ఎవరివైపు పబ్లిక్? చాణక్య సర్వేలో క్లారిటీ!
Breaking News
ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా భారత్ పయనం
Published on Fri, 01/17/2025 - 12:48
ఆటోమోటివ్ పరిశ్రమలో ప్రపంచానికి భారత్ నాయకత్వం వహించే దిశగా పయనిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ప్రశంసించారు. భవిష్యత్తులో ఈ పరిశ్రమ వృద్ధి చెందేందుకు ఎంతో అవకాశం ఉందన్నారు. ఢిల్లీలోని భారత్ మండపంలో ఏర్పాటు చేసిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పో 2025(రెండో ఎడిషన్-Bharat Mobility Global Expo 2025)ను ప్రధాని మోదీ శుక్రవారం ప్రారంభించారు. జనవరి 17 నుంచి 22 వరకు జరిగే ఈ ఎక్స్పో భారత్ మండపం, ద్వారకాలోని యశోభూమి, గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్పో సెంటర్ అండ్ మార్ట్ అనే మూడు వేదికల్లో జరగనుంది. 5,100 మందికి పైగా అంతర్జాతీయ ఆవిష్కర్తలు, 5 లక్షలకుపైగా సందర్శకులు, ఔత్సాహికులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని అంచనా.
ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ..‘భారతదేశ ఆటోమోటివ్ పరిశ్రమ(automotive industry) అద్భుతమైంది. భవిష్యత్తులో ఈ పరిశ్రమ ఎదిగేందుకు ఎన్నో అవకాశాలున్నాయి. దేశంలోని తయారీదారులు స్థానిక డిమాండ్ను తీర్చడమే కాకుండా ప్రపంచ వేదికలపై తమదైన ముద్ర వేస్తున్నారు. సుస్థిర పద్ధతులను అవలంబించడంలో, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమ్మిళితం చేయడంలో ఈ రంగం చాలా కృషి చేస్తోంది. దేశీయ తయారీదారులు అనుసరిస్తున్న విధానాలు ప్రపంచ ఆటోమోటివ్ రంగంలో భారతదేశాన్ని కీలకంగా మార్చనున్నాయి. ఈ రంగంలో ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా భారత్ పయనిస్తుంది. భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ)కు మరింత డిమాండ్ పెరుగుతుంది. విధానపరమైన కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల పర్యావరణ వ్యవస్థకు మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది’ అన్నారు.
ఇదీ చదవండి: బాసులు లేని వర్క్ కల్చర్
భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025 ‘బియాండ్ బోర్డర్స్: కో-క్రియేటింగ్ ఫ్యూచర్ ఆటోమోటివ్ వాల్యూ చైన్’ అనే థీమ్తో ప్రారంభమైంది. ఆటోమోటివ్, మొబిలిటీ రంగాల్లో సహకారం, సృజనాత్మకతను పెంపొందించడం ఈ కార్యక్రమం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఈవెంట్ లో ఆటోమొబైల్స్, కాంపోనెంట్ ప్రొడక్ట్స్, అడ్వాన్స్డ్ మొబిలిటీ టెక్నాలజీలతో సహా 100కు పైగా కొత్త లాంచ్లు ఉండబోతున్నాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
Tags : 1