరిగిన వాళ్లకు న్యాయం చేయొచ్చని మాత్రం అర్థమయ్యింది. ట్రాన్స్కో అధికారుల మనసు కరగక పోవడంతో అప్పులు చేసి మరీ కోర్టులో కేసు వేశాం. 54 కిలోమీటర్ల దూరాన్ని సైకిల్ తొక్కుతూ నాన్న వాయిదాలకు హాజరయ్యేవారు. అదే నాలో ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకోవాలనే కసిని పెంచింది. 14 ఏళ్ల తరువాత పరిహారం వచ్చినా.. అది మా అప్పులు–వడ్డీలకు కూడా చాల్లేదు. పదో తరగతి వరకు ప్రభుత్వ బడే. మళ్లీ ఇడుపుల పాయలో సీటు, అక్కడే బీటెక్ (సివిల్ ఇంజినీరింగ్) పూర్తి చేశాను.
ఐఏఎస్ అవుతా..
డిగ్రీ పూర్తయ్యాక స్నేహితులతో కలిసి హైదరాబాద్కు వెళ్లాను. 2022లో వెలువడ్డ గ్రూప్స్ నోటిఫికేషన్ లో తొలి పరీక్షే తప్పాను. ఆ మరుసటి ఏడాది వెలువడ్డ నోటిఫికేషన్ లో ఎలాగైనా ఉద్యోగం కొట్టాలని నిర్ణయించుకున్నాను. గ్రూప్–1, గ్రూప్–2కు సమాంతరంగా సిద్ధమయ్యాను. నా ఆర్థిక పరిస్థితి తెలిసి చాలామంది దాతలు చందాలు వేసుకుని హాస్టల్ ఫీజులు, స్టడీ సెంటర్ ఫీజులు కట్టారు. అది ఎప్పటికీ మర్చి పోలేను. ఈ మధ్యే గ్రూప్–2లో సివిల్ సప్లైస్లో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం వచ్చినా గ్రూప్ 1లో ఉద్యోగం వస్తుందన్న ధీమాతో అందులో చేరలేదు. నా నమ్మకం వమ్ము పోలేదు. అనుకున్నట్లే వచ్చింది. అమ్మా నాన్నలను నా కారులో ఎక్కించుకుని ఊరంతా తిప్పాలి. ఇదే సమయంలో ఎప్పటికైనా ముద్దంగల కృష్ణవేణి.. ఐఏఎస్ అని పిలిపించుకోవాలన్న నా లక్ష్యాన్ని సాధించి తీరతాననే నమ్మకం ఉంది.
– ఎం.లోకనాథన్, సాక్షి, చిత్తూరు అర్బన్
Tags : 1