టీడీపీ నేతల వ్యాఖ్యలు సిగ్గుచేటు
Breaking News
పొయ్యి వెలిగించకుండానే వండే వంటకాలు..!
Published on Fri, 03/27/2026 - 12:35
పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో గ్యాస్, ఇంధన సమస్యలు తలెత్తుతాయేమోనని యావత్తు దేశం ఆందోళన చెందింది. సరిగ్గా ఈ సమయంలో విశాఖ తీరానికి ఎల్పీజీ, చమురు నౌకలు ఒక్కొక్కటిగా చేరుకోనుండటం కాస్త ఊరటనిచ్చే అంశం. అయితే ఇలా యుద్ధం మరేదో విపత్తు కారణంగా మొదట ఇబ్బందులు ఎదురయ్యేది గ్యాస్, చమురు వద్దే. ఇంతవరకు చాలాసార్లు చమురు కష్టాలు చూశాం. కానీ తొలిసారిగా గ్యాస్ కొరత ఎలా ఉంటుందో గత కొన్ని రోజులుగా దాని ఎఫ్క్ట్ని ప్రత్యక్షంగా చూశాం. ఒక్కసారిగా గ్యాస్పై ఆధారపడకుండా వండే ప్రత్యామ్నాయ పద్ధతుల వైపు చూశారు అంతా. మరోవైపు ఇండక్షన్ స్టవ్లు, కట్టెల పొయ్యిలు ఇలా పలు రకాల ప్రత్యామ్నాయాలు, కొంగొత్త ఆవిష్కరణల దిశగా నిపుణులు అడుగులు వేశారు. అయితే వీటన్నింటికంటే భిన్నంగా అందరికంటే ముందే పొయ్యితో పనిలేకుండా చేసే వంటకాల గురించి ప్రయోగాలను చేసి సక్సెస్ అయ్యారు కోయంబత్తూరుకు చెందిన ప్రముఖ చెఫ్ శివకుమార్. పైగా మంట, నూనెతో సంబంధం లేకుండా హాయిగా ఆస్వాదించే రకరకాల వంటకాలను సైతం కనిపెట్టారాయన. మరి అవేంటో..?, ఎలా చేస్తారో సవివరంగా తెలుసుకుందామా..!.
ప్రముఖ చెఫ్ పడయాల్ శివకుమార్ వండకుండా, నూనె లేకుండా వండే ఆహారంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి తనను తాను అంకితం చేసుకున్నారు. ఆయన పచ్చిపదార్థాల్లో సహజ రుచులు, పోషకవిలువల ప్రాముఖ్యతను గ్రహించి ఆయన ఈ దిశగా అడుగులు వేశారు. నూనె తరుచుగా పదార్థాల సహజ రుచిని, దాని పోషక విలువలని తగ్గించేస్తుందట. ఇక ఉడికించడం వల్ల పెద్ద ఎత్తున పోషకాలు ఆవిరైపోతాయి.
అందువల్ల ఆ రెండింటితో పనిలేకుండా వండే వంటకాల్లో రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం, మంచి పోషకాలను పొందొచ్చని గట్టిగా నమ్మారు శివ. ఆ నేపథ్యంలోనే మంట, నూనెతో పనిలేకుండా వండే వంటకాలపై అన్వేషించి ఏకంగా..2500 విభిన్న రకాల వంటకాలను తయారు చేసే పద్ధతులను అభివృద్ధి చేశారు. అంతేగాదు కోయంబత్తూర్లో ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రత్యేకమైన దక్షిణ భారత రా వెగన్ వంటకాలను అందించే 'పడయల్ నో ఆయిల్ నో బాయిల్ రెస్టారెంట్'ను కూడా ప్రారంభించారు.
ఈ రెస్టారెంట్ "ఆహారమే ఔషధం" అనే శివకుమార్ తత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ రెస్టారెంట్ కారం తక్కువ, రుచిలో ఏమాత్రం తీసిపోని మంచి బోజనాన్ని అందిస్తుంది. 'రా ఫుడిజం'ను ప్రోత్సహిస్తూ, ప్రాసెస్ చేసే ఫాస్ట్ ఫుడ్స్కి దూరంగా ఉండేలా చేసి ప్రజలంతా ఆరోగ్యంగా ఉండేలా చేయడమే లక్ష్యంగా ఈ వంటకాలను అందించడం విశేషం. సహజమైన వంట సంప్రదాయాల వైపుకు అందరూ అడుగులు వేసేలా చేయడమే తన లక్ష్యమని అంటున్నారు. శివ వంటకాలన్ని జీర్ణవ్యవస్థను శుభ్రపరిచేలా, ఆరోగ్య సమస్యలను పరిష్కరించేవిగా నిరూపితమయ్యాయట కూడా.
ఈ ఆలోచన ఎలా వచ్చిందంటే..
ప్లస్ టూ వరకు రెగ్యులర్గా చదివిన శివకుమార్.. ఆ తర్వాత దూరవిద్య ద్వారా డిగ్రీ పూర్తి చేశారు. ఆధ్యాత్మికంపై మక్కువతో వేదాగ్ని మహర్షి వద్ద యోగా అభ్యసించారు. అలా ఆ సంస్థలో పదేళ్లు ఉపాధ్యాయుడిగా పనిచేశారు. అక్కడే యోగాసనాలు, ఆరోగ్యకరమైన ఆహారవిధానాలు నేర్చుకున్నారు. అదే ఆయన్ని ఈ ‘పడయల్’ రెస్టారెంట్ వరకు నడిపించింది.
యోగా శిక్షణలో ఉన్న వారికి అందించే చిరుధాన్యాలు, మూలికా ఆహారం తీసుకున్న వారి శరీరంలో మార్పులు చోటుచేసుకోవడం గమనించిన ఆయన ఈ సహజసిద్ధమైన ప్రకృతి ఆహారంపై ప్రయోగాలు చేశారు. అలాగే ఈ వంటకాలు తిన్న చాలామంది తమ ఆరోగ్య సమస్యలు నయమైనట్లు చెబుతుండడంతో ప్రకృతి ఆహారంపై మరింతగా అన్వేషణ చేసినట్లు తెలిపారు.
(చదవండి: అమ్మమ్మ చేతి ఎంబ్రాయిడరీ..! 1947 నాటి..)
Tags : 1