అమెరికా నష్టపరిహారం చెల్లించాల్సిందే.. మీ ఇష్టం మళ్లీ యుద్ధమే!
Breaking News
అమ్మ కడుపు చల్లగా...
Published on Sat, 04/11/2026 - 05:34
గర్భధారణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల నుంచి నవజాత శిశువుల ఆరోగ్యం వరకు తల్లీబిడ్డలు చల్లగా ఉండేలా కృషి చేస్తోంది డా.అపర్ణ హెగ్డే ఆధ్వర్యంలోని స్వచ్ఛంద సంస్థ... ఆర్మ్మాన్. ప్రతి ఇంటిలో చిన్నదో, పెద్దదో సెల్ఫోన్ ఉంటుంది. ఆ సెల్ఫోన్నే వేదికగా చేసుకొని పేదింటి గర్భిణి మహిళలకు వారం, వారం సలహాలు ఇవ్వడంతో పాటు హెల్త్ వర్కర్లకు శిక్షణ ఇస్తోంది ఆర్మ్మాన్...
‘ప్రసూతి, నవజాత శిశు మరణాలు చాలా వరకు నివారించదగినవే అయినా నివారించలేకపోతున్నాం’ అంటున్న యూరోగైనకాలజిస్ట్ అపర్ణ హెగ్డే తల్లులు, నవజాత శిశువుల మరణాలను నివారించడానికి ‘అర్మ్మ్యాన్’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. ‘క్షేత్రస్థాయిలో తక్కువ వనరులతో ఎక్కువ బాధ్యతలు నిర్వహిస్తున్నారు హెల్త్ వర్కర్లు. దీనివల్ల గ్రామీణ ప్రాంతాలు, పట్టణ మురికివాడలలోని మహిళలకు సకాలంలో వైద్యసహాయం అందడం సవాలుగా మారింది. ఆరోగ్య వ్యవస్థలోని లోపాలను దగ్గరి నుంచి చూడడం వల్లే తగిన పరిష్కారాల కోసం ఆర్మ్మాన్కు శ్రీకారం చుట్టాను’ అంటున్నారు అపర్ణ హెగ్డే.
వారే స్ఫూర్తి....
ప్రజారోగ్య వ్యవస్థకు చోదకశక్తిగా ఉన్న ఆశా కార్యకర్తలు అనే హెల్త్ వర్కర్లు అపర్ణకు స్ఫూర్తి. ‘ఆశాకార్యకర్తలు శ్రమజీవులు. పనిభారాన్ని తమ భుజాలపై మోస్తున్నారు. ఒక గర్భిణి స్త్రీని లేదా నవజాత శిశువును చూడడానికి మండే ఎండలను, వర్షాలను వారు లెక్క చేయరు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉండాలనే తపనతో కర్తవ్యదీక్షతో ముందుకు వెళతారు. వారు పొలాల గుండా, అడవుల గుండా మండే ఎండల్లో గంటల తరబడి నడిచిపోవడం చూశాను. గర్భిణులు, బాలింతలకు నిజంగా ఏమి అవసరమో వారు మాకు చెబుతుంటారు. మేము ఏదైనా మార్పు తెచ్చామంటే దానికి వారే మూలకారకులు’ అంటున్నారు అపర్ణ.
మొబైల్ ఫోన్ వేదికగా...
గర్భిణి స్త్రీలకు, మూడు సంవత్సరాలలోపు పిల్లల తల్లులకు తగిన సూచనలు, ముందుజాగ్రత్తలు చెప్పి వారు సమస్యల బారిన పడకుండా చూస్తోంది ఆర్మ్మాన్. దీని కోసం ప్రతి ఇంటిలో అందుబాటులో ఉండే మొబైల్ ఫోన్నే ఆసరాగా చేసుకుంటోంది. గర్భిణులు, బాలింతలు తమకు ఏమైనా సమస్యలు ఉంటే అందుబాటులో ఉన్న మొబైల్తో సమాచారాన్ని అందిస్తే చాలు ఆర్మ్మాన్ కార్యకర్తలు రంగంలోకి దిగుతారు. ప్రమాదకరమైన కేసులను ముందుగానే గుర్తించి తెలియజేసేలా హెల్త్వర్కర్లకు తగిన శిక్షణ ఇస్తోంది ఆర్మ్మాన్.
