లేఖ బయటకి వస్తే రాజకీయ ప్రకంపలను ఖాయం
Breaking News
రియల్ ‘ఈల్డ్’ జోరు.. రేసులోకి హైదరాబాద్!
Published on Wed, 09/02/2026 - 11:52
భారతదేశంలోని ప్రధాన నగరాల్లో రియల్ ఎస్టేట్ రంగం గణనీయమైన మార్పులకు లోనవుతోంది. ఒక ప్రాపర్టీ విలువ ఆధారంగా ఏడాదికి వచ్చే అద్దె ఆదాయాన్ని కొలిచే రెంటల్ ఈల్డ్ గత ఏడేళ్లలో క్రమంగా పుంజుకోవడం ఇన్వెస్టర్లకు సానుకూల సంకేతాలను ఇస్తోంది. ‘అనరాక్ రీసెర్చ్ అండ్ అడ్వైజరీ’ గణాంకాల ప్రకారం 2019 నుంచి 2026 రెండో త్రైమాసికం నాటికి దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో రెంటల్ ఈల్డ్స్ గణనీయంగా పెరిగాయి.
నగరాల వారీగా రెంటల్ ఈల్డ్స్ పెరుగుదల (2019-2026 క్యూ2 వరకు)
బెంగళూరు: 3.6% నుంచి 4.6% (దేశంలోనే అత్యధికం)
గురుగ్రామ్: 3.5% నుంచి 4.3%
ముంబై: 3.5% నుంచి 4.3%
పుణె: 3.3% నుంచి 4.0%
నోయిడా: 3.2% నుంచి 3.9%
కోల్కతా: 3.3% నుంచి 3.9%
హైదరాబాద్: 2.6% నుంచి 3.6% (అత్యధిక శాతం పెరుగుదల)
చెన్నై: 2.7% నుంచి 3.3%
ఢిల్లీ: 2.2% నుంచి 3.2%
హైదరాబాద్ మార్కెట్ను ప్రత్యేకంగా గమనిస్తే ఇక్కడ రెంటల్ ఈల్డ్ 2019లో ఉన్న 2.6 శాతం నుంచి 2026 నాటికి 3.6 శాతానికి పెరిగింది. ఇది దేశంలోనే అత్యధిక శాతం పెరుగుదలలో ఒకటి కావడం విశేషం. ఐటీ, కార్పొరేట్ రంగాల్లో ఉద్యోగులు తిరిగి ఆఫీసులకు రావడం, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల విస్తరణ వల్ల ప్రధాన ఉద్యోగ కేంద్రాలకు సమీపంలో ఉన్న నివాసాలకు డిమాండ్ విపరీతంగా పెరిగిందని రియల్టీ నిపుణులు చెబుతున్నారు.
ఈ డేటాను విశ్లేషించేటప్పుడు ఇన్వెస్టర్లు కేవలం అద్దె ఆదాయాన్నే కాకుండా ప్రాపర్టీ విలువ పెరిగే అవకాశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. బెంగళూరు, ముంబై, గురుగ్రామ్ వంటి నగరాలు స్థిరమైన నగదు ప్రవాహాన్ని కోరుకునే వారికి అనుకూలంగా ఉన్నాయి. హైదరాబాద్ వంటి నగరాలు వేగవంతమైన వృద్ధి, మెరుగైన క్యాపిటల్ అప్రిసియేషన్ రెండింటినీ అందిస్తున్నాయి.
భవిష్యత్తులో పెట్టుబడి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఉద్యోగ కేంద్రాలు, మెట్రో రవాణా వసతులు ఉన్న ప్రాంతాల్లో 2 బీహెచ్కే లేదా 3 బీహెచ్కే ఫ్లాట్లను ఎంచుకోవడం ద్వారా ప్రాపర్టీ ఖాళీగా ఉండే సమయాన్ని తగ్గించవచ్చు. అలాగే రెసిడెన్షియల్ ప్రాపర్టీల్లో 3 నుంచి 4.6 శాతం మధ్య ఉండే ఈల్డ్స్తో పోలిస్తే, కమర్షియల్ ప్రాపర్టీల ద్వారా 7 నుంచి 9 శాతం వరకు అద్దె రాబడి సాధించే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇన్వెస్టర్లు తమ పోర్ట్ఫోలియోను తగిన విధంగా విస్తరించుకోవాలి.
ఇదీ చదవండి: కుప్పకూలిన బంగారు కొండ!
Tags : 1