మొసాద్ కంటే డేంజర్.. రోమాలు నిక్కబొడుచుకునే వీడియో
Breaking News
ఆర్బీఐ కొత్త సర్వేలు.. ఎందుకో తెలుసా?
Published on Thu, 07/09/2026 - 20:13
ద్రవ్య విధాన రూపకల్పనకు కీలకమైన సమాచారాన్ని అందించే లక్ష్యంతో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మూడు సర్వేలను ప్రారంభించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ద్రవ్యోల్బణ అంచనాలు, గ్రామీణ, పట్టణ ప్రజల ఆర్థిక పరిస్థితిపై అభిప్రాయాలను తెలుసుకోవడం ఈ సర్వేల ప్రధాన ఉద్దేశ్యం. భవిష్యత్ ద్రవ్య విధాన నిర్ణయాలు తీసుకునే సమయంలో.. ఈ సర్వేల ద్వారా లభించే సమాచారం ఆర్బీఐకి చాలా ఉపయోగపడనుంది.
కుటుంబాల ద్రవ్యోల్బణ అంచనాల సర్వే
ఆర్బీఐ ప్రారంభించిన సర్వేలలో ఒకటి 'కుటుంబాల ద్రవ్యోల్బణ అంచనాల సర్వే'. ఈ సర్వే ద్వారా ప్రజలు భవిష్యత్లో ధరల పెరుగుదలను ఎలా అంచనా వేస్తున్నారో తెలుసుకోనున్నారు. ఈ సర్వేను దేశంలోని 19 నగరాల్లో నిర్వహించనున్నారు. ప్రజలు తమ రోజువారీ వినియోగ అలవాట్లు, ఖర్చుల ఆధారంగా వివిధ వస్తువులు, సేవల ధరల్లో మార్పులు ఎలా ఉండవచ్చని భావిస్తున్నారో ఇందులో నమోదు చేస్తారు.
రాబోయే మూడు నెలల్లో, అలాగే ఒక సంవత్సరం కాలంలో సాధారణ ధరల పరిస్థితి ఎలా ఉండొచ్చనే అంశంపై కుటుంబాల అభిప్రాయాలను సేకరిస్తారు. ఆహారం, ఇతర వినియోగ వస్తువులు వంటి నిర్దిష్ట ఉత్పత్తుల ధరలపై కూడా ప్రజల అంచనాలను తెలుసుకుంటారు. దీంతో పాటు ప్రస్తుతం ఉన్న ద్రవ్యోల్బణ స్థాయి, వచ్చే మూడు నెలలు.. ఏడాదిలో ఉండే అవకాశం ఉన్న ద్రవ్యోల్బణంపై పరిమాణాత్మక వివరాలను కూడా సేకరించనున్నారు.
రూరల్ కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ సర్వే
ఆర్బీఐ మరో సర్వే పేరు 'రూరల్ కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ సర్వే'. గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో ప్రజల ఆర్థిక పరిస్థితిపై ఉన్న అభిప్రాయాలను తెలుసుకోవడం ఈ సర్వే లక్ష్యం. దేశంలోని 31 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ సర్వే నిర్వహించనున్నారు. ఇందులో ప్రజల ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, భవిష్యత్పై వారి అంచనాలను నమోదు చేస్తారు. ప్రధానంగా దేశ ఆర్థిక పరిస్థితి, ఉద్యోగ అవకాశాలు, ధరల స్థాయి, కుటుంబ ఆదాయం, ఖర్చులపై ప్రజల అభిప్రాయాలను సేకరిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో వినియోగ ధోరణులు ఎలా మారుతున్నాయో తెలుసుకోవడానికి ఈ సమాచారం ఉపయోగపడుతుంది.
అర్బన్ కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ సర్వే
అర్బన్ కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ సర్వేను కూడా ఆర్బీఐ ప్రారంభించింది. పట్టణ ప్రాంతాల్లోని ప్రజలు దేశ ఆర్థిక పరిస్థితిని ఎలా చూస్తున్నారు? భవిష్యత్పై వారి అంచనాలు ఏమిటి? అనే అంశాలను తెలుసుకోవడం దీని ఉద్దేశ్యం.
ఈ సర్వేలో ఆర్థిక పరిస్థితి, ఉద్యోగ అవకాశాలు, ధరల స్థాయి, కుటుంబ ఆదాయం, ఖర్చులపై పట్టణ కుటుంబాల అభిప్రాయాలను సేకరిస్తారు. ద్రవ్యోల్బణ అంచనాల సర్వే మాదిరిగానే ఈ సర్వేను కూడా 19 నగరాల్లో నిర్వహించనున్నారు. ఇందులో అహ్మదాబాద్, బెంగళూరు, చండీగఢ్, చెన్నై, ఢిల్లీ, ముంబై, తిరువనంతపురం వంటి ప్రధాన నగరాలు ఉన్నాయి.
దేశ ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం, ప్రజల ఖర్చు ధోరణులు, వినియోగదారుల విశ్వాసం వంటి అంశాలు చాలా ముఖ్యమైనవి. వడ్డీ రేట్లను నిర్ణయించడం, ద్రవ్య సరఫరాను నియంత్రించడం వంటి కీలక నిర్ణయాలకు ఆర్బీఐ ఈ సమాచారాన్ని ఉపయోగిస్తుంది. ప్రజలు ధరల పెరుగుదలను ఎలా అంచనా వేస్తున్నారు? వారి ఆదాయం, ఖర్చుల పరిస్థితి ఎలా ఉంది? ఆర్థిక వ్యవస్థపై వారి నమ్మకం ఎంతవరకు ఉంది? వంటి అంశాలపై స్పష్టమైన అవగాహన రావడం ద్వారా ఆర్బీఐ మరింత సమర్థవంతమైన ద్రవ్య విధానాలను రూపొందించగలదు.
Tags : 1