మార్పు వస్తోంది...
‘ఆర్మ్మాన్ వల్ల మార్పు వచ్చిందా?’ అనే ప్రశ్నకు ‘అవును’ అని ఆత్మవిశ్వాసం నిండిన గొంతుతో సమాధానం ఇస్తున్నారు అపర్ణ హెగ్డే. గర్భధారణ మధ్య విరామం అవసరం అని ‘ఆర్మ్మాన్’ విస్తృతంగా ప్రచారం చేసింది. ఈ ప్రభావంతో రేణుక అనే మహిళ తన భర్తను కుటుంబ నియంత్రణకు అంగీకరించేలా ఒప్పించింది. దిల్లీలోని కళ్యాన్పురి మురికివాడల్లో నివసించే భాటియ భార్య శిశువుకు జన్మనిచ్చి చనిపోయింది. నవజాత శిశువును ఎలా చూసుకోవాలి, ఆరోగ్యాన్ని ఎలా పర్యవేక్షించాలి, అనేదానిపై భాటియాకు బొత్తిగా అవగాహన లేదు. నవజాత శిశువుకు సంబంధించి ‘ఆర్మ్మాన్’ ఇచ్చిన సూచనలు, సలహాలు ఆయనకు ఎంతో ఉపకరించాయి.
గర్భిణిగా ఉన్నప్పుడు ఖుష్బు శ్రీవాస్తవ, ఆరోగ్యకరమైన ప్రసవానికి సంబంధించి వారానికి ఒకసారి ‘ఆర్మ్మాన్’ నుంచి వచ్చే వాయిస్ కాల్స్ వినేది. మాత్రల వాడకం నుంచి తీసుకునే ఆహారం వరకు ఆ సలహాలు ఖుష్బుకు ఎన్నో రకాలుగా ఉపయోగపడ్డాయి. పోషకాహార ప్రాముఖ్యతను గట్టిగా చెప్పాయి. ఆమె ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనిచ్చింది. గతంలో ఖుష్బుకు గర్భస్రావం అయింది. ‘గతంలో నేను వాయిస్ కాల్స్ విని ఉంటే నాకు గర్భస్రావం కాకుండా ఉండేది’ అంటుది ఖుష్బు.
‘ఆర్మ్మాన్’ ప్రభావం గురించి చెప్పడానికి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే.
వైట్ రిబ్బన్ అలయెన్స్
మన దేశంలో ప్రసూతి మరణాల నివారణ, నవజాత శిశువుల ఆరోగ్యం....మొదలైన లక్ష్యాలతో 1999లో ‘వైట్ రిబ్బన్ అలయెన్స్’ అనే స్వచ్ఛంద సంస్థ ఆవిర్భవించింది. కస్తుర్బా గాంధీ జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ‘సేఫ్ మదర్ హుడ్ డే’ నిర్వహించుకోవాలని ‘వైట్ రిబ్బన్ అలయెన్స్’ నిర్ణయించింది.
సామాజిక హోదాతో సంబంధం లేకుండా...
ప్రసవ సమయంలో ఏ స్త్రీ ప్రాణాలు కోల్పోకూడదు. ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ అందుబాటులో లేకపోవడం వల్ల ఏ బిడ్డా ప్రాణాలు కోల్పోకూడదు. తల్లులు, పిల్లల ఆరోగ్యం వారు ఎక్కడ పుట్టారు, వారి కుటుంబాలు ఎంత సంపాదిస్తున్నాయి, సమీపంలో క్లీనిక్ ఉందా, అనేదానిపై ఆధారపడకూడదు. ప్రతి స్త్రీ తన కులం, వర్గం, సామాజిక హోదాతో సంబంధం లేకుండా తన కోసం, తన బిడ్డ కోసం సరైన నిర్ణయం తీసుకునే సాధికారత ఉండాలి. ప్రభుత్వాలు మా సాంకేతికతను స్వీకరించడం మాత్రమే కాకుండా దానిని తమ సొంతం చేసుకొని, మెరుగు పరిచి జాతీయ ఆరోగ్య వ్యవస్థలకు అనుసంధానిస్తున్నాయి. తద్వారా మహిళల ఆరోగ్యం రాజకీయ, సామాజిక, సాంస్కృతిక ప్రాధాన్యతగా మారుతుంది.
– అపర్ణ హెగ్డే
Tags : 1