Religious Leader: మీ హస్తం లేకుండానే గోవుల అక్రమ రవాణా జరుగుతుందా?
Breaking News
మూత్రం ఆపుకొంటే ముప్పే !
Published on Mon, 11/10/2025 - 08:12
లబ్బీపేట(విజయవాడతూర్పు): వాష్రూమ్స్ కంపు కొడుతున్నాయని కొందరు, అందుబాటులో లేక ఇంకొందరూ, సమయం లేని మరికొందరూ యూరిన్ వస్తున్నా.. గంటల కొద్ది ఆపుకొంటున్న వారు అనేక మంది ఉంటున్నారు. అంతేకాదు ఇంటి నుంచి విధులకు, కళాశాలలకు వెళ్లే వారు తిరిగి ఇంటికి వచ్చే వరకూ మూత్ర విసర్జన చేయని వారు కూడా ఉంటున్నారు. నీళ్లు తాగితే వాష్రూమ్కి వెళ్లాల్సి వస్తుందని తక్కువగా తాగుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి వారిలో మూత్రాశయ, కిడ్నీ సమస్యలు తలెత్తుతుండటంతో ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. నగరంలోని యూరాలజిస్టుల వద్దకు వస్తున్న వారిలో ఇలాంటి వారు అధికంగా ఉంటున్నారు. మూత్రం వస్తున్నట్లు సిగ్నల్ వచ్చిన తర్వాత ఆపుకోవడం కరెక్ట్ కాదంటున్నారు. అలా చేయడం ద్వారా అనేక అనారోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
ఇవే నిదర్శనం..
గవర్నర్పేటకు చెందిన డిగ్రీ విద్యార్థిని మూత్రం వస్తే ఆపుకోలేక అర్జెంట్గా వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. తరగతి గదిలో ఉన్నప్పుడు కూడా తీవ్ర ఇబ్బంది పడుతుండటంతో యూరాలజిస్టును సంప్రదించారు. ఎక్కువ సేపు మూత్రానికి వెళ్లకుండా ఆపుకోవడం వలన ఇలాంటి సమస్య తలెత్తినట్లు వైద్యులు తెలిపారు.
పటమటకు చెందిన ఓ ఉద్యోగిని 36 గంటల వరకూ యూరిన్ రాకపోవడంతో యూరాలజిస్టు వద్దకు వెళ్లారు. అక్కడ పరీక్ష చేస్తే యూరినరీ బ్లాడర్ పెరిగినట్లు ఉంది. అంటే ఎక్కువ సేపు మూత్రం ఆపుకోవడం వలన ఇలాంటి సమస్య తలెత్తినట్లు నిర్ధారించారు. ఇలా అనేక మంది మూత్ర సమస్యలు, కిడ్నీలో రాళ్లతో వైద్యులను సంప్రదిస్తున్నారు.
సమస్యలివే..
యూరిన్ బ్లాడర్లో రెండు లీటర్ల వరకూ యూరిన్ నిల్వ ఉంటుందని, పెరిగితే యూరిన్కు వెళ్లాలనే సిగ్నల్ వస్తుంది. అలా వచ్చినప్పుడు మూత్ర విసర్జన చేయకుండా, బ్లాడర్లో యూరిన్ మూడు, నాలుగు లీటర్లకు చేరుతుంది.అలా యూరిన్ పెరగడం వలన యూరిన్ బ్లాడర్ ఎన్లార్జ్ అవుతుంది.
కిడ్నీలపై ఒత్తిడి పెరిగి, వాటి పనితీరుపై ప్రభావం చూపుతుంది.
ఇలాంటి వారిలో యూరినరీ ప్రాబ్లమ్స్ తలెత్తుతాయి.
యూరిన్కు సిగ్నల్ వచ్చిన వెంటనే అర్జంట్గా వెళ్లాల్సి వస్తుంది. ఒక్కోసారి వాష్రూమ్కు వెళ్తుండగానే యూరిన్ పడిపోతుంది.
కొందరిలో అసలు యూరిన్ రాకుండా ఆగిపోతుంది.
ఇలాంటి సమస్యలతో టీనేజ్ పిల్లలతో పాటు పెద్ద వారు ఆస్పత్రులకు వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు.
నీళ్లు తాగడం లేదు..
నీళ్లు తాగితే మూత్ర విసర్జన చేయాల్సి వస్తుందని, విద్యార్థులే కాదు, ఉద్యోగుల్లో కూడా చాలా మంది తక్కువగా నీరు తాగుతున్నారు.ఇలాంటి వారిలో మూత్ర కోశ సమస్యలతో పాటు, కిడ్నీలో రాళ్లు కూడా వస్తున్నాయి.
కిడ్నీలో రాళ్లు రావడానికి ఆహార అలవాట్లతో పాటు తక్కువగా నీళ్లు తాగడమే ప్రధాన కారణంగా వైద్యులు చెబుతున్నారు.
ఇలాంటి వారిలో యూరినరీ ట్యూబ్ సన్నబడటం కూడా జరగవచ్చు.
కిడ్నీల్లో రాళ్లు రాకుండా ఉండేందుకు రోజుకు 3 నుంచి 4 లీటర్లు నీటిని తాగాలని వైద్యులు సూచిస్తున్నారు.
్రప్రొస్టేట్ సమస్యలతో...
ప్రస్తుతం 50 ఏళ్లు దాటిన వారిలో ప్రొస్టేట్ సమస్య కామన్గా మారినట్లు వైద్యులు చెబుతున్నారు.ప్రొస్టేట్ సమస్య కారణంగా అతిగా మూత్రం రావడం, అసలు రాకపోవడం, తక్కువగా రావడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
50 ఏళ్లు దాటిన వారు ప్రొస్టేట్ పరీక్ష చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
ప్రొస్టేట్ సమస్యలున్న 90 శాతం మందిలో మందులతోనే నయం చేయవచ్చునంటున్నారు.
కేవలం 10 శాతం మందికి మాత్రమే సర్జరీ అవసరం అవుతుందంటున్నారు.
మూత్రం వస్తున్న సిగ్నల్ వచ్చిన తర్వాత ఎక్కువ సేపు ఆపుకోవడం సరికాదు. అలా చేయడం ద్వారా మూత్రాశయ, కిడ్నీల సమస్యలు తలెత్తుతున్నాయి. మా వద్దకు వచ్చే వారిలో కిడ్నీలో రాళ్లు, ప్రొస్టేట్ సమస్యలు, యూరినరీ ట్యూబ్ సన్నబడటం, అర్జంట్గా యూరిన్ రావడం, అసలు రాకపోవడం వంటి వారు ఉంటున్నారు. కిడ్నీలో రాళ్లు, ప్రోస్టేట్ సమస్యలున్న వారికి అందరికీ సర్జరీ అవసరం లేదు. చాలా మందిలో మందులతో నయం చేయవచ్చు. యూరిన్ ట్యూబ్ సన్నబడటం వంటి సమస్య పుట్టుకతో పిల్లల్లో కూడా ఉంటుంది. అలాంటి వారికి మందులు, సర్జరీ ద్వారా సరిచేస్తున్నాం. 10 ఏళ్లలో 12,500 వరకూ యూరాలజీ సర్జరీలు చేశాం.
– డాక్టర్ గుంటక అజయ్కుమార్, యూరాలజిస్ట్
Tags : 1