సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి పిటిషన్ పై విచారణ
Breaking News
ఈ మార్కెట్ అమ్మలదే!
Published on Thu, 06/25/2026 - 06:20
ప్రపంచం మొత్తంగా ఉన్న మార్కెట్లు కేవలం లాభనష్టాల లెక్కల మీదే నడుస్తాయి. కానీ, మణిపుర్లోని ఇమాకైథెల్ మార్కెట్ త్యాగం, పోరాటం, మాతృశక్తి మీద నడుస్తుంది. 500 ఏళ్లుగా వేలమంది మహిళలు ఒకేచోట చేరి ఆర్థిక వ్యవస్థను శాసిస్తున్నారు. అందుకే ప్రపంచంలోనే పూర్తిగా మహిళలచే నడుస్తున్న అతిపెద్ద మార్కెట్గా ఇమా కైథెల్కు పేరుంది.
మణిపురి భాషలో ఇమా అంటే అమ్మ, కైథెల్ అంటే మార్కెట్. అంటే తల్లుల మార్కెట్. దాదాపు 5,000 నుంచి 6,000 మంది మహిళా వ్యాపారులు ఇక్కడ నిత్యం వ్యాపారాలు సాగిస్తుంటారు. వీరిలో చాలామంది తరతరాలుగా తమ దుకాణాలను వారసత్వంగా పొందుతున్నారు. పురుషులు ఇక్కడికి కేవలం వస్తువులు కొనడానికి మాత్రమే రావాలి. వ్యాపారం చేయడానికి వారికి అస్సలు అనుమతి
ఉండదు.
తుపాకులకీ భయపడలే!
ఈ మార్కెట్ కేవలం వ్యాపార కేంద్రం మాత్రమే కాదు, మణిపురి మహిళల పోరాట పటిమకు నిదర్శనం. 16వ శతాబ్దంలో లల్లూప్–కాబా అనే వ్యవస్థ ఉండేది. ఇది ఒక వెట్టిచాకిరి పద్ధతి. దీని ప్రకారం పురుషులు యుద్ధాలకో లేదా సుదూర ప్రాంతాల్లో వ్యవసాయం చేయడానికో వెళ్లాల్సి వచ్చేది. ఆ సమయంలో ఇళ్లను కాపాడుకుంటూ, మిగిలిన పంటను అమ్ముకోవడానికి మహిళలు స్వయంగా ఈ మార్కెట్ను ప్రారంభించారు.
అయితే బ్రిటిష్ వారు ఈ మార్కెట్ను విదేశీయులకు అమ్మేయాలని చూశారు. అప్పుడు ఇక్కడి మహిళలంతా ఏకమై నుపి లాన్ (మహిళల యుద్ధం) ప్రకటించి ప్రాణాలకు తెగించి పోరాడారు. ఆ దెబ్బతో బ్రిటిష్ వారు వెనక్కి తగ్గక తప్పలేదు. ఆ తరువాత రెండవ ప్రపంచ యుద్ధ సమయంలోనూ, బ్రిటిష్ పాలకులు మణిపుర్ నుంచి బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేయడంతో రాష్ట్రంలో కరువు ఏర్పడింది. దీనిని అడ్డుకోవడానికి ఇమా కైథెల్ మహిళలు ప్రాణాలకు తెగించి పోరాడారు. పోలీసులు కాల్పులు జరిపినా వెనకడుగు వేయలేదు.
రంగుల ప్రపంచం
ఈ మార్కెట్ ఒక రంగుల ప్రపంచం. తాజా కూరగాయలు, పండ్లు, మణిపుర్ స్పెషల్ నగారి వంటి ఆహార పదార్థాల నుంచి.. చేనేత వస్త్రాల వరకు అన్నీ ఇక్కడ లభిస్తాయి. ముఖ్యంగా మణిపురి సాంప్రదాయ దుస్తులైన ఫానెక్స్, ఇన్నాఫీస్ ఇక్కడ ప్రధాన ఆకర్షణ. మహిళలకు ఆర్థికంగా అండగా నిలిచిన ఈ మార్కెట్ పర్యాటక కేంద్రంగానూ మారింది!
Tags : 1