రిటైర్డ్ జడ్జిపై పులివర్తి నాని బూతు పురాణం.. తిరుపతి అడ్వకేట్స్ స్ట్రాంగ్ రియాక్షన్
Breaking News
ఆ దేశంలో మాదిరి అయితే.. లీవ్లు కష్టమే!
Published on Fri, 07/03/2026 - 12:09
ఐరోపాలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన జర్మనీని తిరిగి వృద్ధి బాట పట్టించేందుకు ఛాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం 34 అంశాలతో కూడిన భారీ సంస్కరణల ప్యాకేజీని ప్రకటించింది. ఇందులో ఉద్యోగుల అనారోగ్య సెలవులపై కఠిన నిబంధనలు, మధ్యతరగతి కుటుంబాలకు పన్ను రాయితీలు, పెన్షన్ వ్యవస్థలో మార్పులు, బ్యూరోక్రసీ తగ్గింపు వంటి కీలక నిర్ణయాలు ఉన్నాయి. ఈ ప్రతిపాదనలను ఈ ఏడాది చివరికల్లా పార్లమెంట్లో ఆమోదింపజేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఇక నుంచి డాక్టర్ సర్టిఫికెట్ తప్పనిసరి
ప్రస్తుతం జర్మనీలో ఉద్యోగులు కొన్ని సందర్భాల్లో తొలి మూడు రోజుల వరకు డాక్టర్ను ప్రత్యక్షంగా కలవకుండానే అనారోగ్య సెలవు పొందే అవకాశం ఉంది. కొత్త సంస్కరణల ప్రకారం, ఉద్యోగి మొదటి రోజు నుంచే వైద్యుడి ధ్రువీకరణ పత్రం (మెడికల్ సర్టిఫికెట్) సమర్పించాలని యజమాని కోరే హక్కు ఉంటుంది. అలాగే ఫోన్ ద్వారా అనారోగ్య సెలవు ధ్రువీకరణ పొందే విధానానికీ ముగింపు పలకనున్నారు. దేశంలో అనారోగ్య సెలవుల రేటు అసాధారణంగా పెరగడం ఉత్పాదకతను దెబ్బతీస్తోందని మెర్జ్ ప్రభుత్వం వాదిస్తోంది.
మధ్యతరగతికి పన్ను ఊరట
సంస్కరణల్లో భాగంగా తక్కువ, మధ్య ఆదాయ కుటుంబాలకు ఆదాయపు పన్నులో భారీ ఉపశమనం కల్పించనున్నారు. 2028 నాటికి పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చిన తర్వాత, ఇద్దరు పిల్లలు ఉన్న, ఏడాదికి 60 వేల యూరోలు పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం ఉన్న కుటుంబానికి సుమారు 600 యూరోలు పన్ను ఆదా అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. మొత్తం మీద సంవత్సరానికి సుమారు 10 బిలియన్ యూరోల పన్ను ఉపశమనం కల్పించనున్నట్లు వెల్లడించింది.
పెన్షన్ వ్యవస్థలో కీలక మార్పులు
వృద్ధాప్య జనాభా పెరుగుతున్న నేపథ్యంలో పెన్షన్ వ్యవస్థను దీర్ఘకాలికంగా నిలబెట్టేందుకు పదవీ విరమణ వయస్సును ఆయుర్దాయానికి అనుగుణంగా దశలవారీగా పెంచే ప్రతిపాదనను ప్రభుత్వం ముందుకు తెచ్చింది. దీంతో భవిష్యత్తులో ఉద్యోగులు చెల్లించే పెన్షన్ చందాలపై అధిక భారం పడకుండా చూడడమే లక్ష్యమని తెలిపింది.
రెడ్టేప్కు కత్తెర
వ్యాపారాలకు అడ్డంకిగా మారిన అనవసర అనుమతులు, రిపోర్టింగ్ నిబంధనలు, డాక్యుమెంటేషన్ ప్రక్రియలను సరళీకృతం చేయనున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో డిజిటలైజేషన్కు ప్రాధాన్యం ఇస్తూ పరిపాలనా వ్యయాన్ని తగ్గించే చర్యలకూ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
ఎందుకు ఈ సంస్కరణలు?
గత రెండేళ్ల ఆర్థిక మందగమనం, అధిక ఇంధన ధరలు, చైనా కంపెనీల పోటీ, తగ్గిన ప్రైవేట్ పెట్టుబడులు, వృద్ధాప్య జనాభా, అంతర్జాతీయ వాణిజ్య ఒత్తిళ్ల నేపథ్యంలో జర్మనీ ఆర్థిక వ్యవస్థ సవాళ్లు ఎదుర్కొంటోంది. 2026లో కేవలం 0.5 శాతం వృద్ధినే ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ సంస్కరణలు తీసుకొచ్చినట్లు మెర్జ్ పేర్కొన్నారు.
Tags : 1